Monday, September 24, 2018

రావి చెట్టు - ప్రదక్షిణం


పరమాచార్య స్వామి వారు తమని తాము సాధారణ సన్యాసిగా చెప్పుకున్నా కొన్ని సంఘటనలు వారి నిజరూపాన్ని వారి అపార శక్తిని తెలియపరుస్తాయి. అలాంటి ఒక సంఘటన నా జీవితంలో జరిగింది.

అప్పుడు పరమాచార్య స్వామి వారు తిరువనైక్కావల్ లో మకాం చేసారు. నేను నా భర్త మహాస్వామి వారిని దర్శించుకుని తిరిగి తంజావూరు వెళ్ళిపోవాలి. మరుసటి రోజు సోమవార అమావాస్య. మేమిద్దరమూ తంజావూరులో రావి చెట్టుకు ప్రదక్షిణ చేయాలి.

మహాస్వామి వారు అక్కడకు వచ్చిన అందరితోను మాట్లాడి వారికి ప్రసాదం ఇచ్చి పంపిస్తున్నారు. మా విన్నపం విని కూడా మా మాటలు విన్నట్టు ఉన్నారు. మేము వరుసలో వచ్చినప్పుడు మా ముందువరకు అందరికి ప్రసాదం ఇచ్చి మా వంతు వచ్చిన వెంటనే లేచి లోపలికి వెళ్ళిపోయేవారు – వారు పదే పదే ఇలాగే చేస్తుండేవారు.

మేము తంజావూరు వెళ్ళే ఆలోచన విరమించుకుని రాత్రికి అక్కడే ఉండిపోయాము. నాకు మహాస్వామి వారిపై చాలా కోపంగా ఉన్నింది.

మరుసటి రోజు ఉదయం విశ్వరూపం తరువాత, వారి గంట జపం మొదలుపెట్టేముందు మేనేజరు వారితో “ముప్పవు గంట తరువాత నేను జపంలో ఉండగానే పల్లకిని కొల్లిదం నది ఒడ్డుకు చేర్చుటకు ఏర్పాట్లు చెయ్యమని” చెప్పారు. వారు పల్లకిలోపల కూర్చుని తలుపులు వేసుకున్నారు.

రావి చెట్టుకు ఎలాగు ప్రదక్షిణలు చేయలేమని తెలుసుకుని, కనీసం మహస్వామి వారి చుట్టూ తిరుగుదామని అనుకున్నాము. మేనా చుట్టూ ప్రదక్షిణలు చెయ్యడం మొదలుపెట్టాము. అది పూర్తి అయినతరువాత పల్లకి బయలుదేరింది. మేము కూడా దాని వెంట వెళ్ళి కొల్లిదం చేరుకుని అక్కడే స్నానాదులు ముగించాము.

పరమాచార్య స్వామి వారు తమ అనుష్టానానికి కూర్చుంటూ నన్ను పిలిచి ”ఎన్ని ప్రదక్షిణలు చేసావు?” అని అడిగారు. “తొంబై ప్రదక్షిణలు” అని చెప్పాను. కాని నేను ప్రదక్షిణలు చేసినట్టు మహాస్వామి వారు చూసే అవకాశమే లేదు. మిగిలిన ప్రదక్షిణములు కూడా పూర్తి చెయ్యమని చెప్పారు.

నేను మిగిలిన ప్రదక్షిణలు పూర్తి చేసిన తరువాత నన్ను అడిగారు, “ఏ శ్లోకం పఠిస్తూ ప్రదక్షిణలు చేసావు?”

“గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః అని మననం చేస్తూ ప్రదక్షిణ చేసాను” అని చెప్పాను.

“రావి చెట్టు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ శ్లోకం పఠిస్తావు?” అని అడిగారు.

”మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపాయ అగ్రతో శివరూపాయ వృక్షరాజాయతే నమో నమః” అని అన్నాను.

వెంటనే మహాస్వామి వారు “మరింకేంటి ఇక్కడా త్రిమూర్తియే అక్కడా త్రిమూర్తియే. సరిపోయింది కదా!” అని అన్నారు.

ఈ మాటలు చెప్పి నన్ను ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చారు. అప్పటినుండి ప్రతి సోమవార అమావాస్య నాడు పరమాచార్య స్వామి వారికి ప్రదక్షిణ చెయ్యాలని నియమం పెట్టుకున్నాను.

--- జయలక్ష్మీ అమ్మాళ్, పొల్లాచి. మహాపెరియావళ్ – దరిశన అనుభవంగళ్ 4

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

https://t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Monday, September 17, 2018

ఆయుర్వేద వైద్యం - బొమ్మల కొలువు



అది మహారాష్ట్రలోని సతారాలో ఉత్తర శ్రీ నటరాజ స్వామి వారి దేవాలయం కడుతున్నప్పటి రోజులు. మహాస్వామి వారు అక్కడే ఉంటూ అన్నీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పరమాచార్య స్వామి వారి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు.

ఒకనాటి ఆదివారం మద్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో 30 సంవత్సరముల వయస్సుగల ఒక యువకుడు మహాస్వామి వారికి సాష్టాంగం నమస్కారం చేసి నుంచున్నాడు. అతని కళ్ళల్లో కన్నీటి ధారను మహాస్వామి వారు చూసి ప్రేమతో “ఏమప్పా! ఎవరు నీవు? ఎక్కడనుండి వచ్చావు? నీ కళ్ళల్లో ఆ తడి ఎందుకు?” అని అడిగారు. అతను ఏమి సమాధానం చెప్పకుండానే పెద్దగా ఏడ్వటం మొదలుపెట్టాడు. చుట్టూ ఉన్న వారు అతన్ని ఊరడించి మహాస్వామి వారిముందు కూర్చోపెట్టారు.

”ఎక్కడినుండి వచ్చావు అప్పా?” మహాస్వామి అడిగారు. ”పాలక్కాడ్ కేరళ”

వెంటనే మహాస్వామి వారు “పాలక్కాడ్ నుండి ప్రయాసపడి ఇక్కడిదాకా వచ్చావా?” అని అడిగారు. ”అవును పెరియావ మీకొసం అక్కడినుండి వచ్చాను”

“సరే. నీ పేరు ఏంటి?”

“హరిహర సుబ్రమణియన్”

“భేష్! చాలా మంచి పేరు. మీ తండ్రి గారు ఏం చేస్తుంటారు?” అని అడిగారు. ”మా తండ్రి గారు ఇప్పుడు శరీరంతో లేరు. వారు పాలక్కాడ్ లో ఆయుర్వేద వైద్యుడు. వారి పేరు డా. హరిహర నారాయణన్”

అతను ముగించక ముందే మహాస్వామి వారు కుతూహలంతో ”ఓ నువ్వు పాలక్కాడ్ ఆయుర్వేద వైద్యులు హరిహర నారాయణన్ కుమారుడవా. మంచిది! సరే చెప్పు. అలా అయితే నువ్వు డా. హరిహర రాఘవన్ గారి మనవడివి కదూ! వారందరూ ఆయుర్వేద వైద్యంలో మంచి పేరు సంపాయించారు” అని చెప్తూ వచ్చిన అతణ్ణి పరిశీలనగా చూస్తూ కనుబొమ్మలు పైకెత్తారు.

”అవును పెరియావ” సమాధానమిచ్చాడు ఆ యువకుడు.

మహాస్వామి వారు నవ్వుతూ “భేశ్! ఉన్నతమైన వైద్య వంశం మీది. అది సరే నువ్వు నీ పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోలేదా?” అని అన్నారు.

”నేను అది చెదవలేదు పెరియావ. మా తండ్రి గారు నన్ను ఆ మార్గంలో పెంచలేదు” కొంచం నిర్లక్ష్యంగా అన్నాడు. ”నువ్వు అలా చెప్పరాదు. మీ తండ్రిగారు చెప్పించలేదా లేదా నీకే దానిపైన శ్రద్ధ లేదా?”

అతను ఏమి చెప్పలేదు. “అంతటి మహా వైద్యుల వంశంలో పుట్టి నువ్వు నేర్చుకునే భాగ్యం పోగొట్టుకున్నావు. సరే ఎంతదాకా చదువుకున్నావు?” అడిగారు మహాస్వామి వారు. ”తొమ్మిది దాకా పెరియావ”

“ఏం మరి చదువుకోవాలని అనిపించలేదా?”

“ఏమో నాకు అప్పుడు అనిపించలేదు. కాని ఇప్పుడు చింతిస్తున్నాను.”

“నీకు వివాహం అయ్యిందా?”

“అయ్యింది పెరియావ. మాకు ఏడు సంవత్సరముల కూతురు ఉంది”

“సరే. ఇప్పుడు ఏమి చేస్తున్నావు?”

అతని కళ్ళల్లో నుండి నీరు జారసాగింది. “నాకు మంచి చదువు లేకపోవడం వల్ల మంచి ఉద్యోగం లభించలేదు పెరియావ. నేను ఒక రైస్ మిల్లులో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాను. నా జీతం ఏడు వందల రూపాయలు. దాంతోనే మా కుటుంబం గడుస్తోంది.”

“ఓహో అలాగా? సరే నీకు మీ పూర్వీకులు స్వంత ఇల్లు వదిలివెళ్ళారా?”

అతను కళ్ళు తుడుచుకుంటూ “మా తాత గారు ఒక ఇంటిని కట్టించారు. నేను ఇక్కడకి రావటం ఆ ఇంటి గురించే పెరియావ. చాలా ఏళ్ళ క్రితం మా అత్తయ్య (నాన్న గారి చెల్లెలు) భర్త చనిపోవడంతో తన ఇద్దరు కూతుళ్లను తీసుకుని పాలక్కాడ్ వచ్చింది. నవరాత్రులప్పుడు మా నాన్న గారు మేము ఉన్న ఇంటిని 25వేల రూపాయలకు తకట్టుపెట్టారు. మా అత్తగారి పిల్లల పెళ్ళిళ్ళు చేసారు. తరువాత మా నాన్న మా అత్త ఇద్దరూ కాలం చేసారు.”

“పెరియావ నా బాధ ఏంటంటే నవరాత్రి సమయంలో లక్ష్మీకారకం అయిన ఇంటిని తాకట్టు పెట్టి పోయారు. ఇప్పుడు ఆ అప్పు 45వేల రూపాయలు అయ్యింది. ఇక ఇల్లు నా నుండి వెళ్ళీపోతుంది” పరమాచార్యస్వామి వారు ధ్యానంలోకి వెళ్ళారు. కొద్దిసేపటి తరువాత చిరువవ్వుతో “సరే ప్రతి నవరాత్రికి నువ్వు ఇంట్లో బొమ్మల కొలువు పెద్తున్నావు కదూ?”

“లేదు పెరియావ. మా తండ్రి గారు ఉన్నప్పుడు పెట్టేవారం. వారు వెళ్ళీపోయిన తరువాత నేను పెట్టడంలేదు.”

మహాస్వామి వారు అడ్డుపడుతూ “పూర్వీకుల గురించి నువ్వు అలా మాట్లాడకూడదు. వారు చాలా గొప్పవారు. నాకు తెలుసు. వారు చాలా మంచి పనులు చేసి వెళ్ళిపోయారు. నువ్వు మనసులో ఏదో పెట్టుకుని తరతరాలుగా వస్తున్న ఆచారాలను వదలరాదు. మరొక్క వారంలో నవరాత్రి మొదలు అవుతుంది. పాలక్కాడ్ లోని మీ ఇంటిలో బొమ్మలు కొలువు పెట్టి దేవిని ఆరాధించు. నీ కష్టాలు తీరి ఊరట లభిస్తుంది.” అని చెప్పి అతనికి ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించి పంపించారు.

ఇరవై రోజులు గడిచాయి. ఆ రోజు ఆదివారం. సతారా లో మహాస్వామి దర్శనార్థం చాలా మంది భక్తులు వచ్చారు. శ్రీ మఠం పరిచారకుడు ఒకరు ఆ భక్తుల మధ్యలో త్రోవ చేసుకుంటూ ఒక 60 65 సంవత్సరముల వయస్సు ఉన్న ఒక పెద్దాయనను తీసుకుని వచ్చారు. వారు కాషాయ వస్త్రములు ధరించి మెడలో ఎన్నో తుళసి రుద్రాక్ష మాలలు ధరించి ఉన్నారు. వారు మహాస్వామి వారికి సాష్టాంగం చేసి హిందీలో మాట్లాడారు. పరమాచార్య స్వామి వారు కూడా అతనితో హిందీలో మాట్లాడి తమ ఎదురుగా ఉన్న వేదిక పైన కూర్చోమన్నారు.

కొద్దిసేపటి తరువాత పాలక్కాడ్ హరిహర సుబ్రమణియన్ వచ్చి మహాస్వామి వారికి నమస్కరించాడు. అతని చేతిలో చిన్న ట్రంకు పెట్టె ఉంది. మహాస్వామి వారు అతణ్ణి అతని చేతిలోని ట్రంకు పెట్టెని చూసారు. ఆ యువకుడు ఆ డబ్బా తెరిచి అందులో ఉన్న పట్టు బట్టలో చుట్టబడియున్న కొన్ని తాళపత్రాలను బయటకు తీసాడు. మహాస్వామి వారు ఏమి తెలియనట్టు ఏంటవి? అన్నాట్టుగా చూసారు.

అతను అమాయకంగా “మీరు ఈ సంవత్సరం నుండి బొమ్మల కొలువు పెట్టమని నాకు అనుజ్ఞ ఇచ్చారు. నేను బొమ్మల కోసం వెతికితే నాకు ఈ డబ్బా దొరికింది. నేను ఎప్పుడూ దీన్ని చూడలేదు. నేను తెరచి చూసి అందులో ఉన్న భాష అర్థం కాక ఇక్కడకి తెచ్చాను.”

మహాస్వామి వారు నవ్వుతూ తమ ఎదురుగా కూర్చొని ఉన్న ఆ కాషాయ వస్త్రధారిని చూసి హిందీలో “కొద్దిసేపటి ముందు నువ్వు నన్ను అడిగిన ఆ అపూర్వ వస్తువు వచ్చింది. వచ్చి చూడు” అని అన్నారు. అతను కింద కూర్చుని ఆ తాళ పత్రాలను నిశితంగా పరిశీలించసాగాడు. అతని మొహం ఆనందమయమైంది. వాటిని ఎత్తుకుని తలపై ఉంచుకొని ఆనందంతో గట్టిగా “ఓ పరమ ఆచార్య పురుషా! ఈ అపూర్వ అయుర్వేద గ్రంథం కోసం ఎన్నో ఏళ్ళుగా వెతుకుతున్నాను. నువ్వు ప్రత్యక్ష దైవానివి. అరగంటలో నేను అడిగినదాన్ని నాకు ప్రసాదించావు. నేను ధన్యుణ్ణి.” అని పరమాచార్య స్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేసాడు.

హరిహర సుబ్రమణియన్ ఏమి అర్థం కాక నిలుచుండిపోయాడు. మహాస్వామి వారు దగ్గరకు పిలిచి “ఇతను పండరీపురం నుండి వచ్చిన ఆయుర్వేద సిద్ధాంతి. అరగంట క్రితం తను ఒక అపూర్వ గ్రంథం కోసం వెతుకుతున్నానని నాతో చెప్పాడు. నా మనస్సుకు ఏదో తోచినట్టయ్యి కొద్దిసేపు వేచియుండమని చెప్పాను. తరువాత నువ్వు ఈ ట్రంకు పెట్టెతో వచ్చావు. వారికి ఇవి ఉపయోగపడతాయి. నీ తండ్రిని తాతని తలచుకొని నీ చేతులతో వాటిని ఆయనకు ఇవ్వు” అని ఆజ్ఞాపించారు.

ఆ యువకుడు వారు చెప్పినట్టే చేసాడు. వాటిని తీసుకుంటున్నప్పుడు ఆ పెద్దమనిషి కళ్ళలో ఆనందభాష్పాలు కారాయి. అతను ఆ యువకుడితో “నీ వల్ల నాకు అపూర్వ గ్రంథము దొరికింది. దానికి వెల నేను కట్టలేను. అలాగని ఈ అపూర్వ సంపదని ఉచితముగా తీసుకోలేను” అని ఒక పళ్ళెంలో యాభైవేల రూపాయలు, పళ్ళు ఉంచి వినయంగా ఇచ్చాడు. ఆ యువకుడు మహాస్వామి వారి వంక చూసాడు. వారు చిరునవ్వుతో తీసుకుమ్మన్నారు. వణుకుతున్న చేతులతో అతను దాన్ని అందుకున్నాడు.

మహాస్వామి వారు దగ్గరకు పిలిచి “నువ్వు నీ పూర్వీకుల గురించి తప్పు గా మాట్లాడినప్పుడు నేను నీకు ఏమి చెప్పానో గుర్తుందా? వారు చాలా గొప్పవారు. చాలా మంచి పనులు చేసారు. చూసావా బొమ్మల కొలువు పెట్టమన్నందుకు నీకు ఇది దొరికింది. ఇంటి అప్పు 45వేలు అన్నావుగా! చంద్రమౌళీశ్వరుడు నిన్ను అనుగ్రహించాడు. పాలక్కాడ్ కి తిరిగి వెళ్ళు. డబ్బు జాగ్రత్త” అని చెప్పి అశీర్వదించి పంపించారు.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

https://t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Monday, September 10, 2018

ఇంటి దైవాన్ని మరచిపోతే?


ఒక భక్తుడు కంచి మఠంలోనికి ప్రవేశిస్తూ, తూలుతూ తడబడతూ క్రింద పడిపోబోయాడు. అతని అవస్థ చూసి అక్కడ ఉన్న వారు పట్టుకున్నారు. అయినా అతను నోట్లో నుండి రక్తం కక్కుకున్నాడు. అక్కడున్నవారు భయపడిపోయారు. అక్కడ రేగిన కలకలం పరమాచార్య స్వామి వారి చెవులను చేరింది.

వారు ఒక పరిచారికుని వంక చూసి “ఎందుకు అంత అలజడి అక్కడ?” అని అడిగారు.

మఠం మేనేజరు మహాస్వామి వారితో “ఎవరో భక్తుడు రక్తం కక్కుకున్నాడు” అని చెప్పాడు.

మహాస్వామి వారు మేనేజరుతో “అతనిదేవూరు? ఇప్పుడు ఎక్కడినుండి వస్తున్నాడు” కనుక్కోమన్నారు.

ఆ భక్తుడు తిరుచ్చి దగ్గర్లోని ఒక పల్లెటూరినుండి వచ్చాడు. చిదంబరంలోని నటరాజ స్వామి వారిని దర్శించుకుని కాంచీపురానికి వచ్చాడు. మహాస్వామి వారు ఆ పెద్దమనిషిని దగ్గర్లోని డాక్టరు దగ్గరకు తీసుకువెళ్ళమని చెప్పారు. రక్తం కక్కున్నాడు అని విన్న వెంటనే డాక్టరుగారు హెమొరేజ్ (రక్తస్రావం) వాల్ల ఇలా జరిగి ఉండొచ్చు అనుకున్నారు. హాస్పిటల్ లో చేర్పించమని సలహా ఇచ్చారు.

ఈ విషయాన్ని మహాస్వామి వారికి చేరవేసారు.

”ఇది హెమొరేజ్ కాదు. మీ నాన్నమ్మను అడిగితే అది వేడి చేయడం వల్ల అలా జరిగింది అని చెబుతారు. ఇంకొందరు దృష్టిదోషం వల్ల అలా జరిగింది అని చెబుతారు. నాకు తెలిసి ఈ పెద్దమనిషి వారి ఇంటి దైవం తిరువాచూర్ మదుర కాళి అమ్మన్. ఇప్పుడు వీరికి కాని వీళ్ల ఇంట్లో వాళ్ళకి ఇంటి దైవం విషయం గుర్తులేదు. కాని ఇప్పుడు వీరు అమ్మవారిని భక్తితో కొలవడం లేదు. కంచి కాళికాదేవికి పూజ చేసి ఇతనికి ప్రసాదం ఇవ్వండి. ఇతను చిదబరంలోని థిల్లై కాళి అమ్మవారిని దర్శించుకోకుండా ఇక్కడికి వచ్చాడు. అది తప్పు కదా? అంతే కాకుండా కాళి దేవి వారి ఇంటి ఆరాధ్యదైవం. మరి అటువంటప్పుడు కాళి దేవిని భక్తితో కొలవాలి కదా? సరే”

“అతనికి ఆరోగ్యం బాగుపడిన వెంటనే చిదంబరం వెళ్ళి థిల్లై కాళి అమ్మవారిని దర్శించుకోవాలి. వైద్యులు చెప్పినట్టు ఇతను అధిక రక్త పోటుతో బాధపడుతున్నాడు. అందుకే రక్తం కక్కున్నాడు. కావున అతని తిండిలో సాధ్యమైనంతవరకు ఉప్పు తగ్గించాలి.” ఇలా మహాస్వామి వారు చాలా సూచనలు చేసారు.

కాంచీపురం కాళి అమ్మవారి దేవస్థానం నుండి కుంకుమ తెచ్చి ఆ పెద్దమనిషి నుదుటిపైన రాసారు. అతన్ని శ్రీమఠం లోని హాల్లో పడుకోబెట్టారు. పరమాచార్య స్వామి వారు చెప్పినట్టు తరచుగా అతనికి చల్లటి నీటిని కొంచం కొంచం తాగడానికి ఇచ్చారు. రాత్రి అతను హాయిగా నిద్రపోయాడు. మరుసటి ఉదయం అతను మామూలుగా సంభాషించాడు. రాత్రి విశ్రాంతి వల్ల అతను కొంచం ఉత్సాహంగా కనపడ్డాడు. ఆయన మహాస్వామి వారి వద్ద ప్రసాదం తీసుకుని మేనేజరు గారికి ధన్యవాదాలు తెలిపి వెళ్ళిపోయాడు.

ఇంటికి వెళ్ళిన తరువాత తనకు ఎటువంటి ఆరోగ్య సమస్య లేదని అతను మేనేజరు గారికి ఉత్తరం రాసాడు. ఇంకా

“నేను ఇక ఎప్పుడూ మా ఇంటి దైవాన్ని మరచిపోను. కాని నాకు ఈనాటికి అర్థం కాని విషయం ఏంటంటే మహాస్వామి వారికి ఎలా తెలుసు నేను చిదంబరంలో థిల్లై కాళి అమ్మవారిని దర్శించుకోలేదని?” అది మనకి కూడా అంతుచిక్కని విషయం.

మన ఇంటి దైవం తరతరాలుగా మన చేత పూజింపబడుతూ మనల్ని రక్షిస్తున్న దైవం. కొత్త కొత్త దేవుళ్ళ మోజులో పడి ఇంటి దైవాన్ని ఎన్నటికి మరువరాదు. తల్లితండ్రులు కూడబెట్టిన ఆస్తులు కావాలి. కాని వారు అర్చించిన దైవం మాత్రం వద్దా?

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

https://t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Sunday, September 9, 2018

25 ఏళ్ళు - 7 ఏళ్ళు


నేను ఒకసారి మహాస్వామి వారి దర్శనంకోసం కర్ణాటక రాష్ట్రం లోని వాసనగెరె వెళ్ళాను. స్వామి వారు సండూరు మహారాజు గారికి చెందిన గనుల ప్రాంతములో పర్యటిస్తున్నారు. కొంతమంది భక్తులతో కలిసి స్వామి వారు ఒక జమఖానం పై కూర్చున్నారు. ‘వేద రక్షా నిధి ట్రస్ట్’ కు చెందిన అన్నాదురై అయ్యంగార్ మరియు కొంతమంది వారి వేదపాఠశాల విద్యార్థులతో పాటు అక్కడ కూర్చున్నారు. అప్పుడు సమయం రాత్రి 10:30 గంటలు.

సండూరు మహారాజు, మహారాణి, వారి కుమారుడు కూడా అక్కడ ఉన్నారు. అతను యు.స్ లోని యేల్ విశ్వవిద్యాలయంలో గణిత శాఖలో రీడర్ గా పనిచేస్తున్నాడు. అతను గణితంలో పి. హెచ్.డి పట్టా పొందాడు. వారి తల్లితండ్రులు స్వామి వారి ముందు వినయంగా నిలుచున్నారు. కాని ఇతను మాత్రం చాలా మమూలుగా ఉన్నాడు. పరమాచార్య స్వామి వారు రాజుగారు మరియు రాణిగార్లతో కాసేపు కన్నడం లో మాట్లాడి కొద్దిసేపటి తరువాత వాళ్ళ అబ్బాయి వంక తిరిగి అడిగారు.

“నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు? ఏమి చేస్తున్నావు”

“నేను యేల్ విశ్వవిద్యాలయంలో గణిత శాఖలో రీడర్ గా పనిచేస్తున్నా ను” అని బదులిచ్చాడు. ”నువ్వు ఏమి చదువుకున్నావు? గణితంలో ఏ శాఖలో నువ్వు పి. హెచ్.డి పట్టా పొందావు?” అని అడిగారు. పరమాచార్య స్వామి వారికి అర్థం అవదు అని సంకోచిస్తూ అతను కొద్దిసేపు వారి ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. అతని తండ్రి చెప్పమని అదేశించాడు. ”క్వాంటమ్ థియరీ” అని నిర్లక్ష్యంగా అన్నాడు. మహాస్వామి వారు మట్టిలో ఒక +ve సంజ్ఞను వేసి దాని చుట్టూ ఒక వృత్తం వేసారు. అలాగే –ve సంజ్ఞను వేసి ఒక వృత్తం వేసారు. వాటిని రెండూ చూపిస్తూ అతన్ని అడిగారు. ”నీ పి.హెచ్.డిలో క్వాంటమ్ థియరీ థీసిస్ కోసం నువ్వు సానుకూల విధానాన్ని(Positive Approach) అవలంబించావా లేదా ప్రతికూల విధానాన్ని(Negative Approach) అవలంభించావా?”

అంతదాకా చికాకుగా ప్రవర్తిస్తున్న వాళ్ల అబ్బాయి ఈ ప్రశ్న విని కొద్దిగా ఆశ్చర్యపోయి కంగారుతో మాటలు తడబడగా పరమాచార్య స్వామి వారిపై గౌరవంతో బదులిచ్చాడు. ”సానుకూల విధానాన్ని అవలంబించాను.”

“ప్రతికూల విధానాన్ని ఎందుకు తీసుకోలేదు? అది తరువాత చేద్దాం అనుకున్నావా?”

”అది సాధ్యపడదు. చాలా కష్టం”

మహాస్వామి వారు అన్నాదురై అయ్యంగార్ వైపు చూసి “అది కష్టం అని అతను అంటున్నాడు. మీ వేద పాఠశాల పిల్లలతో ఋగ్వేదము నుండి ఈ పన్నాన్ని ఆమ్నాయం చెయ్యమని చెప్పండి” అని మొదటి రెండు పదాలను అందించారు.

ఆ విద్యార్థులు దాన్ని ఐదు నిముషముల సేపు వల్లించారు. తరువాత ఆ అబ్బాయి వంక తిరిగి, ”నువ్వు 24 లేదా 25 వ సంవత్సరములో నీ పట్తా పొందావు కదూ.” అని అన్నారు

“అవును నా 25వ సంవత్సరములో” అని బదులిచ్చాడు. ”ఋగ్వేదం లోనిది ఇప్పుడు నువ్వు విన్నది. అది సానుకూల విధానానం, ప్రతికూల విధానాం రెండింటి గురించి చెప్తుంది.” అని అన్నారు. వారి మాటలకు ఆ అబ్బాయి విస్తుపోయి, మళ్ళీ ఒక సారి చెప్పమని ఆ విద్యార్థులను కోరాడు. ”నువ్వు ఇప్పుడు ఏమి అలోచిస్తున్నావో నాకు తెలుసు. 25సంవత్సరాల లక్షలు లక్షలు ఖర్చుపెట్టి చదువుకొని తెలుసుకున్నది కేవలం 7 ఏళ్ళు వేదం చెదువుకొని ఉంటే తెలుసుకుని ఉండేవాడిని కదా!” అని గట్టిగా నవ్వారు.

--- తిరువణ్ణామలై గౌరీశంకర్ మామ

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

https://t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Saturday, September 8, 2018

పరమాచార్య స్వామి – ఉప్పు వ్యాపారి



అనుకోకుండా నాకు ఒక పెద్ద దుఃఖం, భరింపరాని శోకం కలిగింది. నాలుగు నెలల దాకా మహాస్వామి వారిని దర్శించుకోవడానికి కూడా వెళ్ళలేదు. మహాస్వామి వారు నాకోసం కబురు పంపారు. ఇద్దరు లేదా ముగ్గురు పెద్ద అధికారులు వచ్చి నన్ను వారి వద్దకు తీసుకుని వెళ్ళారు.

అప్పుడు రాత్రి పది గంటలు. . . . కటిక చీకటి. . . . కేవలం ఒక మట్టి ప్రమిద మాత్రమే వెలుగుతోంది.

”...నిపుణౌ”, మహాస్వామి వారు మెల్లిగా చెప్పారు, “చెప్పు”.

”తవ హి చరణావేవ నిపుణౌ . . . సౌందర్యలహరి లోని నాలుగవ శ్లోకం
త్వదన్యః పాణిభ్యాం. . . ”

పరమాచార్య స్వామి వారు చిన్నగా అన్నారు, “అందరికీ ఆ అమ్మే ఆశ్రయం. ఎవరెవరికి ఏమి ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఆమెకి తెలుసు.”

అంతా నిశ్శబ్ధం.... ”సాంబమూర్తి నీకు సంత అంటే ఏంటో తెలుసా?”

“తెలుసు పెరియావ. చాలామంది వర్తకులు సరుకులు తెచ్చి అమ్ముతూ ఉంటారు. వారంలో ఒక రోజు ప్రతి గ్రామంలో సంత జరుగుతుంది. వారు ఈరోజు ఇక్కడ రేపు అక్కడ అని ప్రయాణిస్తూంటారు.”

“నీవు ఉప్పు వ్యాపారి గురించి ఎప్పుడైనా విన్నావా?”

“అవును. వారు సంతలో ఉప్పు అమ్ముకుని జీవిస్తూ ఉంటారు. వారికి అదే జీవనాధారం.”

“అవును. అటువంటి ఒక ఉప్పు వ్యాపారి కామాక్షి అమ్మకి పరమ భక్తుడు. ఒకసారి అతను ఒక ఊరిలో సంత ముగించుకుని మరొక ఊరికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక అడవి గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమంది దొంగలు ఇతన్ని చూసారు. గాడిద పైన ఉప్పు మూటలు తీసుకువెళ్తున్న అతన్ని చూసి “రేయ్ రేపు సంతలో ఇతను ఈ ఉప్పునంతా అమ్మి డబ్బులతో మళ్ళా ఇదే మార్గంలో వెళ్తాడు. అప్పుడు మనం ఇతని ధనాన్ని దొంగిలించాలి.” వారు ఒక పథకం వేసారు. ఇంకా, వాళ్ళు పేల్చే మందుగుండు సామాగ్రి గురించి నీకు తెలుసా?”

“దేవాలయాలలో ఉత్సవాల సమయంలో పేలుడు పదార్థాలతో మందుగుండు సామాగ్రి తయారుచేస్తారు. గొట్టాలలో గట్టిగా కుక్కి ఒక వత్తి పెడతారు. ఆ వత్తి చివరకు అగ్ని తగిలితే అది చిన్నగా వెళ్ళి మందుగుండును తాకి పెద్దగా శబ్దము చేస్తూ పేలుతుంది.”

“అవును. ఆ దొంగల పథకము కూడా అదే. ఒక మందుగుండు పేలిస్తే ఆ గాడిద కంగారులో అటు ఇటు పరిగెడుతుంది. ఆ ఉప్పు వ్యాపారి భయతో అరుస్తూ గగ్గోలు పెడతాడు. అప్పుడు అతని దట్టీ నుండి డబ్బు తస్కరించవచ్చు.”

“ఆ రోజు సంతలో ఉప్పు వ్యాపారి తన దగ్గర ఉన్న ఉప్పును అమ్మడానికి కుప్పలుగా పోసాడు. కాని ఆరోజు బాగా వర్శం పడి ఉప్పు మొత్తం కరిగిపోయింది. అతనికి ఆరోజు వ్యాపారం లో నష్టము మనస్సుకు కష్టము కలిగింది. బుద్దికి తోచినట్టుగా మనస్సుకు వచ్చినట్టుగా కామాక్షిని తిట్టడం మొదలుపెట్టాడు. అతని కోపం ఏంటంటే డబ్బులేకుండా ఇంటికి వెళ్ళాలి అని. ఇంటికి వెనుతిరిగి నడక మొదలుపెట్టాడు. అడవి మార్గంలోకి ప్రవేశించగానే దొంగలు అతన్ని చూసి మందుగుండు పేల్చడానికి సిద్ధపడ్డారు. వత్తి గుండా మంట లోపలికి వెళ్ళి మందుగుండు సామాగ్రిని చేరింది కాని పేలలేదు. వారు దానికి కారణం వెతకగా ఆ మందుగుండు బాగా తడిసిపోయింది పొద్దున్న పడిన వర్షానికి. వాళ్ళు ఉప్పు వ్యాపారితో ఇలా అన్నారు. “దేవుడు నిన్ను కాపాడాడు. నీకోసమే ఈరోజు వర్షం పడినట్టుంది. పో ఇంటికి పోయి దేవున్ని ప్రార్థించు”

ఆ ఉప్పు వ్యాపారి నిశ్చేష్టుడయ్యాడు. “అమ్మ నాకు ద్రోహం చేసింది అనుకున్నాను. కాని అది తప్పు. ఆమె నన్ను కాపాడింది. అమ్మా కామాక్షి నన్ను క్షమించు. నాకు ఎప్పుడు ఎక్కడ ఏమి ఇవ్వాలో నీకు బాగా తెలుసు. నా అజ్ఞానాన్ని మన్నించు తల్లీ. వర్షం రాకపోయి ఉంటే నేను ఉప్పు మొత్తం అమ్మి డబ్బుతో వస్తుండేవాడిని. డబ్బు తీసుకోవడంతో పాటు ఈ దొంగలు నన్ను కొట్టేవారు. నన్ను కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు.“

కావున మనకి ఏమి లభించినా అది అమ్మ అనుగ్రహమే. మిగిలినది దేనికోసమూ ఆశించకుండా పరులకు మంచి చెయ్యడమే.

మహాస్వామి వారు చిన్న గొంతుకతో, తీరికగా చెప్పిన ఈ దీర్ఘ ఉపన్యాసం ముగిసే నాటికి రాత్రి 2:30 అయ్యింది.

అప్పుడు నేను “నా తల పైన ఉన్న వెయ్యి టన్నుల బరువు తీసేసినట్టు అయ్యింది” అని అన్నాను.

పరమాచార్య స్వామి వారు సంతతో మొదలుపెట్టి కామాక్షి అమ్మతో ముగించారు. అది నా మనస్థితి కోసం చెప్పబడినా ఇది అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే అందరూ ఇటువంటి స్థితిలో ఉన్నవారమే కదా!

తరువాత మహాస్వామి వారు ”క్రమం తప్పకుండా ప్రతిరోజూ రామాయణం చదువు. నీ మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది.” అని అన్నారు

ఈనాటికి నాకు రామాయణ పారాయణ - మనస్సుకు ప్రశాంతత ఒకేసారి వస్తుంది.

--- బ్రహ్మశ్రీ రామకృష్ణ దీక్షితర్, శ్రీమఠం విద్వాన్. మహాపెరియావళ్ దరిశన అనుభవంగళ్-1

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Friday, September 7, 2018

జీవన్ముక్తుల జీవకారుణ్యం



అది 1983 ఏప్రియల్ చైత్ర పౌర్ణమి. పరమాచార్య స్వామివారు ఆంధ్రదేశంలోని మహబూబ్ నగర్ జిల్లాలోని సరిహద్దు గ్రామమైన కొడంగల్ కు వచ్చారు. పర్ణశాలగా మార్చిన ఒక పశువుల కొట్టంలో వారి మకాం. మరుసటి రోజు నేను నా స్నేహితుడు విశ్వరూప దర్శనం చేసుకుని, స్వామివారి తెల్లవారు చేసే జపం అప్పుడు దాదాపు రెండు గంటల పాటు వారి వద్దనే కూర్చునే అదృష్టాన్ని పొందాము.

స్వామివారు జపం పూర్తిచేసేటప్పటికి దర్శనం కోసమని కొంతమంది భక్తులు వచ్చారు. మహాస్వామివారు వారితో మాట్లాడుతూ, తాము ఉంటున్న స్థలం యజమాని గురించి అడిగారు. ఆ సమూహం నుండి ఆ స్థలం యజమాని బంధువు ఒకరు ముందుకు వచ్చి, స్వామివారు అడిగిన విషయాలను తెలిపాడు. వారి కుటుంబం, వృత్తి, వారికున్న భూమి, గోసంపద మొదలైన విషయాలను అడిగి తెలుసుకున్నారు.

ఇది విన్నవారెవరికైనా వారిని గూర్చి మహాస్వామివారు అడిగి తెలుసుకుంటున్నారు అనే అనుకుంటారు. కాని అలా అడగడంలో ఆంతర్యం కేవలం తెలుసుకోవడం కోసం మాత్రమే కాదని తరువాత అర్థమయ్యింది. మరి ఇప్పుడు గోవుల్ని, గేదెలని ఎక్కడ ఉంచారు అని అడిగారు స్వామివారు. వాటిని ఆరుబయట కట్టేశారు అని తెలుసుకుని, ఈ ఎండలో రోజంతా అవి అక్కడే ఉంటాయా అని అడిగారు. వాటి నివాసాన్ని తను ఆక్రమించుకున్నానని స్వామివారి తలంపు కావచ్చు. వెంటనే మఠానికి సంబంధించిన కొన్ని వస్తువులను తీయించి, వాటిని లోపల ఉంచమని ఆదేశించారు.

ఆ మూగజీవులపై స్వామివారికున్న ప్రేమ అపారమైనది. ఆ పశువుల కొట్టంలో ఉండవలసిన హక్కు వాటిదే కాని తనది కాదని వాటికి చల్లని నీడను ఏర్పరిచారు మహాస్వామివారు.



Courtesy --- కంచి పెరివ ఫోరం.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

https://t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం