Monday, November 12, 2018

గుడి వ్యవహారం - గబ్బిల జన్మ

Image result for kanchi periyava




శ్రీ జగదీశ భట్ గారి జీవితంలో జరిగిన ఈ సంఘటన వల్ల శ్రీ శ్రీ శ్రీ చన్ద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు సర్వాంతర్యామి అని, ఈనాటికి భక్తులను కరుణిస్తున్నారని రూఢీగా అవగతమవుతుంది.

ఉత్తర చిదంబరంగా పేరుగాంచిన సతారాలోని నటరాజ స్వామి దేవాలయం స్వామివారి ఆదేశం ప్రకారం నిర్మించబడింది. ఆలయం పూర్తవడానికి ముందే, శ్రీ జగదీశ భట్ గారిని దేవాలయ వ్యవహారాలు చూసుకోవల్సిందిగా ఆజ్ఞాపించారు.

పరమాచార్య స్వామివారి ఆదేశానుసారం శ్రీ జగదీశ భట్ కూడా సతారా వెళ్లి, అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయ వ్యవహారాలు చూసుకుంటూ ఉండేవారు. కాని అతను అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇక వాటిని తట్టుకోలేక కంచీపురానికి తిరిగొచ్చాడు. పరమాచార్య స్వామివారు విచారించగా తనకు కల్గిన ఇబ్బందులను ఏకరువుపెట్టాడు.

కాని కరుణామూర్తులైన స్వామివారు అతని ఇబ్బందులను విని, పరిపూర్ణమైన ఆశీస్సులను అందించి, సతారాకు తిరిగివెళ్ళమని ఆదేశించారు. జగదీశ భట్ తో మాట్లాడుతూ, “శ్రీ ఏకాంబరేశ్వర దేవాలయంలో తలక్రిందులుగా వేలాడుతున్న గబ్బిలాలను చూశావా?” అని అడిగారు. గబ్బిలాలకు నోరు, మలమూత్ర ద్వారములు రెండూ ఒక్కటే అని చెప్పారు. తినడానికి, విసర్జించడానికి కూడా ఒక్కటే వాడుతాయి. ఎవరైనా దేవాలయ నిధులు, ధనము తస్కరించడానికి ప్రయత్నిస్తే, మరుసటి జన్మలో గబ్బిలంగా జన్మిస్తాడు అని శాస్త్రవచనం. స్వామివారు ఇదంతా చెప్పగానే, దేవాలయ ద్రవ్య విషయంలో అతను మరింత శ్రద్ధ కనబరుస్తూ, ఇది తనకు హెచ్చరికగా భావించాడు.

స్వామివారే స్వయంగా అతణ్ణి ఉత్సాహపరచడంతో కొత్త శక్తి వచ్చినట్లై దేవాలయాన్ని చూసుకునే బాధ్యతను తీసుకుని, చాలా సంవత్సరాల పాటు తన కర్తవ్యాన్ని నిర్వహించారు. కాని, ఎదో కారణాల వల్ల మొత్తం దేవాలి బాధ్యత, అర్చక బాధ్యత మొత్తం జగదీశ భట్ గారి పైనే పడ్డాయి. చివరకు మొత్తం వ్యవహారాలు చూసుకోవడం తలకు మించిన భారం అయిపొయింది. అటువంటి సమయంలో పరమాచార్య స్వామివారు తనకు ఇలా ఇబ్బంది కలగాజేస్తున్నారని చాలా నిరాశకు గురయ్యాడు.

ఆరాత్రి జగదీశ భట్ కు నిద్రపట్టడం లేదు. తెల్లవారుఝామున పరమాచార్య స్వామివారు కనపడ్డారు. వారు రెండుచేతులను పైకెత్తి సంపూర్ణ ఆశీస్సులను అందిస్తున్నట్టుగా కల వచ్చింది. “నువ్వు ఏమి భయపడకు. అంతా నేను చూసుకుంటాను” అని పరమాచార్య స్వామివారు ధైర్యం ఇచ్చినట్టుగా అనిపించింది. కనుల నీరు కారుతుండగా వెంటనే నిద్రనుండి మేల్కొన్నారు.

అది కేవలం కల లాగా అనిపించడం లేదు. స్వయంగా పరమాచార్య స్వామివారే వచ్చి ఆశీర్వాదించినట్టుగా ఉంది. ఆరోజు తనకి నూతనోత్సాహం కలిగింది. అన్ని పనులనూ ఎంతో ఉత్సాహంగా చేసుకున్నారు. ఒత్తిడి అసలు లేదు. ఇదంతా కేవలం పరమాచార్య ఆశీస్సులవల్లే అని అతనికి తెలుసు.

మరుసటిరోజు మరొక్క ఆశ్చర్యం జరిగింది. ఒక యువకుడు దేవాలయానికి వచ్చి అతని ముందు నిలబడ్డాడు. ఇంతకుముందు అతను భట్ కు సహాయకునిగా ఉండేవాడు. కాని ఏవో కారణాల వల్ల వెళ్ళిపోయాడు. ఎన్నో చోట్ల ప్రయత్నించి, చివరకు ఇక్కడే తనకు అనుగుణంగా ఉందని తిరిగొచ్చాడు. ఇక ఎప్పటికి ఈ దేవాలయాన్ని విడవకూదడనే దృఢ నిశ్చయంతో వచ్చాడు. అది కూడా మహాస్వామివారి కరుణయే అని జగదీశ భట్ గారికి అవగతమైంది.

బ్రహ్మజ్ఞానుల ఆశీస్సులు వారు భౌతికంగా మనవద్ద లేకపోయినా అవి తప్పాక జరిగి తీరుతాయని జగదీశ భట్ గారి జీవితంలో జరిగిన ఈ సంఘటన వల్ల అర్థమవుతుంది.

--- “శ్రీ పెరియవ మహిమై” పత్రిక నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Tuesday, November 6, 2018

వేదాధ్యయనం - విదేశీయానం



పరమేశ్వరుడంతటి దయాళువు, శుక మహర్షి అంతటి ఉన్నతులు అయిన మన మహాస్వామి మనందరినీ ఆదరించి ఆశీర్వదిస్తున్నారు.

1968లో కుంబకోణం శ్రీ రంగరాజచారి పరమాచార్య స్వామియొక్క పరిపూర్ణ కటాక్షంలో మునిగిపోయారు. 1971లో ఋగ్వేద అధ్యయనం పూర్తైన తరువాత, జీవనాధారం కోసం వైదిక వృత్తి చేపట్టాలని భావిస్తే, అందుకు పరమాచార్య స్వామివారు తమ అంగీకారాన్ని తెలపలేదు.

“నీ వేద విద్యార్జనకు నేను తగిన ఏర్పాట్లు చేస్తాను. నీ విద్యార్జన కొనసాగించు” అని స్వామివారు తెలిపారు. ప్రతి నేలా రెండు వందల రూపాయలు రంగరాజచారి కుటుంబానికి అందేట్టు, స్వంతంగా వండుకోవడానికి కావాల్సిన సంభారాలు కూడా ఏర్పాటు చేశారు. రంగరాజచారి గారిది పెద్ద కుటుంబం. కేవలం పరమాచార్య స్వామివారి ఆశీస్సులతోనే అందరి ఆడపిల్లల పెళ్ళిళ్ళు జరిగాయి.

మహాస్వామివారు పండరీపురంలో మకాం చేస్తున్నప్పుడు, రంగరాజచారి స్వామివారిని దర్శించుకుని సాష్టాంగం చేసి నమస్కరించారు. అప్పుడు మహాస్వామివారు, “నువ్వు నాకు సాష్టాంగం చెయ్యొచ్చా?” అని అడిగారు.

“మా సంప్రదాయం ప్రకారం, యజ్ఞోపవీతము, శిఖ లేని సన్యాసిని చూస్తే స్నానం చెయ్యాలి” అని రంగరాజచారి బదులిచ్చాడు.

“అలా అయితే, మరి నా ముందర ఎందుకు సాష్టాంగం చేశావు?”

“ఈ స్వరూపము విష్ణు స్వరూపమే అని నాకు అనిపించింది” అని భక్తితో బదులిచ్చాడు. ఈ శీవైష్ణవ భక్తశిఖామణి జీవితంలో పరమాచార్య స్వామి అనుగ్రహంతో ఒక అద్భుతం జరిగింది. రంగరాజచారిది పేద కుటుంబం. వారి ఆదాయంతో సభ్యులందరినీ చూసుకోవడం కూడా వీలు కాని పరిస్థితి. ఆడపిల్లల పెళ్ళిళ్ళకు డబ్బు కూడా అవసరం. ఇటువంటి స్థితిలో వారికి ఒక మంచి అవకాశం వచ్చింది. 1978లో వేద విద్యాభ్యాసం ముగియగానే, వారిని జర్మని రమ్మని కొందరు ఆహ్వానించారు. అంతటి కటిక దారిద్య్రాన్ని అనుభవిస్తున్న సమయంలో జర్మని అవకాశాన్ని, నేలకు మూడువేల రూపాయల సంపాదనని ఎలా కాదనగలరు. ఈ డబ్బుతో పాటు మూడేళ్ళ తరువాత మూడు లక్షల రూపాయలు అందుతుంది. కనుక రంగరాజచారి ఈ అవకాశాన్ని ఒప్పుకోవడంలో ఆశ్చర్యం ఏమి లేదు.

ఈ అవకాశాన్ని ఇచ్చినతనికి అన్ని ఏర్పాట్లు చూసుకోమని చెప్పాడు. ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లలో మునిగిపోయాడు. అదే సంవత్సరం అక్టోబరు 31న బోంబే నుండి బయలుదేరడానికి నిర్ణయించుకున్నాడు. ఇంత జరిగినా ఈ విషయాలేవీ ఇతరులకు తెలియనివ్వలేదు. అక్టోబరు 27న తన తండ్రికి విషయం తెలపడానికి గ్రామానికి వెళ్ళాడు.

“పరమాచార్య స్వామివారి అనుమతి తీసుకున్నావా?” అని అడిగారు అతని నాన్న. “లేదు, నాకు తెలిసి వారు అనుమతి ఇవ్వరు. స్వామివారు అనుమతించకపోతే, ఇంత డబ్బులు వచ్చే ఈ ప్రతిపాదనని నేను కాదనలేను. వెళ్ళడానికి నేనే నిర్ణయించుకున్నాను. మనకు డబ్బు అవసరం చాలా ఉంది. నాకు ఇంకొక మార్గం కనపడడం లేదు” అని చెప్పాడు.

ఆరాత్రికి తన ఊళ్లోనే ఉండిపోయాడు. రాత్రి మూడు గంటలప్పుడు, నిద్ర రాక మంచంపై అటు ఇటు దొర్లుతున్నాడు. అప్పుడు కళ్ళముందు మహాస్వామివారు ఉన్నట్టుగా లీలగా కనపడుతోంది. దగ్గరకు వచ్చి తనని తాకినట్టుగా తనకు అనుభూతి కలిగింది. తన తల్లి అడిగినట్టుగానే, “వెళ్ళడానికే నిర్నయించుకున్నావా?” అని అడిగినట్టు అనిపించింది. అది కలో, నిజమో అర్థం కావడంలేదు. ఆలస్యం చేయకుండా మరుసటిరోజే పరమాచార్య స్వామివద్దకు వెళ్లి అనుమతి పొందాలని భావించాడు.

అప్పుడు పరమాచార్య స్వామివారు కర్ణాటక రాష్ట్రం, బాదామి దగ్గరలోని బనశంకరి అనే చోట మకాం చేస్తున్నారు. అక్కడకు చేరుకోగానే స్వామివారి దర్శనానికి ముందు, స్నానం చేస్తున్నాడు. అప్పుడు పరమాచార్య స్వామివారి సహాయకులొకరు వచ్చి, “వచ్చి దర్శనం చేసుకోమని పరమాచార్య ఆదేశించారు” అని చెప్పాడు.

తను వస్తున్న విషయం కాని, వచ్చిన కారణం కాని ఎవరికీ తెలియదు. కాని మహాస్వామివారు కబురుచేయడంతో ఆశ్చర్యపోయాడు. అదే ఆశ్చర్యంతో వెళ్లి స్వామివారి ముందు నిలబడ్డాడు.

“ఎప్పుడు బయలుదేరుతున్నావు?” అని అడిగారు స్వామివారు.

“స్వామివారు ఎప్పుడు అనుమతిస్తే అప్పుడు” అని బడులిచ్చాడు స్వామివారు తన తిరుగు ప్రయాణం గురించి అడుగుతున్నరేమో అనుకుని.

“నీవున్నచోటికి తెరిగివెళ్ళే విషయం గురించి నేను అడగడం లేదు. విదేశాలకు వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నావు కదా! దాని గురించి ఎప్పుడు అని అడుగుతున్నా”

ఆ మాటలు విని నిశ్చేష్టుడయ్యాడు. ఇంకా ఆ విస్మయం నుండి తేరుకునే లోపే, పరమాచార్య స్వామివారు ఇంకొక విషయం తెలిపారు.

“నువ్వు ఇక్కడకు రావడానికి కారణమేంటో చెప్పనా? మొన్న నేను వచ్చి నిన్ను అడిగాను, “వెళ్ళడానికే నిశ్చయించుకున్నావా?” అని. అందుకే వెళ్లబోయేముందు ఇక్కడకు వచ్చావు. అంతేనా?” అని అన్నారు.

ఆరోజు జరిగినది కల కాదని, నిజంగా స్వామివారే వచ్చి ఆశీర్వదించారని తెలుసుకున్న తరువాత రంగరాజచారి భావోద్వేగానికి గురయ్యాడు.

“నీ మంచి నడతను కొనసాగించు . . . డబ్బు అవసరం లేదు . . . మంచి నడవడిక ముఖ్యం” అని చెప్పి, తమ దివ్య పాదచారణాలను ఆ భక్తుని తలపై ఉంచి కరుణతో ఆశీర్వదించారు.

ఇది అద్భుతం కదా! ఒక సాంప్రదాయస్తుణ్ణి విదేశాలకు వెళ్ళకుండా ఆపారు స్వామివారు. ధర్మం యొక్క సాకార రూపమైన మన స్వామివారు తన భక్తులను ధర్మ మార్గంలో పయనించడానికి అనుకూలంగా అనుగ్రహాన్ని ప్రసరిస్తారు.

--- “శ్రీ పెరియవ మహిమై” పత్రిక నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Monday, November 5, 2018

మహాస్వామి వారి ఘటం





పరమాచార్య స్వామి వారికి పరమ భక్తుడైనందువల్ల తన కీర్తి ప్రతిష్టలు అంతా స్వామి వారి అనుగ్రహంగానే పరిగణిస్తారు. “నాతో వారి ఉనికి, వారు నా వెంటే ఉన్నారన్న విషయం నాకు ఎన్నో సార్లు ఋజువు అయ్యింది” అని అంటారు ప్రముఖ ఘటం విద్వాంసులు విక్కు వినాయకరం.

ఒకసారి వినాయకరం, ఎల్. శంకర్ మరియ జాకిర్ హుస్సేన్ లతో కలిసి ఒక కచేరి కోసం ఏథెన్స్ వెళ్ళారు. కచేరి రోజుకు కొన్ని రోజులముందు అకస్మాత్తుగా వారి ఘటం పగిలిపోయింది. చెన్నైలో ఉన్న వారి భార్యకు ఏడుస్తూ “తెచ్చుకున్న ఘటం పగిలిపోయింది. ఇక్కడ నాకు ఇక పని లేదు. నేను తిరిగి వచ్చేస్తాను” అని చెప్పారు. వారి భార్య ఒక రోజు వేచి ఉండమని చెప్పి వారి పరిస్థితిని ఆచార్యుల వారికి చెప్పడానికి కంచికి వెళ్ళారు. పరమాచార్య స్వామి వారు ఆవిడ గోడు విని ఏమి పలుకక మిన్నకుండిపోయారు. ఆవిడ చాలా బాధపడి కన్నీరు కారుస్తూ తిరిగి వెళ్ళి పోతున్నప్పుడు మహాస్వామి వారు మౌనంగా ఒక కొబ్బరికాయను ఇచ్చి పంపారు.

మరోవైపు జాకిర్ హుస్సేన్ ఏథెన్స్ మొత్తం వెతికి చివరగా అమెరికా హౌస్ లో ప్రదర్శనకు ఉంచిన ఒక ఘటం చూసారు. కాని దాన్ని అతను ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే అది ఇచ్చిన వ్యక్తి దాన్ని ఎవరికి ఇవ్వకూడదు అమ్మకూడదు అని చెప్పారు. అది తనకి ఎవరు ఇచ్చారు అని అడుగగా అందరూ అతను “వినాయకరం” అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. “ఆ ఘటం నీకు ఇచ్చినవారికే ఇప్పుడు దాని అవసరం వచ్చింది” అని జాకిర్ గారు చెపారు. అప్పుడు అతను వినాయకరం గారి వద్ద నుండి “ఈ ఘటం నాకు చాలా ఉపయోగపడింది” అని ఒక లేఖని కూరుతూ ఆ ఘటాన్ని ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఇంకా ఆశ్చర్యపోవల్సిన విషయం ఏమిటంటే వినాకరం కచేరిలో వాయించడానికి సరిపడా శృతి ఆ ఘటానికుంది.

మరొక్కసారి అమెరికా వెళ్తూ జర్మనీలో విమానం తప్పినందువల్ల సరదాగా ఒక సంగీత వాద్య పరికరాలు అమ్మే దుకాణానికి వెళ్ళారు. వారి వినాయకరం అని తెలుసుకుని ఆ దుకాణదారుడు వారికి ఒక ఘటాన్ని చూపించి దాని నాణ్యత తెలుపమన్నారు. అది ఒక జర్మనీ వనిత తయారుచేసినది. దాని శృతి శబ్ధ స్వరం అచ్చంగా భారతదేశంలో తయారు చేసినదానివలే ఉన్నదని చెప్పారు.

సంతోషంతో ఆ యజమాని, వారు వద్దని వారిస్తున్నా దాన్ని వారికి బహూకరించాడు. వారు అమెరికా వెళ్ళిన తరువాత చూస్తే తెచ్చుకున్న ఘటం పగిలిపోయి ఉంది. వారికి బహూకరించిన ఘటాన్నే వారు కచేరీలో వాడారు. ఆ ఘటం శృతి జి (5 కట్తై) అది కచేరి యొక్క ఆధార శృతి సి (1 కట్తై)కి సరిగ్గా సరిపోయింది. దాన్ని పరమాచార్య స్వామి వారి ఘటంగా భావించి వారి పూజామందిరంలో ఉంచుకున్నారు వినాయకరం గారు.

--- పద్మశ్రీ టి.హెచ్. వినాయకరం, చెన్నై - శక్తివికటన్ ప్రచురణ

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

https://t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం