Saturday, June 15, 2019

సుద్యుమ్నుడు - ఇళ



Image result for sudyumna

సంసార జీవితంలో భార్యా, భర్త, ఇద్దరూ ఒక మాట మీదనే నిలబడి ఒక బాటలోనే నడవాలని అలా కాని పక్షంలో భవిష్యత్తు విచిత్రమైన మార్పులు పొందుతూ ఉంటుందని అవి వారి సంతానాన్ని ఇబ్బందులకు గురిచేస్తాయనే విషయాన్ని సుద్యుమ్నుడి కథ తెలుపుతుంది. అలాగే భారతం కేవలం పురాణ గ్రంథమే కాదని అందులో ఈనాడు వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో మనకు కనిపిస్తున్న ఎన్నో అద్భుతాలు ఆనాటి వారు ­హ మాత్రంగానయినా ఆలోచించగలిగారనే విషయాన్ని మహాభారతంలోని కథ, సాహిత్యం వివరిస్తోంది. వైవశ్యత మనువు భార్య శ్రద్ధాదేవి, వైవశ్యత మనువు తన భార్యతో కలిసి పుత్రకామేష్టియాగం ప్రారంభించాడు. శ్రద్ధాదేవికి తనకు కూతురు జన్మిస్తే బాగుండుననే అభిప్రాయం కలిగింది. ఒక రోజున ఆమె యాగం చేస్తున్న హోత వద్దకు వెళ్ళి నమస్కరించి తనకు కూతురు కలిగేలా యాగం చేయమని ప్రార్థించింది. ప్రార్థనను మన్నించి హోమం చేశారు. పుత్రకామేష్టి పూర్తయిన తర్వాత శ్రద్ధాదేవికి కూతురు జన్మించింది. 

                           ఆ శిశువుకు ‘ఇళ’ అని పేరు పెట్టారు. కానీ వైవశ్యత మనువు యజ్ఞ బ్రహ్మ వశిష్టుడి వద్దకు వెళ్ళి పుత్రుడికి బదులుగా పుత్రిక జన్మించిందని తన కోరిక ఎందుకు భగ్నమైందని అడిగాడు. వశిష్టుడు దివ్యదృష్టితో జరిగినదంతా తెలిసికొని తన శక్తితో ఇళను బాలుడిగా మార్చాడు. ఆ బాలుడికి సుద్యుమ్నుడు అని పేరు పెట్టారు. సుద్యుమ్నుడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకనాడతడు తన మంత్రిగణంతో వేటకు వెళ్ళి చాలాసేపు సింహాలను, పులులను వేటాడి అలసి ఆ సమీపంలో ఉన్న ఒక కొలనులో ఉన్న నీటిని తాగారు. వెంటనే సుద్యుమ్నుడు, అతడి పరివారం గుర్రాలతో సహా ఆడవారిగా మారిపోయారు. దానికి కారణం పూర్వం ఆ ప్రాంతంలో పురుష సంచారాన్ని నిషేధిస్తూ పార్వతి కోరిక మేరకు పరమేశ్వరుడు శాపం ఇవ్వడమే. సుద్యుమ్నుడు అతడి పరివారం స్త్రీలుగా మారడంతో తిరిగి తమ రాజ్యానికి వెళ్ళలేక అక్కడక్కడ తిరగడం ప్రారంభించారు. ఒకనాడు అక్కడికి సమీపంలో ఉన్న బుధుడి ఆశ్రమానికి వెళ్ళడం తటస్థించింది. బుధుడి కొడుకైన చంద్రుడు రాజస్త్రీగా ఉన్న సుద్యుమ్నుడి (ఇళ) మీద మనసు పడ్డాడు. వారిద్దరి సమాగ ఫలితంగా కొన్నాళ్ళకు వారికి పురూరవుడు జన్మించాడు. కొంత కాలం గడిచిన తరువాత సుద్యుమ్నుడు తనకు బాల్యంలో ఆడరూపు పోగొట్టి మగరూపు తెప్పించిన వశిష్టుని తలుచుకున్నాడు. 

                    వశిష్టుడు అక్కడికి వచ్చి విషయం తెలుసుకున్నాడు. తన శిష్యుడు ప్రస్తుతం ఉన్న ఆడ రూపును పోగొట్టి మగ రూపును ప్రసాదించమన్న కోరికను తీర్చలేక శివుడిని గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై పార్వతికి ఇచ్చిన మాటను తోసివేయక వశిష్టుని కోరికను కాదనలేక ఉభయ తారకంగా ఉండే విధంగా ఒక మాసం మగవాడుగా, ఒక మాసం ఆడదిగా సుద్యుమ్నుడు ఉండే విధంగా అనుగ్రహించి అంతర్థానమయ్యాడు. సుద్యుమ్నుడు అప్పటికి ఆనందించి తిరిగి రాజ్యానికి వెళ్ళి పురుష రూపంగా ఉన్నప్పుడు మాత్రమే రాజ్య పరిపాలన చేయడం ప్రారంభించాడు. ఆ కాలంలో సుద్యుమ్నునకు.. ఉత్కళుడు, గయుడు, విమలుడు అను ముగ్గురు కుమారులు కలిగారు. వారు ఉత్తరరాజ్య భాగాలకు రాజులయ్యారు.  తమ రాజు కొన్ని మాసాలు మాత్రమే పరిపాలన చేస్తుండడం ప్రజలకు వింత అనిపించి ఆనోటా ఆ నోటా అసలు విషయం తెలుసుకున్నారు. ఈ లోగా సుద్యుమ్నుడి కొడుకు పురూరవుడు పెరిగి పెద్దవాడయ్యాడు. సుద్యుమ్నుడు ప్రజలు తనను గురించి అనుకునే పలు రకాల మాటలు వినలేక సుద్యుమ్నునకు ఈ జీవితమంటే రోత పుట్టింది. అతను తన పుత్రుడు పురూరవునకు ప్రతిష్ఠానపుర రాజ్య సింహాసనం  అప్పగించి తపోవనాలకు వెళ్లిపోయాడు.  సుద్యుమ్నుడి తల్లిదండ్రులు ఏకాభిప్రాయం కలిగి ఉండకపోవడం ఈ కథలోని ఇన్ని మార్పులకు, సుద్యుమ్నుడి మనోవేదనకు కారణమైంది.




- శ్రీ యల్లాప్రగడ మల్లికార్జున రావు గారు
- సేకరణ ఈనాడు దినపత్రిక నుంచీ

Wednesday, June 12, 2019

నారాయణుడు ఉన్న చోట

Related image

గొప్ప నీతిశాస్త్రంగా, పూజనీయ గ్రంథంగా ఉన్న మహాభారత కథలో అక్కడక్కడా కొన్ని సందేహాలు పాఠకులకు తలెత్తుతుంటాయి. ఇది ధర్మమా? అధర్మమా? అని తేల్చుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి వాటిలో కౌరవ పాండవులకు గురుపుత్రుడైన అశ్వత్థామ ప్రయోగించిన దివ్య అస్త్రాలన్నీ నిర్వీర్యం కావడం ఆశ్చర్యంగా కనిపిస్తుంది. తన అస్త్రాలు విశ్వాన్ని మొత్తాన్ని జయించగలవనే నమ్మకంతో ఉన్న అశ్వత్థామ అవి దేనికీ పనికి రాకుండా పోవడంతో తీవ్రంగా కలత చెందుతాడు. యుద్ధం చేస్తున్నప్పుడు ఎవరో ఒక మహాపురుషుడు ఒక శూలాన్ని పట్టుకొని తన ముందు నిలబడి శత్రుసంహారం చేయడం అర్జునుడికి కనిపిస్తుంటుంది. అశ్వత్థామ, అర్జునులకు ఇవి తీరని సందేహాలుగా మిగులుతాయి. ఈ సందేహాలను వ్యాసభగవానుడు నివృత్తి చేసి వారి మనస్సులను సమాధాన పరిచి మళ్లీ కార్యోన్ముఖులను చేస్తాడు. అందుకే ద్రోణపర్వం చివర్లో వ్యాసుడు ముందుగా అశ్వత్థామకు సాక్షాత్కరిస్తాడు.
అందరికీ గురువు, ఎదురులేని శక్తికలిగిన తన తండ్రిని రణరంగంలో దృష్టద్యుమ్నుడు చాలా నీచంగా సంహరించడం అశ్వత్థామకు విపరీతమైన ఆగ్రహాన్ని కలిగించింది. వెంటనే తన దగ్గర ఉన్న నారాయణాస్త్రంతో శత్రుసంహారం చేస్తానని దుర్యోధనుడికి అశ్వత్థామ ధైర్యం చెబుతాడు. ఆ అస్త్రం ఎంతో శక్తిమంతమైందని, తన తండ్రి నారాయణుడిని ఆరాధించి ఆ అస్త్రాన్ని పొంది తనకు ఇచ్చినట్లు చెప్పాడు. ఆ దివ్యాస్త్రంతో ఎలాంటి వారినైనా సంహరించగలనని, తన తండ్రిని చంపిన శత్రువుల మీద పగతీర్చుకుంటానన్నాడు. అశ్వత్థామ పలికిన ఆ ధైర్యపు వచనాలతో కౌరవసేనలో మళ్లీ ఉత్సాహం కలిగింది. అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు. యుద్ధరంగంలో కలకలం మొదలైంది. వాసుదేవుడు చిద్విలాసం చిందించాడు. అర్జునుడు బ్రహ్మ సృష్ఠించి ఇచ్చిన మహాస్త్రాన్ని ప్రయోగించాడు. అది అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాన్ని క్షీణింపచేసింది. అశ్వత్థామకు ఏమీ అర్ధంకాక అస్త్రాలను విడిచి పెట్టి అయోమయంగా ఎటో వెళ్లిపోయాడు. అలా వెళుతున్న అశ్వత్థామకు వ్యాసుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు అశ్వత్థామ తన మనస్సులో ఉన్న వ్యథనంతా వెళ్లగక్కాడు. ఎంతో గొప్ప దివ్యాస్త్రాలనుకున్న తన అస్త్రాలన్నీ ఏ కారణంతోనో పనికిరాకుండా పోయాయని, తన శత్రువులైన కృష్ణార్జునులను ఏమీ చేయలేకపోవడం తనకెంతో వ్యథ కలిగిస్తోందన్నాడు. అప్పుడు వ్యాసుడు చిరునవ్వుతో కృష్ణుడు సామాన్యుడు కాడు. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువేనని చెప్పాడు. లోకాలన్నింటినీ రక్షించాలనే అతడు కృష్ణుడుగా జన్మించాడు. ఈ కృష్ణుడే పురాణ మునుల్లో ప్రసిద్ధులైన నరనారాయణుల్లో నారాయణుడు. శక్తి కోసం హిమాలయ పర్వతాల మీద కఠోరంగా తపస్సు చేసిన నారాయణుడికి పరమశివుడు ప్రమథగణాలతో సహా ప్రత్యక్షమయ్యాడు. తనకు వరాలు ప్రసాదించమని శివుడిని ఆయన కోరుకున్నాడు.
                                లోక సంరక్షణ కోసం దేవతలు, గంధర్వులు తదితరులలో జన్మించి దుష్టులను సంహరించమని శివుడు నారాయణుడికి చెప్పాడు. నారాయణుడు యుద్ధంలో నిలబడినప్పుడు ఏ అస్త్రశస్త్రాలు పని చేయకుండా గొప్ప శక్తిని పరమేశ్వరుడు నారాయణుడికి ఇచ్చాడు. నరనారాయణులలో నరుడు అర్జునుడుగా జన్మించాడు. పరమేశ్వర శక్తితో ఉన్న కృష్ణుడు ఉండడం వల్లనే నీ దివ్యాస్త్రాలు ప్రభావం చూప లేక పోయాయని వివరించాడు. వ్యాసుడి బోధతో అసలు విషయాన్ని గ్రహించిన అశ్వత్థామ మనసులోనే పరమేశ్వరుడిని స్తుతించి శ్రీకృష్ణుడికి నమస్కరించి మనశ్శాంతిని పొందాడు.
ఆ తరువాత వ్యాసుడు అర్జునుడి దగ్గరకు వెళ్లాడు. అర్జునుడు ఆయనను సాదరంగా ఆహ్వానించి పూజించి సత్కరించాడు. అనంతరం తన మనస్సులో ఒక సందేహం ఉందని దాన్ని తీర్చమని వేడుకున్నాడు. తాను యుద్ధం చేస్తున్నప్పుడు ఎవరో ఒక దివ్య పురుషుడు గొప్ప ప్రకాశవంతమైన శరీరంతో వెలుగుతూ తన ముందు నిలబడి చేతిలో ఉన్న శూలంతో తాను చంపాలనుకున్న శత్రువులందిరినీ సంహరిస్తూ కనిపిస్తున్నాడు. నేను కేవలం ఆయన వెనుక నిలబడి శత్రువుల మీదకు బాణాలు వేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఆ దివ్యపురుషుడు ఎవరై ఉంటారో చెప్పమన్నాడు. అప్పుడు వ్యాసమహర్షి సమాధానం చెబుతూ అర్జునుడికి దివ్యతేజోరాశిగా కనిపించిన వ్యక్తి సాక్షాత్తు పరమశివుడు. పాశుపతంలాంటి అస్త్రాలను ప్రసాదించింది కూడా ఆయనే. ధర్మరక్షణ కోసం సాక్షాత్తు ఆ రుద్రుడే యుద్ధరంగంలో కృష్ణార్జునులకు అండగా నిలిచాడని వివరించి అంతర్ధానమయ్యాడు.

- శ్రీ యల్లాప్రగడ మల్లికార్జున రావు గారు
- సేకరణ ఈనాడు దినపత్రిక నుంచీ

Saturday, June 8, 2019

నాస్తికుడు ఆస్తికుడైన వేళ

Image result for sri chandrashekarendra saraswati

చిత్రనిర్మాత సాండొ చిన్నప్ప దేవార్ మరియు ప్రఖ్యాత తమిళ కవి కన్నదాసన్ ఇద్దరూ ప్రాణ స్నేహితులు. ఒక సినిమా షూటింగ్ నిమిత్తం కార్లో వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది. దేవార్ చిన్న చిన్న దెబ్బలతో తప్పించుకున్నాడు కాని కన్నదాసన్ మాత్రం తీవ్రమైన గాయాలతో స్పృహ కోల్పోవడంతో మాద్రాసులోని ఆసుపత్రిలో చేర్పించారు.

దేవార్ కు పరమాచార్య స్వామి అంటే అమితమైన భక్తి. వెంటనే తేనంబాక్కం శివస్థానంలోని బ్రహ్మపురీశ్వర దేవస్థానంలో మకాం చేస్తున్న మహాస్వామి వారిని దర్సించుకోవడానికి వెళ్ళాడు.

“ఒక ప్రమాదం జరిగింది” అని స్వామితో చెప్పాడు దేవార్. వెంటనే స్వామివారు “కన్నదాసన్ ఎలా ఉన్నాడు?” అని అడిగారు.

తను ఏమి చెప్పకనే మహాస్వామివారు కన్నదాసన్ ఎలా ఉన్నాడు అని అడగటంతో దేవార్ ఆశ్చర్యపోయారు. ప్రమాదం నుండి తను ఎలా బయటపడ్డాడు, కన్నదాసన్ ఎలా తీవ్రంగా దెబ్బతిని అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చేరాడు అన్న విషయమంతా స్వామివారికి విన్నవించాడు.

దేవార్ ఆత్రుతని గమనించి మహాస్వామి వారు “దిగులు పడకు ఏమి పరవాలేదు” అని అతణ్ణి సముదాయించారు. ఆస్పత్రిలో ఉన్న కన్నదాసన్ నుదుటిపైన విభూతి పెట్టి, కొద్దిగా నోట్లో వేసి మిగిలిన దాన్ని దిండు కింద ఉంచమని స్వామివారే స్వయంగా విభూతిని పొట్లం కట్టి ఇచ్చారు. దేవార్ సంకోచిస్తూ విభూతిని అందుకున్నాడు.

ఎందుకంటే కన్నదాసన్ పరమ నాస్తికుడు. దైవాన్ని నమ్మేవాడు కాదు. అప్పటికే కన్నదాసన్ ద్రావిడ పార్టీల నాస్థిక కార్యకలాపాల్లో, వాటి వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. బ్రాహ్మణుల గురించి, సనాతన ధర్మం గురించి చాలా చెడుగా మాట్లాడేవాడు. నిజానికి ప్రమాదం జరగడాని వారం రోజులముందు కూడా కంచిలోని శంకర మఠం ఎదురుగుండా జరిగిన ఒక సభలో శంకరాచార్యుల (కంచి పీఠాధిపతుల) చిత్తరువును అవమానపరిచాడు. మరి ఇప్పుడు అటువంటి వ్యక్తికి ఈ విభూతి ఎలా ఇచ్చేది అని ఆలోచిస్తున్నాడు దేవార్.

ఆ త్రికాలజ్ఞాని దేవార్ పరిస్థితిని అర్థం చేసుకుని దేవార్ తో ఇలా అన్నారు.

”ఏమి అనుమానపడకుండా వెళ్ళి కన్నదాసన్ నుదుటన ఈ విభూతి పెట్టు. చిన్న మేఘం కాసేపు సూర్యుణ్ణి అడ్డుకున్నట్టు, ఈ నాస్తికత్వం అతణ్ణి అడ్డుకుంది. ఇప్పటి నుండి అతను సూర్యునివలె ప్రకాశిస్తాడు. వారి పూర్వీకులు ఎంతటి మహాత్ములో నీకు తెలుసా? వారి ముత్తాత కంచి వరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని పునరుద్ధరించారు. వారి తాత కంచి ఏకాంమ్రేశ్వర దేవస్థానాన్ని పునరుద్ధరించారు. వారి తండ్రి కంచి కామాక్షి అమ్మవారి దేవస్తానాన్ని పునరుద్ధరించారు. అతను దేవాలయలాను సంరక్షించే మాహానుభావుల వంశంలో జన్మించాడు. ఇప్పుడు నీకు అర్థమైందా?”

దేవార్ ఆస్పత్రికి వెళ్ళి స్వామివారు చెప్పినట్టు చేసాడు. స్వామివారు ఇచ్చిన విభూతిని కన్నదాసన్ నుదుటన పెట్టి కొంచం నోట్లో వేసి, మిగిలినదాన్ని దిండు కింద పెట్టాడు. అప్పుడు సాయం సంధ్యా సమయం. తమిళ సాహిత్యానికి రాజైన కవి అరసు(కవి రాజు) కన్నదాసన్ ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. దేవార్ విశ్రాంతి కొరకై రాత్రికి ఇంటికి వెళ్ళి తన స్నేహితుణ్ణి చూడాలని ఉదయాన్నే మరలా వచ్చాడు. స్పృహలోకొచ్చిన కన్నదాసన్ కు ఏమి చెప్పాలా అని అలోచిస్తూ రాత్రి అంతా గడిపాడు.

మరుసటి రోజు ఆసుపత్రికి రాగానే కన్నదాసన్ స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచి అలాగే మంచంపై పడుకుని ఉండడం చూసి ఆనందపడ్డాడు. “నేను ఎన్ని రోజులనుండి ఈ ఆసుపత్రిలో ఉన్నాను? నా మొహం చూసుకోవాలి అద్దాన్ని తీసుకుని రా” అని చెప్పాడు. దేవార్ ఆద్దం తెచ్చిచ్చాడు. అద్దంలో తన మొహాన్ని, నుదుటిపై ఉన్న విభూతిని చూసి అతను కోప్పడలేదు. బదులుగా ఎవరు పెట్టారు అని అడిగాడు. దేవార్ కొంచం ధైర్యం తెచ్చుకుని తను పరమాచార్య స్వామిని కలవడమూ, వారి అతణ్ణి అనిగ్రహించడమూ మొదలగు అన్ని విషయాలు కన్నదాసన్ కు చెప్పాడు.

అంతా వినగానే కన్నదాసన్ కన్నీళ్ళపర్యంతం అయ్యాడు. “నన్ను కరుణించారా? నా పైన ఇంతటి దయ చూపించారా? కేవలం వారం రోజుల ముందు నా చేష్టలతో, మాటలతో వారిని అవమానపరిచాను. ఎంతటి పాపిని నేను?” అని భోరున విలపించాడు. “పూర్తి స్వస్థత పొందిన తరువాత నేను మొదట నా ఇంటికి వెళ్ళను. ఇంతటి పాపిని అనుగ్రహించిన ఆ మహాత్ముని వద్దకు ముందు నన్ను తీసుకుని వెళ్ళు” అని దేవార్ ను అర్థించాడు.

అతని కోరిక ప్రకారం మహాస్వామివారిని దర్శించుకుని తనని క్షమించవలసిందిగా పలువిధాల ప్రార్థించాడు. అప్పటి నుండి నాస్తికత్వం నుండి ఆధ్యాత్మికత వైపు మళ్ళాడు. మనసులో భక్తిభావం పొంగగా మహాస్వామి వారిపై కవిత రాసాడు. మరలా స్వామిని దర్శించినప్పుడు దాన్ని వారికి సమర్పించాడు.

”ఎవరి కనుచూపుచేతనే అన్ని పాపాలు నశించిపోతాయో
ఎవరు తిరువాచకానికి సాకార స్వరూపమై నిలచినారో
ఎవరు తన మేధస్సు చేత సత్యా జ్ఞానానికి అర్థం చెప్పగలరో
ఎవరు ఈ విశ్వాన్ని రక్షించాడానికి వచ్చిన విశ్వనాథుడో
ఎవరు అన్ని మతాల చేత తమ దేవుడని ఒప్పబడినాడో
అటువంటివారి చరణారవిందములకు మనల్ని సమర్పించుకుందాము
రండి! అందరూ తరలిరండి!!”

మహాస్వామివారు పద్యాన్ని చదివి కన్నదాసన్ తో “నువ్వు చెప్పినది కేవలం శేషాద్రి

స్వామివారికి మాత్రమే సరిపోతుంది. ఆయనే తురువణ్ణామలై అర్ధనారీశ్వరుడు. ఆయనే సత్పురుషుడు, మహామనీషి” అని అన్నారు.

”సనాత ధర్మ వైభవాన్ని గురించి మనస్పూర్తిగా రాయి” అని ఆశీర్వదించి పంపారు.

అప్పుడే కన్నదాసన్ మనసులో బీజం పడింది. అది చిగురించి, చిన్న మొక్కై, మహావృక్షమై మహత్తరమైన “అర్థముల్లా హిందు మతం; అర్థవంతమైన హిందూ మతం” అనే పుస్తకమై వర్ధిల్లింది.

[పూర్వీకులు చేసిన పుణ్యం మనల్ని ఖచ్చితంగా కాపాడుతుంది. మరి వింతపోకడలతో స్వధర్మాన్ని ఆచార వ్యవహారాలని మంటగలిపి పాశ్చాత్య సంస్కృతికి బానిసలవుతున్న వారి వంశాలని, ముందు తరాలని కాపాడేది ఎవరు? ఏ పుణ్యం చూపించి భగవంతుడు నిన్ను కాపాడుతాడు. అందుకే ‘కురు పుణ్య మహోరాత్రం’ అన్నారు శంకరులు.]

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

మార్కండేయ మహాముని


 Related image
పుణ్యపురుషుల సందర్శనం, పవిత్ర ప్రదేశాల ప్రభావం సామాన్యమైనవి కావని అర్ధాయుష్కులను కూడా చిరాయుష్కులుగా చేయగల శక్తి తీర్థక్షేత్ర సందర్శనం వలన కలుగుతుందని వివరించే కథ పద్మపురాణం 33వ అధ్యాయంలో కనిపిస్తుంది. మార్కండేయ ముని జీవితానికి సబంధించిన ఈ కథను పులస్త్యముని భీష్ముడికి వివరించి చెప్పాడు. పూర్వం మ్రుకండుడు అనే ముని తన భార్యతో సహా కఠోరంగా తపస్సు చేసి దైవానుగ్రహం వలన ఒక కుమారుడిని పొందాడు. ఆ బాలుడు ఐదేళ్ల ప్రాయంలోనే మంచి గుణగణాలతో ప్రకాశిస్తూ ఉండేవాడు. ఆ చిన్నారి బాలుడు ఇంటి ముంగిట తిరుగుతూ వచ్చేపోయే వారందరికీ జరగబోయే విషయాలను ఎన్నింటినో వివరిస్తూ ఉండేవాడు. దీనిని గమనించిన మ్రుకండుడు ఒకరోజున తన కుమారుడిని పిలిచి నీ ఆయుర్ధాయం ఎంతో చెప్పగలవా అని అడిగాడు.

                                                             ఆ బాలుడు తనకు బ్రహ్మ ఇచ్చిన ఆయువు ఇంకా ఆరు మాసములే ఉందని చెప్పాడు. ఆ మాటలను విని దుఃఖిస్తున్న తండ్రిని దుఃఖించవడద్దని ఆ బాలుడు చెప్పాడు. వెంటనే మ్రుకండుడు తన కుమారుడికి ఉపనయనం జరిపించి, హితబోధగా కనిపించిన ప్రతిమనిషికి ఎటువంటి బేధాన్ని తలచకుండా నమస్కరిస్తూ ఉండమని చెప్పాడు. ఆ బాలుడు తండ్రి మాటను శిరసావహించి తనకు కనిపించిన ప్రతి మనిషికి ఎంతో భక్తిభావంతో, వినయంతో నమస్కరిస్తూ ఉండేవాడు. ఇలా కాలం గడుస్తుండగా ఒకరోజున సప్తరుషులు తీర్థయాత్రలకు వెళుతూ ఆ బాలుడి కంట పడ్డారు. తనకు ఎదురైన ఆ సప్తర్షులందరికీ ఎంతో భక్తితో నమస్కరించాడు. ఆ చిన్నారి బాలుడు అలా నమస్కరించడం ఎంతో ముచ్చటగా సప్తర్షులకు అనిపించింది. వెంటనే వారు ‘‘పూర్ణాయుష్కుడవు కమ్ము’’ అని దీవించారు. అయితే ఆ వెంటనే వారు ఆ బాలుడికి బ్రహ్మ అల్పాయువునే ప్రసాదించాడని తెలుసుకున్నారు. అంతేగాక ఇంకా ఐదు రోజులు మాత్రమే అతనికి ఆయువు ఉందని గ్రహించారు. వెనువెంటనే ఆలస్యం చేయక ఆ బాలుడిని కూడా వెంటబెట్టుకొని వారంతా బ్రహ్మ దగ్గరకు వెళ్ళి నమస్కరించారు. ఆ రుషుల నడుమ బాలుడే ముందుగా తనను గుర్తించి నమస్కరించడం బ్రహ్మకు కూడా ఎంతో ఆనందాన్ని కలిగించింది. వెంటనే బ్రహ్మదేవుడు చిరాయువు కమ్మని ఆ బాలుడిని ఆశీర్వదించాడు. బ్రహ్మ ఆశీర్వచనం విని ప్రక్కనే ఉన్న రుషులంతా ఎంతో ఆనందించారు. ఆ రుషులంతా అలా ఎందుకు ఒక్కసారిగా ఆనందస్వరూపులవుతున్నారో బ్రహ్మకు తెలియరాక ఆ బాలుడు ఎవరని, రుషులంతా తనదగ్గరకు రావడానికి కారణమేమిటని రుషులను ప్రశ్నించాడు బ్రహ్మ. అప్పుడు సప్తర్షులు ఆ బాలుడు మ్రుకండుడి కుమారుడని జరిగిన విషయమంతా వివరించి ఆ బాలుడు తన తండ్రి ఆజ్ఞానుసారం కనిపించిన ప్రతిమనిషికి భక్తి, వినయాలతో నమస్కరిస్తూ తీర్థయాత్రలు చేస్తున్న తమకు ఎదురయ్యాడని చెప్పారు. తాము కూడా ఆ బాలుడిని దీర్ఘాయువుగా ఉండమని దీవించినట్లు ఇప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఆ బాలుడిని చిరాయువు ప్రసాదంచడం ఎంతో ఆనందాన్ని కలిగించినట్లు వారు చెప్పారు. ఆ మాటలను విని బ్రహ్మదేవుడు కూడా ఎంతో ఆనందించి ఆ మార్కండేయుడు (మ్రుకండముని కుమారుడు) తన ఆయువుతో సమానమైన ఆయువు కలిగినవాడవుతాడని మరోమారు పలికి రుషులకు, మార్కడేయునికి వీడ్కోలు పలికాడు. అనంతరం మార్కండేయుడు తన ఇంటికి, రుషులు తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళారు. మార్కండేయుడు ఇంటికి తిరిగివచ్చి తన తండ్రితో జరిగిన విషయాన్నంతటినీ వివరించి తన జీవితమంతా బ్రహ్మను గురించిన తపస్సులోనే గడిచేలా అనుమతి ఇవ్వమని వేడుకున్నాడు. తన కుమారుడి విజయానికి మ్రుకండుడు ఎంతగానో ఆనందించినప్పటికీ వెంటనే తనను వీడి వెళుతున్నందుకు కొంత బాధాతప్తుడయ్యాడు. అప్పుడు మార్కండేయుడు తండ్రికి ధైర్యం చెప్పి దుఃఖించవలసిన పనిలేదని తాను పుష్కరతీర్థంలో తపస్సు నిర్వహించడానికి వెళుతున్నానని ఆ పుష్కరతీర్థ మహిమను సాక్షాత్తూ జగన్నాథుడే
‘‘బ్రహ్మలోకస్య పన్థానం ధన్యాఃపశ్యంతి పుష్కరం! యన్తు వర్షశతం సాగ్రమగ్నిహోత్రముపాసితా!! కార్తీకం వసేదేకాం పుష్కరే సమమేవచ! కర్తుమ్మయా నశక్తిః కర్మణానైవ సాధితమే!!’’
ఇలా అభివర్ణించాడని చెప్పాడు. ఈ కథలో అల్పాయుష్కుడైన బాలుడు తీర్థయాత్రలు చేస్తున్న సప్తర్షులకు కనిపించడం వారివెంటనే తానే బయలుదేరి బ్రహ్మలోకం వరకూ వెళ్ళి బ్రహ్మ ఆశీస్సులను కూడా పొందటం లాంటి సందర్భాలను పరిశీలిస్తే సత్పురుషుల సందర్శనం, తీర్థయాత్రల వలన కలిగే పుణ్యఫలితం ఎంతటి సత్ఫలితాలను ఇస్తాయో గమనించవచ్చు.


- శ్రీ యల్లాప్రగడ మల్లికార్జున రావు గారు
- సేకరణ ఈనాడు దినపత్రిక నుంచీ

గౌతమ మహాముని

Related image

తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే. పాపం కూడా నిప్పులాంటిదే. నిప్పులాగే దాని ప్రభావం ఉంటుంది. ఈ జీవిత సత్యాన్ని సమర్ధిస్తూ భూమికి గౌతమిని తెచ్చి మనుషుల పాపాలను పోగొట్టేందుకు కృషి చేసిన గౌతమ మునికి సంబంధించిన కథ ఒకటి ఉంది. శివపురాణంలో కోటిరుద్ర సంహితలో ఇది కనిపిస్తుంది. గౌతమ మునిని గోహత్యా పాపం చుట్టుకుందని భయపెట్టి ఆయనచేత తీవ్రమైన తపస్సు చేయించి గంగ భూమి మీదకు వచ్చి గౌతమిగా మారి ముందుగా గౌతముడి పాపాన్ని తొలగించి ఆ తర్వాత అందరి పాపాలను క్షాళన చేసేందుకు పథకం పన్నిన బ్రాహ్మణులు శాపం పాలయ్యారు. అయితే ఈ సందర్భంలో గంగాదేవి కోపానికి గౌతముడిచ్చిన శాపానికి ఆ బ్రాహ్మణులేకాక వారి సంతతి కూడా దరిద్రులుగా మారవలసి వచ్చింది. గౌతముడి చేత గౌతమీ నదిని భూమి మీదకు తెప్పించడమన్నది మంచిపనే అయినా దీనికోసం ఒక మాయాగోవును సృష్టించటం అది గౌతముడి పంటచేలో వేస్తుండగా గౌతముడు దాన్ని మెల్లగా అదిలించటం, ఆ మాత్రానికే ఆ గోవు ప్రాణాలు విడవడం జరిగాయి. ఆ వెంటనే గౌతముడి ఆశ్రయం పొందిన బ్రాహ్మణులంతా గోహత్యా పాపం పోవడానికి గంగను భూమి మీదకు తీసుకురమ్మనమని గౌతముడికి చెప్పారు. నిజంగానే గోహత్య జరిగిందని భయపడి దాన్ని పోగొట్టుకోవటానికి ఆ ముని ఎంతో తీవ్ర తపస్సును చేయవలసి వచ్చింది. అన్నింటినీ మించి ఆ సమయంలో ఆయన పడిన మనోవ్యధ అంతా ఇంతా కాదు. బ్రాహ్మణులు గౌతముడి శక్తి తెలిసినవారే కనుక ఆయనను ఆలా భయానికి గురిచేయకుండా వేరొకవిధంగా సాత్విక ధోరణిలో ఆయనను ప్రార్థించి ఆయన చేత తపస్సు చేయించి గంగను భువికి తెప్పించి ఉంటే బ్రాహ్మణులకు గౌతముడి శాపం అంటివుండేది కాదు. గౌతముడికి బంధుప్రీతి, ఆశ్రిత రక్షణ మీద ఆసక్తి అధికంగా ఉన్నాయని బ్రాహ్మణులకు తెలుసు. కనుక వారు గౌతముడి ఆశ్రమం నుండి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నప్పుడు అంతమందీ కలిసి ఆయనకు నచ్చచెప్పి బయలుదేరినా అంత ప్రమాదం సంభవించి ఉండేది కాదు. విపరీతంగా కరవు ఉన్నంతకాలం గౌతముడి ఆశ్రమంలో ఆశ్రయాన్ని పొంది ఆ తరువాత ఆయన మీద బ్రాహ్మణులు గోహత్య పాపం జరిగిందని నాటకమాడిన తీరు సమంజసంగా లేదు. కనుకనే గౌతముడు వారిని శపించవలసి వచ్చింది. ఈ శాపానికి గంగాదేవి ప్రవర్తన కూడా కొంతవరకు దోహదం చేసింది.
పరమేశ్వరుడి అనుజ్ఞ మేరకు గౌతమీనది గౌతమ ముని వెంట బయలుదేరింది. ఆ గంగ బ్రహ్మగిరి మీద నుండి పరవళ్ళు తొక్కుతూ ఒక ఉదుంబర వృక్షపు కొమ్మనుండి జాలువారుతూ ప్రవాహ వేగాన్ని పుంజుకుంది. తొలిగా గౌతముడు ఆయన శిష్యులు ఆ గంగలో స్నానం చేసి తమ పాపాలను పోగొట్టుకున్నారు. ఆ ప్రదేశమే ఆనాటి నుండి గంగా ద్వారమని పేరు పొందింది. ఇలా గౌతముడు ఆయన శిష్యులు స్నానాలు చేసిన తర్వాత మాయా గోవును సృష్టించిన బ్రాహ్మణులు కూడా గౌతమిలో స్నానమాడటానికి వచ్చారు. అయితే ఎంతో ఆశ్చర్యంగా ఒక్క క్షణంలో ఆ గంగ వెంటనే అంతర్ధానమయింది. విస్తుపోయిన గౌతముడు గంగాదేవిని పలుమారులు స్తుతించాడు. అయితే అప్పుడు గంగ చేసిన మేలును మరిచి పాపం చేసిన వారిని తాను తాకలేనని పలికింది. అయితే వెంటనే గౌతముడు
‘అపకారిషు యో లోక ఉపకారం కరోతివై!
తేన పూతో భవామ్యత్ర భగవద్వచనం త్విదమ్‌’
అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చెయ్యడమే గొప్పతనంగా పరిగణలో ఉందని కనుక ఈ అపకారులకు ఉపకారం చెయ్యమని వేడుకున్నాడు. గౌతముడు అలా అనేక విధాలుగా మంచి సూక్తులతో గంగాదేవిని శాంతపరిచాడు. అప్పటికీ ఆమె గౌతముడికి అపకార చేసిన వారికి ప్రత్యక్షం కావటానికి ఒప్పుకోక కొన్ని నిబంధనలను పెట్టింది. ముందుగా వారంతా నూట ఒక్కసార్లు బ్రహ్మగిరికి ప్రదక్షిణం చెయ్యాలని ఆ తరువాతనే వారికి తాను ప్రత్యక్షమవుతానని పలికింది. ఆ బ్రాహ్మణులంతా జరిగిన తప్నేమిటో తెలుసుకుని తమను క్షమించమని గంగాదేవిని వేడుకున్నారు. గంగ చెప్పినట్లుగానే గిరి ప్రదక్షిణలు చేశారు. వారు అలా చేసిన తరువాత గంగాదేవి అనుజ్ఞతో గంగ ద్వారానికి కింది భాగంలో గౌతమ ముని ఒక గొయ్యిని తవ్వాడు. దానిపేరే కుశావర్తం. గంగాదేవి ఆ గొయ్యిలోకి ప్రవహించింది. అది ఉత్తమ తీర్థంగా పేరు తెచ్చుకుంది. అలా ఆ కుశావర్తంలో అంతా స్నాన విధులను నిర్వహించి పవిత్రులయ్యారు.
ఈ కథలోనే కల్పభేదంతో మరొక విషయం కూడా కనిపిస్తుంది. గౌతముడు తనను ఇబ్బంది పెట్టిన బ్రాహ్మణులందరినీ గంగను భూమి మీదకు తెచ్చిన తరువాత తాను గోహత్యా పాపం పొగొట్టుకున్న తర్వాత తీవ్రంగా శపించాడు. ఆ శాపం ప్రకారం వారికి వారి సంతతికి కూడా శివభక్తి నశించటం, దరిద్రం ప్రాప్తించటం లాంటివన్నీ సంభవించాయి. వారు చేసేదిలేక కాంచీనగరంలో నివాసమేర్పరచుకుని గౌతముడి శాపాన్ని అనుభవించారుట. కనుక తెలిసి చేసినా తెలియక చేసినా లేక మంచి జరుగుతుందన్న ఆలోచనతో చేసినా కూడా తప్పు తప్పేనని ఆ తప్పునకు తగిన శిక్ష ఎవరైనా అనుభవించి తీరాల్సిందేనని ఈ కథ వివరిస్తోంది.


- శ్రీ యల్లాప్రగడ మల్లికార్జున రావు గారు

- సేకరణ ఈనాడు దినపత్రిక నుంచీ 

Tuesday, June 4, 2019

చిన్నపిల్లలు తప్పు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత పెద్దలదే

చిన్నపిల్లలు తప్పు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత పెద్దలదేనని, ఆ బాధ్యతను మరచినపుడు చిన్నపిల్లలు చేసిన తప్పు వల్ల కలిగే ఫలితానిన పెద్దలు అనుభవించాల్సి వస్తుందని జనమేజయుడి జీవితంలో జరిగిన సంఘటన వివరిస్తుంది.





భారతీయ సంప్రదాయ సాహిత్యంలో శ్రవ్యకావ్యాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ఒకరు చెపుతుంటే మరొకరు వినే కావ్యాలను శ్రవ్య కావ్యాలంటారు. సంప్రదాయ కావ్యాలైన రామాయణ, భారత, భాగవతాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క వక్త, శ్రోత ఉన్నారు. పంచమ వేదంగా ప్రసిద్ధిచెందిన మహాభారతానికి వైశంపాయనుడు వక్తగా, జనమేజయుడు శ్రోతగా ఉన్నారు. పాండవమధ్యముడైన అర్జునుడికి మునిమనుమడు జనమేజయుడు. సుభద్రా, అర్జునులకు అభిమన్యుడు జన్మించాడు. అభిమన్యుడికి, ఉత్తరకు కొడుకుగా పరీక్షిత్తు జన్మించాడు. పరీక్షిత్తుకు, మాద్రవతికి జన్మించినవాడే మహాభారత శ్రోత అయిన జనమేజయుడు. జనమేజయుడు కురుక్షేత్రంలో దీర్ఘ సత్రయాగం చేస్తున్న సమయంలో ఒకనాడు ‘సరమ’ అనే ఒక కుక్క తన కొడుకు ‘పారమేయుడు’ను వెంట పెట్టుకొని దేవలోకం నుండి అక్కడికి వచ్చింది. పారమేయుడిని చూసిన జనమేజయుడి సోదరులు శ్రుతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడనే ముగ్గురు చిన్నపిల్లల చేష్టలుగా దానిని హింసించారు. 

అది వెంటనే వెళ్ళి తనకు జరిగిన అవమానాన్ని తల్లి సరమతో చెప్పింది. సరమ, రాజైన జనమేజయుడి దగ్గరకు వెళ్ళి ఓ రాజా నీ సోదరులు నిష్కారణంగా నా కొడుకుని బాధించారు. రాజు సోదరులైనంత మాత్రాన ఇలా అమాయకులను బాధించటం న్యాయం కాదు కదా. దీనికి ప్రతిగా సాధు ప్రాణులకు బాధను కలిగించిన పాపానికి మీకు తగిన భయకారణమన కష్టాలు కలుగును కాక అని పలికి అంతర్ధానమైపోయింది. సరమ మాటలను విన్న జనమేజయ మహారాజుకు ముందు ఆశ్చర్యం కలిగింది. కానీ ఆ తరువాత దాని శాపం నుంచి విముక్తి పొందటానికి తన పురోహితుల సలహాను తీసికొని దీర్ఘ సత్రయాగం అయిపోయిన తర్వాత శుత్రశ్రవణుడు అనే ముని వద్దకు వెళ్ళి ఆయనను ప్రార్ధించి తపో నిష్టాపరుడైన ఆయన కుమారుడు సోమశ్రవణుడుని తన పురోహితునిగా పంపమని అతనిచేత యజ్ఞయాగాలను చేయించి తన సోదరులు చేసిన అపరాధానికి, శాంతిని కలిగించుకున్నాడు. సోమశ్రవణుడిని చేరటానికి జనమేజయ మహారాజు ఎన్నెన్నో కష్టాలను అనుభవిస్తూ ముని ఆశ్రమాలను వెదకవలసి వచ్చింది. పిల్లలు తప్పు దోవలో నడిస్తే దీని ఫలితాన్ని పెద్దలు అనుభవించవలసి వస్తుందని జనమేజయుడి కథ వివరిస్తోంది.











- శ్రీ యల్లాప్రగడ మల్లికార్జున రావు గారు

- సేకరణ ఈనాడు దినపత్రిక నుంచీ 

Saturday, June 1, 2019

సుందోపసుందుల కథ

Image result for sunda upasunda tilottama


ఎంత ఆత్మీయత అనురాగాలతో ఉన్న సోదరులైనా ఒక కాంత కారణంగా కక్షలకు, కార్పణ్యాలతో రగిలి జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితులేర్పడుతుంటాయని, అలా జరగకుండా ఉండాలంటే తగిన విధంగా ధర్మమార్గంలో ప్రవర్తించాలని చెప్పే కథ ఇది. అలాగే పాండవులయిదుగురు ద్రౌపదిని వివాహం చేసుకున్న తరువాత ద్రౌపదితో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు ఆమెకు భర్తగా ఉండేలాగా, నిర్ణయాన్ని అతిక్రమించిన వారు సంవత్సర కాలంపాటు తీర్థయాత్రలకు వెళ్లి వచ్చేలాగా ఎవరి సమక్షంలో నిర్ణయం తీసుకున్నారనే విషయం కూడా ఈ కథలోనే తెలుస్తుంది. వీటన్నిటితోపాటు అప్సరస కన్యలలో అతిలోక సౌందర్యవతి అయిన తిలోత్తమ జన్మకు, ఆ జన్మ కారణానికి ఉన్న సంబంధాన్ని కూడా ఈ కథలో చూడవచ్చు. 

                                       నారదుడు పాండువులకు ఈ సుందోపసుందుల కథలో వివరించి చెప్పాడు. ద్రౌపది స్వయంవరం తరువాత పాండవులు కుంతితో కలిసి హస్తినకు వచ్చారు. దృతరాష్ట్రుడిచ్చిన అర్ధరాజ్యంతో ఖాండవప్రస్థంలో ఇంద్రప్రస్థపురాన్ని నిర్మించుకుని పాండవులు రాజ్యమేలుతుండగా ఒక రోజున నారుదుడు అక్కడికి వచ్చాడు.  

                      ధర్మరాజాదులు చేసిన అతిథి పూజలు స్వీకరించిన తరువాత ఆ అయిదుగురు సోదరులకు ద్రౌపది లేని సమయంలో ఈ కథను వివరించాడు. పూర్వం నికుంభుడు అనే రాక్షసుడికి సుందుడు, ఉపసుందుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. ఆ ఇద్దరూ ఒకరి మీద ఒకరు ప్రాణప్రదమైన ఆత్మీయత అనురాగాలతో జీవిస్తుండేవారు. రాక్షసులైనా బ్రహ్మ గురించి కఠోర దీక్షతో తపస్సు చేయడానికి వింధ్యపర్వత ప్రాంతాలకు ఆ ఇద్దరూ వెళ్ళారు. ఆ సోదరుల తపోదీక్షకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. కామరూపం, కామగమనం, అమరత్వం, ఇతరులెవరితో మరణం లేకుండా ఉండేస్థితి, సకలమాయలు తామిద్దరికీ కావాలని బ్రహ్మను వారు కోరుకున్నారు. వారు కోరిన వరాలలో అమరత్వం తప్ప మిగిలిన కోరికలన్నింటినీ బ్రహ్మ అనుగ్రహించాడు. బ్రహ్మ దగ్గర పొందిన ఆ వరాలతో ఆ ఇద్దరూ లోకాలన్నింటినీ హింసాప్రవృత్తితో అతలాకుతలం చేయసాగారు. వారికున్న మాయారూపాలను ధరించే శక్తి వల్ల పులులుగా, ఏనుగులుగా మారి మునులు రుషులు ఉండే ఆశ్రమాలను చిందరవందర చేయసాగారు. దేవతలను కూడా తీవ్రంగా భయపెట్టడం వారికి పరిపాటైంది. ఈ కష్టానికి చింతిస్తూ దేవతలు, రుషులంతా బ్రహ్మ దగ్గరకు వెళ్లి తమను రక్షించమని ప్రార్థించారు. 


      బ్రహ్మ వారంరికీ అభయమిచ్చి సుందోపసుందులు ఇద్దరూ ఇతరులెవరితోనూ తమకు మరణం ప్రాప్తించకూడదని కోరుకున్నారు. కానీ తామిద్దరిలో ఒకరి వల్ల ఒకరు మరణం పొందకుండా ఉండే కోరికను కోరుకోలేదని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి మునులను దేవతలను రక్షించాలని బ్రహ్మదేవుడు అనుకున్నాడు. వెంటనే విశ్వకర్మను పిలిపించి సృష్టి మొత్తంలోకి సౌందర్యవతి అయిన ఒక కన్యను సృష్టించమని చెప్పాడు. విశ్వకర్మ బ్రహ్మ ఆజ్ఞను శిరసా వహించి సృష్టి మొత్తంలో ఉన్న అన్ని అందమైన వస్తువులలో ఒక్కొక్క దాని నుంచి నువ్వుగింజంత ప్రమాణంలో అందాన్ని స్వీకరించి ఒక అద్భుత సౌందర్యరాశి వంటి యువతిని సృష్టించాడు. సంస్కృతంలో నువ్వుగింజను ‘తిల’ అని అంటారు. తిల ప్రమాణంలో అన్ని సౌందర్యాల నుంచి తీసిన సౌందర్యంతో రూపొందినది కనుక ఆ సౌందర్యవతి పేరు తిలోత్తమ అయింది. 

తిలోత్తమ వెంటనే మద్యం మత్తులో మదిరాక్షుల నడుమ భోగాలను అనుభవిస్తున్న సుందోపసుందుల ఎదుట నిలిచి వయ్యారాలు ఒలకపోసింది. ఆ ఇద్దరిని అమితంగా ఆకట్టుకుంది. వారిద్దరూ ఆమె కోసం పోటీ పడసాగారు. అప్పుడు తిలోత్తమ ఇద్దరూ ఒకరితో ఒకరు యుద్ధానికి దిగి ఎవరు బలాఢ్యులని నిరూపించుకుంటే తాను వారి సొంతమవుతానని పలికింది. అప్పటి దాకా అపూర్వమైన అనురాగం, ఆత్మీయతానుబంధాలతో ఉన్న సోదరులైన సుందోపసుందులు ఇద్దరూ ఒకరి మీదకు ఒకరు కాలుదువ్వుకున్నారు. భీకరంగా పోరాడుకుని చివరకు ఇద్దరూ మరణించారు. 

ఇలా తిలోత్తమ అనే స్త్రీ కారణంగా అంతకు ముందు ఎప్పుడూ ఏ సందర్భంలోనూ విరోధులుగా కనిపించని సుందోపసుందులు బద్ధవిరోధులై మరణించారని పాండవులు కూడా ద్రౌపది కారణంగా అలా నాశనం కావడం మంచిది కాదని నారదుడు చెప్పాడు. అప్పుడు నారదుడి సమక్షంలోనే ధర్మరాజు తన సోదరులతో కలిసి ద్రౌపదితో ఒక్కొక్కరు ఒక సంవత్సరంపాటు భర్తగా ఉండేలాగా, ఈ నిర్ణయాన్ని అతిక్రమించినవారు ఒక సంవత్సరం పాటు తీర్ధయాత్రలకు వెళ్ళేలాగా ఏర్పాటుచేసుకున్నారు. 






- శ్రీ యల్లాప్రగడ మల్లికార్జున రావు గారు

- సేకరణ ఆనంద్
ఈనాడు దినపత్రిక నుంచీ