Wednesday, July 31, 2019

గరుత్మంతుడు

Related image


ప్రత్యక్ష దైవాల వంటి తల్లిదండ్రుల పొందగలిగిన తనయులు సర్వత్రా జయాలనే పొందుతుంటారని గరుత్మంతుడి వృత్తాంతం మహాభారతంలో వివరిస్తోంది. వినతకు రెండో సంతానంగా జన్మించిన గరుత్మంతుడు అప్పటికే ఆమె కద్రువకు, ఆమె సంతతికి దాస్యం చేస్తుండడం చూసి ఎలాగయినా తల్లి దాస్యాన్ని పోగొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఒకనాడు గరుత్మంతుడు తన దగ్గరకు వచ్చిన సర్పాలని చూసి నా తల్లి దాస్యం, నా దాస్యం విముక్తి కావడానికి మీరు ఏం కావాలో కోరుకొమ్మని అడిగాడు. ‘మాకు అమృతం తెచ్చిపెట్టు మీ దాస్యం విముక్తి అవుతుంది’ అని వారు పలికారు. వెంటనే గరుత్మంతుడు తల్లి వినత దగ్గరకు వెళ్లి నమస్కరించి విషయం చెప్పి తనకు ఆకలిగా ఉందని ఆహారం ఇవ్వమని ప్రార్థించాడు. ఆమె చాలా సంతోషించి సముద్రంలో ఉన్న నిషాదులను మాత్రం తిని ఆకలి తీర్చుకొనమని ఆశీర్వదించింది. గరుత్మంతుడు తల్లి చెప్పినట్లు చేశాడు. కాని ఆకలి తీరలేదు. వెంటనే తన తండ్రి కస్యప ప్రజాపతిని ప్రార్థించాడు. ఆయన పరస్పరం శాపాలను పెట్టుకుని ఏనుగు, తాబేలుగా మారిన విభావనుడు, సుప్రతీకుడు అనే వారిని భక్షించి ఆకలి తీర్చుకొమ్మన్నాడు. భారీకాయాలతో ఉన్న ఆ రెంటిని ఒక పెద్ద చెట్టు కొమ్మమీద పెట్టుకుని భక్షించాలనుకుని కాలు మోపబోగా ఆ చెట్టు కొమ్మ ఫెళఫెళ విరిగింది. ఆ కొమ్మకు బొటనవేలు పరిమాణంలో ఉండి తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేసుకుంటున్న వాలఖిల్యులు అనే మునులు ఉన్నారు. వెంటనే కొమ్మను పట్టుకొని తన తండ్రి దగ్గరకు గరుత్మంతుడు వెళ్లాడు. వాలఖిల్యులు గరుత్మంతునిమీద బాగా కోపించారు. అయితే విషయాన్ని వివరించి గరుత్మంతుడు తన కుమారుడేనని పట్టుదలతో అతను తన తల్లి దాస్యం తీర్చడానికి స్వర్గలోకం నుంచి అమృతభాండం తేవడానికి వెళుతున్నాడని, దయతో కోపాన్ని ఉపసంహరించుకోమని ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు వాలఖిన్యులు సంతోషించి గరుత్మంతుని శపించకుండా హిమాలయాలకు తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయారు. ఆ తరువాత తండ్రి సూచన మేరకు చెట్టుకొమ్మను హిమాలయాలకు తీసుకుని వెళ్లి విడిచి ఏనుగు, తాబేలును భక్షించి అమృతభాండం కోసం స్వర్గలోకానికి వెళ్లాడు. ఇలా తలిదండ్రుల ఆశీస్సులతో కష్టాలను అధిగమించి గరుత్మంతుడు కార్యసాధకుడయ్యాడు.






శ్రీ యల్లాప్రగడ మల్లికార్జున రావు గారు
సేకరణ ఈనాడు దినపత్రిక నుంచీ

Saturday, July 27, 2019

శివాజి గణేశన్ ఔదార్యం

Image result for sivaji ganesan donate elephant


మీరు ‘తిరువరుత్ చల్వర్’ సినిమాలో అప్పర్ (63 నాయనార్లలోని నాల్వర్లు సుందర్, అప్పర్, జ్ఞానసంబంధర్, మాణిక్యవాచకర్ లలో ఒకరు) గా చేశారు. ఆ దృశ్యాలు ఇప్పటికి మామనస్సులో ముద్రవేశాయి. ఈ పాత్ర చెయ్యడానికి మీకు కంచి పరమాచార్య స్వామివారు ప్రేరేపణ అని చెప్పారు కదా! అది కొంచం వివరిస్తారా? అని ఒక పాత్రికేయుడు శివాజి గణేశన్ ని అడిగాడు.

నటనలో రాణించాలంటే నటులకు సూక్ష్మపరిశీలన చాలా అవసరం అని నా అభిప్రాయం. నేను నా చుట్టూ ఉన్న పరిసరాలని, వ్యక్తులని బాగా గమనిస్తుంటాను. నేను అప్పర్ గా నటించాను కాబట్టి, ఒక పాతకాలంనాటి శివభక్తుని గుణాలను చూపించాలి, అతని వేషధారణ, ఆహార్యము మొదలైనవి.

పరమాచార్య స్వామివారు నన్ను దర్శనానికి రమ్మన్నారని నాకు ఒకరోజు శంకరమఠం నుండి కబురు వచ్చింది. అప్పుడు స్వామివారు మైలాపూర్ లోని మఠంలో ఉన్నారు. నాకు సరిగ్గా గుర్తుంటే ఆ మఠం కర్పగాంబళ్ కళ్యాణమంటపం పక్కనే ఉంటుంది.

నేను, నా భార్య, అమ్మానాన్న నలుగురం కలిసి స్వామివారి దర్శనానికి వెళ్ళాము. మేము మఠానికి వెళ్ళగానే మమ్మల్ని ఒక గదిలో కూర్చోమని చెప్పారు. దాదాపు ఒక గంటసేపు ఉన్నాము అనుకుంటా. అప్పుడు స్వామివారి ఎదో ఉపన్యాసం చెబుతున్నారు. హఠాత్తుగా కరెంటు పోవడంతో అంతా గాఅఢాంధకారంగా మారిపోయింది.

స్వామివారు చేతిలో ఒక చిన్న దీపంతో మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు. నిదానంగా కూర్చుని కళ్ళపైన చేతులనుంచుకొని మా వైపు చూస్తున్నారు.

”నువ్వు శివాజి గణేశన్ కదూ?” అని అడిగారు.

”అవును స్వామి నేనే” అని బదులిచ్చి నేలపై పడి స్వామివారికి సాష్టాంగం చేసి వారి ఆశీస్సులు తీసుకున్నాను. అమ్మానాన్న, నా భార్య కూడా స్వామికి నమస్కరించారు.

“మిమ్మల్నందరిని చూడటం చాలా సంతోషంగా ఉంది” అన్నారు స్వామి. తారువాత స్వామివారు:

“నేను తిరుపతి, తిరువణైక్కావల్, తంజావూరులోని పున్నైనల్లూర్ మారియమ్మన్ దేవాలయం వంటి చోట్లకి వెళ్ళినప్పుడు ఆలయ ధర్మకర్తలు నాకు ఏనుగుల చేత పుష్పమాలలు వేయించారు. దేవస్థానానికి ఈ ఏనుగులని ఎవరు ఇచ్చారు అని అడిగగా వారు ‘శివాజి గణేశన్’ అని చెప్పారు.

దేశంలో చాలామంది ధనవంతులున్నారు. ప్రచారం కోసం వారు దేవాలయాలకు ధనం ఇస్తారు. కాని దేవాలయాలకు ఏనుగులను ఇవ్వాలంటే దానికి ఉదారమైన గుణం ఉండాలి. అది నీలో ఉంది.

నిన్ను కన్న నీ తల్లితండ్రులు అదృష్టవంతులు. మీ తల్లితండ్రుల కోసం నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తాను.” అని చెప్పి స్వామివారు లేచి లోపలికి వెళ్ళారు.

ఆ సమయంలో నేను ఎంత ఆనందానికి లోనయ్యుంటానో ఆలోచించండి. ఎంతటి ఆశ్చర్యకరమైన అనుగ్రహం అది! అలోచించండి ఒకసారి.

చెప్పలంటే నాకు జీవితంలో భయం అనేది లేదు. భయం అన్నది నేనెరుగను. ప్రత్యేకించి నాకు స్వామివారి అనుగ్రహం ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి. అంతా వారు చూసుకుంటారు.

బహుశా ఈ సంఘటన నాపైన ప్రభావం చూపింది అనుకుంటా. స్వామివారు అలవాట్లని చాలా క్షుణ్ణంగా గమనించాను. కాబట్టి ఆ సూక్ష్మ పరిశీలన వల్లే ఆ సినిమాలో అప్పర్ లా నటించగలిగాను.

--- ‘నడిగర్ తిలగమ్’ శివాజి గణేశన్ ఆత్మకథ నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Wednesday, July 24, 2019

అయ్యంగార్ స్వామి అలక


Related image
ప్రతి శుక్రవారం కంచి మఠంలో విద్వత్ సదస్సు జరుగుతుంది. పండితులందరూ వివిధ విషయలపైన చర్చించుకుంటారు. చివరికి పరమాచార్య స్వామివారు చివరిగా వివరణ ఇస్తారు. అలాగే పండితులందరికి స్వామివారు సన్మానం అంటే దక్షిణ ఇస్తారు.

అలాంటి ఒకరోజున చిన్నకాంచీపురం నుండి ఒక అయ్యంగారు పండితులు వచ్చారు. పరమాచార్య స్వామికి నమస్కారములు చేసి స్వామివారు ఇచ్చిన డబ్బులను తీసుకున్నారు. కాని దానితో అతను తృప్తి చెందలేదని అతని హావభావాలు చెబుతున్నాయి. మహాస్వామి వారు దాన్ని గమనించి, “ఏమి అయ్యంగార్ స్వామివారు సంతోషమే కదా?” అని అడిగారు. ఆయన అవును అని ముభావంగా చెప్పి వెళ్ళిపోయారు.

మిగిలిన పండితుల తరువాత సామాన్య భక్తులు స్వామి దర్శనానికి వచ్చారు. మొదట ఉన్నది కుటుంబంతో సహా ఉన్న ఒక న్యాయవాది. ఆయన ఒక పళ్ళెంలో పళ్ళు, పూలు, జీడిపప్పు మొదలైనవి తీసుకుని వచ్చి స్వామివారి ముందు పెట్టి “పెరియవ ఒక విన్నపం” అని అన్నాడు.

మహాస్వామివారు అతణ్ణి ఊరకే ఉండమని చెప్పి, ఒక శిష్యుణ్ణి పిలిచి “వెళ్ళి ఆ అయ్యంగార్ స్వామిని పిలుచుకుని రా. చిన్న కాంచీపురం వెళ్ళడానికి బస్సులో కూర్చుని ఉంటాడు” అని చెప్పారు. ఆ శిష్యుడు గంగై కొండన్ బస్టాండుకు వెళ్ళి చూడగా ఒక బస్సులో కూర్చుని కనిపించారు. మహాస్వామివారు తనను రమ్మన్నారని ఆ అయ్యంగార్ స్వామితో చెప్పాడు ఆ శిష్యుడు.

”నేను ముప్పై పైసలు పెట్టి టికెట్టు కొన్నాను. నేను ఇప్పుడు అక్కడికి వస్తే నాకు ముప్పై పైసలు నష్టం” అని చెప్పాడు ఆ స్వామి. దీన్నంతా గమనిస్తున్న బస్ కండక్టరు వెంటనే, “ఏంటి స్వామి, పరమాచార్య దర్శనం కోసం దేశవిదేశాల నుండి వస్తారు. మీరు చూస్తే స్వామివారే రమ్మంటుంటే వెళ్ళనంటున్నారు. ఆ టికెట్టు ఇలా ఇవ్వండి మీ ముప్పై పైసలు మీకు తిరిగిస్తాను. ఏదో ముఖ్యమైన విషయమేమో, వెళ్ళి స్వామివారి కలవండి” అని చెప్పాడు.

ఆ అయ్యంగార్ స్వామి టికెట్టు వెనక్కిచ్చి, ముప్పై పైసలు తీసుకుని బస్సు దిగి ఆ శిష్యుడితో పాటు వెళ్ళాడు స్వామివారిని చూడటానికి. మహాస్వామివారు నవ్వుతూ, “ఏమి అయ్యంగార్ స్వామివారు! మీ ముప్పై పైసలు త్రిగివ్వకపోతే బస్సు దిగి ఇక్కడికి రారా ఏమి?” ఇది విని అతను నోరెళ్ళబెట్టాడు. స్వామివారికి ఎలా తెలుసు ఆ విషయం?

పక్కనున్న న్యాయవాది మళ్ళీ మొదలెట్టాడు, “పెరియవ ఒక విన్నపం . . ”

మహాస్వామివారు ఉండు అని చెప్పి అయ్యంగార్ స్వామిని న్యాయవాది పక్కన కూర్చోమన్నారు. ఆ స్వామి చిరునామా తీసుకోవలసిందిగా ఆ న్యాయవాదికి చెప్పారు. తరువాత ఆయ్యంగార్ స్వామితో, “తరువాతి బస్సు సిద్ధంగా ఉంది వెళ్ళమని చెప్పారు”

అతనికి ఏమి అర్థం కాక వెళ్ళిపోయాడు.

న్యాయవాది మరలా, “పెరియవా. . .” అని మొదలు పెడుతుండగా స్వామివారే “ఏమప్పా! ప్రతి నెలా వేదం చదివిన ఒక పేద బ్రాహ్మణుడికి కొంత ధనం ఇవ్వాలి అని కదా అనుకుటున్నావు. అంతేనా?” అని అడిగారు. అతను కొద్దిసేపు చేష్టలుడిగి తరువాత తేరుకుని, “అవును పెరియవ” అని బదులిచ్చాడు.

“నీకు తెలుసా, నేను ఆ అయ్యంగార్ స్వామి చిరునామా తీసుకోమన్నది అందుకే. ప్రతి నెలా మరువకుండా రూ.250/- పంపు. నువ్వు కొద్ది నెలల తరువాత నిలిపివేస్తే అతను మరలా ఇక్కడకు వస్తాడు. అతను చాలా మంచివాడు, పండితుడు. కాని పేదవాడు అంతే” అని చెప్పారు.

న్యాయవాది అందుకు ఒప్పుకుని, కుటుంబ సమేతంగా స్వామివారికి సాష్టాంగం చేసి వెళ్ళిపోయారు. ఆ అయ్యంగార్ కి స్వామి ప్రతినెలా డబ్బు అందుతోందా లేదా అని తమ శిష్యుల ద్వారా కొన్ని నెలల పాటు విచారణ చేశారు స్వామివారు.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Saturday, July 20, 2019

శ్రేష్టిదార్ అని పిలవొచ్చునా?

Image result for sri chandrasekharendra saraswathi mahaswamy

నేను కాంచీపురంలోనే ఉండడంవల్ల ప్రతిరోజూ మహాస్వామివారి దర్శనభాగ్యం దొరికేది. ఒకసారి శ్రీమఠంలో ఎదో ఆరాధన సoదర్భoగా కావల్సినంత మంది వైదికులు దొరకకలేదు. పరమాచార్య స్వామివారు నాపేరు సిఫారసు చేసి వేరే వాళ్లతో పాటుగా ఆ కార్యక్రమంలో వైదికునిగా పాలుపంచుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించారు. భోజనాలు అయిన తరువాత నన్ను పిలిచి సహస్ర గాయత్రి చెయ్యమన్నారు. ఆ ఆరాధనలో వైదికునిగా పాల్గొన్నదానికి పరిహారంగా.

నాకు చెంగల్పేట్ న్యాయాలయానికి బదిలీ అవ్వడంతో నాకు పరమాచార్య స్వామివారి దర్శన భాగ్యం తగ్గిపోయింది. కాబట్టి ప్రతి నెల అనుషం (స్వామివారి జన్మ నక్షత్రమైన అనూరాధ నక్షత్రం) రోజు కాంచీపురానికి వెళ్ళి కామాక్షి అమ్మవారి ఆలయంలో త్రిశతి అర్చన చెయ్యించి, ప్రసాదాన్ని పరమాచార్య స్వామివారికి సమర్పించి వారిని దర్శించుకొనేవాణ్ణి. ఒకసారి అలా వెళ్ళగా శ్రీమఠం ఆరోజు భక్తులతో చాలా రద్దీగా ఉంది. దర్శించుకుని బయటకు వచ్చే భక్తులవద్ద ఉన్నాను నేను. మహాస్వామివారు దగ్గర ఉన్న సేవకునితో “శ్రేష్టిదార్ ని పిలువు” అని ఆదేశించారు.

కొంతమంది మా గుంపువైపు “శ్రేష్టిదార్ శ్రేష్టిదార్” అని అరిచారు. ఎవరో నన్ను తీసుకునివెళ్ళి మహాస్వామివారి ముందు నిలబెట్టారు. వారు స్వామితో, “శ్రేష్టిదార్ ఎవరూ లేరు. కోర్టు నుండి ఈ పెద్ద గుమాస్తా ఉన్నారు” అని చెప్పారు. నేను స్వామితో, “పెరియవ నేను శ్రేష్టిదార్ ను కాను, హెడ్ క్లర్క్ ని అని చెప్పాను”.

కాని స్వామివారు పట్టుబట్టి “ఎందుకు నువ్వు శ్రేష్టిదార్ కాకూడదు?” అని అడిగారు.

నేనూ ఖచ్చితంగానే సమాధానం చెప్పాను. “నాకు దానికి కావాల్సిన విద్యార్హతలు లేవు. నేను కేవలం SSLC ముగించాను. నా కిందన ఉన్నవాళ్ళు న్యాయశాస్త్రంలో BA.,BL, MA.,BL మొదలైనవి పూర్తిచేసినవారు. కాబట్టి విదార్హతలను బట్టి నాకు రాదు. అదీగాక, బెంచిలో ఉన్న జిల్లా న్యాయాధికారి పరమ కఠినుడు కనుక నా పేరును సిఫారసు చెయ్యడు. కాబట్టి నేను శ్రేష్టిదార్ ను కాలేను” అని చెప్పాను. స్వామివారు నాకు వెళ్ళడానికి అనుమతినిచ్చారు.

కొన్నిరోజుల తరువాత చెన్నై న్యాయాలయం నుండి కొంతమంది తనిఖీకి వచ్చారు. వారు నా శక్తి సామర్థ్యాలను పరిశీలించి హైకోర్టు జడ్జికి ఒక రహస్య నివేదిక సమర్పించారు. కొన్నిరోజుల తరువాత నన్ను శ్రేష్టిదార్ గా చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. అందరికి ఆశ్చర్యం కలిగింది ఇది ఎలా సాధ్యం అని. కేవలం విద్యార్హతలను బట్టే ఉన్నత పదవులిస్తారు అనుకునే వారికి ఇది ఒక గుణపాఠం.

ఈలోగా, నేను తరువాతి అనుషానికి కాంచీపురం వెళ్ళాను. పరమాచార్య స్వామివారి ముందు కామాక్షి అమ్మవారి ప్రసాదం పెట్టగానే స్వామివారు చెయ్యెత్తి తమ తలపై ఉంచుకుని శ్రేష్టిదార్ (‘హెడ్’, ‘చీఫ్’) అని అర్థం స్ఫురించేట్టుగా నాకు చూపిస్తూ “ఇప్పుడు నిన్ను శ్రేష్టిదార్ అని పిలవొచ్చునా?” అని అడిగారు.

స్వామివారు అలా అనగానే నా వొళ్ళు గగుర్పాటుకు గురి అయ్యింది. నేను ఏమీ మాట్లాడలేకున్నాను. నేను చెయ్యగలిగింది ‘దైవం మానుష రూపేణా’ అన్నట్టుగా నా ఎదురుగా ఉన్న సర్వేశ్వరునికి సాష్టాంగం చేసి నా కన్నీళ్లతో వారి పాదపద్మములను కడగడమే. వారే నాకు ఉద్యోగోన్నతి కల్పించినవారు. జరగబోయేది ఏమిటో ఆ దైవానికే తెలుసు అని ఆరోజే నాకు అర్థం అయ్యింది.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

--- పి.కె రామనాథన్, చెన్నై. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 6

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Wednesday, July 17, 2019

అత్యవసర చికిత్స

Image result

కుంభకోణ మఠంలో చంద్రమౌళీశ్వర పూజ పూర్తైన తరువాత, పరమాచార్య స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.

శ్రీమఠంతో సంబంధం ఉన్న ఒక రైతు ఆత్రుతగా స్వామివారి వద్దకు పరిగెత్తుకుని వచ్చి, స్వామివారి పాదాలపై పడి విలపించసాగాడు, “నా కుమారుణ్ణి కాపాడండి దేవుడా!” అని.

ఏమి జరిగిందో కనుక్కోమని సహాయకునికి చెప్పారు స్వామివారు.

ఆ రైతుకి ఉన్నది ఒక్కడే కొడుకు. ఆ పిల్లవాడు ఆహారం తింటున్నప్పుడు, ఒక పాము అతని శరీరంపై పాకి వెళ్లిపోవడం వల్ల భయంతో మూర్చిల్లాడు. పాము కరిచిందో లేదో తెలియడంలేదు. సాధారణంగా పాము కాటుని మంత్రంతో పోగొట్టే ఒక పధ్ధతి ఉంది. కాని ఆ మంత్రం తెలిసిన వారు దగ్గరలో ఎవరూ లేరు.
“సామి మాత్రమే వాణ్ణి కాపాడాలి . . .”

మహాస్వామివారు విభూతి ప్రసాదాన్ని ఇచ్చారు. “ఆ పిల్లవాని నుదురుపై పూయండి”.

“సరే సామి”

“మీ ఇంట్లో శీకాయ పుడి ఉందా?”

“ఉంది సామి” అని తలూపాడు.

“పిల్లవాని పెదాలు వేరుచేసి, కొద్దిగా శీకాయ పొడి వేసి చిన్నగా రుద్దండి. చేదుగా ఉందని పిల్లవాడు ఉమ్మివేస్తే, పాము కరవలేదని అర్థం. తీయగా ఉన్నదని లోపలి తీసుకుంటే, పాము కరచిందని అర్థం. దాని ప్రకారంగా చికిత్స చెయ్యాలి. వెళ్లి పిల్లవాడికి శేకాయ పొడి ఇవ్వు”

ఆ రైతు పరుగున ఇంటికి వెళ్లి స్వామివారు చెప్పినట్టుగా చేశాడు. శీకాయ పొడిని నోటిలో వెయ్యగానే, “చేదు, చేదు” అని ఉమ్మేశాడు. పాము కరవలేదని ఆ రైతు చాలా సంతోషపడ్డాడు.

పరిస్థితి చక్కబడిన తరువాత ఆ రైతు కుటుంబంతో సహా స్వామివారి దర్శనానికి వచ్చారు. ఆ రితు భార్యతో స్వామివారు, “ప్రతి రోజూ ఇంటిలో నువ్వుల నూనె దీపాన్ని వెలిగించు” అని చెప్పారు.

--- శ్రీమఠం బాలు మామ. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Saturday, July 13, 2019

మృష్టాన్నభోజనం


ఈరోజుల్లో టీవీలలో ఎన్నో వంటల కార్యక్రమాలు వస్తున్నాయి. ఆ కార్యక్రమాల్లో ఇచ్చే సూచనలను  సరిగ్గా అర్థం చేసుకుని వండితే, చివరగా తయారయ్యే పదార్ధం తినడానికి యోగ్యంగా ఉంటుందా? అది అనుమానమే.

కొత్త వంటకాలు ఏవీ లేకపోతె, సాధారణంగా చేసే మునక్కాయ సాంబారు లేదా బెండకాయ తాలింపు చేసే విధానాన్నే ఉపయోగించి కొత్త వంటలు చేస్తారు.

స్వామివారు పూర్వాశ్రమంలో ఎన్నడూ వంటింటికి వెళ్ళలేదు; సన్యసించిన తరువాత ఇక వెళ్ళాల్సిన అవసరం లేదు. కాని స్వామివారికి నలభీమపాకంలోని మెళకువలన్నీ తెలుసు. అంతేకాక కొత్త కొత్త వంటలు ఎలా చెయ్యాలో కూడా మంచి నేర్పు.

మేము పండరీపురం నుండి తిరిగొస్తున్నాము. అయిదారు చిన్ని గుడిసెలు ఉన్న ఒక కుగ్రామానికి చేరుకున్నాము. ఒక పెద్ద చెట్టు కింద మకాం ఏర్పాటుచేసుకున్నాము.

పరమాచార్య స్వామివారు భిక్ష పూర్తిచెయ్యగానే, మాకోసం కాస్త ఎక్కువగా వండిన పదార్థాలను ఆరగించి మా భోజనం కూడా పూర్తిచేశాము. అది మధ్యాహ్న విశ్రాంతి సమయం.

హఠాత్తుగా పెద్ద కోలాహలంతో ఇరవై మంది వ్యక్తులు వచ్చారు. వారందరూ చెన్నై ప్రాంతం వారు. శ్రీమఠం మకాం కాబట్టి శ్రీ చంద్రమౌళీశ్వర ప్రసాదంగా మంచి ఆహారం దొరుకుతునదన్న నమ్మకంతో అక్కడకు వచ్చారు.

కాని అప్పుడు శ్రీమఠం ఒక పెద్ద చెట్టు కింద మకాం చేసి ఉంది. వండడానికి కావాల్సిన సరుకులు, పాత్రలు కూడా లేవు. ఇటువంటి విషయాల గురించి మహాస్వామివారు ఎక్కువగా కలతచెందేవారు కాదు. ఆకలితో వచ్చిన వారి కడుపు నింపడమే స్వామివారి లక్ష్యం.

బ్రహ్మచారి రామకృష్ణన్ అని స్వామివారి ఆంతరంగిక సేవకుడు ఉండేవాడు. “అందరికి ఆహారం తయారుచెయ్యి” అని అతణ్ణి ఆదేశించారు స్వామివారు.
రామకృష్ణన్ చేతులు నలుపుతూ నిస్సహాయంగా నిలబడి, “మనం మన మకాం తరువాతి ఊరికి వెళ్ళినతరువాత వారికి వండి పెడతాను” అని తెలిపాడు.
ఇబ్బంది ఉందని పరమాచార్య స్వామివారు అర్థం చేసుకుని, “బియ్యం ఉందా?” అని అడిగారు.

“ఉంది; కాస్త పెసర పప్పు కూడా ఉంది”

“అయితే ఇంకేం! నువ్వు ఏం చేస్తావంటే, బియ్యాన్ని నానబెట్టి కడుగు, ఆ నీటిని మరొక పాత్రలో సేకరించు. డానికి కొద్దిగా ఉప్పు వేసి, నిమ్మకాయ పిండి, నారత్తై ఆకులను కత్తిరించి వెయ్యి. ఇది మజ్జిగ అవుతుంది.

పెసర పప్పుని ఎక్కువగా నీరు పోసి ఉడికించు. నీటిని పప్పును వేరుచేసి, ఆ వేడినీళ్ళకు నిమ్మకాయ వెయ్యి. ఇది రసం అవుతుంది.

ఇప్పుడు ఉడికించిన పెసర పప్పు ఉంది కదా! దానికి కాస్త ఉప్పు, కత్తిరించిన మిరపకాయలు వెయ్యి. అది తాళింపు అవుతుంది” అని ఆదేశించారు.

అరగంటలో మొత్తం సిద్ధం అయ్యింది. ఈలోగా మేము అతిథులకి భోజనానికి ఆకులు, నీరు సమకూర్చాము. మొత్తానికి షడ్రుచుల నాలుక కోసం అన్నం, పెసర పప్పు తాళింపు, రసం, మజ్జిగ తయారుచేసాము.

“ఇది మృష్టాన్న భోజనం” అన్నారొక అతిథి.

“దేవామృతం” అని మరొకరు చెప్పారు.

“ఇంతటి రుచికరమైన భోజనాన్ని ఇంతకుముందెన్నడూ తినలేదు” అన్నారు మూడవవారు.

ఆ మాటలను విని మాలో మేము నవ్వుకున్నాము. అది పరమాచార్య స్వామివారి వాక్కు వల్ల కలిగిన రుచి అని మాకు తెలుసు.

ఆతిథ్యం అన్నది పరమాచార్య స్వామివారిని చూసే నేర్చుకోవాలి. అది ఒక అక్షయ పాత్ర.

--- శ్రీమఠం బాలు. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 4

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Wednesday, July 10, 2019

మంగళసూత్రం - సుమంగళి


Image result for sri chandrasekharendra saraswathi mahaswamy

పాలక్కాడ్ జిల్లాలోని మంజపర బ్రాహ్మణ సమూహానికి చెందిన ఆర్.జి. వెంకటాచలం కంచి మఠానికి పెద్ద భక్తుడు. చాలా పెద్ద పెద్ద పదవులనలంకరించి ఇప్పుడు చెన్నైలో జీవిస్తున్నారు. కాని తమ జన్మస్థలం అంటే వల్లమాలిన అభిమానం. దాదాపు యాభైలక్షల రూపాయలు విరాళాలు సేకరించి మంజపరలోని గురువాయురప్పన్ దేవస్థానాన్ని పునరుద్ధరింంచారు. వారికి పరమాచార్య స్వామివారితో అనుభవాలు కోకొల్లలు. భక్తిపారవశ్యంతో వారు ఎప్పుడూ ఈ సంఘటనను గుర్తు చేసుకుంటారు.

ప్రతి సంవత్సరమూ వారు పరమాచార్య స్వామివారి అనుగ్రహం కోసం వచ్చేవారు భిక్షావందనంతో. 1988లో రహదారుల ప్రయాణానికి కొంచం ఆటంకం ఏర్పడడంతో ఆయన రావాల్సిన రోజుకు రారు అని అందరూ తలచారు. కాని ఏలాగో వారు కాంచీపురం చేరుకున్నారు. స్వామివారి దర్శన సమయంలో అతణ్ణి, “నీ సంపాదన ఎంత?” అని అడిగారు. వారు సమాధానం చెప్పగానే వారికి స్వామివారి ఆదేశం అందింది.

”నువ్వు ఇక ఎప్పుడు భిక్షావందనం చెయ్యడానికి వచ్చినా, కొన్ని మంగళసూత్రాలను చెయ్యించి నీతోపాటు తీసుకుని రా” అని చెప్పారు.

ఆయన కొద్దిగా అలోచనలో పడ్డారు. ఏ సాంప్రదాయాన్ని అనుసరించి మంగళసూత్రాలను చెయ్యించాలి. స్మార్త, తెలుగు, అయ్యర్ ఇలా చాలా చాలా ఉన్నాయి కదా. ఏ రకంగా తయారు చేయించాలి? ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది అని.

వెంటనే స్వామివారు “ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏ సంప్రదాయమైనా పరవాలేదు. తీసుకుని రా” అని చెప్పారు. వెంకటాచలం ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అతను ఈ విషయమై తన మనసులో ఆలోచిస్తున్నాడు. స్వామివారిని అడగనేలేదు. మరి స్వామివారికి ఎలా తెలిసిసింది? అడగకముందే స్వామివారు సమాధానం ఇవ్వడం అతణ్ణి ఆశ్చర్యచకితుణ్ణి చేసింది.

ఈ సంఘటన జరిగి మూడు సంవత్సరాలు గడిచిపోయింది. ప్రతి సంవత్సరం లాగే ఆ సంవత్సరం కూడా భిక్షావందనానికి శ్రీమఠానికి వచ్చారు. ఆరోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కొద్ది దూరంలో నిలబడి వెంకటాచలం తనవంతు కోసం ఎదురుచూస్తున్నాడు. ఒక పెద్ద ముత్తైదువ బహుశా పేదరాలు, స్వామివారితో ప్రాధేయపూర్వకంగా మాట్లాడుతోంది. స్వామివారి ముఖమండలంలో అనంతమైన శాంతి గోచరిస్తోంది.

వెంకటాచలం తనవంతు రాగానే మహాస్వామి వారిముందు నిలబడి, “స్వామివారి ఆదేశం ప్రకారం మంగళసూత్రాలను తెచ్చాను” అని చెప్పాడు. స్వామివారు చేతివేళ్ల శబ్ధంతో ఆ సుమంగళిని దగ్గరకు రమ్మన్నారు. వెంకటాచలం వైపుకి తిరిగి “ఆమె కుమార్తెకి పెళ్ళి అట. మంగళసూత్రం కావాలి అట. తీసుకో ఇక్కడే నీ చేతులతోనే ఆమెకి ఇవ్వు” అని ఆదేశించారు. వెంకటాచలం చాలా సంతోషించారు.

“సార్, నేను చాలా పోగొట్టుకున్నాను. జీవనం సాగించడానికి కూడా కష్టపడ్డాను. అయినాకూడా, ఎప్పుడూ తిరుమాంగల్యాలు చెయ్యించడం మానలేదు. అది పరమాచార్య స్వామి వారి ఆజ్ఞ కదా? మరి ఎలా వదిలిపెట్టగలను? స్వామివారి ఏమి తెలియదా? అంతా తెలుసు. నా భార్య ఏ బాధాలేకుండా సుమంగళీగానే కన్ను మూసింది. మరి ఇంతకంటె ఇక ఏమి అడగాలి ఆ సర్వేశ్వరుణ్ణి?” అని కంఠం గాద్గదికమవుతుండగా వారి అనుభవాన్ని చెప్పుకొచ్చారు వెంకటాచలం.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

అనుష్టానం మానరాదు



1963లో పరమాచార్య స్వామివారు కుంబకోణం దగ్గర్లోని మరుదనల్లూర్ లో మకాం చేస్తున్నారు. అప్పుడు కుంబకోణంలోని కుంబేశ్వర ఆలయంలో ‘తిరుప్పావై - తిరువెంబావై’ సదస్సులు వైభవంగా జరుగుతున్నాయి. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ భక్తవత్సలం మరియు మధురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి తిరుప్పణి (ఆలయ సంబంధిత పనులు) చేసిన పి.టి. రాజన్ ఆ సదస్సుకు వచ్చారు.

అప్పుడు సాయం సంధ్యా సమయం. మహాస్వామి వారి ఉపన్యాసం వినాలని వారి వద్దనే కూర్చుని ఉన్నాను. స్వామివారు ఉపన్యాసం మొదలుపెట్టబోతూ నావైపు తిరిగి, చేతులతో ఆచమనం చేస్తున్నట్టుగా చూపిస్తూ వెళ్ళి సంధ్యావందనం చెయ్యమని ఆజ్ఞాపించారు. స్వామి ఉపన్యాసం వినాలనే కోరికతో నేను సంధ్యావందనం మాని అక్కడ కూర్చున్నానని స్వామివారు అర్థం చేసుకున్నారు. ఎట్టి పరిస్థితులలోను అనుష్టానం మానవద్దు అని నన్ను హెచ్చరించటం. స్వామివారి ఆజ్ఞ ప్రకారం సంధ్య వార్చడానికి నేను కొలను వద్దకు వెళ్ళాను.

ఆ రోజు రాత్రి పదిగంటలప్పుడు మేము ఆహ్వానించకుండానే స్వామివారు మేలకావేరిలోని మా ఇంటికి విచ్చేశారు. దాదాపు ఒక గంట పాటు అనుగ్రహ భాషణం చేశారు. మేము పరమానంద భరితులమయ్యాము. అలా స్వామివారు బ్రాహ్మణుడికి సంధ్యావందనం వంటి నిత్యకర్మల కంటే మేలైనది విలువైనది వేరొక్కటి లేదని సెలవిచ్చారు. అలా ధర్మానుష్టానం చేసిన వారి వద్దకు స్వామివారే వచ్చి అనుగ్రహం ఇస్తారు. అలా ఆచరించని వారు మాత్రమే స్వామిని వెతుక్కుంటూ వెళ్ళాలి.

--- యస్. పంచపకేశ శాస్తిగళ్, కుంబకోణం. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 1

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం