Wednesday, August 19, 2020

సాల్వ వధ

 Ancient Aircraft (Vimana) and Parachute by King Salwa in Bhagavata ...


 ఈ కథ మహాభారతం అరణ్యపర్వం ప్రథమాశ్వాసంలో ఉంది. అన్ని కథల కన్నా ఈ కథకు ఒక ప్రత్యేకత ఉంది. దుర్యోధనుడు నిండుసభలో ద్రౌపదిని, పాండవులను అవమానించటం, అంతకంటే ముందు పాండవులు, కౌరవులు జూదం ఆడటం, ఆ జూదంలో అన్యాయంగా కౌరవులు పాండవులను ఓడించి ద్రౌపది వస్త్రాపహరణం, పాండవుల అరణ్యవాసం ఇలాంటి దుష్కృత్యాలు ఎన్నెన్నో సంభవించాయి. అయితే పాండవుల పక్షపాతిగా నిరంతరం వారిని వెన్నంటి ఉన్న శ్రీకృష్ణుడు పాండవులను జూదం ఆడకుండా ఎందుకు నివారించలేకపోయాడు అనే ప్రశ్నకు శ్రీకృష్ణుడే సమాధానం చెప్పిన సందర్భం ఈ కథలో ఉంది.

జూదంలో ఓడిపోయి అరణ్యాల పాలైన పాండవులు కామ్యకవనానికి చేరుకున్నారు. అక్కడకి శ్రీకృష్ణుడు వచ్చి పాండవుల యోగక్షేమాలను విచారించాడు. తాను సాల్వుడు అనే శిశుపాలుడి సోదరుడితో పదినెలల పాటు యుద్ధం చేస్తున్న కారణంగా తనకు పాండవులు జూదానికి వెళ్ళిన సంగతికానీ మరి ఏ ఇతర విషయాలు కానీ తెలియలేదని, సాల్వుడిని సంహరించిన తర్వాత యుధానుడు తనకు ఈ విషయమంతా చెప్పాడని వెంటనే తనకు పాండవులను చూడాలనిపించి కామ్యకవనానికి వచ్చానని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు.

శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను విని ఎంతో ఆశ్చర్యానికి లోనైన ధర్మరాజు తనకు సాల్వవధ ఇతివృత్తాన్ని వివరించి చెప్పమన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ యుద్ధానికి సంబంధించిన పూర్వాపరాలన్నింటినీ ధర్మరాజుకు వివరిస్తూ శిశుపాలుడి తమ్ముడైన సాల్వుడు తాను శిశుపాలుడిని సంహరించినందుకు తనమీద ఎంతో క్రోధాన్ని పెంచుకున్నాడని కృష్ణుడు చెప్పాడు. సాల్వుడికి సౌంభకం అనే కామగమనం గల ఒక నగరం ఉండేదని ఆ నగరంతో సహా సాల్వుడు ఎదురువచ్చి ద్వారకా నగర పరిసరాలలో శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని కృష్ణుడిని సంహరిస్తానని పెద్దపెద్దగా కేకలు పెడుతుండగా యాదవ కుమారులు సాల్వుడి మీదకు దండెత్తి వెళ్ళారు. వారిలో చారుధేష్ణుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు తదితరులను సాల్వుడి సేనాపతి అయిన క్షేమవృద్ధి ఎదిరించాడు. సాంబుడు వాడిని తన బాణపు దెబ్బలతో ఏడిపించాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక క్షేమవృద్ధి పారిపోగా వేగవంతుడు అనే మరొకడు వచ్చి సాంబుడి మీద విరుచుకుపడ్డాడు. అప్పుడు చారుదేష్ణుడు వేగవంతుడిని ఎదిరించి వధించాడు. ఆ తర్వాత విలంత్యుడు అనే వాడిని కూడా చారుదేష్ణుడు వధించటంతో సాల్వుడు ఉగ్రుడై తన మహాసేనతో అక్కడికి వచ్చాడు. అప్పుడు ప్రద్యుమ్నుడికి సాల్వుడికి ఘోరయుద్ధం జరిగింది. ప్రద్యుమ్నుడు దివ్యాస్త్రంతో వాడిని సంహరించబోగా నారదుడు తదితర మునులు అక్కడికి వచ్చి తొందర పడవద్దని సాల్వుడి మరణం శ్రీకృష్ణుడి చేతిలోనే ఉందని చెప్పటంతో ప్రద్యుమ్నుడు వాడిని వదిలివేశాడు. యాదవ కుమారులను సాల్వుడు ఇలా ఎదురిస్తూ ద్వారకానగరాన్ని ముట్టడిస్తున్నాడన్న సంగతి ధర్మరాజు చేస్తున్న రాజసూయయాగంలో ఉన్న శ్రీకృష్ణుడికి తెలిసింది. యాగం పరిసమాప్తి అయిన తర్వాత సాల్వుడి వధకు కృష్ణుడు పూనుకున్నాడు. అంతేగాక వాడిని సంహరించి కానీ ద్వారకలో అడుగుపెట్టనని కృష్ణుడు శపథం చేసి తన పాంచజన్యాన్ని పూరించి శిశుపాలుడి తమ్ముడైన సాల్వుడు ఉన్న మూర్తికావత దేశం మీదకు అసంఖ్యాక చతురంగ బలాలతో వెళ్ళాడు. అయితే సాల్వుడు తన కామగమనం గల నగరం సౌంభకంతో సహా సముద్రకుక్షి దేశానికి వెళ్ళాడు. కృష్ణుడు కూడా అక్కడికే వెళ్ళి వారితో ఘోరయుద్ధానికి తలపడ్డాడు. సాల్వుడు తన సౌంభకాన్ని ఎక్కి శ్రీకృష్ణుడితో ఎన్నోరకాలుగా మాయాయుద్ధం చేశాడు. కృష్ణుడి మీద శిలావర్షాన్ని కురిపిస్తుండటంతో కృష్ణుడు తన వజ్రబాణాల చేత ఆ శిలావర్షాన్ని నిరోధించాడు. వాడు తన నగరంతో సహా ఆకాశంలో మాయమై దొంగచాటుగా యుద్ధం చేస్తుండటంతో చివరకు ఇక సహించలేక కృష్ణుడు తన చక్రాయుధాన్ని వాడిమీదకు సంధించాడు. అది ఆకాశంలో ఉన్న సౌంభకంలోని సాల్వుడిని సంహరించింది. వెంటనే సౌంభక నగరంతో సహా సాల్వుడు నేలకూలాడు.

* * *

పదినెలల పాటు శ్రీకృష్ణుడు తాను ఇలా ఘోరాతి ఘోరంగా సాల్వుడితో యుద్ధం చేసి వాడిని సంహరించి కానీ ద్వారకకు చేరుకోలేదని ఈ కారణంగానే పాండవుల విషయాలు ఏవీ తనకు తెలియకుండా పోయాయని చెప్పాడు. ఆ తర్వాత కృష్ణుడు పాండవులందరికీ ధైర్యవచనాలు చెప్పి తన చెల్లెలైన సుభద్రను, మేనల్లుడైన అభిమన్యుడిని రధం మీద ఎక్కించుకొని ద్వారకా నగరానికి తీసుకువెళ్ళాడు. అలాగే ద్రౌపది సోదరుడైన దృష్టద్యుమ్నుడు ద్రౌపదికి పాండవుల అయిదుగురి వల్ల కలిగిన ఉపపాండవులను తీసుకొని ద్రుపది నగరానికి వెళ్ళిపోయాడు. ఈ కారంణంగానే మిగిలిన అరణ్య, అజ్ఞాతవాస సమయాలలో సభద్ర, అభిమన్యుడు, ఉపపాండవుల ప్రస్తావన మనకు కనిపించదు.

Friday, August 14, 2020

భాగవతంలో వానరం

 Hindu Blog - The Story of Balarama and Monkey Dvividha... | Facebook

రామాయణంలో వానర సేనా వాహని శ్రీరామచంద్రుడికి సహాయం చేసి రామ కార్యాన్ని నెరవేర్చింది. భారతంలో భీమసేనుడు సౌగంధికా పుష్పాన్ని తెచ్చే సందర్భంలో ఆంజనేయుడు భీముడికి ప్రత్యక్షమై ఆ తర్వాత అర్జునుడి రథానికి ‘జెండాపై కపిరాజు’గా నిలిచాడు. ఇలా రామాయణ, భారతాల్లో వానర ప్రస్తావన కనిపిస్తుంది. కానీ భాగవతంలో దైవానికి సహాయకారిగా కాక అపకారిగా పరిణమించబోయి ప్రాణాలను కోల్పోయిన మరో వానరం కథ ఉంది. భాగవత మహాపురాణంలో బలరాముడి బలపరాక్రమాల విజృంభణను వివరించే కథలలో ఇది ప్రధానమైనది.

శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించి లోక కళ్యాణ కారకుడయ్యాడు. నరకాసురుడి స్నేహితులకు, బంధువర్గానికి మాత్రం ఇది ప్రాణాంతకంగా పగను రగిల్చిన సంఘటనగానే గుర్తుండిపోయింది. నరకుడి స్నేహితులలో ప్రధానుడు, మహాబలశాలి అయిన వానరుడు ఒకడుండేవాడు. అతడి పేరు ద్వివిదుడు. వాడు చాలా గర్విష్టి. శరీరబలంలో తనను మించినవాడు ఇంకొకడు ఎవడూ లేదన్నది వాడి భావన. తన స్నేహితుడైన నరకుడ్ని చంపినందుకు కృష్ణుడి మీద పగతీర్చుకోవాలని అనుకుని ద్వారకా నగరంలో ఒక రోజున ప్రవేశించాడు. పల్లెలను తగలబెట్టడం, నదులన్నింటినీ ఇంకిపోయేలా చెయ్యటం, పశువుల మందలను నాశనం చెయ్యటం, అగడ్తలను పూడ్చివేయటం ఇలా ఎన్నెన్నో అకృత్యాలు అక్కడ చేయసాగాడు. వాడి చేష్టలు సామాన్య ప్రజలకు కూడా అతి భయంకరంగా మారాయి. చేతికి దొరికిన మనుషులందరినీ చావబాది కాళ్ళూ చేతులు కట్టివేసి గుహలలో తోసి పెద్దపెద్ద బండరాళ్ళు అడ్డుపెడుతూ ఉండేవాడు. ఇలా శ్రీకృష్ణుడు పరిపాలిస్తున్న ప్రాంతమంతా వాడి చేష్టలకు అల్లకల్లోలమయింది. ఒకరోజున వనంలో తన స్త్రీజన పరివారంతో విలాసంగా కాలం గడుపుతున్న బలరాముడి దగ్గరకు ద్వివిదుడు వచ్చాడు. తన కోతి చేష్టలతో ఎన్నెన్నో రకాలుగా అక్కడ ఉన్నవారిని ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. కోతి చేష్టలు మరీ విపరీతం కావడంతో బలరాముడు తనకు సమీపంలో ఉన్న ఒక పెద్దరాయిని తీసి ద్వివిదుడి మీదకు విసిరికొట్టాడు. అయితే వాడు ఆ రాయి దెబ్బను తప్పించుకోవటమే కాక బలరాముడి పక్కనే ఉన్న మద్యంతో నిండివున్న భాండాన్ని తీసుకుని చెట్టుమీదకు ఎగిరి కూర్చుని దాన్ని నేలమీదకు విసిరికొట్టాడు. బలరాముడికి ఎంతో ప్రియమైన మద్యం నేలపాలయింది. అంతలోనే ఆ వానరుడు అక్కడ ఉన్న స్త్రీజనం చీరలను చింపటం, మెడలో హారాలను తెంచటం లాంటి పనులను చేసి బలరాముడి కోపం ప్రజ్వరిల్లేలా ఎన్నెన్నో కోతి చేష్టలను ప్రదర్శించాడు. ఇక బలరాముడు ఆగలేక తన ఆయుధాలైన నాగలి, రోకలిని చేతపట్టుకుని ఆ కోతి వెంటపడ్డాడు. ఆ దెబ్బతో ద్వివిదుడికి మరింత కోపం వచ్చి అక్కడ ఉన్న ఒక చెట్టును ­డపెరికి బలరాముడి మీదకు విసిరాడు. బలరాముడు దెబ్బతిన్న రేచులాగా ఒక్క ఉదుటున లేచి తన చేతిలో ఉన్న రోకలిని గిరగిరాతిప్పి ఆ వానరుడి మీదకు విసిరాడు. ఆ దెబ్బతో వాడు కిందపడి మూర్ఛిల్లాడు. మరికొద్దిసేపటికి తెప్పరిల్లుకున్న వాడు మరొక చెట్టును పీకి బలరాముడి మీదకు విసిరాడు. అయితే బలరాముడు దాన్ని తన నాగిలిని అడ్డంపెట్టి ముక్కలు ముక్కలు చేశాడు. వానరుడు విసురుతున్న రాళ్ళన్నీ బలరాముడి రోకలి దెబ్బలకు నుగ్గునుగ్గు అయ్యాయి. ఇలా కొద్దిసేపు గడిచిన తర్వాత బలరాముడు ముందుకు ఉరికి బిగించిన తన పిడికిలితో ఆ వానరుడి మెడమీద ఒక్క పోటు పొడిచాడు. ఆ దెబ్బతో వాడి ప్రాణాలు గాలిలో కలిశాయి. రైవతక పర్వత ప్రాంతమంతా వాడు పెట్టిన చావుకేకకు దద్దరిల్లింది. ఇలా భాగవతంలో శ్రీకృష్ణుడి అన్న బలరాముడి చేతిలో ద్వివిదుడు అనే దుష్టబుద్ధిగల వానరుడు హతుడయ్యాడు.

Wednesday, June 24, 2020

వామనావతారం

Story of Vamana Avatar - Hinduism for Kids



భాగవతమంటే భగవత్‌ భక్తుల కథ. భగవత్‌ భక్తులకు సద్గుణాలే అలంకారం. అలాంటి మంచి గుణాలలో దానగుణం మరీ శ్రేష్ఠమైనది. ముక్తిమార్గాన్ని అనుసరించడానికి అది ఎంతగానో దోహదం చేస్తుందని బలిచక్రవర్తి కథ వివరిస్తోంది. బలి చక్రవర్తి దానగుణంలో అద్వితీయుడు. శ్రీమహావిష్ణువు దేవతల కోరికలను అనుసరించి బలిచక్రవర్తి వద్దకు వామనావతారంలో వెళ్ళడానికి బలిచక్రవర్తి దానగుణమే ప్రధానమైంది. మంచి ముఖవర్ఛస్సుతో పొట్టిగా ఉన్న బ్రాహ్మణ బాలుడు తన కోసం నడుస్తూ వచ్చేసరికి బలిచక్రవర్తికి ఎంతో ఆనందం వేసింది. ఎదురు వెళ్ళి నమస్కరించి తన సింహాసనం మీద కూర్చోబెట్టి అతిథిపూజ చేసి యోగక్షేమాలను అడిగాడు. ఆ తరువాత ఏమి కావాలో కోరుకోమని, విలువైన ఆభరణాలు, వస్త్రాలు, భూములేకాక చివరకు తన రాజ్యాన్నయినా ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. అప్పుడు ఓ చక్కటి చిరునవ్వు నవ్వి తనలాంటి వాడికి అవేవీ అక్కర్లేదని, తనకు కేవలం మూడడుగుల నేల మాత్రం చాలని, దాన్ని ఇస్తే తనకు బ్రహ్మానందం కలుగుతుందని వామనుడు చెప్పాడు. బలిచక్రవర్తికి కొంత ఆశ్చర్యమేసింది. తనలాంటి రాజు దగ్గరకు వచ్చి తన అంతస్తుకు తగిన విధంగా ఏవైనా కోరుకోమని మళ్ళీ వేడుకున్నాడు. ఆశ మనిషికి చాలా చేటు తెస్తుందని, ఆశ పొడవైన తాడులాంటిదని, ఆ ఆశాపాశానికి చిక్కుకోవడం మనిషికి మంచిదికాదని వామనుడు వివరించాడు. తనకు కావాల్సింది కేవలం మూడు అడుగుల నేల మాత్రమేనని, దానిని ఇవ్వమని కోరాడు. బలిచక్రవర్తి ఒక స్థిర నిర్ణయానికి వచ్చి వామనుడికి మూడడుగుల నేల దానం ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో రాక్షస గురువైన శుక్రాచార్యుడు అక్కడికి వచ్చి, వచ్చినవాడు సామాన్యుడు కాడని, మూడడుగుల నేలను దానంగా తీసుకుని త్రివిక్రముడై బలిని అణచివేస్తాడని, దానితో వంశము, కులము, రాజ్యము అన్నీ నాశనమవుతాయని, దానము ఇవ్వవద్దని హెచ్చరిక చేశాడు. బలిచక్రవర్తి క్షణకాలం ఆలోచించి తన గురువుకు సమాధానం చెప్పాడు. పూర్వం తనకంటే అధికంగా రాజ్యాన్ని సముపార్జించిన రాజులు ఎందరెందరో ఉన్నారు. కానీ వారు మరణించిన తరువాత వారి పేరు ఎవరూ తలుచుకోలేదు. అదే శిబి చక్రవర్తి వంటివారుమంచి దానాలు చేసి ఇప్పటికీ కీర్తి అనే శరీరంతో వెలుగొందుతున్నారు. తాను కూడా దానం ఇవ్వటానికి సిద్ధమయ్యానని చెప్పాడు. వచ్చినవాడు హరి అయినా మరి ఎవరయినా తనకు లెక్కలేదని, అంతటివాడి చేయి కింద ఉండి తన చేయి పైన ఉండటమే తనకు ఆనందదాయకమని అన్నాడు. దానం ఇచ్చినందు వల్ల కులము, రాజ్యము, వంశము ఏవి నాశనమయినా తనకు లెక్కలేదని, ఒక్కసారి ఇచ్చినమాట వెనుకకు తీసుకోబోనని చెప్పాడు. ఆ తరువాత స్థిర నిర్ణయంతో వామనుడికి ఆనందంగా మూడడుగుల నేలను దానం చేశాడు. వామనుడు త్రివిక్రముడై, విశ్వమంతా వ్యాపించి బలిచక్రవర్తిని పాతాశ సామ్రాజ్యానికి అధిపతిని చేశాడు. బలిచక్రవర్తి పాత్ర ద్వారా భారతీయ సనాతన సంప్రదాయంలో దానగుణానికి ఉన్న విలువ ఎంతటిదో తెలుస్తోంది.

Monday, June 22, 2020

సావిత్రి

Savitri – Vyasa Mahabharata




మద్రదేశాధిపతి అయిన అశ్వపతికి ఆయన భార్య మాళవికి సావిత్రీ దేవత వరప్రసాదం వల్ల సావిత్రి జన్మించింది. 18 సంవత్సరాల నిరీక్షణ అనంతరం ఆ దంపతులకు అందం, తేలివితేటలు, అదృష్టం ఉన్న బాలిక జన్మించింది. సావిత్రి యుక్తవయసుకు వచ్చేసరికి అందాలరాశిగా, అతిలోక సౌందర్యవతిగా ఎదిగింది. ఆమెకు ఆశ్వపతి వివాహ ప్రయత్నాలు చేయడం ప్రారంభించాడు. చాలాకాలం పాటు ప్రయత్నాలు కొనసాగాయి. సాళ్వ రాజ్యాధిపతైన ద్యుమత్సేనుడి కుమారుడు సత్యవంతుడు. సత్యవంతుడి రూప, గుణ, విలాసాలను తెలుసుకొని ఆకర్షితురాలైంది. సావిత్రి. కానీ ద్యుమత్సేనుడి రాజ్యభ్రష్ఠుడై అడవులపాలై ఉన్నాడు. ఒకనాడు నారదమహర్షి మద్రదేశాధిపతైన ఆశ్వపతి దగ్గరకు వచ్చిన సందర్భంలో సావిత్రి పెళ్ళి ప్రస్తావన వచ్చింది. సావిత్రి దృఢ నిశ్చయంతో తన మనసులోని మాటను చెప్పి సత్యవంతుడిని వివాహమాడుతానని చెప్పింది. అందుకు నారదుడు సంతోషించాడు. అశ్వపతి ద్యుమత్సేనుండి వివరాలను అడుగగా నారదుడు తన దివ్యదృష్టితో చూసి సత్యవంతుడు రూపంలోనూ, గుణంలోనూ గొప్పవాడే అయినప్పటికీ ఒక సంవత్సర కాలంలోపు మరణించే అల్పాయిష్కుడని చెప్పాడు. అంతేకాక ఆశ్వపతి, నారదులు ఇద్దరూ సావిత్రిని ఈ కారణంతో మనసు మార్చుకొని వేరొక వరుడిని వివాహమాడమని చెప్పారు. అయినా ఆమె తన పట్టుదలను వదలలేదు. చేసేదిలేక ఆమె తండ్రి అడవికి వెళ్ళి ద్యుమత్సేనుడికి విషయమంతా వివరించి సావిత్రీ సత్యవంతుల వివాహానికి ఒప్పించాడు. ఒక శుభముహూర్తంలో మంచి కానుకలిచ్చి వివాహం జరిపించాడు. వివాహమైన తరువాత రత్నాభరణాలను, విలువైన వస్త్రాలను ధరించక కేవలం నార చీరలనే ధరించి సావిత్రి అత్తమామలకు, భర్తకు సపర్యలు చేస్తూ గడుపుతోంది. ఇంతలో నారదమహర్షి సత్యవంతుడి ఆయుస్షుకు సంబంధించి చేసిన హెచ్చరిక గుర్తుకు వచ్చింది. మరి నాలుగు రోజుల్లో సత్యవంతుడికి ఆయువు తీరుతుందని గ్రహించిన ఆమె కఠోరమైన త్రిరాత్రవ్రతానికి సిద్ధమైంది. మూడురోజుల వ్రతం ముగిసి నాలుగోరోజు ఉదయం సత్యవంతుడు అడవికి పూవులు, ఫలాల కోసం బయలుదేరాడు.
సావిత్రి కూడా అతడి వెంట బయలుదేరగా వద్దని వారించాడు. అయినా ఆమె భర్తను బతిమాలి, అత్తమామల దగ్గర సెలవు తీసుకొని అడవికి బయలుదేరింది. ఆ ఇద్దరూ అడవిలో పువ్వులు, పండ్లు కోసిన తరవాత కట్టెలను కొట్టిన అనంతరం సత్యవంతుడికి బాగా అలసటగా అనిపించి సావిత్రి ఒడిలో తలపెట్టుకొని పడుకున్నాడు. అలా పడుకున్న కొద్దిసేపటికి అతడు నిస్తేజుడు కావటం, కొద్దిదూరంలో తేజోవంతుడైన ఒక దివ్యపురుషుడు నిలబడి ఉండటం సావిత్రి గమనించింది. సత్యవంతుడిని తన ఒడి నుంచి దింపి ఆ దివ్యపురుషుడికి ఎదురుగా వెళ్ళి ఆయనయమధర్మరాజని తెలుసుకుని, యముడు తన భర్త ప్రాణాలను బంధించి తీసుకువెళ్ళడం చూసి వెంబడించింది. తనను వెంబడించి వస్తున్న సావిత్రి పాతివ్రత్య మహిమకు యముడు ముగ్ధుడై పతి ప్రాణం తప్ప ఏమైనా కోరుకోమన్నాడు. అప్పుడు ఆమె తన మామగారికి చూపును ప్రసాదించమని కోరింది. ఆ వరమిచ్చిన తరువాత మళ్ళీ వెంబడిస్తున్న సావిత్రిని చూసి ఇంకొక వరం కోరుకోమ్మనగా తన మామకు రాజ్యప్రాప్తి కలగాలని కోరుకుంది. యముడు అనుగ్రహించాడు. అయినా వదలక వెంబడిస్తున్న సావిత్రిని పతిప్రాణం తప్ప వేరొకటి కోరుకొమ్మనగా తన తండ్రికి పుత్రప్రాప్తి కలగాలని వేడుకుంది. అయినా మళ్ళీ వెంబడిస్తూ తన వాక్‌ చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్న సావిత్రి పాతివ్రత్యానికి ముచ్చటపడి యముడు సత్యవంతుడి ప్రాణాలను తిరిగి ఇచ్చేశాడు. ఇలా సావిత్రి తన మనోనిబ్బరంతో, దృఢ సంకల్పంతో అత్తమామలకు రాజ్యాన్ని, తండ్రికి పుత్రసంతానాన్ని, తనకు అయిదోతనాన్ని సంపాదించుకోగలిగింది. ఆడది అబలకాదు సబల అని సావిత్రి కథ వివరిస్తోంది.

Sunday, May 31, 2020

వింధ్యాద్రి గర్వభంగం - అగస్త్య మహాముని

Agastya and Lopamudra. - Mahabharat - A Story Retold | Facebook



                                                 
                     అసూయాపరులకు, గర్వపోతులకు ఎప్పటికైనా గర్వభంగం తప్పదన్న సత్యాన్ని ఈ కథ నిరూపిస్తుంది. స్కాందపురాణంలో ఈ కథ కనిపిస్తుంది.


                   భూమండలం మీద ఉన్న కులపర్వతాలన్నింటికీ హిమవంతుడు రాజు. అలాగే మిగిలిన పర్వతాలలో ఒక్కొక్క పర్వతానికి ఉన్న విశేషాన్ని అనుసరించి సప్తకుల పర్వతాలకు ఒక్కొక్క ప్రత్యేకతను బ్రహ్మ ఏర్పాటు చేశాడు. అవికాక మిగిలిన ఇతర పర్వతాలకు కూడా స్థల ప్రభావాన్ని అనుసరించి ఒక్కొక్క పర్వతానికి ఒక్కొక్క గుర్తింపు ఇచ్చాడు. మిగిలిన పర్వాతాల గొప్పతనాన్ని చూసి వింధ్యపర్వతం మాత్రం నిరంతరం అసూయ పడుతుండేది. తాను కూడా తలచుకుంటే ఎంతో ఎత్తుకు ఎదగగల శక్తి కలిగిన పర్వతాన్నేనని గర్వపడుతుండేది. ఇలా గర్వపడటమే ఆ పర్వతం ఇప్పటికీ అణిగి మణిగి ఉండటానికి కారణమైంది. నిరంతర అసూయాగుణం కలిగిన ఆ వింధ్యపర్వతం ఒక రోజున నారదుడు దోవలో వెళుతుండగా ఆయనకు స్వాగతం పలికి అతిథి పూజలు చేసి సత్కరించి తన గోడంతా వెళ్లబోసుకుంది. మేరు పర్వతం, హిమాలయ పర్వతం, మందర పర్వతం, ఇలాంటి పర్వతాలు ఏవీ తగిన సామర్థ్యం కలిగి ఉండకపోయినా వాటిని అందరూ గౌరవిస్తున్నారని, పూజిస్తున్నారని వాస్తవానికి ఆ పర్వతాలన్నింటికంటే తానే అధిక శక్తి కలిగిన దానినని చెప్పుకుంది. నారదుడు వింధ్యపర్వతం గర్వం చూసి మనసులో నవ్వుకున్నాడు. కానీ కలహాభోజుడు అప్పటికి ఏదో ఒక విధంగా వింధ్యపర్వతం దగ్గర నుంచి బయటపడి వింధ్య పర్వతాన్ని సమర్ధిస్తున్నట్లుగా మిగిలిన పర్వతాలను తక్కువగా చూస్తున్నట్లుగా భావం కలిగేలా పూర్తిగా తన ప్రవర్తనను ప్రకటించకుండా వింధ్యాద్రి నుంచి ముందుకు కదిలాడు. వింధ్యపర్వతం ఆనాటి నుంచి ఎలాగైనా తన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలని అనుకుంది. వెంటనే ఆకాశం వరకు పెరిగింది.  వింధ్యపర్వతం అలా ఆకాశం వరకు పెరిగే సరికి సూర్యగమనానికి అడ్డంకి ఏర్పడింది. సూర్యుడు పర్వతానికి ఆ వైపు నిలిచిపోయాడు. నక్షత్ర, గ్రహ సంచారాలు కూడా ఆగిపోయాయి. ఇటువైపు, అటువైపు పగలు, రాత్రుల్లో మార్పులు జరగడం లేదు. దాంతో లోకవాసుల జీవితాలన్నీ అయోమయంలో పడ్డాయి.

                                              సూర్యోదయ సూర్యాస్తమయాలు లేక మునులు సంధ్యావందనం, యజ్ఞయాగాలు చేసుకోలేకపోయారు. ఈ విపరీత పరిస్థితి దేవతలను సైతం బాగా కలచివేసింది. దేవతలంతా కలసి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి మొర పెట్టుకున్నారు. బ్రహ్మ సమయ స్ఫూర్తితో ఆలోచించి వింధ్యపర్వతం గర్వం అణచటానికి అగస్త్య మహాముని ఒక్కడే తగిన వాడని భావించాడు. గతంలో ఇంద్రపదవి చేపట్టి లోకాలను బాధించిన నహుషుడి గర్వాన్ని అణించింది, సముద్రాల జలాలను ఔపోశన పట్టింది ఆ మునేనని చెప్పి దేవతలందరినీ తీసుకుని అగస్త్య మహాముని ఆశ్రమానికి వెళ్లాడు. ఆయనకు విషయమంతా వివరించి ఎలాగైనా వింధ్యపర్వతం గర్వం అణచి ప్రపంచానికి మేలు చేయమని ప్రార్ధించాడు. అగస్త్యుడు కాశీ మహానగరాన్ని, కాశీ విశ్వేశ్వరుడిని, అన్నపూర్ణను విడిచిపెట్టి వెళ్లడం ఇష్టం లేకపోయినా లోకకల్యాణం కోసం దేవతల కోరికను తీర్చడం కోసం తన భార్య అయిన లోపాముద్రను వెంటపెట్టుకుని బయలుదేరాడు.  వింధ్యపర్వతాన్ని ఆ దంపతులిద్దరూ సమీపించగానే వింధ్యుడు వారికి నమస్కరించి ఎటు వెళుతున్నారని అడిగాడు. అప్పుడు అగస్త్యుడు తాను భార్యా సమేతంగా దక్షిణ భారత యాత్రకు బయలుదేరినట్లు తమకు దోవ ఇస్తే అవతల వైపునకు వెళ్లగలమని చెప్పాడు. వింధ్యుడు అందుకు ఒప్పుకున్నాడు. అయితే అగస్త్యుడు తాను మళ్లీ తిరిగి వచ్చే వరకు అలాగే ఎత్తు తగ్గించుకుని అణిగి మణిగి ఉండాలని వింధ్యుడికి చెప్పాడు. అగస్త్యుడి మాటల్లోని ఆంతర్యాన్ని గమనించలేని వింధ్యపర్వతం ఆకాశానికి పెంచిన తన దేహాన్ని తగ్గించుకుని ముని దంపతులకు దారి ఇచ్చింది. లోపాముద్రతో కలసి ఆ పర్వతాన్ని దాటి ముందుకు వెళ్లాడు. సూర్యచంద్రాదులకు, నక్షత్ర గ్రహాలకు అడ్డు తొలగిపోవడంతో మళ్లీ ప్రపంచమంతా హాయిగా యథావిథిగా గడపగలిగింది.

                  అగస్త్యుడు కాశీ మహానగరం నుంచి అలా దక్షిణ భారతదేశంలో దాక్షారామం, శ్రీశైలం తదితర ప్రాంతాలను సందర్శించి అక్కడే ఉండిపోయి వెనక్కు తిరిగిరాలేదు. దాంతో వింధ్యుడు అలాగే ఉండిపోయాడు. 

Thursday, May 28, 2020

హయగ్రీవావతారం

14 Best Lord Hayagreeva images | Gods, goddesses, Lord vishnu ...



సకల చరాచర సృష్ఠికి కర్త అయిన బ్రహ్మకు శక్తిని ఇచ్చేవి వేదాలే, ఆ వేదాల సంరక్షణలో నిరంతరం మహావిష్ణువు నిమగ్నమై ఉంటాడని, విష్ణుతత్వ మహత్యాన్ని, వేద విజ్ఞాన ఔన్నత్యాన్ని గురించి ఈ కథ తెలియజేస్తుంది.

                      శ్రీ మహావిష్ణువు దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం ఎన్నో విధాలుగా ఎన్నెన్నో సందర్భాల్లో అవతరించాడు. తేజోవంతమైన రూపంతో ఆయన హయగ్రీవావతారం పొంది వేదాలను రక్షించాడు. కేవలం వేదోద్ధరణ లక్ష్యంగా హయగ్రీవావతారం కనిపిస్తుంది. పూర్వం శ్రీ మహావిష్ణువు నాభికమలంలో ఆసీనుడై ఉన్న సృష్ఠికర్త బ్రహ్మ తన పనిలో తాను నిమగ్నమై ఉండగా రజస్తమోగుణాలకు ప్రతీకలుగా ఉన్న మధుకైటభులు అనే ఇద్దరు రాక్షసులు గదలను ధరించి మెల్లగా బ్రహ్మదగ్గరకు చేరి, మనోహర రూపాలతో భాసిల్లుతున్న నాలుగు వేదాలను అపహరించారు.

                                                  బ్రహ్మ చూస్తుండగానే అపహరించిన వేదాలతో ఆ దానవులు సముద్రంలో ప్రవేశించి రసాతలానికి చేరారు. వేదాలను కోల్పోయిన బ్రహ్మ వేదాలే తనకు ఉత్తమ నేత్రాలని, వేదాలే తనకు ఆశ్రయాలని, వేదాలే తనకు ముఖ్య ఉపస్యాలని అవి లేకపోతే తాను సృష్ఠిని చేయడం కుదరదని విచారిస్తూ ఆ ఆపద నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించసాగాడు. ఆయనకు వెంటనే శ్రీమహావిష్ణువు గుర్తుకు వచ్చి పరిపరివిధాల స్తుతించాడు. బ్రహ్మ ఆవేదనను శ్రీహరి గ్రహించి వేద సంరక్షణ కోసం యోగ రూపంతో ఒక దివ్యశరీరాన్ని పొందాడు. ఆ శరీరం చంద్రుడిలా ప్రకాశించసాగింది. ఆ శరీరమే హయగ్రీవ అవతారం అయింది. నక్షత్రాలతో నిండిన ఆకాశం ఆయన శిరస్సుగా మారింది. సూర్యకిరణ కాంతితో ఆయన కేశాలు మెరవసాగాయి. ఆకాశం పాతాళం రెండు చెవులుగా, భూమి లలాటభాగంగా, గంగా సరస్వతులు పిరుదులుగా, సముద్రాలు కనుబొమ్మలుగా, సూర్యచంద్రులు కన్నులుగా, సంధ్య నాసికగా, ఓంకారమే ఆయనకు అలంకారంగా, విద్యుత్తు నాలుకగా, పితృదేవతలు దంతాలుగా, గోలోకం బ్రహ్మలోకం రెండు పెదవులుగా, తమోమయమైన కాళరాత్రి ఆయనకు మెడభాగంగా అలరారాయి.

                ఈ విధమైన ఒక దివ్యరూపాన్ని ధరించిన శ్రీహరి హయగ్రీవావతారం బ్రహ్మ ముందు నుంచి అంతర్ధానమై రసాతలానికి ప్రవేశించింది. అక్కడ హయగ్రీవుడు ఉదాత్త, అనుదాత్త స్వరయుక్తంగా పెద్దగా సామవేదాన్ని గానం చేయసాగాడు. ఆ మధుర గానవాహిని రసాతలం అంతా మారుమోగింది. ఆ గానరసం రసాతలంలో వేదాలను దొంగిలించి దాక్కున్న రాక్షసుల చెవులకు కూడా సోకింది. ఆ గాన రసవాహినికి ఆ రాక్షసులిద్దరు పరవశించి బ్రహ్మ దగ్గర నుంచి తాము తెచ్చిన వేదాలను ఒక చోట భద్రం చేసి గానం వినిపించిన దిక్కుకు పరుగులు తీశారు. అయితే ఇంతలో హయగ్రీవుడు రాక్షసులు దాచిన వేదాలను తీసుకొని సముద్ర గర్భం నుంచి బయటకు వచ్చి అక్కడ ఈశాన్యభాగంలో హయగ్రీవరూపాన్ని విడిచి తన స్వరూపాన్ని పొందాడు. రాక్షసులు గానం వినిపించిన దిక్కుకు బయలుదేరి వెళ్లి ఎంత వెతికినా, ఎక్కడ వెతికినా ఎవరూ కనిపించలేదు. వెంటనే తమ వేదాలను దాచి ఉంచిన ప్రదేశానికి వెళ్లి చూశారు. అక్కడ వేదాలు కనిపించలేదు.

                                               వెంటనే ఆ ఇద్దరూ రసాతలం నుంచి వెలుపలికి వచ్చి సముద్రంలో దివ్యతేజ కాంతిపుంజంలాగా ఉండి ఆదిశేషుడి మీద యోగ నిద్రాముద్రలో ఉన్న శ్రీమహావిష్ణువును చూశారు. ఆ రాక్షసులు తాము దాచిన వేదాలను అపహరించింది ఆ శ్వేతపురుషుడేనని, తమ దగ్గర నుంచి వేదాలను తెచ్చినది కాక ఏమీ తెలియనట్లు నిద్రిస్తున్నాడని కోపగించుకొని శ్రీమహావిష్ణువు మీదకు యుద్ధానికి వెళ్లారు. అప్పుడు విష్ణువు ఆ రాక్షసులతో యుద్ధం చేసి వారిని సంహరించాడు. ఇలా హయగ్రీవావతారం వేదోద్ధరణ లక్ష్యంగా అవతరించింది.

Saturday, May 23, 2020

నారద తుంబురులు

Tumburu - Wikipedia



భారతీయ పురాణ సాహిత్యంలో తారసపడే ప్రతి కథ, పాత్ర మానవాళికి ఒక మంచి మార్గాన్నో, నడవడికనో నేర్పడానికే అవతరించినట్లు అనిపిస్తూ ఉంటుంది. అందరికీ సుపరిచితమైన నారదుడు వంటి పాత్రల ప్రవర్తన ద్వారా కూడా సందేశం అందుతూ ఉంటుంది. నారదుడు, తుంబురుడు ఇద్దరూ సహాధ్యాయులు (ఒకచోట విద్యనేర్చుకున్నారు), గానవిద్యలో తనను మించిన వారు ఎవరూ ఉండవోరనేది నారదముని పెంచుకున్న భావం. ఆ గర్వఫలమే ‘తాడితన్నే వాడు ఉంటే వాడితల తన్నేవాడు మరొకరు ఎప్పుడూ ఉండే ఉంటాడనే నగ్నసత్యాన్ని చవిచూడాల్సి వచ్చింది నారదుడు. తన గర్వభంగ కథనంతా మణికంఠరుడు అనే ఓ గంధర్వుడికి వివరించి విచారం పొందాడు. నారదుడి నోవేదనంతా ఇలా ఉంది.
వైకుంఠంలో ఒకనాడు శ్రీమహావిష్ణువు నిండుకొలువు తీరి ఉన్నాడు. ఆ కొలువు కూటానికి దేవతలు, మినగణాలు, గంధర్వులు, తదితరులంతా విచ్చేశారు. సభా ప్రాంగణానికి ముందు ఉన్న అందమైన తోట నుంచి లక్ష్మీదేవి నల్లని మబ్బుల మధ్యన మెరుపు తీగలాగా మెరుస్తూ చెలికత్తెలు అటూ ఇటూ నడుస్తుండగా శ్రీమహావిష్ణువు కొలువుతీరిన ప్రదేశానికి బయలుదేరి వస్తోంది. ఆమెను చూడాలనే తపన అక్కడ ఉన్న వారందరిలోనూ బయలుదేరింది. ఈ లోగా విష్వక్సేనుడు తన పరివారంతో అక్కడికి వచ్చాడు. వారంతా చేతిలో బెత్తాలు ధరించి లక్ష్మీదేవి నడిచే దారికి అడ్డంగా ఉన్న వారందరినీ చెదరగొట్టి కకావికలు చేశారు. బ్రహ్మలాంటి దేవతలు కూడా ఆ ధాటికి దూరంగా పారిపోవాల్సి వచ్చింది. ఇంకా నారదుడు వంటి వారి పరిస్థితి చెప్పనవసరం లేదు. అలా లక్ష్మీదేవి కొలువు కూటంలోకి వెళ్లిన వెంటనే ద్వారపాలకులు తలుపులు మూసివేశారు. కొద్దిసేపైన తరువాత లోపలి నుంచి ఎవరో వచ్చి ఓహో తుంబురుడా అంటూ గట్టిగా పిలిచి తుంబురుడిని లోపలకు తీసుకువెళ్లారు. లోపల ఏం జరుగుతుందోనని బయట ఉన్న వారందరికీ ఆతృత హెచ్చింది. కొద్ది సమయం అయిన తరువాత చిరునవ్వులు నవ్వుతూ గంధపు పూతలతో మెడలో దగాదగా మెరిసే పతకంతో సన్మానితుడైన తుంఉబురుడు బయటకు రాగానే అందరూ ఏమిటి విశేషమని అడిగారు. తుంబురుడు సంతోషంతో శ్రీమహాలక్ష్మి చెంత ఉండగా మహావిష్ణువు తన గానాన్ని విని ఆనందించి ఇలా సత్కరించాడని చెప్పాడు. ఆ మాటలు నారదుడి మనసును ఎంతో నొప్పించాయి. అసూయతో అతని హృదయం రగిలిపోయింది. ఇంతకు ముందు ఎక్కడ గానకళను ప్రదర్శించినా తామిద్దరూ కలసి ప్రదర్శించటం అలవాటుగా వస్తోంది. గానకళలో తనకు ఎన్నోమార్లు ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు తుంబురుడు తగుదనమ్మా అంటూ తానొక్కడే వెళ్లి శ్రీహరి ఎదుట గానాన్ని ఆలపించటం అతని హృదయాన్ని భగభగలాడించింది. ఎలాగయినా తుంబురుడిని మించిన గానకళా విద్వాంసుడిగా ఇప్పుడు అందరిచేత మెప్పు పొందాలని అనుకున్నాడు. దీనితోపాటుగా తుంబురుడి గాన విద్యలోని దోషాలను పసిగట్టి వాటిని బయటపెట్టేందుకు స్నేహాన్ని నటిస్తూనే కార్యాన్ని సాధించాలని అనుకున్నాడు. ఒకనాడు తుంఉబురుడి ఇంటికి వెళ్లిన నారదుడికి పాటకు సిద్ధంగా ఉంచిన వీణ కనిపించింది. అక్కడ ఉన్న పరిచారికలను తుంబురుడెక్కడ అని అడుగగా లోపల ఉన్నాడని పిలుచుకొస్తామని వెళ్లారు. ఈలోగా అక్కడ పెట్టి ఉంచిన వీణను నారదుడు తాకాడు. తుంఉబురుడు శ్రుతి చేసి పెట్టిన వీణ అద్భుతమైన రాగాలను ఆలపించింది. శ్రుతి చేసిన వీణే అంత అద్భుతంగా ఆలాపన చేస్తే తుంబురుడు స్వయంగా గానమాలపిస్తే ఇంక ఎంత గొప్పగా ఉంటుందోనని ­హించుకొని సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తరువాత ఎంతో మంది గురువులను అతడు ఆశ్రయించి గానవిద్యలో తనను తుంఉబురుడి కంటే గొప్పవాడిని చేయమని అడిగాడు. వారంతా అది తమకు సాధ్యపడదని చెప్పారు. చివరకు చేసేది లేక శ్రీమహావిష్ణువు గురించి చాలా కాలం తపస్సు చేశాడు. ఆయన ప్రత్యక్షమై నారదుడి కోరిక విని ఈ అవతారంలో అది సాధ్యపడదని తరువాత వచ్చే అవతారంలో వీలు కల్పిస్తానని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఇలా తానొక్కడే గానకళలో గొప్పవాడని భావించుకున్న నారదుడు భంగపాటుకు గురై పండితులు ఎప్పుడూ నీటికొద్దీ తామరలాగా ఉంటారని, చెవిటివాడి ముందు శంఖం ­దినట్లుగా తమకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారి ఎదుట తమ విద్యను ప్రదర్శించరని గ్రహించాడు. తుంబురుడు తన సహాధ్యాయి అయినప్పటికీ ఎంతో కృషి చేసి గాన కళాప్రపూర్ణుడు అయ్యాడని, అది తెలియని తాను గానే గొప్ప అనుకుని గర్వపడి చివరకు గర్వభంగపాటుకు గురికావాల్సి వచ్చిందనుకున్నాడు. విద్యావంతులు, గుణవంతులు, వినయ సంపన్నులు సమయాన్ని సందర్భాన్ని పురస్కరించుకుని మాత్రమే తమలోని గొప్పతనాన్ని ప్రదర్శిస్తారని తెలుసుకోలేని వారు నారదుడిలాగే గర్వభంగం పొందాల్సి వస్తుందని ఈ కథ సారాంశం.






మూలం డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు

Wednesday, May 20, 2020

భక్తవత్సలుడు - భక్తవత్సలం

SEVA - The Purpose of Life: MAHAPERIYAVA - THE GREAT SAINT...



1964లో శ్రీమఠం మకాం కరైకుడిలోని శంకర మఠంలో ఉంది. పరమాచార్య స్వామివారి దర్శనంకోసం అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ యం. భక్తవత్సలం విచ్చేశారు. మహాస్వామివారు వారితో, “రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటి అనే క్షేత్రం గురించి విన్నావా? అక్కడున్న వారందరిని వెంటనే వారి సమానుతో పాటుగా అక్కడి నుండి ఖాళీచెయ్యించడానికి నువ్వు ఆదేశాలు జారీ చెయ్యి. నీ ప్రభుత్వ ఆస్తుల్ని కూడా సంరిక్షించుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకో” అని ఆజ్ఞాపించారు.

ఎందుకు? ఏమిటి? అని భక్తవత్సలం అడగాలి కదా. కాని ఒక్క విషయం కూడా అడగలేదు. ఎందుకంటె ఆ ఆదేశాలు వచ్చినది భూతభవిష్యత్ వర్తమాన కాలాలను ఎరిగిన పరమాచార్య స్వామివారి నోటి నుండి కనుక. కారణం అడగడం వల్ల కొత్తగా వొరిగేది ఏమీ లేదు. ఏదిఏమైనా అది చాలా పెద్ద కారణమే అయ్యి ఉంటుంది.

అవును నిజంగా అది చాలా పెద్ద కారణమే!!

సరిగ్గా స్వామివారు అలా ఖాలీ చెయ్యించమని చెప్పిన ఏడెనిమిది రోజులకే భయంకరమైన వేగం కలిగిన సుడిగాలులు, పెద్ద సముద్రపు అలలతో కూడిన భయంకరమైన తుఫాను వచ్చింది. మొత్తం ధనుష్కోటి నగరం తుఫానులో చిక్కుకొని సముద్రపు నీటీలో మునిగిపోయింది.

ఎవరు భక్తవత్సలుడు కాషాయం కట్టిన వారా? లేక తెల్లని చేనేత దుస్తులు కట్టిన వారా?

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

--- వి.శ్రీనివాసన్, చెన్నై. మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్ 2

Credit 👇

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Monday, May 18, 2020

పదిహేను రోజుల తరువాత

Kanchi Mahaswami Satabdhi Manimantapam




సర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారి కుమారుడు డా. అల్లాడి రామకృష్ణన్ మరియు అతని భార్య శ్రీమతి లలితా రామకృష్ణన్ అమెరికా వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వెళ్ళేముందు ఒకసారి పరమాచార్య స్వామిని దర్శించి ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చారు.

”ఎప్పుడు బయలుదేరాలి?”

“ఈ నెల పన్నెండున స్వామి”

స్వామివారు కొద్దిసేపు మౌనంగా ఉండి తరువాత కాసేపు కళ్ళు మూసుకున్నారు.

”పదిహేను రోజుల తరువాత బయలుదేరొచ్చు కదా!” అని అన్నారు.

హఠాత్తుగా వచ్చిన మహాస్వామివారి ఆజ్ఞ.

స్వామివారికి తెలియపరచకుండా పన్నెండో తేదీనే బయలుదేరవచ్చు. ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలంటే కన్ ఫర్మ్ అయిన టికెట్లను రద్దు చేసుకుని మరలా కొత్తగా రిజర్వ్ చేయించుకోవాలి. మహాస్వామివారు గుర్తుపెట్టుకుని మరీ ఏమి అడగరు కదా!!

కాని మహాస్వామివారు అలా చెప్పిన తరువాత అతనిక వెళ్ళడు. కనుక ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు.

పన్నెండో తేదీన మీనంబాక్కం విమానాశ్రయం నుండి అమెరికాకు వెళ్ళాల్సిన విమానం తన ప్రయాణాన్ని దురదృష్టవశాత్తు ముంబైలోనే ముగించింది.

తరువాత ఆ విమానంలో ఉన్న వందమందీ ఆరోజే మృత్యువాత పడ్డారని తెలిసింది.

రామకృష్ణన్ దంపతులకి రెండు రకాలుగా కన్నీళ్ళు వచ్చాయి. అంతమంది చనిపోయినందుకు బాధతో, వారిని కాపాడినందుకు కృతజ్ఞతతో.

--- వి. శ్రీనివాసన్, చెన్నై. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 2

Credit 👇

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Monday, April 27, 2020

గోవు వెనక వెళ్ళడమెందుకు ?

Sri Sri Sri Chandrasekharendra Saraswathi.



పరమాచార్య స్వామివారు విజయయాత్రలలో భాగంగా, వివిధ ప్రాంతాలలో నివసిస్తుండేవారు. అలాంటి సమయాలలో కొందరు భక్తులు, తమ ఇళ్ళకు రమ్మనో లేదా అక్కడి దేవాలయాలకు రమ్మనో అభ్యర్తిస్తుంటారు.

భక్తులు రమ్మని ప్రార్తిస్తున్నది దేవాలయానికే అయితే పరమాచార్య స్వామివారు దాదాపుగా వారి అభ్యర్థనను మన్నించి అక్కడకు వెళ్లి, దేవుడి దర్శనం చేసుకుని, దగ్గరలోని ఒక స్థలంలో మకాం చేసి, కొద్దిసేపో లేదంటే ఒకరోజో అక్కడ ఉంది భక్తులకు దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తుంటారు. కొన్నిసార్లు ఏదైనా ఉపన్యాసం కాని లేదా సామాన్య విషయాలు చర్చించడం కాని జరుగుతూ ఉంటాయి.

ఒకసారి పరమాచార్య స్వామివారు తమిళనాడు మొత్తం విజయయాత్ర చేస్తున్నారు. యాత్రలో భాగంగా తిరుచిరాపల్లిలో కొన్నిరోజుల పటు మకాం చేశారు. ప్రతిరోజూ స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చేవారు. ఆ భక్తజన సమూహంలో తిరుచ్చిలోని ఒక కళాశాల ప్రధానాచార్యులు కూడా ఉన్నారు. వరుసలో అతని వంతు రాగానే మహాస్వామివారికి నమస్కరించి, ఎన్నోరకాల పళ్ళు పూలు సమర్పించాడు. మహాస్వామివారి దివ్యపాదములు తన కళాశాలను తాకాలని, విద్యార్ధులని అనుగ్రహించాలని ప్రార్థించాడు.

కాని మహాస్వామివారు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. అతని ప్రార్థనకు మౌనమే స్వామివారి సమాధానం అయ్యింది. అతను మాత్రం రోజూ వచ్చి స్వామివారిని అర్థించేవాడు.

చివరగా ఒకరోజు కరుణాసాగరులైన మహాస్వామివారు అతనిపై తమ దయను ప్రసరింపజేశారు. పటికబెల్లం, కుంకుమ ప్రసాదం ఇస్తూ, స్వామివారు అతనితో, “రేపు ఉదయం మీ కళాశాలకు వస్తాను. ఒక ఆవు, దూడతో నీవు నీ భార్య సిద్ధంగా ఉండండి” అని ఆజ్ఞాపించారు.

ఆ భక్తుని సంతోషానికి అవధులు లేవు. “ఖచ్చితంగా అలాగే చేస్తాను పెరియవా” అని మహదానందంతో వెళ్ళిపోయాడు.

చెప్పినట్టుగానే ఉదయం స్వామివారు కళాశాలకు వెళ్ళారు. అతను ఆవు, దూడ, పూర్ణకుంభంతో సహా స్వామివారికోసం ఎదురుచూస్తున్నాడు. మహాస్వామివారి పూర్ణకుంభాన్ని స్వీకరించి, కళాశాల ద్వారం వద్దకు వచ్చి నిలబడ్డారు.

స్వామివారు ఆ భక్తునితో, “నువ్వు ఎక్కడేక్కడైతే నేను రావాలి అనుకుంటున్నావో, అక్కడకు నువ్వు ఆవు, దూడను ముందు తీసుకుని వెళ్ళు, నేను అనుగమిస్తాను” అని తెలిపారు.

స్వామివారి ఆదేశం ప్రకారం అతను భార్యతో కలిసి ఆవు దూడను ముందు తీసుకుని వెళ్తూ ఉంటె స్వామివారు ఆవు వెనుకగా వస్తున్నారు. మొత్తం కలియతిరిగిన తరువాత స్వామివారు ఆ భక్తునితో, “సంతృప్తిగా ఉందా?” అని అడుగగా, అతను తనకు కలిగిన ఆనందాన్ని మాటలలో చెప్పడం కుదరక, కళ్ళ నీరు కారుస్తూ, హృదయం ఉప్పొంగి, తనకు స్వామివారు కలిగించిన అదృష్టానికి, వారి దయకు కృతజ్ఞతగా నేలపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు.

తమ వసతికి తిరిగొచ్చిన స్వామివారు సాయింత్రం భక్తులతో మాట్లాడుతూ, ఉదయం తాము కళాశాలకు వెళ్లోచ్చిన విషయం ప్రస్తావనకు రావడంతో ఒక వ్యక్తి స్వామివారిని, “పెరియవా, కళాశాలో మీరు ఆవు వెనుకగా ఎందుకు వెళ్ళారు?” అని అడిగాడు.

స్వామివారు చిరునవ్వుతూ, “అతను నాపై అత్యంత భక్తిభావం కలవాడు. నేను వస్తే అది కళాశాలకు మంచి అని నమ్మి నన్ను ఆహ్వానించాడు. కాని అది ఆడపిల్లలు చదివే కళాశాల. వారు అన్ని రోజులలోను కళాశాలకు వస్తారు. వారు దూరం ఉండాల్సిన సమయాలలో కూడా కళాశాలకు వస్తారు. అందుకే నేను ఒక ఆలోచన చేశాను. అతని కోరికను తీర్చాలి. నా అనుష్టానం, నియమపాలన కూడా కాపాడబడాలి. దానికి పరిష్కారం ఒక్కటే. మన శాస్త్రాలలో ఉన్నదాని ప్రకారం, ఎటువంటి అశౌచమైనా, ఎటువంటి స్థలమైనా గోవు డెక్కల నుండి వచ్చే ధూళి తగిలితే, ఆ స్థలం పవిత్రమవుతుంది. అందుకే ఆవును ముందు వదిలి నేను దాన్ని అనుసరించాను” అని బదులిచ్చారు.

స్వామివారు చెప్పిన విషయాన్ని విన్నవారందరూ స్థాణువులై నిలబడిపోయారు. ఇంతటి ధర్మసూక్ష్మము ఉంటుందా అని మనం అనుకోవచ్చు. ధర్మాన్ని, ఆశ్రమ నియమ పాలనను ఇంతగా పాటించే జీవితం ఉంటుందా అని మనం అనుకోవచ్చు. ఇలా దయను కూడా ధర్మంతో ముడిపెట్టి పాలించేవారు కంచి పరమాచార్య స్వామివారు కాక ఇంక ఎవరు ఉంటారు?

--- “కడవులిన్ కురల్” - తిరువారూర్ దివాకరన్. ‘కుముదం’ పత్రిక నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

Credit 👇

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Friday, April 24, 2020

ముందు పద్మావతీ కల్యాణం చెయ్యి

Chandrashekarendra Saraswati | MOA

కంచి పరమాచార్య స్వామివారిలో ఉన్న ఒక యోగి లక్షణాలను, అనన్యసామాన్యమైన నిరాడంబరతను కలిపి చూడడం మా అదృష్టం. వారి అవతార రహస్యాన్ని తెలుసుకున్న ఎందఱో భక్తులను స్వామివారు అనుగ్రహించారు.

ఆ ప్రత్యక్ష దైవాన్ని ప్రత్యక్షంగా సేవించి తరించే భాగ్యం పొందినవారిలో శ్రీమఠం బాలు ఒకరు. ప్రతిరోజూ వారి అవతారాన్ని తెలిపే అన్నో సంఘటనలను ప్రత్యక్షంగా చూశాడు. ఈ సంఘటను కూడా అతను చెప్పిన అనుభవాల్లో ఒకటి.
మరవక్కాడు రామస్వామి అనే భక్తునికి నలుగురు కూతుళ్ళు, ఇద్దరు కుమారులు. యుక్తవయస్సులో అతను ఏ విషయంలోనూ ఆసక్తి చూపకుండా, ఊరికే అక్కడా ఇక్కడా తిరుగుతుండడంతో, నెలవారీ ఆదాయం అంటూ ఏమి లేదు. వైదిక కర్మలలో పండితులకు సహాయం చెయ్యడంవల్ల లభించే కొద్ది మొత్తమే అతని కుటుంబానికి ఆసరా.

అతను నివసిస్తున్న గృహం తాతలనాటిది కావడంతో ఇంటికి అద్దె కట్టాల్సిన అవసరం లేదు. గ్రామ శివార్లలో అతనికి ఒక కొబ్బరితోట ఉంది. దాని నుండి వచ్చే ఆదాయమే వారికి తిండి పెడుతోంది.

పెద్దమ్మాయికి ఇరవైరెండేళ్ళు. తరువాతి అమ్మాయికి ఇరవైయ్యేళ్ళు. ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకే ముహూర్తంలో జరిపించేస్తే ఖర్చు కొద్దివరకు తగ్గుతుందని అతని ఆలోచన. కాని జరుగుతున్న సంఘటనలు దానికి ఊతమియ్యడంలేదు. పెద్దమ్మాయికి మంచి సంబంధం కుదరడంతో, త్వరగా పెళ్లిచేయ్యాలనే అతను ఇష్టపడడంతో, కొబ్బరితోట అమ్మడానికి నిశ్చయించుకుని ఒకరి వద్ద ధర కూడా నిర్ణయించేశాడు.

కాని అతను చేస్తున్న ఈ పని అన్నగారికి నచ్చలేదు. ఆ కొబ్బరితోట తరతరాలుగా వస్తున్నది కావడంతో, అందులో ఇతనికి భాగం ఉన్నది కాబట్టి, కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు. రామస్వామి అయ్యర్ కు ఏమీ పాలుపోలేదు. అసలే ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎలాగో కుమార్తె పెళ్లి జరిపించాలి అనుకున్నాడు. కాని అతని అన్న కొబ్బరితోట అమ్మకానికి అడ్డుపడ్డాడు. రామస్వామి చాలా చాలా బాధలో ఉన్నాడు.

ఇక తను చేసేదేంలేక కరుణా సముద్రుడైన పరమాచార్య స్వామివద్దకు పరిగెత్తుకుని వచ్చాడు. స్వామివారికి సాష్టాంగం చేసి నిల్చుని, గద్గదమైన స్వరంతో, కళ్ళ నీరు కారుతుండగా మొత్తం విషయం అంతా స్వామివారికి విన్నవించాడు. పరమాచార్య స్వామివారు అయిదు నిముషాల పాటు అతనివైపు చూసి, ఏమీ చెప్పకుండా ప్రసాదం ఇచ్చి పంపేశారు.

పెద్ద దుఃఖభారంతో వచ్చిన ఆ భక్తుడు నిరాశాపడ్డాడు. పరమాచార్య స్వామివారు కనీసం చిన్న మాట సాయంగా బాధపడకు అని కూడా చెప్పకుండా పంపించివేశారు అన్న బాధతో బయటకు వచ్చాడు. అతను బయటకు రాగానే, మహాస్వామివారిని సేవించుకునే అదృష్టం కల్గిన బాలు కనపడ్డాడు. దుఃఖం తన్నుకురావడంతో తన బాధను బాలుకు చెప్పుకున్నాడు. “పరమాచార్య స్వామివారు తలచుకుంటే ఏమైనా చెయ్యగలరు. మా అన్నకు అన్నీ ఉన్నాయి; పెద్ద ఇల్లు, ఆస్తి, ఐశ్వర్యం; ఎప్పుడూ యాత్రలలో ఉంటాడు; నేను ఎప్పుడూ ప్రత్యక్షంగా కలవలేను; నా వల్ల చెయ్యడం కాకపోయినా ఎపుడూ మా న్నాన్నగారి ఆబ్దికానికి కూడా పిలవడు; ఎంతో కష్టపడి నా కుమార్తె పెళ్లి చేద్దామనుకుంటే, ఇలా చేశాడు”

మొత్తం విన్న తరువాత “ఇదంతా ఎందుకు స్వామివారితో చెప్పలేదు?” అని అడిగాడు బాలు. “నేను మొత్తం చెప్పాను, పరమాచార్య స్వామివారు సాంతం విన్నారు. కేవలం విభూతి ప్రసాదం ఇచ్చారు కాని ఏ ‘అనుగ్రహం’ ఇవ్వలేదు” అని బదులిచ్చాడు రామస్వామి.

ఎంతో బాధతో తన గోడు చెప్పుకున్న రామస్వామిని చూసి, పెరియవా ఇలా చెయ్యకుండా ఉండాల్సింది అనుకున్నాడు బాలు. అందరిపై కరుణను ప్రసరించే మహాస్వామి, రామస్వామిని ఇలా వదిలేయరాడు కదా! అందునా పేదవాడైన రామస్వామిపై స్వామివారి కరుణ దయ అపారమైనవి కదా! అని అనుకున్నాడు.

“ఏమి బాధపడవద్దు. నీ సమస్యను స్వామివారికి వదిలి ఏం జరగాలో అది చూడు. ఎలాగో స్వామివారే నిన్ను కాపాడుతారులే” అని అతణ్ణి స్వాంతనపరచి పంపాడు బాలు.

కొన్ని రోజులు గడిచిపోయాయి. ‘ఉపన్యాస చక్రవర్తి’ శ్రీ మార్గబంధు శాస్త్రి పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చారు. అతని ఐశ్వర్యము, యశస్సు అతను ధరించిన తెల్లని పట్టుపంచె, జరి అంచు ఉన్న అంగవస్త్రం, బంగారుతో అల్లిన రుద్రాక్షమాల, నవరత్నాల హారంలో కనపడుతోంది. మహాస్వామివారు గంటల తరబడి వివిధ అంశాలపై వారితో మాట్లాడేవారు. వారు ఎప్పుడు వచ్చినా సాయింత్రాలు ఉపన్యాసం చెప్పమని స్వామివారు అడిగేవారు.

కాని ఈసారి ఎందుకనో ఎప్పటిలాగా లేదు. భార్యతో, ఇద్దరు శిష్యులతో కలిసి, చేతిలో ఉన్న పళ్ళెం నిండా పళ్ళతో వచ్చి నిల్చున్న ఆయన్ని పట్టించుకోకుండా స్వామివారు ఇతరులతో సంభాషిస్తున్నారు. “ఎందుకు ఇవ్వాళ ఇలా జరుగుతోంది. దేశంలోనే ప్రఖ్యాతిచెందిన ఉపన్యాస చక్రవర్తి వేచియున్నాడు; సరే స్వామివారికి చెబుదాం” అనుకుని, గట్టిగా స్వామివారికి వినపడేటట్లు, “మార్గబంధు శాస్త్రి వచ్చారు” అని చెప్పాడు.

స్వామివారి చూపు ఇటువైపు పడ్డట్టుగా అన్పించడంతో, అటువంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న మార్గబంధు శాస్త్రి పళ్ళ తట్టను స్వామివారికి సమర్పించి, “చాలాకాలం తరువాత ఏడెనిమిది రోజులదాకా నాకు ఎటువంటి కార్యక్రమాలు లేవు. అందుకేనే తిరుమలకు వెళ్తున్నాను. ‘శ్రీనివాస కల్యాణం’ చేయించా

లని నా భార్య కోరిక. అందుకనే వెంటనే బయలుదేరాము. పరమాచార్యుల వారి అనుగ్రహంతో మేము ‘శ్రీనివాస కల్యాణం’ చేయించాలని అనుకుంటున్నాము” అని చెప్పాడు.

పరమాచార్య స్వామివారు అతనివైపు చూడనుకూడా లేదు. కనీసం అతని మాటలు కూడా వినలేదు. చుట్టూ ఉన్నవారితో ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతున్నారు, కాని దాదాపు అరగంటపాటు మార్గబంధు శాస్త్రితో మాట్లాడలేదు.

స్వామివారికి గుర్తుచేయాలని “శాస్త్రి అక్కడ నిలబడి ఉన్నారు” అని మరలా చెప్పాడు బాలు.

‘పరమాచార్య స్వామివారు నన్ను ఆశీర్వదించి, తిరుమలకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాళ నన్ను ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారని’ తలచి, “అవును. పెరియవా నన్ను అనుగ్రహించాలి. ‘శ్రీనివాస కల్యాణం’ చేయించడానికి ఈరోజే తిరుమలకు వెళ్తున్నాను” అని అర్థించాడు.

వెంటనే మహాస్వామివారు లేచి, “ముందు పద్మావతీ  కల్యాణం చెయ్యి” అని చెప్పి లోపలకు వెళ్ళిపోయారు. దీనంతటినీ గమనిస్తున్న అక్కడున్నవారికి ఇది విపరీతంగా తోచింది.

‘శ్రీనివాస కల్యాణం’ అంటే ‘పద్మావతీ  కళ్యాణమే’ కదా! అంటే “తిరుమలలో శ్రీనివాస కల్యాణం చేయించేవారందరూ తిరుచానూరు వెళ్లి పద్మావతీ కల్యాణం చేయించమనా స్వామి వారి ఆదేశం”

దీనికి అర్థమేంటో మార్గబంధు శాస్త్రికి కూడా అర్థం కాలేదు. “ఎందుకు పరమాచార్య స్వామివారు ఇటువంటి ఆదేశాన్ని ఇచ్చి లోపలకు వెళ్ళిపోయారు” అని ఆలోచిస్తూ నిలబడిపోయాడు. కాని వెంటనే దాని అర్థమేంటో, అంతరార్థమేంటో స్వామివారే స్ఫురింపచేశారు.

మరో రెండు నెలలు గడిచిపోయాయి. పరమ సంతోషం నిండిన మొహంతో రామస్వామి అయ్యర్ పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చాడు. తన కుమార్తె పెళ్లి పత్రికను స్వామివారికి సమర్పించడానికి వచ్చాడు ఈసారి.

“అంతా పరమాచార్య స్వామివారి అనుగ్రమ వల్లనే. నా కుమార్తె పెళ్లి ఖర్చు మొత్తం భరించడానికి మా అన్న ఒప్పుకున్నాడు. కేవలం కన్యాదానం చెయ్యడం మాత్రమే నా బాధ్యత అని మిగినదంతా తను చూసుకుంటానని నాతో చెప్పాడు. కొబ్బరితోట పైన వేసిన కోర్టుకేసు కూడా వెనక్కుతీసుకున్నాడు. నా చిన్న కుమారునికి ఉపనయనం చేసి, తన శిష్యునిగా తీసుకుంటానని చెప్పాడు. మా అన్నయ్య ఇలా మారిపోతాడని నా కలలో కూడా అనుకోలేదు. ఇదంతా పరమాచార్య స్వామివారి అనుగ్రహం వల్లనే సాధ్యమయ్యింది” అని చెప్పుకుంటూపోయాడు. కాని పరమాచార్య స్వామివారు ఎలా అనుగ్రహించారో అతనికి తెలియదు.

మహాస్వామివారు చెయ్యెత్తి ఆశీర్వదించి, ప్రసాదం ఇచ్చి పంపారు. రామాస్వామి అయ్యర్ బయటకు రాగానే, మరలా బాలు తారసపడ్డాడు. “రామస్వామి! ఏంటి నీ చేతిలో? పెళ్లి పత్రికా? నీ కుమార్తెదా? నీవద్ద ఒక్క పైసా కూడా లేదని చెప్పావు కదా?” అని అడిగి, రామస్వామి ఇచ్చిన పత్రిక తీసుకున్నాడు.

ఇది ఇలా ఉంది, “. . . . . సౌభాగ్యవతి పద్మావతి, మరవక్కాడు జగదీశ్వర శాస్త్రి మనవరాలు, నా తమ్ముడు చిరంజీవి రామస్వామి పెద్ద కుమార్తె. . .” చివరన ఇట్లు “మీ భవదీయుడు, మార్గబంధు శాస్త్రి”

బాలు ఆశ్చర్యంతో నోట మాటరాక నిశ్చేష్టుడయ్యాడు.

రెండు నెలల క్రితం పరమాచార్య స్వామివారు మార్గబంధు శాస్త్రికి చెప్పినదానికి అర్థం ఇదా! రామస్వామి అన్న ఈయనే అని స్వామివారికి తెలిసి ఉండవచ్చు. కాని రామస్వామి పెద్ద కుమార్తె పేరు పద్మావతి అని ఎలా తెలుసు?

పరమాచార్య స్వామివారికి అంతా తెలుసు అన్న నిజంలో ప్రత్యేకత ఏమి లేదు. ఆ ప్రత్యక్ష దైవానికి అనుగ్రహించడం తప్ప ఇంకేం తెలుసు. ఇటువంటి అనుగ్రహానికి పాత్రులైన ఆ భక్తులు ఎంతటి యశస్సును పొందుతారో మనం ఊహించగలమా?

కరుణాసముద్రుల కరుణ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది.

--- “శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా మహిమై” పత్రిక నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Monday, April 20, 2020

యధార్ధ సంఘటన

Birth centenary of 'Father of India's Space programs'! Dr Vikram ...

అది 1970 వ సంవత్సరం. తిరువనంతపురం ( నేటి త్రివేడ్రం) సముద్రపు ఒడ్డున ఒక పెద్దమనిషి భగవద్గీత పఠనములో ఉన్నాడు. అక్కడికి ఒక నాస్తికుడైన ఒక కుర్రవాడు వచ్చి ఆయన పక్కన కూర్చున్నాడు.



ఆ కుర్రాడు ఈ పెద్దమనిషినితో " ఈకాలంలో కూడా ఇలాంటి పుస్తకాలు చదవడం వలన , మీరంతా మూర్ఖులుగా మిగులుతున్నారు. మాకు సిగ్గుగా ఉన్నది" అని రెచ్చగొడుతూ మాట్లాడము మొదలుపెట్టాడు.

పైగా " మీరే కనుక ఇలాంటి పుస్తకాలు చదవకుండా సైన్సు పుస్తకాలు చదువుతూంటే, మనదేశం ఈపాటికి చాలా అభివృద్ధి సాధించి ఉండేది " అని ఆవేశంతో అన్నాడు.

ఆ పెద్దమనిషి ఆ కుర్రవాని పరిచయం అడిగాడు. అప్పుడా కుర్రవాడు " నేనొక కలకత్తానుండి వచ్చిన సైన్స్ పట్టభద్రుడిని. ఇక్కడ భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్లో పనిచేయటానికి వచ్చాను " అని గర్వంగా చెప్పాడు.

" మీరు వెళ్ళి ఈ భగవద్గీత లాంటి పుస్తకాలు చదవకుండా సైన్సు మీద పుస్తకాలు చదవమని, ఇలాంటి పుస్తకాలు చదవడం వలన జీవితంలో సాధించేది ఏదీ ఉండదని " ఓ ఉచిత సలహా కూడా ఇచ్చాడు.

ఆ పెద్దమనిషి నవ్వి, అక్కడనుండి వెళ్ళడానికి ఉపక్రమించాడు. ఆయన అలా లేవగానే నలుగురు రక్షక దళ భటులు ఆయనను చుట్టుముట్టి, ఆయనకు రక్షణగా నిలబడ్డారు. ఆయన కోసం ఒక అధికార ఎర్రబుగ్గ కారు వచ్చింది. ఇదంతా చూసి, ఆ కుర్రవాడు భయపడి, ఆ పెద్దమనిషిని " మీరెవరూ " అనడిగాడు. ఆ పెద్దమనిషి తనపేరు " విక్రం సారాభాయి" చెప్పాడు. అంటే, అప్పటికి ఆ కుర్రవానికి తను పనిచేయబోయే సంస్థకు ఆయన చైర్మన్ అని అర్ధం అయ్యింది.

ఆ సమయానికి భారతదేశంలో 13 రీసెర్చ్ సంస్థలు, విక్రం సారాభాయి పేరుమీద నడుస్తున్నాయి. అణువిజ్జాన పధకాలు రచించే సంస్థకు ఆయన అధిపతి. ఆయనను ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా దానికి నియమించింది.

అప్పుడు ఆ కుర్రవాడు వలవలా ఏడుస్తూ, ఆయన కాళ్ళమీద పడ్డాడు. అప్పుడు కీ.శే. విక్రం సారాభాయి చెప్పిన గొప్ప విషయం ఇది.

" ఈ విశ్వంలో ప్రతి వస్తువు పరమాత్మచే సృష్టించబడినదే. అది పురాణకాలం కావచ్చును. మహాభారత సమయం కావచ్చు. ప్రస్తుత సమయం కావచ్చును. మిత్రమా !! దైవాన్ని ఎప్పుడూ మరువకు. " అని బోధించాడు.

ఇప్పటి నాస్తికులు ప్రతిదీ హేతువాదం , అంటూ డాంబికముగా కరాళ నృత్యాలు చేయవచ్చును. కానీ సైన్సును అభివృద్ది చేసినది మటుకు ఆస్తికులే అని చరిత్ర చెపుతోంది. దైవం నిత్య సత్యం. భగవద్గీత ఒక అమోఘమైన విజ్జాన శాస్త్రము. దానిని ఎవరూ తప్పుబట్టలేరు. దానిలో చెప్పినది ఆచరించి ప్రపంచంలో ఎందరో లాభము పొందుతున్నారు. ప్రపంచములో ఉన్న సమస్యల కన్నిటికీ భగవద్గీతలో పరిష్కారాలున్నాయి.

శ్రీమత్భగవద్గీత సకలశాస్త్ర సారం !
శ్రీ కృష్ణం వందే జగద్గురుం !!

Friday, April 17, 2020

కమలాపండు రసం తాగు

What Life has taught Me : Paramacharya talks about Himself…



1957 అక్టోబరు 10న డిఫెన్స్ అకౌంట్స్ డిపార్టమెంట్ లో అప్పర్ డివిజన్ క్లార్క్ గా చేరడానికి నేను పూణే వెళ్ళాల్సిఉంది. పరమాచార్య స్వామివారు పశ్చిమ మాంబళంలోని రామకృష్ణపురంలో మకాం చేస్తున్నారని అనుకోకుండా నాకు తెలిసింది. అప్పుడు నేను ప్యాంటు చొక్కా వేసుకున్నాను. అవకాశం వాడులుకోరాదని అలాగే వెళ్లి 1957 అక్టోబరు 9న స్వామివారి దర్శనం చేసుకున్నాను. చొక్కా తెసివేసి స్వామివారికి ప్రణమిల్లాను. వారి ఆశీస్సులతో పూణేకు ప్రయాణమయ్యాను. ఇప్పుడు క్లాస్ ఒన్ ఉద్యోగిగా పదవీవిరమణ చేశాను.

1968లో మా చెల్లెలి ఆరోగ్యం క్షీణించి తంజావూరు మెడికల్ హాస్పిటల్ లో తనని చేర్పించాము. తంజావూరు నుండి పూణేకు తిరిగివెళ్తూ పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళ్లాను. అప్పుడు స్వామివారు మౌనంలో ఉన్నారు. వారి సేవకుల ద్వారా కొన్ని పళ్ళు సమర్పించి నా చెల్లెలి పరిస్థితిని స్వామివారికి తెలిపాను. మహాస్వామివారు ఒక కమలాపండును తీసుకుని దాన్ని మా చెల్లెలికి ఇమ్మని ఆదేశించారు. నేను పూణేకు వెళ్తున్నానని, తంజావూరుకు వెళ్ళడం లేదని స్వామివారికి చెప్పాను. ఆ కమలాపండును రసం తీసి తన బాగుకోసం నన్ను తాగమని ఆజ్ఞాపించారు. నేను పూణే చేరుకోగానే మా చెల్లెలి ఆరోగ్యం మెరుగై, ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చిందని ఉత్తరం వచ్చింది. ఇది నాకు చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. ఎందుకంటే, నేను తంజావూరు నుండి వచ్చేటప్పుడు తనపై ఆశలు వదులుకోవాలని చెప్పారు అక్కడి వైద్యులు.

1985లో నేను యాభైలోకి అడుగుపెడుతున్నప్పుడు నా భార్య, అత్తగారితో కలిసి పరమాచార్య స్వామి దర్శనానికి వెళ్లాను. నా భార్య తాతగారైన కల్యాణపురం అడ్వకేట్ నవనీతం సారంగపాణి అయ్యంగార్, 1920లలో కుంబకోణం మఠంలో పరమాచార్య స్వామివారికి పెద్ద భక్తులు. నా భార్య వారి పేరు చెప్పగానే, కొద్దిసేపు మౌనం. ఆశ్చర్యకరంగా వెంటనే స్వామివారు తనని పిలిచి, సారంగపాణి అయ్యంగార్ తో జరిగిన ఎన్నో విషయాలను తెలిపి, మా గురించిన విషయాలను అడిగి ఆశీర్వదించారు. పరమాచార్య స్వామివారికి కొన్ని వేలమంది భక్తులు ఉన్నప్పటికీ, యాభై ఏళ్ల తరువాత ఒకరి గురించి ఇంతగా చెబుతున్నారంటే ఇది నిజంగా నమ్మశక్యం కాదు.

--- ఆర్. కృష్ణన్, I.D.A.S(రిటైర్డ్). “kamakoti.org” నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Sunday, March 15, 2020

మోహినీ అవతారం

Image result for mohini rahu ketu



భారతీయ పురాణాలలో దేవతలను ఎప్పటికప్పుడు కాపాడుతూ వారితో ధర్మరక్షణ నిర్వహించే సర్వదేవతా సంరక్షుడిగా శ్రీ మహా విష్ణువు ప్రతి కథలోనూ కనిపిస్తాడు. క్షీరసాగర మధనం సమయంలో అమృతం ఉద్భవించింది.


ఆ అమృతాన్ని శ్రీ మహా విష్ణువు చేజిక్కించుకొని దేవతలకు ప్రసాదిద్దామని అనుకునేంతలోనే రాక్షసులు అమృత భాండాన్ని అపహరించుకు పోయారు. దేవతలంతా తెల్ల మొఖం వేసుకొని నీరుగారిన సమయంలో శ్రీ మహా విష్ణువు ఆ ప్రదేశం నుంచి అంతర్ధానమయ్యాడు. రాక్షసులు అమృతాన్ని ఎలా పంచుకోవాలో తెలియక వాదులాడుకుంటున్న సమయంలో వారి మధ్యకు అతిలోక సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ ముగ్ధమనోహర మోహినీ రూపంలో శ్రీ మహా విష్ణువు రాక్షసులను సమ్మోహపరుస్తూ అక్కడ ప్రత్యక్షమయ్యాడు. రాక్షసులంతా అమృతం కోసం అప్పటి వరకు వాదులాడుకుంటున్న వారంతా మెరుపు తీగలాంటి మోహినీ రూపాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు.

             ఆ అందం తమకు దక్కాలంటే తమకు దక్కాలని ఎవరికి వారు మదన తాపంతో వ్యాకులత చెందుతున్న సమయంలో అరమోడ్పు కన్నులతో మోహిని వారి వైపు చూసింది. మోహావేశపరులైన వారు ఆమె చెంతకు చేరారు. అమృతాన్ని అందరికి సమానంగా పంచమని అమృతభాండాన్ని ఆమె చేతికిచ్చారు. ఆ రాక్షసులను నమ్మించాలన్న నిశ్చయంతో తాను వారకాంతనని తన మీద వారికి నమ్మకం కలగడం విచిత్రంగా ఉందని చెప్పింది. కానీ వారంతా ఆమె మాటలనే పూర్తిగా విశ్వసిస్తామని, అమృతాన్ని సమంగా పంచమని ఆమె మీద విశ్వాసాన్ని ప్రకటించారు. రాక్షసులంతా సంబరపడుతూ అమృతభాండాన్ని తెచ్చి మోహినికి అందించగానే హొయలొలుకుతూ తీయ తియ్యటి మాటలతో అమృతాన్ని పంచే విషయంలో తాను ఏమాత్రం పొరపాటు పడినా సహించాలని గోముగా అడిగింది. వారంతా ఆమెను పూర్తిగా నమ్ముతున్నట్లు మరీ మరీ చెప్పడంతో అమృతాన్ని పంచడానికి సిద్ధపడింది. మోహినీ దేవతలను రాక్షసులను రెండు వరుసలుగా కూర్చోబెట్టి విలాసంగా వయ్యారంగా అమృతాన్ని పంచడం ప్రారంభించింది. ముందుగా అమృతాన్నంతటినీ దేవతల వరుసలోని వారికే పూర్తిగా ఇచ్చేసింది. ఈ విషయాన్ని గమనిస్తున్న రాహువు మాయా రూపంలో దేవతల వరుసలో కూర్చొని అమృతాన్ని అందుకున్నాడు. వెంటనే మోహిని తన అసలు రూపాన్ని ప్రదర్శించి శ్రీ మహా విష్ణువుగా అందరికీ సాక్షాత్కరించింది. మాయ రూపంలో ఉన్న రాహువు శిరస్సును శ్రీ విష్ణువు చక్రాయుధంతో ఖండించాడు. రాక్షసుల పక్షంలోని వారందరికీ ఇది మరీ మరీ బాధను కలిగించింది. బలి తన మాయతో దేవతలందరినీ మూర్చ పోయేలా చేశాడు. అయితే మహా విష్ణువు ఆ కష్టం నుంచి కూడా దేవతలను గట్టెక్కించాడు. కాలనేమి, మాలిలాంటి రాక్షసులను ఎందరినో విష్ణువు సంహరించాడు. దేవేంద్రుడు బలి, జంభబలులనే రాక్షసులను వధించాడు. గొప్ప వరం పొంది సామాన్యంగా మృత్యువు వాత పడలేనటువంటి నముచి అనే రాక్షసుడిని నురుగుతో విష్ణువు సంహరించాడు. ఇలా యుద్ధం కొనసాగుతుండగా బ్రహ్మదేవుడు విష్ణువును శాంతింపదలచి నారద మహర్షిని ఆయన వద్దకు పంపి యుద్ధాన్ని విరమింప చేశాడు.

         రాక్షసులను మోహపెట్టడానికి దేవతలను రక్షించడానికి, దుష్టశిక్షణ శిష్ట రక్షణ లక్ష్యాన్ని నెరవేర్చడానికి శ్రీ మహా విష్ణువు మోహినీ అవతారం ధరించాడని తెలుసుకున్న దేవతాగణాలలోని వారంతా అక్కడకు చేరడానికి బయలుదేరారు. గౌరి సమేతుడై శివుడు కూడా మోహినీ రూప సందర్శన కోసం అక్కడకు వచ్చి మోహిని మోహజాలంలో ఇరుక్కున్నాడు. మోహినీ అవతారం ఇలా ఓ కీలకమైన కార్యం కోసం ఆవిర్భవించినట్లు తెలుస్తోంది.

Tuesday, February 18, 2020

ధర్మవ్యాధుడు - అర్జునకి - అహింస

Image result for ధర్మవ్యాధుడు



అహింసా స్వరూపం ఎలాంటిదో తెలిపే ఈ కథ వరాహ పురాణంలో కన్పిస్తుంది. ఏది హింస, ఏది అహింస అనే విషయం తెలియక చాలామంది సందిగ్ధావస్థలో కొట్టుమిట్టాడుతుంటారు. ఆ సందిగ్ధమే కొన్ని కొన్ని సార్లు మనస్పర్థలను, తగాదాలకు కూడా దారితీస్తూ ఉంటుంది. ఈ కథలో ఇతివృత్తం కూడా ఇటువంటి మనస్పర్థల నేపథ్యంలోనే ఉంది. పూర్వం మిథిల నగరంలో ఒక కిరాత కులంలో ధర్మబుద్ధిగల ధర్మవ్యాధుడు అనేవాడు ఉండేవాడు. ఇలా ధర్మవ్యాధుడు జన్మించటానికి కారణం వసురాజు గతజన్మలో అతడి సేవకుడికిచ్చిన వరమే కారణం.
ధర్మవ్యాధుడు తన కిరాతకుల సంప్రదాయాన్ని అనుసరించి ప్రతిరోజూ వేటకు వెళ్ళి ఒక మృగాన్ని చంపి తీసుకువచ్చి సగం అగ్నికి సమర్పించి మిగిలిన సగం మాంసాన్ని తనకోసం, తన కుటుంబసభ్యుల కోసం, అతిథులకోసం వినియోగిస్తూ ఉండేవాడు. ధర్మవ్యాధుడికి అర్జునకుడు అనే ఒక కుమారుడు, అర్జునకి అనే ఒక కూతురు జన్మించారు. అర్జునకుడు తండ్రికి సహాయకుడిగా ఉంటూ ఉండేవాడు. అర్జునకి కూడా ధర్మబుద్ధితో పెరిగి పెద్దది అయి యుక్తవయస్సుకు వచ్చింది. ఆమెకు వివాహం చెయ్యాలని ధర్మవ్యాధుడు తలపెట్టాడు. ఎంతో సౌందర్యవతి, ధర్మగుణశాలి అయిన అర్జునకికి తగిన వరుడిని వెతుకుతూ ధర్మవ్యాధుడు మాతంగుడు అనే ఒక మునికి తన కుమార్తెకు భర్తగా కాదగిన కుమారుడు ఉన్నాడని తెలుసుకొని ఆయన ఆశ్రమానికి వెళ్లాడు. తాన వచ్చిన పనిని చెప్పి మునికుమారుడు అయిన ప్రసన్నుడికి తన కుమార్తె అయిన అర్జునకికి వివాహం జరిగేలా మాతంగుడిని ఒప్పించాడు. మాతంగుడు కూడా ధర్మవ్యాధుడి గుణశీలాలను, ఆయన కూతురు అయిన అర్జునకి గుణశీలాలను అంతకుముందే తెలసుకొని ఉన్న కారణంగా వెంటనే ప్రసన్నుడిని, అర్జునకికి వివాహం జరిపించాడు.

ధర్మవ్యాధుడు తన కుమార్తెకు తగిన బుద్ధులు అన్నీ చెప్పి అత్తమామలను వినయవిధేయలతో సేవించమని మరీమరీచెప్పి అత్తవారింటికి పంపాడు. అర్జునకి, ప్రసన్నుడి జీవితం సుఖంగా గడుస్తూనే ఉంది. అయితే ఒకరోజున అర్జునకి ఏదో పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆమె అత్తగారు ఒకటికి రెండు సార్లు ఆమెను పిలిచింది. అయినా ఆ మాటలు చెవిన పడకపోవడంతో అర్జునకి పలుకలేదు. వెంటనే కోపంతో అక్కడకు వచ్చిన ఆమె అత్త నిర్ధాక్షిణ్యంగా మూగజీవుల గొంతులు కోస్తూ బతికేవారి కూతురిని తన కోడలుగా చేసుకోవటమే తప్పు అయిందని తాను పిలిచినా రాకపోవడంతో అంత గర్వపడాల్సిన విషయం ఏం ఉందని, అయినా ఇవి ఏవీ ఆలోచించకుండా తన భర్త కోడలిగా తీసుకురావడమే తప్పు అయిందని రకరకాలుగా అనేకరకాలుగా సూటిపోటిమాటలను అని పుట్టింటికి వెళ్ళగొట్టింది. పుట్టింటికివచ్చిన అర్జునకి తండ్రికి తన అత్త పలికిన పలుకులను చెప్పింది.

ధర్మవ్యాధుడు తన ధర్మబుద్ధిని, నడవడిని తన వియ్యపురాలు తెలుసుకోలేకపోయిందని అనుకొని హింసకు అహింసకు బేధం ఏంటో నిజానికి ఎవరు తక్కువగా హింస చేస్తున్నారో వివరించి చెప్పాలని తన కూతురు అత్తగారింటికి వెళ్ళాడు. ధర్మవ్యాధుడికి మాతంగముని ఎదురువచ్చి మర్యాదలు చేశాడు. అప్పుడు ధర్మవ్యాధుడు తాను కేవలం జీవహింసకు తావులేని ఆహారాన్నే స్వీకరిస్తానని చెప్పాడు. మాతంగుడు ఎంతో సంతోషంతో ధర్మవ్యాధుడికి వరి, గోధుమ ఇలాంటి ధాన్యాలతో తయారు అయిన ఆహార పదార్ధాలనే తన భార్యచేత చేయించి పెట్టించాడు. ఆ పదార్ధాలను చూసిన ధర్మవ్యాధుడు ఒక్క ఉదుటన భోజనం ముందునుంచి లేచి బయటకు వచ్చాడు. అప్పుడు మాతంగుడు తాను కూడా బయటకు వచ్చి ఎందుకు ఇలా చేశావని అడిగాడు. ఇంత ఘోరంగా జీవహింసతో కూడుకొని ఉన్న ఆహారాన్ని తనకు పెట్టటమే కాక మళ్ళీ ఎదరు ప్రశ్నించడం ఏమిటని ధర్మవ్యాధుడు మాతంగుడితో అన్నాడు. తాను పెట్టించిన ఆహారం వరి, గోధుమలకు సంబంధించినదే అని జీవహింసకు తావులేదని మాతంగుడు అన్నాడు. అప్పుడు ధర్మవ్యాధుడు తాను రోజుకు కేవలం ఒక జంతువును మాత్రమే వధించి ధర్మబద్ధంగా తన కుటుంబం కోసం ఆహారాన్ని సమకూరుస్తున్నానని అయితే కొన్నివేల వరిమొక్కలను, గోధుమ మొక్కలను కానీ కోసి హింసించి అలా వచ్చిన ధాన్యంతో తనకు ఆహారం పెట్టడం ఏమంత సబబు అని అన్నాడు. మొక్కలు, చెట్లలో కూడా జీవం ఉంటుందనే విషయాన్ని తెలుసుకోలేక ఇంత జీవహింసకు పాల్పడడం మంచిదికాదని చెప్పాడు. ఈ ధర్మసూక్ష్మాన్ని మాతంగుడు, ఆయన భార్య ఇద్దరు విని అర్జునకిని వెళ్ళగొట్టడంలో ఉన్న తప్పు తెలుసుకున్నారు. అయితే ధర్మవ్యాధుడు కూడా తాను మాతంగుడిని కానీ, ఆయన భార్యను కానీ అవమానించాలనే ధోరణిలో భోజనం ముందు నుంచి లేవలేదని కేవలం హింస ఎలాంటిదో తెలియజెప్పటానికే అలా చేశానని అదీగాక ఆ రోజున తన ఇంటిదగ్గర పితృకార్యం ఉన్నందువలన ఆహారం స్వీకరించడంలేదని చెప్పాడు. ఇక నుంచి ఇంతకుముందు తనను జీవహింస పరుడని నిందిచినట్లుగా నిందిచవచ్దని తన కూతురిని సక్రమంగా చూసుకొనమని చెప్పాడు. ఎవరికివారు సాధ్యమైనంత వరకు హింసకు దూరంగా ఉండాలంటే అహింస అవుతుందని వివరించి చెప్పాడు. ఇలా వరాహపురాణంలో కన్పించే అర్జునకి కథ అహింసాతత్వాన్ని నిరూపిస్తుంది.

Monday, February 10, 2020

దక్షిణ గోగ్రహణం

Image result for pandavas agnyathavasam

పాండవులు అజ్ఞాతవాస దీక్షలో ఉన్నప్పుడు వారి అజ్ఞాతాన్ని భంగపరచి పాండవులను ఎలాగైనా మరోమారు అరణ్య, అజ్ఞాతవాసాలకు పంపాలని దుర్యోధనుడు ఎప్పటికప్పుడు తీవ్రంగా ఆలోచిస్తూనే ఉన్నాడు. దుర్యోధనుడి ఆలోచనలకు అనుకూలంగా ఒక సమాచారం అందింది. మత్స్యదేశ రాజైన విరాటరాజు బావమరిది సింహబలుడు (కీచకుడు) మరణించాడని దుర్యోధనుడు తెలుసుకున్నాడు. భూలోకంలో భీమసేనుడు, కీచకుడు, బలరాముడు, శల్యుడు సమాన బలవంతులని దుర్యోధనుడికి తెలుసు. అదీకాక మహాబలశాలి అయిన కీచకుడిని అన్ని అవయవాలు విరిచి ముద్దలాగా చేసి చంపగలిగింది భీముడేనని, భీముడే గంధర్వుడి రూపంలో ఆ పని చేసి ఉంటాడని దుర్యోధనుడు అనుకున్నాడు. అందుకు కారణం కీచకుడికి బలరాముడు, శల్యుడు దూరంగా ఉన్నారు. అదీకాక పాండవులు ఎక్కడ అజ్ఞాతంలో ఉండే అవకాశం ఉందని ఆలోచిస్తుంటే సస్య శ్యామలంగా, సుభిక్షంగా ఉండే ప్రాంతంలోనే పాండవులు ఉండే వీలుందని భీష్మాచార్యుడు చెప్పిన మాటలను బట్టి కూడా పాండవుల ఉనికి దుర్యోధనుడు ­హించాడు. వెంటనే తన మంత్రులు సామంతులతో కొలువు తీరి మత్స్యదేశాన్ని దక్షిణ దిక్కు నుంచి, ఉత్తర దిక్కు నుంచి రెండు వైపులా బంధించగలిగితే విరాటరాజును రక్షించటానికి పాండవులు వచ్చి తీరుతారని అప్పుడు వారి గుట్టు రట్టవుతుందని దుర్యోధనుడు తన వారందరికీ చెప్పాడు. ఈ ఆలోచన బాగుందని, తానందుకు సిద్ధమని అక్కడే ఉన్న త్రిగర్త రాజైన సుశర్మ చెప్పాడు. కీచకుడి అండ చూసుకొని విరాటరాజు తన మీదకు ఎన్నోసార్లు దండెత్తి వచ్చి అవమాన పరిచాడని కీచకుడు మరణించాడు కనుక ఇప్పుడు తాను విరాటుడిని జయించగలనని పలికాడు. దుర్యోధనుడు, కర్ణుడులాంటి వారంతా సుశర్మ ఆలోచనను సమర్ధించి మత్స్యదేశాన్ని దక్షిణ దిక్కు నుంచి సుశర్మ ముట్టడించేలాగా ఆ తరువాత ఉత్తర దిక్కు నుంచి కౌరవ ప్రముఖులు విరాట రాజ్యాన్ని ముట్టడించేలాగా పథకం సిద్ధం చేసుకుని యుద్ధ సన్నాహాలు ప్రారంభించారు. మత్స్యదేశాన్ని దక్షిణ దిక్కు నుంచి తాకుతూ వచ్చి సుశర్మ గోసంపదను తరలించుకు వెళుతున్నాడని విరాటరాజుకు వర్తమానం వచ్చింది. విరాటుడు వెంటనే తన తమ్ముడు శతానీకుడు తదితర వీరులను సిద్ధం చేసి యుద్ధానికి బయలుదేరాడు. గతంలో ఎన్నోసార్లు తన చేతిలో పరాజితుడైనప్పటికీ సుశర్మకు బుద్ధి రాకపోవటం విచిత్రంగా ఉందని విరాటరాజు అనుకున్నాడు. విరాటరాజు చేస్తున్న యుద్ధ సంరంభాన్ని గమనించి కంకుభట్టు రూపంలో ఉన్న ధర్మరాజు విరాటుడి దగ్గరకు వెళ్లి గతంలో తనకు ఒక ముని అనేక దివ్యాస్త్రాలను ప్రసాదించాడని తనకు కొన్ని రథాలను, సైన్యాన్ని సమకూర్చితే యుద్ధ రంగానికి తానూ వచ్చి సహాయపడుతానని చెప్పాడు. తమ కొలువులోనే వంటవాడుగా ఉన్న వలలుడిని కూడా యుద్ధానికి తీసుకువెళ్ల వచ్చని అతడు మల్లయుద్ధంలో ఎంతో నేర్పుకలవాడని చెప్పాడు. అలాగే గోవులను రక్షస్తున్న దామగ్రంధిని, అశ్వశిక్షకుడైన తంత్రీపాలుడు కూడా యద్ధ విద్యలో ఎంతో నిపుణులని వారిని కూడా యద్ధానికి బయలుదేర దీయమని చెప్పాడు. విరాటరాజు కంకుభట్టు మాటలకు సమ్మతించి కంకుభట్టుకు, వలలుడికి, దామగ్రంధికి, తంత్రీపాలుడికి కావాల్సిన ఆయుధాలను, రథాలను ఏర్పాటు చేశాడు. అలా నలుగురు సోదరులు విరాటరాజు వెంట తరలివెళ్లి సుశర్మను ఎదుర్కొన్నారు. సుశర్మకు, విరాటరాజుకు మహాభీకరంగా పోరు జరిగింది. కానీ చివరలో సుశర్మ విరాటరాజును విరథుడిని చేసి తన రథం మీద ఎక్కించుకుని తీసుకువెళ్లసాగాడు. ఆ పరిస్థితిని చూసి విరాటుడి సైన్యమంతా చెల్లా చెదురవుతున్న సమయంలో ధర్మరాజు, భీముడిని పిలిచి పరిస్థితి చేయిదాటి పోయేలా ఉందని అజ్ఞాతవాసంలో తమకు ఆశ్రయాన్నిచ్చి ఆదుకుంటున్న విరాటుడిని రక్షంచటం తమ కర్తవ్యమని చెప్పాడు. భీముడు వెంటనే ఒక పెద్ద చెట్టును పెకలించి సుశర్మ సైన్యాన్ని చెదరగొడతానని బయలుదేరబోతుండగా ధర్మరాజు అలా చేయవద్దని పెద్ద పెద్ద చెట్లను, వృక్షాలను పెకలించి శత్రువులతో పోరాడేది భీముడేనన్న సంగతి కౌరవులు పసిగడితే తమ గుట్టు రట్టవుతుందన్నాడు. అలాకాక శస్త్రాలు, ఆయుధాలతోనే యద్ధం చేయమని చెప్పాడు. వెంటనే భీమసేనుడు అమిత ఉత్సాహంతో విరాటరాజును రథం మీద ఎక్కించుకునివెళుతున్న సుశర్మను వెంబడించాడు. తన అస్త్ర, ఆయుధ, భుజబలాన్నంతా ప్రదర్శించి సుశర్మను నిలువరింప చేశాడు. సుశర్మ రథసారథి, అశ్వాలు పడిపోగా రథచక్ర రక్షకుడైన శోణాశ్యుడు పారిపోయాడు. వెంటనే విరాటుడు కూడా విజృంభించటంతో త్రిగర్త సేనలు చెల్లా చెదురయ్యాయి. భీముడి దెబ్బకు సుశర్మ మూర్ఛపోయాడు. అతనిని రథం మీదకు ఎక్కించుకుని భీముడు తన అన్న దగ్గరకు తీసుకువచ్చి సుశర్మను వధించటానికి అనుమతివ్వమని కోరాడు. అయితే ధర్మరాజు అందుకు అంగీకరించలేదు. సుశర్మకు అప్పుడే మూర్ఛ నుంచి మెలకువ వచ్చింది. భీముడు, ధర్మరాజు పలికిన సూటిపోటీ మాటలతో అతడు అవమాన భారంతో కుంగిపోయాడు. భీముడు, ధర్మరాజు సూచన మేరకు అతడిని విడిచిపెట్టాడు. ఇదంతా చూస్తున్న విరాటరాజుకు ఎంతో ఆశ్చర్యమేసింది. తన ప్రాణాలను, రాజ్యాన్ని రక్షంచినందుకు ఎంతగానో కృతజ్ఞతలు చెప్పి తన రాజ్యంలో ఉన్న ధనాన్ని, చివరకు రాజ్యాన్ని కూడా గ్రహించమని కోరాడు. అయితే ధర్మరాజు తాము ధనాన్ని కోరి యద్ధం చేయలేదని, దైవానుగ్రహం వల్లనే సుశర్మ మీద విజయం లభించిందని, తమకు ఎలాంటి బహుమానాలు అక్కరలేదని చెప్పాడు. కంకుభట్టు ఔదార్యానికి మత్స్యదేశ రాజైన విరాటుడు ఎంతో ముచ్చటపడ్డాడు.

Monday, February 3, 2020

మన్మథుడే ప్రద్యుమ్నుడు

Image result for pradyumna



శివుడు కోపాగ్నికి దగ్ధమైన మన్మథుడు ఆ తరువాత ఏమయ్యాడు? రతీ విలాసానికి కరిగిన దేవతలు ఆమెకు ఎలాంటి వరమిచ్చారు? రతీ మన్మథులు సశరీరులుగా మళ్లీ ఎప్పుడు ఎలా కలుసుకోగలిగారు? అనే విషయాలను భాగవతంలో వ్యాసుడు చెప్పిన ఈ కథ వివరిస్తుంది. మన్మథుడు ప్రద్యుమ్నుడుగా శ్రీకృష్ణుడికి జన్మించటం ఆ ప్రద్యుమ్నుడే కృష్ణుడికి విరోధి, కృష్ణుడు భార్య రుక్మిణికి సోదరుడు అయిన రుక్మి కుమార్తెను వివాహమాడి రెండు కుటుంబాల నడుమ ఉన్న కయ్యాన్ని వియ్యంగా మార్చిన ఉదంతం ఈ కథలోనే కనిపిస్తాయి. ఎన్నెన్నో మెలికలతో ఈ కథ చివరకు సుఖాంతంగా ముగుస్తుంది.


తారకాసురుడిని సంహరించడం కోసం పార్వతికి శివుడికి జన్మించే కుమారుడే తగిన వాడని బ్రహ్మ దేవతలకు చెప్పడంతో దేవతలంతా వెళ్లి తపోనిష్ఠలో ఉన్న పరమేశ్వరుడి మనసు మార్చటానికి మన్మథుడిని ఆశ్రయించారు. మన్మథుడు దైవకార్యం నెరవేర్చటానికి ఉద్యుక్తుడయ్యాడు. కానీ శివుడి ఆగ్రహానికి మాడి మసైపోయాడు. అప్పుడు రతీదేవి విపరీతంగా విలపిస్తుండగా దేవతలామెను ఓదార్చి మన్మథుడు తిరిగి ప్రద్యుమ్నుడు అనే పేరుతో జన్మిస్తాడని చెప్పారు. నారదుడు రతీదేవికి మరింత మనశ్శాంతి కలగటానికి ప్రద్యుమ్నుడి జన్మకు సంబంధించిన విశేషాలను కూడా వివరించాడు. కృష్ణుడికి రుక్మిణిదేవి వల్ల ప్రద్యుమ్నుడు జన్మిస్తాడు. అయితే జన్మించిన కొద్ది రోజుల్లోనే శంబరాసురుడు అనే ఒక అనే ఒక రాక్షసుడు ప్రద్యుమ్నుడిని సంహరించే ప్రయత్నం చేస్తాడు. అందుకే శంబరాసురుడి బారి నుంచి ఆ బాలుడిని రక్షించుకోమని నారదుడు రతీదేవికి చెప్పాడు. అప్పుడామె ఆ దేవముని చెప్పిన మాటలను అనుసరించి మాయావతి అనే పేరుతో శంబరాసురుడి ఇంట్లోనే దాసిగా చేరింది. ఇలా జరిగిన కొంత కాలానికి ద్వారకలో రుక్మిణికి ఒక కుమారుడు జన్మించాడు. అయితే బాలుడు పుట్టిన ఎనిమిదో రోజునే జటాసురుడు అనే రాక్షసుడి కుమారుడైన శంబరాసురుడు ప్రద్యుమ్నుడిని ఎలాగైనా సంహరించాలని అనుకున్నాడు. కృష్ణుడికి జన్మించిన కుమారుడి వల్ల తనకు మరణం ప్రాప్తిస్తుందని తెలుసుకోవటమే అందుకు కారణం. శంబరాసురుడు ఒక కాకి రూపంలో రహస్యంగా పురిటింటిలో ప్రవేశించి ఆ బాలుడిని పట్టుకుని తీసుకువెళ్లి సముద్రంలో పడేశాడు. రుక్మిణి తదితరులంతా ఎంతగానో దుఃఖించారు. అయితే సముద్రంలో పడిన బాలుడిని ఒక పెద్ద చేప మింగింది. ఒక జాలరి వల వేసి పట్టినప్పుడు ఆ చేప అతడికి దొరికింది. చాలా పెద్దదిగానూ, అందంగా, విచిత్రంగా ఉన్న ఆ చేపను తమ రాజైన శంబరాసురుడికి కానుకగా ఆ జాలరి తీసుకువెళ్లి ఇచ్చాడు. శంబరాసురుడి వంట పనివారు ఆ చేపను తరుగుతుండగా దాని కడుపులో నుంచి ఒక చక్కని బాలుడు బయటపడ్డాడు. అందుకు వంట వారు ఆశ్చర్యపోయారు. అక్కడే దాసీ రూపంలో ఉన్న రతీదేవికి ఈ విషయం తెలిసింది. రతీదేవి ఆ బాలుడిని జాగ్రత్తగా కాపాడుతూ శంబరాసురుడి వల్ల ఎటువంటి ప్రమాదం కలుగకుండా చూడసాగింది. శంబరాసురుడు కాకి రూపంలో ప్రద్యుమ్నుడికి చేసిన అపకారం ఆమెకు తెలిసింది. మరింత జాగ్రత్తగా కంటికి రెప్పలా మాయావతి (రతీదేవి) ఆ బాలుడిని పెంచుతూ వచ్చింది. అతడు యుక్త వయస్సుకు వచ్చిన తరువాత ఒక రోజున ఆమె గతాన్నంతా అతడికి వివరించి చెప్పింది. అంతేకాక శంబరాసురుడిని జయించటానికి తనకు తెలిసిన మహామాయ అనే విద్యను అతడికి నేర్పించింది. ప్రద్యుమ్నుడు ఒక రోజున శంబరుడి మీదకు యుద్ధానికి వెళ్లాడు. ఆ ఇద్దరి మధ్య ఘోరంగా యుద్ధం జరిగింది. మహామాయ విద్య సహాయంతో ప్రద్యుమ్నుడు ఆ రాక్షసుడిని సంహరించాడు. ఆ తరువాత రతీదేవితో కలసి ఆకాశ మార్గాన ద్వారకా నగరానికి బయలుదేరి వెళ్లాడు.

శ్రీకృష్ణుడి లాగా రూపురేఖలున్న ప్రద్యుమ్నుడిని చూసి అందరూ కృష్ణుడేమోనని భావించారు. కానీ పక్కన రతీదేవి ఉండటం, కృష్ణుడికి శిరసున నెమలి పింఛం ఉన్నట్లు ప్రద్యమ్నుడికి లేకపోవడం చూసి కృష్ణుడు కాదని పరిచారికలు నిర్ధారించుకున్నారు. రుక్మిణీదేవి తనకు జన్మించి పురిట్లోనే అదృశ్యమైపోయిన తన కుమారుడు బతికి ఉంటే అలాగే ఉండి ఉండేవాడని అనుకుంటుండగానే అక్కడికి నారదుడు వచ్చి విషయమంతా వివరించాడు. అక్కడివారంతా ఎంతో ఆనందించారు. ప్రద్యుమ్నుడు రతీదేవినేకాక రుక్మి కుమార్తె అయిన రుక్మవతిని పెళ్లాడాడు. స్వయంవరంలో ఎందరో రాజులను ఓడించి మరీ ఆమెను చేజిక్కించుకున్నాడు. ఆ వివాహం వల్ల శ్రీకృష్ణుడికి రుక్మిణి సోదరుడైన రుక్మికి ఉన్న విరోధం నశించి వియ్యం కుదిరింది. ప్రద్యుమ్నుడికి రుక్మవతి వల్ల అనిరుద్ధుడు జన్మించాడు.

Tuesday, January 7, 2020

బియ్యంబస్తాలు



Image result for paramacharya rice



పరమాచార్య స్వామివారు రామేశ్వరంలోని శ్రీమఠం శాఖకి బియ్యాన్ని పంపమని 1964 ప్రారంభం నుండే బియ్యం దాతలకు చెబుతున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరంగా తోచి మేనేజరు కూడా ఎక్కువ బియ్యం నిల్వకి ఏర్పాట్లు చేసాడు. కాని అతను ఈ విషయంలో చాలా అసహాయతతో అప్పుడప్పుడు తన అసహనాన్ని స్వామివారికి గట్టిగానే వినిపిస్తున్నాడు. 

కాని పరమాచార్య స్వామివారు ఈ విషయంలో కాస్త మొండిగా వ్యవహరించి రామేశ్వరంలోని వారి శాఖామఠంలో 250 బస్తాల బియ్యం నిల్వచేసేట్టు చర్యలు తీసుకున్నారు. 1964 డిసెంబరు మాసంలో పెద్ద తుఫాను రామేశ్వరంని తాకింది. 

ఆ తుఫాను దెబ్బకి రామేశ్వరం చేరడానికి ఉన్న ఒక్క మార్గం పంబన్ వారధి ధ్వంసమైంది. ధనుష్కోటి పట్టణం మొత్తం సముద్రంలో కలిసిపోయింది. సముద్రుని అలల ఆవేశం వల్ల రామేశ్వర ద్వీపానికి ఆహారం పంపించడం జరగని పని. 

పరమాచార్య స్వామివారు ముందుచూపుతో రామేశ్వరంలోని మఠంలో నిల్వచేయించిన 250 బియ్యం బస్తాలే ప్రకృతి విలయం దెబ్బకి సర్వం కోల్పోయిన రామేశ్వరంలోని వేలాదిమంది ప్రజలకి ఆహారమై వారి కడుపు నింపింది. 

సుశనుడు

Image result for శుక్రుడు




అనేక సందర్భాలలో దేవతల వలన కలిగిన ప్రమాదాలతో తల్లడిల్లిన రాక్షస జాతినే శుక్రాచార్యుడు కాపాడినట్లు అనేకానేక పురాణకథలలో కనిపిస్తుంటుంది. రాక్షసులకు గురువైన ఈ శుక్రాచార్యుడి జన్మకు సంబంధించిన కథ విచిత్రంగా ఉంటుంది. పూర్వం యక్షులకు రాజైన కుబేరుడు దేవరాజైన ఇంద్రుడి కోశాగారానికి అధిపతిగా ఉంటుండేవాడు అయితే ఈ కుబేరుడి ఆధిపత్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో సుశనుడు అనే ఒక ముని సమయం కోసం వేచి ఉండేవాడు. ఆ మునికి తగిన సమయం ఆసన్నం కాగానే తన యోగశక్తి సహాయంతో కుబేరుడి ఆధీనంలో ఉన్న సంపద మొత్తాన్ని సంగ్రహించుకుని తీసుకువెళ్ళాడు. ఆ విషయం తెలిసిన కుబేరుడు తను సుశనుడి చేతిలో మోసపోయినందుకు ఎంతగానో బాధపడుతూ ఎవరికి చెప్పినా ఫలితం లేదని చివరకు పరమేశ్వరుడినే శరణువేడాడు. శరణన్న వారిని ఆదుకునే శంకరుడు కుబేరుడికి అభయమిచ్చి సుశనుడిని సంహరించి ఆ ధనాన్ని మళ్ళీ కుబేరుడికి అప్పగించాలనుకున్నాడు. అయితే ఈ విషయం తెలిసిన సుశనుడు మొండి ధైర్యంతో ఎలాగైనా పరమేశ్వరుడి నుంచి తప్పించుకోవాలని అనేక విధాలుగా తరుణోపాయం కోసం ఆలోచించసాగాడు. తాను ఎక్కడ దాక్కున్నా పరమేశ్వరుడు తనను పట్టి సంహరిస్తాడనే నిర్ణయానికి వచ్చి ఆ ముని తన యోగమాయతో పరమేశ్వరుడి చేతిలో ఉన్న శూలం మీదకు చేరి కూర్చున్నాడు. శూలం మీద ఉన్న తనను శివుడు గమనించడులే అనుకున్న ఆ మునికి నిరాశే ఎదురయింది. సకల చరాచర జగత్తును శాసించగల శివుడు మునిని కనుక్కోలేకపోవడం అనేది అసంభవం. తన శూలాగ్రం మీదనే తనకు కోపాన్ని తెప్పించిన ముని ఉన్నాడని గమనించిన శివుడు తన చేతిలోని శూలాన్ని మరొక చేతితో వంచాడు. ఆనాటినుండి అలా వంగిన శూలం శివుడికి పినాకము అనే ఆయుధంగా మారిపోయింది. అల్లరి చేష్టలు లాగా తనను చీకాకు పరుస్తున్న మునిని శివుడు ఒక చేత్తో పట్టుకుని తన నోట్లో వేసుకుని మింగివేశాడు. అలా సుశనుడు పరమేశ్వరుడు గర్భంలో తిరగడం ప్రారంభించాడు. పరమేశ్వరుడి గర్భగోళంలో వుండలేక తనను రక్షించమని అనేక రకాలుగా ఆముని ఈశ్వరుడిని ప్రార్ధిస్తూ ఎలాగైనా బయటకు తీయమని వేడుకున్నాడు. అయినా చాలాకాలం వరకు శివుడు అతడి మాటలను వినిపించుకోలేదు. సుశనుడు మరీమరీ ఆర్థ్రత నిండిన భక్తి భావంతో శివుడిని ప్రార్ధిస్తూ ఎలాగైనా తనను వెలుపలికి రప్పించమని ఎన్నోమార్లు వేడుకున్న మీదుట శివుడు శాంతుడై తన సర్వ రంధ్రాలను మూసి ఒక్క రంధ్రాన్ని మాత్రం తెరిచి వుంచి ఆ రంధ్రం నుండి సుశనుడిని బయటకు రమ్మనమని చెప్పాడు. చేసేది లేక ఈశ్వర శుక్లం వెలవడే ఆరంధ్రం నుండే సుశనుడు బయటకు వచ్చాడు. ఆనాటి నుండి సుశనుడు శుక్రుడు అయ్యాడు. బయటకు వచ్చిన శుక్రుడు గొప్ప తేజస్సుతో వెలుగొందుతూ కనిపించాడు. శివుడికి అప్పటికీ అతడిమీద కోపం చల్లారలేదు. అతడిని పట్టి సంహరించబోతుండగా ఈశ్వర గర్భం నుంచి వెలువడినవాడు తనకు పుత్రుడితో సమానమని పార్వతీదేవి శివుడికి నచ్చచెప్పి అతడిని రక్షించమని ప్రార్ధించింది. పార్వతీదేవి ప్రార్ధన మేరకు పరమేశ్వరుడు శుక్రుడిని విడిచి పెట్టాడు. శుక్రుడు కూడా తనమీద దయ చూపిన పార్వతీ పరమేశ్వరులకు మొక్కి వెళ్ళిపోయాడు. అలా సుశనుడు అనే ముని అనంతర కాలంలో దానవులకు గురువైన శుక్రాచార్యుడిగా మారిన ఈ కథను భారతం శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు వివరించి చెప్పాడు. ఈ శుక్రాచార్యుడు కథ కొద్దిపాటి తేడాతో శివపురాణంలో కూడా కనిపిస్తుంది.