Showing posts with label మహాభారతము. Show all posts
Showing posts with label మహాభారతము. Show all posts

Monday, February 10, 2020

దక్షిణ గోగ్రహణం

Image result for pandavas agnyathavasam

పాండవులు అజ్ఞాతవాస దీక్షలో ఉన్నప్పుడు వారి అజ్ఞాతాన్ని భంగపరచి పాండవులను ఎలాగైనా మరోమారు అరణ్య, అజ్ఞాతవాసాలకు పంపాలని దుర్యోధనుడు ఎప్పటికప్పుడు తీవ్రంగా ఆలోచిస్తూనే ఉన్నాడు. దుర్యోధనుడి ఆలోచనలకు అనుకూలంగా ఒక సమాచారం అందింది. మత్స్యదేశ రాజైన విరాటరాజు బావమరిది సింహబలుడు (కీచకుడు) మరణించాడని దుర్యోధనుడు తెలుసుకున్నాడు. భూలోకంలో భీమసేనుడు, కీచకుడు, బలరాముడు, శల్యుడు సమాన బలవంతులని దుర్యోధనుడికి తెలుసు. అదీకాక మహాబలశాలి అయిన కీచకుడిని అన్ని అవయవాలు విరిచి ముద్దలాగా చేసి చంపగలిగింది భీముడేనని, భీముడే గంధర్వుడి రూపంలో ఆ పని చేసి ఉంటాడని దుర్యోధనుడు అనుకున్నాడు. అందుకు కారణం కీచకుడికి బలరాముడు, శల్యుడు దూరంగా ఉన్నారు. అదీకాక పాండవులు ఎక్కడ అజ్ఞాతంలో ఉండే అవకాశం ఉందని ఆలోచిస్తుంటే సస్య శ్యామలంగా, సుభిక్షంగా ఉండే ప్రాంతంలోనే పాండవులు ఉండే వీలుందని భీష్మాచార్యుడు చెప్పిన మాటలను బట్టి కూడా పాండవుల ఉనికి దుర్యోధనుడు ­హించాడు. వెంటనే తన మంత్రులు సామంతులతో కొలువు తీరి మత్స్యదేశాన్ని దక్షిణ దిక్కు నుంచి, ఉత్తర దిక్కు నుంచి రెండు వైపులా బంధించగలిగితే విరాటరాజును రక్షించటానికి పాండవులు వచ్చి తీరుతారని అప్పుడు వారి గుట్టు రట్టవుతుందని దుర్యోధనుడు తన వారందరికీ చెప్పాడు. ఈ ఆలోచన బాగుందని, తానందుకు సిద్ధమని అక్కడే ఉన్న త్రిగర్త రాజైన సుశర్మ చెప్పాడు. కీచకుడి అండ చూసుకొని విరాటరాజు తన మీదకు ఎన్నోసార్లు దండెత్తి వచ్చి అవమాన పరిచాడని కీచకుడు మరణించాడు కనుక ఇప్పుడు తాను విరాటుడిని జయించగలనని పలికాడు. దుర్యోధనుడు, కర్ణుడులాంటి వారంతా సుశర్మ ఆలోచనను సమర్ధించి మత్స్యదేశాన్ని దక్షిణ దిక్కు నుంచి సుశర్మ ముట్టడించేలాగా ఆ తరువాత ఉత్తర దిక్కు నుంచి కౌరవ ప్రముఖులు విరాట రాజ్యాన్ని ముట్టడించేలాగా పథకం సిద్ధం చేసుకుని యుద్ధ సన్నాహాలు ప్రారంభించారు. మత్స్యదేశాన్ని దక్షిణ దిక్కు నుంచి తాకుతూ వచ్చి సుశర్మ గోసంపదను తరలించుకు వెళుతున్నాడని విరాటరాజుకు వర్తమానం వచ్చింది. విరాటుడు వెంటనే తన తమ్ముడు శతానీకుడు తదితర వీరులను సిద్ధం చేసి యుద్ధానికి బయలుదేరాడు. గతంలో ఎన్నోసార్లు తన చేతిలో పరాజితుడైనప్పటికీ సుశర్మకు బుద్ధి రాకపోవటం విచిత్రంగా ఉందని విరాటరాజు అనుకున్నాడు. విరాటరాజు చేస్తున్న యుద్ధ సంరంభాన్ని గమనించి కంకుభట్టు రూపంలో ఉన్న ధర్మరాజు విరాటుడి దగ్గరకు వెళ్లి గతంలో తనకు ఒక ముని అనేక దివ్యాస్త్రాలను ప్రసాదించాడని తనకు కొన్ని రథాలను, సైన్యాన్ని సమకూర్చితే యుద్ధ రంగానికి తానూ వచ్చి సహాయపడుతానని చెప్పాడు. తమ కొలువులోనే వంటవాడుగా ఉన్న వలలుడిని కూడా యుద్ధానికి తీసుకువెళ్ల వచ్చని అతడు మల్లయుద్ధంలో ఎంతో నేర్పుకలవాడని చెప్పాడు. అలాగే గోవులను రక్షస్తున్న దామగ్రంధిని, అశ్వశిక్షకుడైన తంత్రీపాలుడు కూడా యద్ధ విద్యలో ఎంతో నిపుణులని వారిని కూడా యద్ధానికి బయలుదేర దీయమని చెప్పాడు. విరాటరాజు కంకుభట్టు మాటలకు సమ్మతించి కంకుభట్టుకు, వలలుడికి, దామగ్రంధికి, తంత్రీపాలుడికి కావాల్సిన ఆయుధాలను, రథాలను ఏర్పాటు చేశాడు. అలా నలుగురు సోదరులు విరాటరాజు వెంట తరలివెళ్లి సుశర్మను ఎదుర్కొన్నారు. సుశర్మకు, విరాటరాజుకు మహాభీకరంగా పోరు జరిగింది. కానీ చివరలో సుశర్మ విరాటరాజును విరథుడిని చేసి తన రథం మీద ఎక్కించుకుని తీసుకువెళ్లసాగాడు. ఆ పరిస్థితిని చూసి విరాటుడి సైన్యమంతా చెల్లా చెదురవుతున్న సమయంలో ధర్మరాజు, భీముడిని పిలిచి పరిస్థితి చేయిదాటి పోయేలా ఉందని అజ్ఞాతవాసంలో తమకు ఆశ్రయాన్నిచ్చి ఆదుకుంటున్న విరాటుడిని రక్షంచటం తమ కర్తవ్యమని చెప్పాడు. భీముడు వెంటనే ఒక పెద్ద చెట్టును పెకలించి సుశర్మ సైన్యాన్ని చెదరగొడతానని బయలుదేరబోతుండగా ధర్మరాజు అలా చేయవద్దని పెద్ద పెద్ద చెట్లను, వృక్షాలను పెకలించి శత్రువులతో పోరాడేది భీముడేనన్న సంగతి కౌరవులు పసిగడితే తమ గుట్టు రట్టవుతుందన్నాడు. అలాకాక శస్త్రాలు, ఆయుధాలతోనే యద్ధం చేయమని చెప్పాడు. వెంటనే భీమసేనుడు అమిత ఉత్సాహంతో విరాటరాజును రథం మీద ఎక్కించుకునివెళుతున్న సుశర్మను వెంబడించాడు. తన అస్త్ర, ఆయుధ, భుజబలాన్నంతా ప్రదర్శించి సుశర్మను నిలువరింప చేశాడు. సుశర్మ రథసారథి, అశ్వాలు పడిపోగా రథచక్ర రక్షకుడైన శోణాశ్యుడు పారిపోయాడు. వెంటనే విరాటుడు కూడా విజృంభించటంతో త్రిగర్త సేనలు చెల్లా చెదురయ్యాయి. భీముడి దెబ్బకు సుశర్మ మూర్ఛపోయాడు. అతనిని రథం మీదకు ఎక్కించుకుని భీముడు తన అన్న దగ్గరకు తీసుకువచ్చి సుశర్మను వధించటానికి అనుమతివ్వమని కోరాడు. అయితే ధర్మరాజు అందుకు అంగీకరించలేదు. సుశర్మకు అప్పుడే మూర్ఛ నుంచి మెలకువ వచ్చింది. భీముడు, ధర్మరాజు పలికిన సూటిపోటీ మాటలతో అతడు అవమాన భారంతో కుంగిపోయాడు. భీముడు, ధర్మరాజు సూచన మేరకు అతడిని విడిచిపెట్టాడు. ఇదంతా చూస్తున్న విరాటరాజుకు ఎంతో ఆశ్చర్యమేసింది. తన ప్రాణాలను, రాజ్యాన్ని రక్షంచినందుకు ఎంతగానో కృతజ్ఞతలు చెప్పి తన రాజ్యంలో ఉన్న ధనాన్ని, చివరకు రాజ్యాన్ని కూడా గ్రహించమని కోరాడు. అయితే ధర్మరాజు తాము ధనాన్ని కోరి యద్ధం చేయలేదని, దైవానుగ్రహం వల్లనే సుశర్మ మీద విజయం లభించిందని, తమకు ఎలాంటి బహుమానాలు అక్కరలేదని చెప్పాడు. కంకుభట్టు ఔదార్యానికి మత్స్యదేశ రాజైన విరాటుడు ఎంతో ముచ్చటపడ్డాడు.

Wednesday, June 12, 2019

నారాయణుడు ఉన్న చోట

Related image

గొప్ప నీతిశాస్త్రంగా, పూజనీయ గ్రంథంగా ఉన్న మహాభారత కథలో అక్కడక్కడా కొన్ని సందేహాలు పాఠకులకు తలెత్తుతుంటాయి. ఇది ధర్మమా? అధర్మమా? అని తేల్చుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి వాటిలో కౌరవ పాండవులకు గురుపుత్రుడైన అశ్వత్థామ ప్రయోగించిన దివ్య అస్త్రాలన్నీ నిర్వీర్యం కావడం ఆశ్చర్యంగా కనిపిస్తుంది. తన అస్త్రాలు విశ్వాన్ని మొత్తాన్ని జయించగలవనే నమ్మకంతో ఉన్న అశ్వత్థామ అవి దేనికీ పనికి రాకుండా పోవడంతో తీవ్రంగా కలత చెందుతాడు. యుద్ధం చేస్తున్నప్పుడు ఎవరో ఒక మహాపురుషుడు ఒక శూలాన్ని పట్టుకొని తన ముందు నిలబడి శత్రుసంహారం చేయడం అర్జునుడికి కనిపిస్తుంటుంది. అశ్వత్థామ, అర్జునులకు ఇవి తీరని సందేహాలుగా మిగులుతాయి. ఈ సందేహాలను వ్యాసభగవానుడు నివృత్తి చేసి వారి మనస్సులను సమాధాన పరిచి మళ్లీ కార్యోన్ముఖులను చేస్తాడు. అందుకే ద్రోణపర్వం చివర్లో వ్యాసుడు ముందుగా అశ్వత్థామకు సాక్షాత్కరిస్తాడు.
అందరికీ గురువు, ఎదురులేని శక్తికలిగిన తన తండ్రిని రణరంగంలో దృష్టద్యుమ్నుడు చాలా నీచంగా సంహరించడం అశ్వత్థామకు విపరీతమైన ఆగ్రహాన్ని కలిగించింది. వెంటనే తన దగ్గర ఉన్న నారాయణాస్త్రంతో శత్రుసంహారం చేస్తానని దుర్యోధనుడికి అశ్వత్థామ ధైర్యం చెబుతాడు. ఆ అస్త్రం ఎంతో శక్తిమంతమైందని, తన తండ్రి నారాయణుడిని ఆరాధించి ఆ అస్త్రాన్ని పొంది తనకు ఇచ్చినట్లు చెప్పాడు. ఆ దివ్యాస్త్రంతో ఎలాంటి వారినైనా సంహరించగలనని, తన తండ్రిని చంపిన శత్రువుల మీద పగతీర్చుకుంటానన్నాడు. అశ్వత్థామ పలికిన ఆ ధైర్యపు వచనాలతో కౌరవసేనలో మళ్లీ ఉత్సాహం కలిగింది. అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు. యుద్ధరంగంలో కలకలం మొదలైంది. వాసుదేవుడు చిద్విలాసం చిందించాడు. అర్జునుడు బ్రహ్మ సృష్ఠించి ఇచ్చిన మహాస్త్రాన్ని ప్రయోగించాడు. అది అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాన్ని క్షీణింపచేసింది. అశ్వత్థామకు ఏమీ అర్ధంకాక అస్త్రాలను విడిచి పెట్టి అయోమయంగా ఎటో వెళ్లిపోయాడు. అలా వెళుతున్న అశ్వత్థామకు వ్యాసుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు అశ్వత్థామ తన మనస్సులో ఉన్న వ్యథనంతా వెళ్లగక్కాడు. ఎంతో గొప్ప దివ్యాస్త్రాలనుకున్న తన అస్త్రాలన్నీ ఏ కారణంతోనో పనికిరాకుండా పోయాయని, తన శత్రువులైన కృష్ణార్జునులను ఏమీ చేయలేకపోవడం తనకెంతో వ్యథ కలిగిస్తోందన్నాడు. అప్పుడు వ్యాసుడు చిరునవ్వుతో కృష్ణుడు సామాన్యుడు కాడు. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువేనని చెప్పాడు. లోకాలన్నింటినీ రక్షించాలనే అతడు కృష్ణుడుగా జన్మించాడు. ఈ కృష్ణుడే పురాణ మునుల్లో ప్రసిద్ధులైన నరనారాయణుల్లో నారాయణుడు. శక్తి కోసం హిమాలయ పర్వతాల మీద కఠోరంగా తపస్సు చేసిన నారాయణుడికి పరమశివుడు ప్రమథగణాలతో సహా ప్రత్యక్షమయ్యాడు. తనకు వరాలు ప్రసాదించమని శివుడిని ఆయన కోరుకున్నాడు.
                                లోక సంరక్షణ కోసం దేవతలు, గంధర్వులు తదితరులలో జన్మించి దుష్టులను సంహరించమని శివుడు నారాయణుడికి చెప్పాడు. నారాయణుడు యుద్ధంలో నిలబడినప్పుడు ఏ అస్త్రశస్త్రాలు పని చేయకుండా గొప్ప శక్తిని పరమేశ్వరుడు నారాయణుడికి ఇచ్చాడు. నరనారాయణులలో నరుడు అర్జునుడుగా జన్మించాడు. పరమేశ్వర శక్తితో ఉన్న కృష్ణుడు ఉండడం వల్లనే నీ దివ్యాస్త్రాలు ప్రభావం చూప లేక పోయాయని వివరించాడు. వ్యాసుడి బోధతో అసలు విషయాన్ని గ్రహించిన అశ్వత్థామ మనసులోనే పరమేశ్వరుడిని స్తుతించి శ్రీకృష్ణుడికి నమస్కరించి మనశ్శాంతిని పొందాడు.
ఆ తరువాత వ్యాసుడు అర్జునుడి దగ్గరకు వెళ్లాడు. అర్జునుడు ఆయనను సాదరంగా ఆహ్వానించి పూజించి సత్కరించాడు. అనంతరం తన మనస్సులో ఒక సందేహం ఉందని దాన్ని తీర్చమని వేడుకున్నాడు. తాను యుద్ధం చేస్తున్నప్పుడు ఎవరో ఒక దివ్య పురుషుడు గొప్ప ప్రకాశవంతమైన శరీరంతో వెలుగుతూ తన ముందు నిలబడి చేతిలో ఉన్న శూలంతో తాను చంపాలనుకున్న శత్రువులందిరినీ సంహరిస్తూ కనిపిస్తున్నాడు. నేను కేవలం ఆయన వెనుక నిలబడి శత్రువుల మీదకు బాణాలు వేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఆ దివ్యపురుషుడు ఎవరై ఉంటారో చెప్పమన్నాడు. అప్పుడు వ్యాసమహర్షి సమాధానం చెబుతూ అర్జునుడికి దివ్యతేజోరాశిగా కనిపించిన వ్యక్తి సాక్షాత్తు పరమశివుడు. పాశుపతంలాంటి అస్త్రాలను ప్రసాదించింది కూడా ఆయనే. ధర్మరక్షణ కోసం సాక్షాత్తు ఆ రుద్రుడే యుద్ధరంగంలో కృష్ణార్జునులకు అండగా నిలిచాడని వివరించి అంతర్ధానమయ్యాడు.

- శ్రీ యల్లాప్రగడ మల్లికార్జున రావు గారు
- సేకరణ ఈనాడు దినపత్రిక నుంచీ