Showing posts with label శ్రీ కంచి మహాస్వామి. Show all posts
Showing posts with label శ్రీ కంచి మహాస్వామి. Show all posts

Monday, May 18, 2020

పదిహేను రోజుల తరువాత

Kanchi Mahaswami Satabdhi Manimantapam




సర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారి కుమారుడు డా. అల్లాడి రామకృష్ణన్ మరియు అతని భార్య శ్రీమతి లలితా రామకృష్ణన్ అమెరికా వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వెళ్ళేముందు ఒకసారి పరమాచార్య స్వామిని దర్శించి ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చారు.

”ఎప్పుడు బయలుదేరాలి?”

“ఈ నెల పన్నెండున స్వామి”

స్వామివారు కొద్దిసేపు మౌనంగా ఉండి తరువాత కాసేపు కళ్ళు మూసుకున్నారు.

”పదిహేను రోజుల తరువాత బయలుదేరొచ్చు కదా!” అని అన్నారు.

హఠాత్తుగా వచ్చిన మహాస్వామివారి ఆజ్ఞ.

స్వామివారికి తెలియపరచకుండా పన్నెండో తేదీనే బయలుదేరవచ్చు. ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలంటే కన్ ఫర్మ్ అయిన టికెట్లను రద్దు చేసుకుని మరలా కొత్తగా రిజర్వ్ చేయించుకోవాలి. మహాస్వామివారు గుర్తుపెట్టుకుని మరీ ఏమి అడగరు కదా!!

కాని మహాస్వామివారు అలా చెప్పిన తరువాత అతనిక వెళ్ళడు. కనుక ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు.

పన్నెండో తేదీన మీనంబాక్కం విమానాశ్రయం నుండి అమెరికాకు వెళ్ళాల్సిన విమానం తన ప్రయాణాన్ని దురదృష్టవశాత్తు ముంబైలోనే ముగించింది.

తరువాత ఆ విమానంలో ఉన్న వందమందీ ఆరోజే మృత్యువాత పడ్డారని తెలిసింది.

రామకృష్ణన్ దంపతులకి రెండు రకాలుగా కన్నీళ్ళు వచ్చాయి. అంతమంది చనిపోయినందుకు బాధతో, వారిని కాపాడినందుకు కృతజ్ఞతతో.

--- వి. శ్రీనివాసన్, చెన్నై. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 2

Credit 👇

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Monday, April 27, 2020

గోవు వెనక వెళ్ళడమెందుకు ?

Sri Sri Sri Chandrasekharendra Saraswathi.



పరమాచార్య స్వామివారు విజయయాత్రలలో భాగంగా, వివిధ ప్రాంతాలలో నివసిస్తుండేవారు. అలాంటి సమయాలలో కొందరు భక్తులు, తమ ఇళ్ళకు రమ్మనో లేదా అక్కడి దేవాలయాలకు రమ్మనో అభ్యర్తిస్తుంటారు.

భక్తులు రమ్మని ప్రార్తిస్తున్నది దేవాలయానికే అయితే పరమాచార్య స్వామివారు దాదాపుగా వారి అభ్యర్థనను మన్నించి అక్కడకు వెళ్లి, దేవుడి దర్శనం చేసుకుని, దగ్గరలోని ఒక స్థలంలో మకాం చేసి, కొద్దిసేపో లేదంటే ఒకరోజో అక్కడ ఉంది భక్తులకు దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తుంటారు. కొన్నిసార్లు ఏదైనా ఉపన్యాసం కాని లేదా సామాన్య విషయాలు చర్చించడం కాని జరుగుతూ ఉంటాయి.

ఒకసారి పరమాచార్య స్వామివారు తమిళనాడు మొత్తం విజయయాత్ర చేస్తున్నారు. యాత్రలో భాగంగా తిరుచిరాపల్లిలో కొన్నిరోజుల పటు మకాం చేశారు. ప్రతిరోజూ స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చేవారు. ఆ భక్తజన సమూహంలో తిరుచ్చిలోని ఒక కళాశాల ప్రధానాచార్యులు కూడా ఉన్నారు. వరుసలో అతని వంతు రాగానే మహాస్వామివారికి నమస్కరించి, ఎన్నోరకాల పళ్ళు పూలు సమర్పించాడు. మహాస్వామివారి దివ్యపాదములు తన కళాశాలను తాకాలని, విద్యార్ధులని అనుగ్రహించాలని ప్రార్థించాడు.

కాని మహాస్వామివారు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. అతని ప్రార్థనకు మౌనమే స్వామివారి సమాధానం అయ్యింది. అతను మాత్రం రోజూ వచ్చి స్వామివారిని అర్థించేవాడు.

చివరగా ఒకరోజు కరుణాసాగరులైన మహాస్వామివారు అతనిపై తమ దయను ప్రసరింపజేశారు. పటికబెల్లం, కుంకుమ ప్రసాదం ఇస్తూ, స్వామివారు అతనితో, “రేపు ఉదయం మీ కళాశాలకు వస్తాను. ఒక ఆవు, దూడతో నీవు నీ భార్య సిద్ధంగా ఉండండి” అని ఆజ్ఞాపించారు.

ఆ భక్తుని సంతోషానికి అవధులు లేవు. “ఖచ్చితంగా అలాగే చేస్తాను పెరియవా” అని మహదానందంతో వెళ్ళిపోయాడు.

చెప్పినట్టుగానే ఉదయం స్వామివారు కళాశాలకు వెళ్ళారు. అతను ఆవు, దూడ, పూర్ణకుంభంతో సహా స్వామివారికోసం ఎదురుచూస్తున్నాడు. మహాస్వామివారి పూర్ణకుంభాన్ని స్వీకరించి, కళాశాల ద్వారం వద్దకు వచ్చి నిలబడ్డారు.

స్వామివారు ఆ భక్తునితో, “నువ్వు ఎక్కడేక్కడైతే నేను రావాలి అనుకుంటున్నావో, అక్కడకు నువ్వు ఆవు, దూడను ముందు తీసుకుని వెళ్ళు, నేను అనుగమిస్తాను” అని తెలిపారు.

స్వామివారి ఆదేశం ప్రకారం అతను భార్యతో కలిసి ఆవు దూడను ముందు తీసుకుని వెళ్తూ ఉంటె స్వామివారు ఆవు వెనుకగా వస్తున్నారు. మొత్తం కలియతిరిగిన తరువాత స్వామివారు ఆ భక్తునితో, “సంతృప్తిగా ఉందా?” అని అడుగగా, అతను తనకు కలిగిన ఆనందాన్ని మాటలలో చెప్పడం కుదరక, కళ్ళ నీరు కారుస్తూ, హృదయం ఉప్పొంగి, తనకు స్వామివారు కలిగించిన అదృష్టానికి, వారి దయకు కృతజ్ఞతగా నేలపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు.

తమ వసతికి తిరిగొచ్చిన స్వామివారు సాయింత్రం భక్తులతో మాట్లాడుతూ, ఉదయం తాము కళాశాలకు వెళ్లోచ్చిన విషయం ప్రస్తావనకు రావడంతో ఒక వ్యక్తి స్వామివారిని, “పెరియవా, కళాశాలో మీరు ఆవు వెనుకగా ఎందుకు వెళ్ళారు?” అని అడిగాడు.

స్వామివారు చిరునవ్వుతూ, “అతను నాపై అత్యంత భక్తిభావం కలవాడు. నేను వస్తే అది కళాశాలకు మంచి అని నమ్మి నన్ను ఆహ్వానించాడు. కాని అది ఆడపిల్లలు చదివే కళాశాల. వారు అన్ని రోజులలోను కళాశాలకు వస్తారు. వారు దూరం ఉండాల్సిన సమయాలలో కూడా కళాశాలకు వస్తారు. అందుకే నేను ఒక ఆలోచన చేశాను. అతని కోరికను తీర్చాలి. నా అనుష్టానం, నియమపాలన కూడా కాపాడబడాలి. దానికి పరిష్కారం ఒక్కటే. మన శాస్త్రాలలో ఉన్నదాని ప్రకారం, ఎటువంటి అశౌచమైనా, ఎటువంటి స్థలమైనా గోవు డెక్కల నుండి వచ్చే ధూళి తగిలితే, ఆ స్థలం పవిత్రమవుతుంది. అందుకే ఆవును ముందు వదిలి నేను దాన్ని అనుసరించాను” అని బదులిచ్చారు.

స్వామివారు చెప్పిన విషయాన్ని విన్నవారందరూ స్థాణువులై నిలబడిపోయారు. ఇంతటి ధర్మసూక్ష్మము ఉంటుందా అని మనం అనుకోవచ్చు. ధర్మాన్ని, ఆశ్రమ నియమ పాలనను ఇంతగా పాటించే జీవితం ఉంటుందా అని మనం అనుకోవచ్చు. ఇలా దయను కూడా ధర్మంతో ముడిపెట్టి పాలించేవారు కంచి పరమాచార్య స్వామివారు కాక ఇంక ఎవరు ఉంటారు?

--- “కడవులిన్ కురల్” - తిరువారూర్ దివాకరన్. ‘కుముదం’ పత్రిక నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

Credit 👇

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Friday, April 24, 2020

ముందు పద్మావతీ కల్యాణం చెయ్యి

Chandrashekarendra Saraswati | MOA

కంచి పరమాచార్య స్వామివారిలో ఉన్న ఒక యోగి లక్షణాలను, అనన్యసామాన్యమైన నిరాడంబరతను కలిపి చూడడం మా అదృష్టం. వారి అవతార రహస్యాన్ని తెలుసుకున్న ఎందఱో భక్తులను స్వామివారు అనుగ్రహించారు.

ఆ ప్రత్యక్ష దైవాన్ని ప్రత్యక్షంగా సేవించి తరించే భాగ్యం పొందినవారిలో శ్రీమఠం బాలు ఒకరు. ప్రతిరోజూ వారి అవతారాన్ని తెలిపే అన్నో సంఘటనలను ప్రత్యక్షంగా చూశాడు. ఈ సంఘటను కూడా అతను చెప్పిన అనుభవాల్లో ఒకటి.
మరవక్కాడు రామస్వామి అనే భక్తునికి నలుగురు కూతుళ్ళు, ఇద్దరు కుమారులు. యుక్తవయస్సులో అతను ఏ విషయంలోనూ ఆసక్తి చూపకుండా, ఊరికే అక్కడా ఇక్కడా తిరుగుతుండడంతో, నెలవారీ ఆదాయం అంటూ ఏమి లేదు. వైదిక కర్మలలో పండితులకు సహాయం చెయ్యడంవల్ల లభించే కొద్ది మొత్తమే అతని కుటుంబానికి ఆసరా.

అతను నివసిస్తున్న గృహం తాతలనాటిది కావడంతో ఇంటికి అద్దె కట్టాల్సిన అవసరం లేదు. గ్రామ శివార్లలో అతనికి ఒక కొబ్బరితోట ఉంది. దాని నుండి వచ్చే ఆదాయమే వారికి తిండి పెడుతోంది.

పెద్దమ్మాయికి ఇరవైరెండేళ్ళు. తరువాతి అమ్మాయికి ఇరవైయ్యేళ్ళు. ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకే ముహూర్తంలో జరిపించేస్తే ఖర్చు కొద్దివరకు తగ్గుతుందని అతని ఆలోచన. కాని జరుగుతున్న సంఘటనలు దానికి ఊతమియ్యడంలేదు. పెద్దమ్మాయికి మంచి సంబంధం కుదరడంతో, త్వరగా పెళ్లిచేయ్యాలనే అతను ఇష్టపడడంతో, కొబ్బరితోట అమ్మడానికి నిశ్చయించుకుని ఒకరి వద్ద ధర కూడా నిర్ణయించేశాడు.

కాని అతను చేస్తున్న ఈ పని అన్నగారికి నచ్చలేదు. ఆ కొబ్బరితోట తరతరాలుగా వస్తున్నది కావడంతో, అందులో ఇతనికి భాగం ఉన్నది కాబట్టి, కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు. రామస్వామి అయ్యర్ కు ఏమీ పాలుపోలేదు. అసలే ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎలాగో కుమార్తె పెళ్లి జరిపించాలి అనుకున్నాడు. కాని అతని అన్న కొబ్బరితోట అమ్మకానికి అడ్డుపడ్డాడు. రామస్వామి చాలా చాలా బాధలో ఉన్నాడు.

ఇక తను చేసేదేంలేక కరుణా సముద్రుడైన పరమాచార్య స్వామివద్దకు పరిగెత్తుకుని వచ్చాడు. స్వామివారికి సాష్టాంగం చేసి నిల్చుని, గద్గదమైన స్వరంతో, కళ్ళ నీరు కారుతుండగా మొత్తం విషయం అంతా స్వామివారికి విన్నవించాడు. పరమాచార్య స్వామివారు అయిదు నిముషాల పాటు అతనివైపు చూసి, ఏమీ చెప్పకుండా ప్రసాదం ఇచ్చి పంపేశారు.

పెద్ద దుఃఖభారంతో వచ్చిన ఆ భక్తుడు నిరాశాపడ్డాడు. పరమాచార్య స్వామివారు కనీసం చిన్న మాట సాయంగా బాధపడకు అని కూడా చెప్పకుండా పంపించివేశారు అన్న బాధతో బయటకు వచ్చాడు. అతను బయటకు రాగానే, మహాస్వామివారిని సేవించుకునే అదృష్టం కల్గిన బాలు కనపడ్డాడు. దుఃఖం తన్నుకురావడంతో తన బాధను బాలుకు చెప్పుకున్నాడు. “పరమాచార్య స్వామివారు తలచుకుంటే ఏమైనా చెయ్యగలరు. మా అన్నకు అన్నీ ఉన్నాయి; పెద్ద ఇల్లు, ఆస్తి, ఐశ్వర్యం; ఎప్పుడూ యాత్రలలో ఉంటాడు; నేను ఎప్పుడూ ప్రత్యక్షంగా కలవలేను; నా వల్ల చెయ్యడం కాకపోయినా ఎపుడూ మా న్నాన్నగారి ఆబ్దికానికి కూడా పిలవడు; ఎంతో కష్టపడి నా కుమార్తె పెళ్లి చేద్దామనుకుంటే, ఇలా చేశాడు”

మొత్తం విన్న తరువాత “ఇదంతా ఎందుకు స్వామివారితో చెప్పలేదు?” అని అడిగాడు బాలు. “నేను మొత్తం చెప్పాను, పరమాచార్య స్వామివారు సాంతం విన్నారు. కేవలం విభూతి ప్రసాదం ఇచ్చారు కాని ఏ ‘అనుగ్రహం’ ఇవ్వలేదు” అని బదులిచ్చాడు రామస్వామి.

ఎంతో బాధతో తన గోడు చెప్పుకున్న రామస్వామిని చూసి, పెరియవా ఇలా చెయ్యకుండా ఉండాల్సింది అనుకున్నాడు బాలు. అందరిపై కరుణను ప్రసరించే మహాస్వామి, రామస్వామిని ఇలా వదిలేయరాడు కదా! అందునా పేదవాడైన రామస్వామిపై స్వామివారి కరుణ దయ అపారమైనవి కదా! అని అనుకున్నాడు.

“ఏమి బాధపడవద్దు. నీ సమస్యను స్వామివారికి వదిలి ఏం జరగాలో అది చూడు. ఎలాగో స్వామివారే నిన్ను కాపాడుతారులే” అని అతణ్ణి స్వాంతనపరచి పంపాడు బాలు.

కొన్ని రోజులు గడిచిపోయాయి. ‘ఉపన్యాస చక్రవర్తి’ శ్రీ మార్గబంధు శాస్త్రి పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చారు. అతని ఐశ్వర్యము, యశస్సు అతను ధరించిన తెల్లని పట్టుపంచె, జరి అంచు ఉన్న అంగవస్త్రం, బంగారుతో అల్లిన రుద్రాక్షమాల, నవరత్నాల హారంలో కనపడుతోంది. మహాస్వామివారు గంటల తరబడి వివిధ అంశాలపై వారితో మాట్లాడేవారు. వారు ఎప్పుడు వచ్చినా సాయింత్రాలు ఉపన్యాసం చెప్పమని స్వామివారు అడిగేవారు.

కాని ఈసారి ఎందుకనో ఎప్పటిలాగా లేదు. భార్యతో, ఇద్దరు శిష్యులతో కలిసి, చేతిలో ఉన్న పళ్ళెం నిండా పళ్ళతో వచ్చి నిల్చున్న ఆయన్ని పట్టించుకోకుండా స్వామివారు ఇతరులతో సంభాషిస్తున్నారు. “ఎందుకు ఇవ్వాళ ఇలా జరుగుతోంది. దేశంలోనే ప్రఖ్యాతిచెందిన ఉపన్యాస చక్రవర్తి వేచియున్నాడు; సరే స్వామివారికి చెబుదాం” అనుకుని, గట్టిగా స్వామివారికి వినపడేటట్లు, “మార్గబంధు శాస్త్రి వచ్చారు” అని చెప్పాడు.

స్వామివారి చూపు ఇటువైపు పడ్డట్టుగా అన్పించడంతో, అటువంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న మార్గబంధు శాస్త్రి పళ్ళ తట్టను స్వామివారికి సమర్పించి, “చాలాకాలం తరువాత ఏడెనిమిది రోజులదాకా నాకు ఎటువంటి కార్యక్రమాలు లేవు. అందుకేనే తిరుమలకు వెళ్తున్నాను. ‘శ్రీనివాస కల్యాణం’ చేయించా

లని నా భార్య కోరిక. అందుకనే వెంటనే బయలుదేరాము. పరమాచార్యుల వారి అనుగ్రహంతో మేము ‘శ్రీనివాస కల్యాణం’ చేయించాలని అనుకుంటున్నాము” అని చెప్పాడు.

పరమాచార్య స్వామివారు అతనివైపు చూడనుకూడా లేదు. కనీసం అతని మాటలు కూడా వినలేదు. చుట్టూ ఉన్నవారితో ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతున్నారు, కాని దాదాపు అరగంటపాటు మార్గబంధు శాస్త్రితో మాట్లాడలేదు.

స్వామివారికి గుర్తుచేయాలని “శాస్త్రి అక్కడ నిలబడి ఉన్నారు” అని మరలా చెప్పాడు బాలు.

‘పరమాచార్య స్వామివారు నన్ను ఆశీర్వదించి, తిరుమలకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాళ నన్ను ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారని’ తలచి, “అవును. పెరియవా నన్ను అనుగ్రహించాలి. ‘శ్రీనివాస కల్యాణం’ చేయించడానికి ఈరోజే తిరుమలకు వెళ్తున్నాను” అని అర్థించాడు.

వెంటనే మహాస్వామివారు లేచి, “ముందు పద్మావతీ  కల్యాణం చెయ్యి” అని చెప్పి లోపలకు వెళ్ళిపోయారు. దీనంతటినీ గమనిస్తున్న అక్కడున్నవారికి ఇది విపరీతంగా తోచింది.

‘శ్రీనివాస కల్యాణం’ అంటే ‘పద్మావతీ  కళ్యాణమే’ కదా! అంటే “తిరుమలలో శ్రీనివాస కల్యాణం చేయించేవారందరూ తిరుచానూరు వెళ్లి పద్మావతీ కల్యాణం చేయించమనా స్వామి వారి ఆదేశం”

దీనికి అర్థమేంటో మార్గబంధు శాస్త్రికి కూడా అర్థం కాలేదు. “ఎందుకు పరమాచార్య స్వామివారు ఇటువంటి ఆదేశాన్ని ఇచ్చి లోపలకు వెళ్ళిపోయారు” అని ఆలోచిస్తూ నిలబడిపోయాడు. కాని వెంటనే దాని అర్థమేంటో, అంతరార్థమేంటో స్వామివారే స్ఫురింపచేశారు.

మరో రెండు నెలలు గడిచిపోయాయి. పరమ సంతోషం నిండిన మొహంతో రామస్వామి అయ్యర్ పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చాడు. తన కుమార్తె పెళ్లి పత్రికను స్వామివారికి సమర్పించడానికి వచ్చాడు ఈసారి.

“అంతా పరమాచార్య స్వామివారి అనుగ్రమ వల్లనే. నా కుమార్తె పెళ్లి ఖర్చు మొత్తం భరించడానికి మా అన్న ఒప్పుకున్నాడు. కేవలం కన్యాదానం చెయ్యడం మాత్రమే నా బాధ్యత అని మిగినదంతా తను చూసుకుంటానని నాతో చెప్పాడు. కొబ్బరితోట పైన వేసిన కోర్టుకేసు కూడా వెనక్కుతీసుకున్నాడు. నా చిన్న కుమారునికి ఉపనయనం చేసి, తన శిష్యునిగా తీసుకుంటానని చెప్పాడు. మా అన్నయ్య ఇలా మారిపోతాడని నా కలలో కూడా అనుకోలేదు. ఇదంతా పరమాచార్య స్వామివారి అనుగ్రహం వల్లనే సాధ్యమయ్యింది” అని చెప్పుకుంటూపోయాడు. కాని పరమాచార్య స్వామివారు ఎలా అనుగ్రహించారో అతనికి తెలియదు.

మహాస్వామివారు చెయ్యెత్తి ఆశీర్వదించి, ప్రసాదం ఇచ్చి పంపారు. రామాస్వామి అయ్యర్ బయటకు రాగానే, మరలా బాలు తారసపడ్డాడు. “రామస్వామి! ఏంటి నీ చేతిలో? పెళ్లి పత్రికా? నీ కుమార్తెదా? నీవద్ద ఒక్క పైసా కూడా లేదని చెప్పావు కదా?” అని అడిగి, రామస్వామి ఇచ్చిన పత్రిక తీసుకున్నాడు.

ఇది ఇలా ఉంది, “. . . . . సౌభాగ్యవతి పద్మావతి, మరవక్కాడు జగదీశ్వర శాస్త్రి మనవరాలు, నా తమ్ముడు చిరంజీవి రామస్వామి పెద్ద కుమార్తె. . .” చివరన ఇట్లు “మీ భవదీయుడు, మార్గబంధు శాస్త్రి”

బాలు ఆశ్చర్యంతో నోట మాటరాక నిశ్చేష్టుడయ్యాడు.

రెండు నెలల క్రితం పరమాచార్య స్వామివారు మార్గబంధు శాస్త్రికి చెప్పినదానికి అర్థం ఇదా! రామస్వామి అన్న ఈయనే అని స్వామివారికి తెలిసి ఉండవచ్చు. కాని రామస్వామి పెద్ద కుమార్తె పేరు పద్మావతి అని ఎలా తెలుసు?

పరమాచార్య స్వామివారికి అంతా తెలుసు అన్న నిజంలో ప్రత్యేకత ఏమి లేదు. ఆ ప్రత్యక్ష దైవానికి అనుగ్రహించడం తప్ప ఇంకేం తెలుసు. ఇటువంటి అనుగ్రహానికి పాత్రులైన ఆ భక్తులు ఎంతటి యశస్సును పొందుతారో మనం ఊహించగలమా?

కరుణాసముద్రుల కరుణ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది.

--- “శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా మహిమై” పత్రిక నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Friday, April 17, 2020

కమలాపండు రసం తాగు

What Life has taught Me : Paramacharya talks about Himself…



1957 అక్టోబరు 10న డిఫెన్స్ అకౌంట్స్ డిపార్టమెంట్ లో అప్పర్ డివిజన్ క్లార్క్ గా చేరడానికి నేను పూణే వెళ్ళాల్సిఉంది. పరమాచార్య స్వామివారు పశ్చిమ మాంబళంలోని రామకృష్ణపురంలో మకాం చేస్తున్నారని అనుకోకుండా నాకు తెలిసింది. అప్పుడు నేను ప్యాంటు చొక్కా వేసుకున్నాను. అవకాశం వాడులుకోరాదని అలాగే వెళ్లి 1957 అక్టోబరు 9న స్వామివారి దర్శనం చేసుకున్నాను. చొక్కా తెసివేసి స్వామివారికి ప్రణమిల్లాను. వారి ఆశీస్సులతో పూణేకు ప్రయాణమయ్యాను. ఇప్పుడు క్లాస్ ఒన్ ఉద్యోగిగా పదవీవిరమణ చేశాను.

1968లో మా చెల్లెలి ఆరోగ్యం క్షీణించి తంజావూరు మెడికల్ హాస్పిటల్ లో తనని చేర్పించాము. తంజావూరు నుండి పూణేకు తిరిగివెళ్తూ పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళ్లాను. అప్పుడు స్వామివారు మౌనంలో ఉన్నారు. వారి సేవకుల ద్వారా కొన్ని పళ్ళు సమర్పించి నా చెల్లెలి పరిస్థితిని స్వామివారికి తెలిపాను. మహాస్వామివారు ఒక కమలాపండును తీసుకుని దాన్ని మా చెల్లెలికి ఇమ్మని ఆదేశించారు. నేను పూణేకు వెళ్తున్నానని, తంజావూరుకు వెళ్ళడం లేదని స్వామివారికి చెప్పాను. ఆ కమలాపండును రసం తీసి తన బాగుకోసం నన్ను తాగమని ఆజ్ఞాపించారు. నేను పూణే చేరుకోగానే మా చెల్లెలి ఆరోగ్యం మెరుగై, ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చిందని ఉత్తరం వచ్చింది. ఇది నాకు చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. ఎందుకంటే, నేను తంజావూరు నుండి వచ్చేటప్పుడు తనపై ఆశలు వదులుకోవాలని చెప్పారు అక్కడి వైద్యులు.

1985లో నేను యాభైలోకి అడుగుపెడుతున్నప్పుడు నా భార్య, అత్తగారితో కలిసి పరమాచార్య స్వామి దర్శనానికి వెళ్లాను. నా భార్య తాతగారైన కల్యాణపురం అడ్వకేట్ నవనీతం సారంగపాణి అయ్యంగార్, 1920లలో కుంబకోణం మఠంలో పరమాచార్య స్వామివారికి పెద్ద భక్తులు. నా భార్య వారి పేరు చెప్పగానే, కొద్దిసేపు మౌనం. ఆశ్చర్యకరంగా వెంటనే స్వామివారు తనని పిలిచి, సారంగపాణి అయ్యంగార్ తో జరిగిన ఎన్నో విషయాలను తెలిపి, మా గురించిన విషయాలను అడిగి ఆశీర్వదించారు. పరమాచార్య స్వామివారికి కొన్ని వేలమంది భక్తులు ఉన్నప్పటికీ, యాభై ఏళ్ల తరువాత ఒకరి గురించి ఇంతగా చెబుతున్నారంటే ఇది నిజంగా నమ్మశక్యం కాదు.

--- ఆర్. కృష్ణన్, I.D.A.S(రిటైర్డ్). “kamakoti.org” నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Saturday, July 27, 2019

శివాజి గణేశన్ ఔదార్యం

Image result for sivaji ganesan donate elephant


మీరు ‘తిరువరుత్ చల్వర్’ సినిమాలో అప్పర్ (63 నాయనార్లలోని నాల్వర్లు సుందర్, అప్పర్, జ్ఞానసంబంధర్, మాణిక్యవాచకర్ లలో ఒకరు) గా చేశారు. ఆ దృశ్యాలు ఇప్పటికి మామనస్సులో ముద్రవేశాయి. ఈ పాత్ర చెయ్యడానికి మీకు కంచి పరమాచార్య స్వామివారు ప్రేరేపణ అని చెప్పారు కదా! అది కొంచం వివరిస్తారా? అని ఒక పాత్రికేయుడు శివాజి గణేశన్ ని అడిగాడు.

నటనలో రాణించాలంటే నటులకు సూక్ష్మపరిశీలన చాలా అవసరం అని నా అభిప్రాయం. నేను నా చుట్టూ ఉన్న పరిసరాలని, వ్యక్తులని బాగా గమనిస్తుంటాను. నేను అప్పర్ గా నటించాను కాబట్టి, ఒక పాతకాలంనాటి శివభక్తుని గుణాలను చూపించాలి, అతని వేషధారణ, ఆహార్యము మొదలైనవి.

పరమాచార్య స్వామివారు నన్ను దర్శనానికి రమ్మన్నారని నాకు ఒకరోజు శంకరమఠం నుండి కబురు వచ్చింది. అప్పుడు స్వామివారు మైలాపూర్ లోని మఠంలో ఉన్నారు. నాకు సరిగ్గా గుర్తుంటే ఆ మఠం కర్పగాంబళ్ కళ్యాణమంటపం పక్కనే ఉంటుంది.

నేను, నా భార్య, అమ్మానాన్న నలుగురం కలిసి స్వామివారి దర్శనానికి వెళ్ళాము. మేము మఠానికి వెళ్ళగానే మమ్మల్ని ఒక గదిలో కూర్చోమని చెప్పారు. దాదాపు ఒక గంటసేపు ఉన్నాము అనుకుంటా. అప్పుడు స్వామివారి ఎదో ఉపన్యాసం చెబుతున్నారు. హఠాత్తుగా కరెంటు పోవడంతో అంతా గాఅఢాంధకారంగా మారిపోయింది.

స్వామివారు చేతిలో ఒక చిన్న దీపంతో మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు. నిదానంగా కూర్చుని కళ్ళపైన చేతులనుంచుకొని మా వైపు చూస్తున్నారు.

”నువ్వు శివాజి గణేశన్ కదూ?” అని అడిగారు.

”అవును స్వామి నేనే” అని బదులిచ్చి నేలపై పడి స్వామివారికి సాష్టాంగం చేసి వారి ఆశీస్సులు తీసుకున్నాను. అమ్మానాన్న, నా భార్య కూడా స్వామికి నమస్కరించారు.

“మిమ్మల్నందరిని చూడటం చాలా సంతోషంగా ఉంది” అన్నారు స్వామి. తారువాత స్వామివారు:

“నేను తిరుపతి, తిరువణైక్కావల్, తంజావూరులోని పున్నైనల్లూర్ మారియమ్మన్ దేవాలయం వంటి చోట్లకి వెళ్ళినప్పుడు ఆలయ ధర్మకర్తలు నాకు ఏనుగుల చేత పుష్పమాలలు వేయించారు. దేవస్థానానికి ఈ ఏనుగులని ఎవరు ఇచ్చారు అని అడిగగా వారు ‘శివాజి గణేశన్’ అని చెప్పారు.

దేశంలో చాలామంది ధనవంతులున్నారు. ప్రచారం కోసం వారు దేవాలయాలకు ధనం ఇస్తారు. కాని దేవాలయాలకు ఏనుగులను ఇవ్వాలంటే దానికి ఉదారమైన గుణం ఉండాలి. అది నీలో ఉంది.

నిన్ను కన్న నీ తల్లితండ్రులు అదృష్టవంతులు. మీ తల్లితండ్రుల కోసం నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తాను.” అని చెప్పి స్వామివారు లేచి లోపలికి వెళ్ళారు.

ఆ సమయంలో నేను ఎంత ఆనందానికి లోనయ్యుంటానో ఆలోచించండి. ఎంతటి ఆశ్చర్యకరమైన అనుగ్రహం అది! అలోచించండి ఒకసారి.

చెప్పలంటే నాకు జీవితంలో భయం అనేది లేదు. భయం అన్నది నేనెరుగను. ప్రత్యేకించి నాకు స్వామివారి అనుగ్రహం ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి. అంతా వారు చూసుకుంటారు.

బహుశా ఈ సంఘటన నాపైన ప్రభావం చూపింది అనుకుంటా. స్వామివారు అలవాట్లని చాలా క్షుణ్ణంగా గమనించాను. కాబట్టి ఆ సూక్ష్మ పరిశీలన వల్లే ఆ సినిమాలో అప్పర్ లా నటించగలిగాను.

--- ‘నడిగర్ తిలగమ్’ శివాజి గణేశన్ ఆత్మకథ నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Wednesday, July 24, 2019

అయ్యంగార్ స్వామి అలక


Related image
ప్రతి శుక్రవారం కంచి మఠంలో విద్వత్ సదస్సు జరుగుతుంది. పండితులందరూ వివిధ విషయలపైన చర్చించుకుంటారు. చివరికి పరమాచార్య స్వామివారు చివరిగా వివరణ ఇస్తారు. అలాగే పండితులందరికి స్వామివారు సన్మానం అంటే దక్షిణ ఇస్తారు.

అలాంటి ఒకరోజున చిన్నకాంచీపురం నుండి ఒక అయ్యంగారు పండితులు వచ్చారు. పరమాచార్య స్వామికి నమస్కారములు చేసి స్వామివారు ఇచ్చిన డబ్బులను తీసుకున్నారు. కాని దానితో అతను తృప్తి చెందలేదని అతని హావభావాలు చెబుతున్నాయి. మహాస్వామి వారు దాన్ని గమనించి, “ఏమి అయ్యంగార్ స్వామివారు సంతోషమే కదా?” అని అడిగారు. ఆయన అవును అని ముభావంగా చెప్పి వెళ్ళిపోయారు.

మిగిలిన పండితుల తరువాత సామాన్య భక్తులు స్వామి దర్శనానికి వచ్చారు. మొదట ఉన్నది కుటుంబంతో సహా ఉన్న ఒక న్యాయవాది. ఆయన ఒక పళ్ళెంలో పళ్ళు, పూలు, జీడిపప్పు మొదలైనవి తీసుకుని వచ్చి స్వామివారి ముందు పెట్టి “పెరియవ ఒక విన్నపం” అని అన్నాడు.

మహాస్వామివారు అతణ్ణి ఊరకే ఉండమని చెప్పి, ఒక శిష్యుణ్ణి పిలిచి “వెళ్ళి ఆ అయ్యంగార్ స్వామిని పిలుచుకుని రా. చిన్న కాంచీపురం వెళ్ళడానికి బస్సులో కూర్చుని ఉంటాడు” అని చెప్పారు. ఆ శిష్యుడు గంగై కొండన్ బస్టాండుకు వెళ్ళి చూడగా ఒక బస్సులో కూర్చుని కనిపించారు. మహాస్వామివారు తనను రమ్మన్నారని ఆ అయ్యంగార్ స్వామితో చెప్పాడు ఆ శిష్యుడు.

”నేను ముప్పై పైసలు పెట్టి టికెట్టు కొన్నాను. నేను ఇప్పుడు అక్కడికి వస్తే నాకు ముప్పై పైసలు నష్టం” అని చెప్పాడు ఆ స్వామి. దీన్నంతా గమనిస్తున్న బస్ కండక్టరు వెంటనే, “ఏంటి స్వామి, పరమాచార్య దర్శనం కోసం దేశవిదేశాల నుండి వస్తారు. మీరు చూస్తే స్వామివారే రమ్మంటుంటే వెళ్ళనంటున్నారు. ఆ టికెట్టు ఇలా ఇవ్వండి మీ ముప్పై పైసలు మీకు తిరిగిస్తాను. ఏదో ముఖ్యమైన విషయమేమో, వెళ్ళి స్వామివారి కలవండి” అని చెప్పాడు.

ఆ అయ్యంగార్ స్వామి టికెట్టు వెనక్కిచ్చి, ముప్పై పైసలు తీసుకుని బస్సు దిగి ఆ శిష్యుడితో పాటు వెళ్ళాడు స్వామివారిని చూడటానికి. మహాస్వామివారు నవ్వుతూ, “ఏమి అయ్యంగార్ స్వామివారు! మీ ముప్పై పైసలు త్రిగివ్వకపోతే బస్సు దిగి ఇక్కడికి రారా ఏమి?” ఇది విని అతను నోరెళ్ళబెట్టాడు. స్వామివారికి ఎలా తెలుసు ఆ విషయం?

పక్కనున్న న్యాయవాది మళ్ళీ మొదలెట్టాడు, “పెరియవ ఒక విన్నపం . . ”

మహాస్వామివారు ఉండు అని చెప్పి అయ్యంగార్ స్వామిని న్యాయవాది పక్కన కూర్చోమన్నారు. ఆ స్వామి చిరునామా తీసుకోవలసిందిగా ఆ న్యాయవాదికి చెప్పారు. తరువాత ఆయ్యంగార్ స్వామితో, “తరువాతి బస్సు సిద్ధంగా ఉంది వెళ్ళమని చెప్పారు”

అతనికి ఏమి అర్థం కాక వెళ్ళిపోయాడు.

న్యాయవాది మరలా, “పెరియవా. . .” అని మొదలు పెడుతుండగా స్వామివారే “ఏమప్పా! ప్రతి నెలా వేదం చదివిన ఒక పేద బ్రాహ్మణుడికి కొంత ధనం ఇవ్వాలి అని కదా అనుకుటున్నావు. అంతేనా?” అని అడిగారు. అతను కొద్దిసేపు చేష్టలుడిగి తరువాత తేరుకుని, “అవును పెరియవ” అని బదులిచ్చాడు.

“నీకు తెలుసా, నేను ఆ అయ్యంగార్ స్వామి చిరునామా తీసుకోమన్నది అందుకే. ప్రతి నెలా మరువకుండా రూ.250/- పంపు. నువ్వు కొద్ది నెలల తరువాత నిలిపివేస్తే అతను మరలా ఇక్కడకు వస్తాడు. అతను చాలా మంచివాడు, పండితుడు. కాని పేదవాడు అంతే” అని చెప్పారు.

న్యాయవాది అందుకు ఒప్పుకుని, కుటుంబ సమేతంగా స్వామివారికి సాష్టాంగం చేసి వెళ్ళిపోయారు. ఆ అయ్యంగార్ కి స్వామి ప్రతినెలా డబ్బు అందుతోందా లేదా అని తమ శిష్యుల ద్వారా కొన్ని నెలల పాటు విచారణ చేశారు స్వామివారు.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Saturday, July 20, 2019

శ్రేష్టిదార్ అని పిలవొచ్చునా?

Image result for sri chandrasekharendra saraswathi mahaswamy

నేను కాంచీపురంలోనే ఉండడంవల్ల ప్రతిరోజూ మహాస్వామివారి దర్శనభాగ్యం దొరికేది. ఒకసారి శ్రీమఠంలో ఎదో ఆరాధన సoదర్భoగా కావల్సినంత మంది వైదికులు దొరకకలేదు. పరమాచార్య స్వామివారు నాపేరు సిఫారసు చేసి వేరే వాళ్లతో పాటుగా ఆ కార్యక్రమంలో వైదికునిగా పాలుపంచుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించారు. భోజనాలు అయిన తరువాత నన్ను పిలిచి సహస్ర గాయత్రి చెయ్యమన్నారు. ఆ ఆరాధనలో వైదికునిగా పాల్గొన్నదానికి పరిహారంగా.

నాకు చెంగల్పేట్ న్యాయాలయానికి బదిలీ అవ్వడంతో నాకు పరమాచార్య స్వామివారి దర్శన భాగ్యం తగ్గిపోయింది. కాబట్టి ప్రతి నెల అనుషం (స్వామివారి జన్మ నక్షత్రమైన అనూరాధ నక్షత్రం) రోజు కాంచీపురానికి వెళ్ళి కామాక్షి అమ్మవారి ఆలయంలో త్రిశతి అర్చన చెయ్యించి, ప్రసాదాన్ని పరమాచార్య స్వామివారికి సమర్పించి వారిని దర్శించుకొనేవాణ్ణి. ఒకసారి అలా వెళ్ళగా శ్రీమఠం ఆరోజు భక్తులతో చాలా రద్దీగా ఉంది. దర్శించుకుని బయటకు వచ్చే భక్తులవద్ద ఉన్నాను నేను. మహాస్వామివారు దగ్గర ఉన్న సేవకునితో “శ్రేష్టిదార్ ని పిలువు” అని ఆదేశించారు.

కొంతమంది మా గుంపువైపు “శ్రేష్టిదార్ శ్రేష్టిదార్” అని అరిచారు. ఎవరో నన్ను తీసుకునివెళ్ళి మహాస్వామివారి ముందు నిలబెట్టారు. వారు స్వామితో, “శ్రేష్టిదార్ ఎవరూ లేరు. కోర్టు నుండి ఈ పెద్ద గుమాస్తా ఉన్నారు” అని చెప్పారు. నేను స్వామితో, “పెరియవ నేను శ్రేష్టిదార్ ను కాను, హెడ్ క్లర్క్ ని అని చెప్పాను”.

కాని స్వామివారు పట్టుబట్టి “ఎందుకు నువ్వు శ్రేష్టిదార్ కాకూడదు?” అని అడిగారు.

నేనూ ఖచ్చితంగానే సమాధానం చెప్పాను. “నాకు దానికి కావాల్సిన విద్యార్హతలు లేవు. నేను కేవలం SSLC ముగించాను. నా కిందన ఉన్నవాళ్ళు న్యాయశాస్త్రంలో BA.,BL, MA.,BL మొదలైనవి పూర్తిచేసినవారు. కాబట్టి విదార్హతలను బట్టి నాకు రాదు. అదీగాక, బెంచిలో ఉన్న జిల్లా న్యాయాధికారి పరమ కఠినుడు కనుక నా పేరును సిఫారసు చెయ్యడు. కాబట్టి నేను శ్రేష్టిదార్ ను కాలేను” అని చెప్పాను. స్వామివారు నాకు వెళ్ళడానికి అనుమతినిచ్చారు.

కొన్నిరోజుల తరువాత చెన్నై న్యాయాలయం నుండి కొంతమంది తనిఖీకి వచ్చారు. వారు నా శక్తి సామర్థ్యాలను పరిశీలించి హైకోర్టు జడ్జికి ఒక రహస్య నివేదిక సమర్పించారు. కొన్నిరోజుల తరువాత నన్ను శ్రేష్టిదార్ గా చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. అందరికి ఆశ్చర్యం కలిగింది ఇది ఎలా సాధ్యం అని. కేవలం విద్యార్హతలను బట్టే ఉన్నత పదవులిస్తారు అనుకునే వారికి ఇది ఒక గుణపాఠం.

ఈలోగా, నేను తరువాతి అనుషానికి కాంచీపురం వెళ్ళాను. పరమాచార్య స్వామివారి ముందు కామాక్షి అమ్మవారి ప్రసాదం పెట్టగానే స్వామివారు చెయ్యెత్తి తమ తలపై ఉంచుకుని శ్రేష్టిదార్ (‘హెడ్’, ‘చీఫ్’) అని అర్థం స్ఫురించేట్టుగా నాకు చూపిస్తూ “ఇప్పుడు నిన్ను శ్రేష్టిదార్ అని పిలవొచ్చునా?” అని అడిగారు.

స్వామివారు అలా అనగానే నా వొళ్ళు గగుర్పాటుకు గురి అయ్యింది. నేను ఏమీ మాట్లాడలేకున్నాను. నేను చెయ్యగలిగింది ‘దైవం మానుష రూపేణా’ అన్నట్టుగా నా ఎదురుగా ఉన్న సర్వేశ్వరునికి సాష్టాంగం చేసి నా కన్నీళ్లతో వారి పాదపద్మములను కడగడమే. వారే నాకు ఉద్యోగోన్నతి కల్పించినవారు. జరగబోయేది ఏమిటో ఆ దైవానికే తెలుసు అని ఆరోజే నాకు అర్థం అయ్యింది.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

--- పి.కె రామనాథన్, చెన్నై. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 6

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Wednesday, July 17, 2019

అత్యవసర చికిత్స

Image result

కుంభకోణ మఠంలో చంద్రమౌళీశ్వర పూజ పూర్తైన తరువాత, పరమాచార్య స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.

శ్రీమఠంతో సంబంధం ఉన్న ఒక రైతు ఆత్రుతగా స్వామివారి వద్దకు పరిగెత్తుకుని వచ్చి, స్వామివారి పాదాలపై పడి విలపించసాగాడు, “నా కుమారుణ్ణి కాపాడండి దేవుడా!” అని.

ఏమి జరిగిందో కనుక్కోమని సహాయకునికి చెప్పారు స్వామివారు.

ఆ రైతుకి ఉన్నది ఒక్కడే కొడుకు. ఆ పిల్లవాడు ఆహారం తింటున్నప్పుడు, ఒక పాము అతని శరీరంపై పాకి వెళ్లిపోవడం వల్ల భయంతో మూర్చిల్లాడు. పాము కరిచిందో లేదో తెలియడంలేదు. సాధారణంగా పాము కాటుని మంత్రంతో పోగొట్టే ఒక పధ్ధతి ఉంది. కాని ఆ మంత్రం తెలిసిన వారు దగ్గరలో ఎవరూ లేరు.
“సామి మాత్రమే వాణ్ణి కాపాడాలి . . .”

మహాస్వామివారు విభూతి ప్రసాదాన్ని ఇచ్చారు. “ఆ పిల్లవాని నుదురుపై పూయండి”.

“సరే సామి”

“మీ ఇంట్లో శీకాయ పుడి ఉందా?”

“ఉంది సామి” అని తలూపాడు.

“పిల్లవాని పెదాలు వేరుచేసి, కొద్దిగా శీకాయ పొడి వేసి చిన్నగా రుద్దండి. చేదుగా ఉందని పిల్లవాడు ఉమ్మివేస్తే, పాము కరవలేదని అర్థం. తీయగా ఉన్నదని లోపలి తీసుకుంటే, పాము కరచిందని అర్థం. దాని ప్రకారంగా చికిత్స చెయ్యాలి. వెళ్లి పిల్లవాడికి శేకాయ పొడి ఇవ్వు”

ఆ రైతు పరుగున ఇంటికి వెళ్లి స్వామివారు చెప్పినట్టుగా చేశాడు. శీకాయ పొడిని నోటిలో వెయ్యగానే, “చేదు, చేదు” అని ఉమ్మేశాడు. పాము కరవలేదని ఆ రైతు చాలా సంతోషపడ్డాడు.

పరిస్థితి చక్కబడిన తరువాత ఆ రైతు కుటుంబంతో సహా స్వామివారి దర్శనానికి వచ్చారు. ఆ రితు భార్యతో స్వామివారు, “ప్రతి రోజూ ఇంటిలో నువ్వుల నూనె దీపాన్ని వెలిగించు” అని చెప్పారు.

--- శ్రీమఠం బాలు మామ. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Saturday, July 13, 2019

మృష్టాన్నభోజనం


ఈరోజుల్లో టీవీలలో ఎన్నో వంటల కార్యక్రమాలు వస్తున్నాయి. ఆ కార్యక్రమాల్లో ఇచ్చే సూచనలను  సరిగ్గా అర్థం చేసుకుని వండితే, చివరగా తయారయ్యే పదార్ధం తినడానికి యోగ్యంగా ఉంటుందా? అది అనుమానమే.

కొత్త వంటకాలు ఏవీ లేకపోతె, సాధారణంగా చేసే మునక్కాయ సాంబారు లేదా బెండకాయ తాలింపు చేసే విధానాన్నే ఉపయోగించి కొత్త వంటలు చేస్తారు.

స్వామివారు పూర్వాశ్రమంలో ఎన్నడూ వంటింటికి వెళ్ళలేదు; సన్యసించిన తరువాత ఇక వెళ్ళాల్సిన అవసరం లేదు. కాని స్వామివారికి నలభీమపాకంలోని మెళకువలన్నీ తెలుసు. అంతేకాక కొత్త కొత్త వంటలు ఎలా చెయ్యాలో కూడా మంచి నేర్పు.

మేము పండరీపురం నుండి తిరిగొస్తున్నాము. అయిదారు చిన్ని గుడిసెలు ఉన్న ఒక కుగ్రామానికి చేరుకున్నాము. ఒక పెద్ద చెట్టు కింద మకాం ఏర్పాటుచేసుకున్నాము.

పరమాచార్య స్వామివారు భిక్ష పూర్తిచెయ్యగానే, మాకోసం కాస్త ఎక్కువగా వండిన పదార్థాలను ఆరగించి మా భోజనం కూడా పూర్తిచేశాము. అది మధ్యాహ్న విశ్రాంతి సమయం.

హఠాత్తుగా పెద్ద కోలాహలంతో ఇరవై మంది వ్యక్తులు వచ్చారు. వారందరూ చెన్నై ప్రాంతం వారు. శ్రీమఠం మకాం కాబట్టి శ్రీ చంద్రమౌళీశ్వర ప్రసాదంగా మంచి ఆహారం దొరుకుతునదన్న నమ్మకంతో అక్కడకు వచ్చారు.

కాని అప్పుడు శ్రీమఠం ఒక పెద్ద చెట్టు కింద మకాం చేసి ఉంది. వండడానికి కావాల్సిన సరుకులు, పాత్రలు కూడా లేవు. ఇటువంటి విషయాల గురించి మహాస్వామివారు ఎక్కువగా కలతచెందేవారు కాదు. ఆకలితో వచ్చిన వారి కడుపు నింపడమే స్వామివారి లక్ష్యం.

బ్రహ్మచారి రామకృష్ణన్ అని స్వామివారి ఆంతరంగిక సేవకుడు ఉండేవాడు. “అందరికి ఆహారం తయారుచెయ్యి” అని అతణ్ణి ఆదేశించారు స్వామివారు.
రామకృష్ణన్ చేతులు నలుపుతూ నిస్సహాయంగా నిలబడి, “మనం మన మకాం తరువాతి ఊరికి వెళ్ళినతరువాత వారికి వండి పెడతాను” అని తెలిపాడు.
ఇబ్బంది ఉందని పరమాచార్య స్వామివారు అర్థం చేసుకుని, “బియ్యం ఉందా?” అని అడిగారు.

“ఉంది; కాస్త పెసర పప్పు కూడా ఉంది”

“అయితే ఇంకేం! నువ్వు ఏం చేస్తావంటే, బియ్యాన్ని నానబెట్టి కడుగు, ఆ నీటిని మరొక పాత్రలో సేకరించు. డానికి కొద్దిగా ఉప్పు వేసి, నిమ్మకాయ పిండి, నారత్తై ఆకులను కత్తిరించి వెయ్యి. ఇది మజ్జిగ అవుతుంది.

పెసర పప్పుని ఎక్కువగా నీరు పోసి ఉడికించు. నీటిని పప్పును వేరుచేసి, ఆ వేడినీళ్ళకు నిమ్మకాయ వెయ్యి. ఇది రసం అవుతుంది.

ఇప్పుడు ఉడికించిన పెసర పప్పు ఉంది కదా! దానికి కాస్త ఉప్పు, కత్తిరించిన మిరపకాయలు వెయ్యి. అది తాళింపు అవుతుంది” అని ఆదేశించారు.

అరగంటలో మొత్తం సిద్ధం అయ్యింది. ఈలోగా మేము అతిథులకి భోజనానికి ఆకులు, నీరు సమకూర్చాము. మొత్తానికి షడ్రుచుల నాలుక కోసం అన్నం, పెసర పప్పు తాళింపు, రసం, మజ్జిగ తయారుచేసాము.

“ఇది మృష్టాన్న భోజనం” అన్నారొక అతిథి.

“దేవామృతం” అని మరొకరు చెప్పారు.

“ఇంతటి రుచికరమైన భోజనాన్ని ఇంతకుముందెన్నడూ తినలేదు” అన్నారు మూడవవారు.

ఆ మాటలను విని మాలో మేము నవ్వుకున్నాము. అది పరమాచార్య స్వామివారి వాక్కు వల్ల కలిగిన రుచి అని మాకు తెలుసు.

ఆతిథ్యం అన్నది పరమాచార్య స్వామివారిని చూసే నేర్చుకోవాలి. అది ఒక అక్షయ పాత్ర.

--- శ్రీమఠం బాలు. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 4

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Wednesday, July 10, 2019

మంగళసూత్రం - సుమంగళి


Image result for sri chandrasekharendra saraswathi mahaswamy

పాలక్కాడ్ జిల్లాలోని మంజపర బ్రాహ్మణ సమూహానికి చెందిన ఆర్.జి. వెంకటాచలం కంచి మఠానికి పెద్ద భక్తుడు. చాలా పెద్ద పెద్ద పదవులనలంకరించి ఇప్పుడు చెన్నైలో జీవిస్తున్నారు. కాని తమ జన్మస్థలం అంటే వల్లమాలిన అభిమానం. దాదాపు యాభైలక్షల రూపాయలు విరాళాలు సేకరించి మంజపరలోని గురువాయురప్పన్ దేవస్థానాన్ని పునరుద్ధరింంచారు. వారికి పరమాచార్య స్వామివారితో అనుభవాలు కోకొల్లలు. భక్తిపారవశ్యంతో వారు ఎప్పుడూ ఈ సంఘటనను గుర్తు చేసుకుంటారు.

ప్రతి సంవత్సరమూ వారు పరమాచార్య స్వామివారి అనుగ్రహం కోసం వచ్చేవారు భిక్షావందనంతో. 1988లో రహదారుల ప్రయాణానికి కొంచం ఆటంకం ఏర్పడడంతో ఆయన రావాల్సిన రోజుకు రారు అని అందరూ తలచారు. కాని ఏలాగో వారు కాంచీపురం చేరుకున్నారు. స్వామివారి దర్శన సమయంలో అతణ్ణి, “నీ సంపాదన ఎంత?” అని అడిగారు. వారు సమాధానం చెప్పగానే వారికి స్వామివారి ఆదేశం అందింది.

”నువ్వు ఇక ఎప్పుడు భిక్షావందనం చెయ్యడానికి వచ్చినా, కొన్ని మంగళసూత్రాలను చెయ్యించి నీతోపాటు తీసుకుని రా” అని చెప్పారు.

ఆయన కొద్దిగా అలోచనలో పడ్డారు. ఏ సాంప్రదాయాన్ని అనుసరించి మంగళసూత్రాలను చెయ్యించాలి. స్మార్త, తెలుగు, అయ్యర్ ఇలా చాలా చాలా ఉన్నాయి కదా. ఏ రకంగా తయారు చేయించాలి? ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది అని.

వెంటనే స్వామివారు “ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏ సంప్రదాయమైనా పరవాలేదు. తీసుకుని రా” అని చెప్పారు. వెంకటాచలం ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అతను ఈ విషయమై తన మనసులో ఆలోచిస్తున్నాడు. స్వామివారిని అడగనేలేదు. మరి స్వామివారికి ఎలా తెలిసిసింది? అడగకముందే స్వామివారు సమాధానం ఇవ్వడం అతణ్ణి ఆశ్చర్యచకితుణ్ణి చేసింది.

ఈ సంఘటన జరిగి మూడు సంవత్సరాలు గడిచిపోయింది. ప్రతి సంవత్సరం లాగే ఆ సంవత్సరం కూడా భిక్షావందనానికి శ్రీమఠానికి వచ్చారు. ఆరోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కొద్ది దూరంలో నిలబడి వెంకటాచలం తనవంతు కోసం ఎదురుచూస్తున్నాడు. ఒక పెద్ద ముత్తైదువ బహుశా పేదరాలు, స్వామివారితో ప్రాధేయపూర్వకంగా మాట్లాడుతోంది. స్వామివారి ముఖమండలంలో అనంతమైన శాంతి గోచరిస్తోంది.

వెంకటాచలం తనవంతు రాగానే మహాస్వామి వారిముందు నిలబడి, “స్వామివారి ఆదేశం ప్రకారం మంగళసూత్రాలను తెచ్చాను” అని చెప్పాడు. స్వామివారు చేతివేళ్ల శబ్ధంతో ఆ సుమంగళిని దగ్గరకు రమ్మన్నారు. వెంకటాచలం వైపుకి తిరిగి “ఆమె కుమార్తెకి పెళ్ళి అట. మంగళసూత్రం కావాలి అట. తీసుకో ఇక్కడే నీ చేతులతోనే ఆమెకి ఇవ్వు” అని ఆదేశించారు. వెంకటాచలం చాలా సంతోషించారు.

“సార్, నేను చాలా పోగొట్టుకున్నాను. జీవనం సాగించడానికి కూడా కష్టపడ్డాను. అయినాకూడా, ఎప్పుడూ తిరుమాంగల్యాలు చెయ్యించడం మానలేదు. అది పరమాచార్య స్వామి వారి ఆజ్ఞ కదా? మరి ఎలా వదిలిపెట్టగలను? స్వామివారి ఏమి తెలియదా? అంతా తెలుసు. నా భార్య ఏ బాధాలేకుండా సుమంగళీగానే కన్ను మూసింది. మరి ఇంతకంటె ఇక ఏమి అడగాలి ఆ సర్వేశ్వరుణ్ణి?” అని కంఠం గాద్గదికమవుతుండగా వారి అనుభవాన్ని చెప్పుకొచ్చారు వెంకటాచలం.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

అనుష్టానం మానరాదు



1963లో పరమాచార్య స్వామివారు కుంబకోణం దగ్గర్లోని మరుదనల్లూర్ లో మకాం చేస్తున్నారు. అప్పుడు కుంబకోణంలోని కుంబేశ్వర ఆలయంలో ‘తిరుప్పావై - తిరువెంబావై’ సదస్సులు వైభవంగా జరుగుతున్నాయి. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ భక్తవత్సలం మరియు మధురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి తిరుప్పణి (ఆలయ సంబంధిత పనులు) చేసిన పి.టి. రాజన్ ఆ సదస్సుకు వచ్చారు.

అప్పుడు సాయం సంధ్యా సమయం. మహాస్వామి వారి ఉపన్యాసం వినాలని వారి వద్దనే కూర్చుని ఉన్నాను. స్వామివారు ఉపన్యాసం మొదలుపెట్టబోతూ నావైపు తిరిగి, చేతులతో ఆచమనం చేస్తున్నట్టుగా చూపిస్తూ వెళ్ళి సంధ్యావందనం చెయ్యమని ఆజ్ఞాపించారు. స్వామి ఉపన్యాసం వినాలనే కోరికతో నేను సంధ్యావందనం మాని అక్కడ కూర్చున్నానని స్వామివారు అర్థం చేసుకున్నారు. ఎట్టి పరిస్థితులలోను అనుష్టానం మానవద్దు అని నన్ను హెచ్చరించటం. స్వామివారి ఆజ్ఞ ప్రకారం సంధ్య వార్చడానికి నేను కొలను వద్దకు వెళ్ళాను.

ఆ రోజు రాత్రి పదిగంటలప్పుడు మేము ఆహ్వానించకుండానే స్వామివారు మేలకావేరిలోని మా ఇంటికి విచ్చేశారు. దాదాపు ఒక గంట పాటు అనుగ్రహ భాషణం చేశారు. మేము పరమానంద భరితులమయ్యాము. అలా స్వామివారు బ్రాహ్మణుడికి సంధ్యావందనం వంటి నిత్యకర్మల కంటే మేలైనది విలువైనది వేరొక్కటి లేదని సెలవిచ్చారు. అలా ధర్మానుష్టానం చేసిన వారి వద్దకు స్వామివారే వచ్చి అనుగ్రహం ఇస్తారు. అలా ఆచరించని వారు మాత్రమే స్వామిని వెతుక్కుంటూ వెళ్ళాలి.

--- యస్. పంచపకేశ శాస్తిగళ్, కుంబకోణం. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 1

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Saturday, June 8, 2019

నాస్తికుడు ఆస్తికుడైన వేళ

Image result for sri chandrashekarendra saraswati

చిత్రనిర్మాత సాండొ చిన్నప్ప దేవార్ మరియు ప్రఖ్యాత తమిళ కవి కన్నదాసన్ ఇద్దరూ ప్రాణ స్నేహితులు. ఒక సినిమా షూటింగ్ నిమిత్తం కార్లో వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది. దేవార్ చిన్న చిన్న దెబ్బలతో తప్పించుకున్నాడు కాని కన్నదాసన్ మాత్రం తీవ్రమైన గాయాలతో స్పృహ కోల్పోవడంతో మాద్రాసులోని ఆసుపత్రిలో చేర్పించారు.

దేవార్ కు పరమాచార్య స్వామి అంటే అమితమైన భక్తి. వెంటనే తేనంబాక్కం శివస్థానంలోని బ్రహ్మపురీశ్వర దేవస్థానంలో మకాం చేస్తున్న మహాస్వామి వారిని దర్సించుకోవడానికి వెళ్ళాడు.

“ఒక ప్రమాదం జరిగింది” అని స్వామితో చెప్పాడు దేవార్. వెంటనే స్వామివారు “కన్నదాసన్ ఎలా ఉన్నాడు?” అని అడిగారు.

తను ఏమి చెప్పకనే మహాస్వామివారు కన్నదాసన్ ఎలా ఉన్నాడు అని అడగటంతో దేవార్ ఆశ్చర్యపోయారు. ప్రమాదం నుండి తను ఎలా బయటపడ్డాడు, కన్నదాసన్ ఎలా తీవ్రంగా దెబ్బతిని అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చేరాడు అన్న విషయమంతా స్వామివారికి విన్నవించాడు.

దేవార్ ఆత్రుతని గమనించి మహాస్వామి వారు “దిగులు పడకు ఏమి పరవాలేదు” అని అతణ్ణి సముదాయించారు. ఆస్పత్రిలో ఉన్న కన్నదాసన్ నుదుటిపైన విభూతి పెట్టి, కొద్దిగా నోట్లో వేసి మిగిలిన దాన్ని దిండు కింద ఉంచమని స్వామివారే స్వయంగా విభూతిని పొట్లం కట్టి ఇచ్చారు. దేవార్ సంకోచిస్తూ విభూతిని అందుకున్నాడు.

ఎందుకంటే కన్నదాసన్ పరమ నాస్తికుడు. దైవాన్ని నమ్మేవాడు కాదు. అప్పటికే కన్నదాసన్ ద్రావిడ పార్టీల నాస్థిక కార్యకలాపాల్లో, వాటి వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. బ్రాహ్మణుల గురించి, సనాతన ధర్మం గురించి చాలా చెడుగా మాట్లాడేవాడు. నిజానికి ప్రమాదం జరగడాని వారం రోజులముందు కూడా కంచిలోని శంకర మఠం ఎదురుగుండా జరిగిన ఒక సభలో శంకరాచార్యుల (కంచి పీఠాధిపతుల) చిత్తరువును అవమానపరిచాడు. మరి ఇప్పుడు అటువంటి వ్యక్తికి ఈ విభూతి ఎలా ఇచ్చేది అని ఆలోచిస్తున్నాడు దేవార్.

ఆ త్రికాలజ్ఞాని దేవార్ పరిస్థితిని అర్థం చేసుకుని దేవార్ తో ఇలా అన్నారు.

”ఏమి అనుమానపడకుండా వెళ్ళి కన్నదాసన్ నుదుటన ఈ విభూతి పెట్టు. చిన్న మేఘం కాసేపు సూర్యుణ్ణి అడ్డుకున్నట్టు, ఈ నాస్తికత్వం అతణ్ణి అడ్డుకుంది. ఇప్పటి నుండి అతను సూర్యునివలె ప్రకాశిస్తాడు. వారి పూర్వీకులు ఎంతటి మహాత్ములో నీకు తెలుసా? వారి ముత్తాత కంచి వరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని పునరుద్ధరించారు. వారి తాత కంచి ఏకాంమ్రేశ్వర దేవస్థానాన్ని పునరుద్ధరించారు. వారి తండ్రి కంచి కామాక్షి అమ్మవారి దేవస్తానాన్ని పునరుద్ధరించారు. అతను దేవాలయలాను సంరక్షించే మాహానుభావుల వంశంలో జన్మించాడు. ఇప్పుడు నీకు అర్థమైందా?”

దేవార్ ఆస్పత్రికి వెళ్ళి స్వామివారు చెప్పినట్టు చేసాడు. స్వామివారు ఇచ్చిన విభూతిని కన్నదాసన్ నుదుటన పెట్టి కొంచం నోట్లో వేసి, మిగిలినదాన్ని దిండు కింద పెట్టాడు. అప్పుడు సాయం సంధ్యా సమయం. తమిళ సాహిత్యానికి రాజైన కవి అరసు(కవి రాజు) కన్నదాసన్ ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. దేవార్ విశ్రాంతి కొరకై రాత్రికి ఇంటికి వెళ్ళి తన స్నేహితుణ్ణి చూడాలని ఉదయాన్నే మరలా వచ్చాడు. స్పృహలోకొచ్చిన కన్నదాసన్ కు ఏమి చెప్పాలా అని అలోచిస్తూ రాత్రి అంతా గడిపాడు.

మరుసటి రోజు ఆసుపత్రికి రాగానే కన్నదాసన్ స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచి అలాగే మంచంపై పడుకుని ఉండడం చూసి ఆనందపడ్డాడు. “నేను ఎన్ని రోజులనుండి ఈ ఆసుపత్రిలో ఉన్నాను? నా మొహం చూసుకోవాలి అద్దాన్ని తీసుకుని రా” అని చెప్పాడు. దేవార్ ఆద్దం తెచ్చిచ్చాడు. అద్దంలో తన మొహాన్ని, నుదుటిపై ఉన్న విభూతిని చూసి అతను కోప్పడలేదు. బదులుగా ఎవరు పెట్టారు అని అడిగాడు. దేవార్ కొంచం ధైర్యం తెచ్చుకుని తను పరమాచార్య స్వామిని కలవడమూ, వారి అతణ్ణి అనిగ్రహించడమూ మొదలగు అన్ని విషయాలు కన్నదాసన్ కు చెప్పాడు.

అంతా వినగానే కన్నదాసన్ కన్నీళ్ళపర్యంతం అయ్యాడు. “నన్ను కరుణించారా? నా పైన ఇంతటి దయ చూపించారా? కేవలం వారం రోజుల ముందు నా చేష్టలతో, మాటలతో వారిని అవమానపరిచాను. ఎంతటి పాపిని నేను?” అని భోరున విలపించాడు. “పూర్తి స్వస్థత పొందిన తరువాత నేను మొదట నా ఇంటికి వెళ్ళను. ఇంతటి పాపిని అనుగ్రహించిన ఆ మహాత్ముని వద్దకు ముందు నన్ను తీసుకుని వెళ్ళు” అని దేవార్ ను అర్థించాడు.

అతని కోరిక ప్రకారం మహాస్వామివారిని దర్శించుకుని తనని క్షమించవలసిందిగా పలువిధాల ప్రార్థించాడు. అప్పటి నుండి నాస్తికత్వం నుండి ఆధ్యాత్మికత వైపు మళ్ళాడు. మనసులో భక్తిభావం పొంగగా మహాస్వామి వారిపై కవిత రాసాడు. మరలా స్వామిని దర్శించినప్పుడు దాన్ని వారికి సమర్పించాడు.

”ఎవరి కనుచూపుచేతనే అన్ని పాపాలు నశించిపోతాయో
ఎవరు తిరువాచకానికి సాకార స్వరూపమై నిలచినారో
ఎవరు తన మేధస్సు చేత సత్యా జ్ఞానానికి అర్థం చెప్పగలరో
ఎవరు ఈ విశ్వాన్ని రక్షించాడానికి వచ్చిన విశ్వనాథుడో
ఎవరు అన్ని మతాల చేత తమ దేవుడని ఒప్పబడినాడో
అటువంటివారి చరణారవిందములకు మనల్ని సమర్పించుకుందాము
రండి! అందరూ తరలిరండి!!”

మహాస్వామివారు పద్యాన్ని చదివి కన్నదాసన్ తో “నువ్వు చెప్పినది కేవలం శేషాద్రి

స్వామివారికి మాత్రమే సరిపోతుంది. ఆయనే తురువణ్ణామలై అర్ధనారీశ్వరుడు. ఆయనే సత్పురుషుడు, మహామనీషి” అని అన్నారు.

”సనాత ధర్మ వైభవాన్ని గురించి మనస్పూర్తిగా రాయి” అని ఆశీర్వదించి పంపారు.

అప్పుడే కన్నదాసన్ మనసులో బీజం పడింది. అది చిగురించి, చిన్న మొక్కై, మహావృక్షమై మహత్తరమైన “అర్థముల్లా హిందు మతం; అర్థవంతమైన హిందూ మతం” అనే పుస్తకమై వర్ధిల్లింది.

[పూర్వీకులు చేసిన పుణ్యం మనల్ని ఖచ్చితంగా కాపాడుతుంది. మరి వింతపోకడలతో స్వధర్మాన్ని ఆచార వ్యవహారాలని మంటగలిపి పాశ్చాత్య సంస్కృతికి బానిసలవుతున్న వారి వంశాలని, ముందు తరాలని కాపాడేది ఎవరు? ఏ పుణ్యం చూపించి భగవంతుడు నిన్ను కాపాడుతాడు. అందుకే ‘కురు పుణ్య మహోరాత్రం’ అన్నారు శంకరులు.]

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Monday, November 12, 2018

గుడి వ్యవహారం - గబ్బిల జన్మ

Image result for kanchi periyava




శ్రీ జగదీశ భట్ గారి జీవితంలో జరిగిన ఈ సంఘటన వల్ల శ్రీ శ్రీ శ్రీ చన్ద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు సర్వాంతర్యామి అని, ఈనాటికి భక్తులను కరుణిస్తున్నారని రూఢీగా అవగతమవుతుంది.

ఉత్తర చిదంబరంగా పేరుగాంచిన సతారాలోని నటరాజ స్వామి దేవాలయం స్వామివారి ఆదేశం ప్రకారం నిర్మించబడింది. ఆలయం పూర్తవడానికి ముందే, శ్రీ జగదీశ భట్ గారిని దేవాలయ వ్యవహారాలు చూసుకోవల్సిందిగా ఆజ్ఞాపించారు.

పరమాచార్య స్వామివారి ఆదేశానుసారం శ్రీ జగదీశ భట్ కూడా సతారా వెళ్లి, అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయ వ్యవహారాలు చూసుకుంటూ ఉండేవారు. కాని అతను అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇక వాటిని తట్టుకోలేక కంచీపురానికి తిరిగొచ్చాడు. పరమాచార్య స్వామివారు విచారించగా తనకు కల్గిన ఇబ్బందులను ఏకరువుపెట్టాడు.

కాని కరుణామూర్తులైన స్వామివారు అతని ఇబ్బందులను విని, పరిపూర్ణమైన ఆశీస్సులను అందించి, సతారాకు తిరిగివెళ్ళమని ఆదేశించారు. జగదీశ భట్ తో మాట్లాడుతూ, “శ్రీ ఏకాంబరేశ్వర దేవాలయంలో తలక్రిందులుగా వేలాడుతున్న గబ్బిలాలను చూశావా?” అని అడిగారు. గబ్బిలాలకు నోరు, మలమూత్ర ద్వారములు రెండూ ఒక్కటే అని చెప్పారు. తినడానికి, విసర్జించడానికి కూడా ఒక్కటే వాడుతాయి. ఎవరైనా దేవాలయ నిధులు, ధనము తస్కరించడానికి ప్రయత్నిస్తే, మరుసటి జన్మలో గబ్బిలంగా జన్మిస్తాడు అని శాస్త్రవచనం. స్వామివారు ఇదంతా చెప్పగానే, దేవాలయ ద్రవ్య విషయంలో అతను మరింత శ్రద్ధ కనబరుస్తూ, ఇది తనకు హెచ్చరికగా భావించాడు.

స్వామివారే స్వయంగా అతణ్ణి ఉత్సాహపరచడంతో కొత్త శక్తి వచ్చినట్లై దేవాలయాన్ని చూసుకునే బాధ్యతను తీసుకుని, చాలా సంవత్సరాల పాటు తన కర్తవ్యాన్ని నిర్వహించారు. కాని, ఎదో కారణాల వల్ల మొత్తం దేవాలి బాధ్యత, అర్చక బాధ్యత మొత్తం జగదీశ భట్ గారి పైనే పడ్డాయి. చివరకు మొత్తం వ్యవహారాలు చూసుకోవడం తలకు మించిన భారం అయిపొయింది. అటువంటి సమయంలో పరమాచార్య స్వామివారు తనకు ఇలా ఇబ్బంది కలగాజేస్తున్నారని చాలా నిరాశకు గురయ్యాడు.

ఆరాత్రి జగదీశ భట్ కు నిద్రపట్టడం లేదు. తెల్లవారుఝామున పరమాచార్య స్వామివారు కనపడ్డారు. వారు రెండుచేతులను పైకెత్తి సంపూర్ణ ఆశీస్సులను అందిస్తున్నట్టుగా కల వచ్చింది. “నువ్వు ఏమి భయపడకు. అంతా నేను చూసుకుంటాను” అని పరమాచార్య స్వామివారు ధైర్యం ఇచ్చినట్టుగా అనిపించింది. కనుల నీరు కారుతుండగా వెంటనే నిద్రనుండి మేల్కొన్నారు.

అది కేవలం కల లాగా అనిపించడం లేదు. స్వయంగా పరమాచార్య స్వామివారే వచ్చి ఆశీర్వాదించినట్టుగా ఉంది. ఆరోజు తనకి నూతనోత్సాహం కలిగింది. అన్ని పనులనూ ఎంతో ఉత్సాహంగా చేసుకున్నారు. ఒత్తిడి అసలు లేదు. ఇదంతా కేవలం పరమాచార్య ఆశీస్సులవల్లే అని అతనికి తెలుసు.

మరుసటిరోజు మరొక్క ఆశ్చర్యం జరిగింది. ఒక యువకుడు దేవాలయానికి వచ్చి అతని ముందు నిలబడ్డాడు. ఇంతకుముందు అతను భట్ కు సహాయకునిగా ఉండేవాడు. కాని ఏవో కారణాల వల్ల వెళ్ళిపోయాడు. ఎన్నో చోట్ల ప్రయత్నించి, చివరకు ఇక్కడే తనకు అనుగుణంగా ఉందని తిరిగొచ్చాడు. ఇక ఎప్పటికి ఈ దేవాలయాన్ని విడవకూదడనే దృఢ నిశ్చయంతో వచ్చాడు. అది కూడా మహాస్వామివారి కరుణయే అని జగదీశ భట్ గారికి అవగతమైంది.

బ్రహ్మజ్ఞానుల ఆశీస్సులు వారు భౌతికంగా మనవద్ద లేకపోయినా అవి తప్పాక జరిగి తీరుతాయని జగదీశ భట్ గారి జీవితంలో జరిగిన ఈ సంఘటన వల్ల అర్థమవుతుంది.

--- “శ్రీ పెరియవ మహిమై” పత్రిక నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Tuesday, November 6, 2018

వేదాధ్యయనం - విదేశీయానం



పరమేశ్వరుడంతటి దయాళువు, శుక మహర్షి అంతటి ఉన్నతులు అయిన మన మహాస్వామి మనందరినీ ఆదరించి ఆశీర్వదిస్తున్నారు.

1968లో కుంబకోణం శ్రీ రంగరాజచారి పరమాచార్య స్వామియొక్క పరిపూర్ణ కటాక్షంలో మునిగిపోయారు. 1971లో ఋగ్వేద అధ్యయనం పూర్తైన తరువాత, జీవనాధారం కోసం వైదిక వృత్తి చేపట్టాలని భావిస్తే, అందుకు పరమాచార్య స్వామివారు తమ అంగీకారాన్ని తెలపలేదు.

“నీ వేద విద్యార్జనకు నేను తగిన ఏర్పాట్లు చేస్తాను. నీ విద్యార్జన కొనసాగించు” అని స్వామివారు తెలిపారు. ప్రతి నేలా రెండు వందల రూపాయలు రంగరాజచారి కుటుంబానికి అందేట్టు, స్వంతంగా వండుకోవడానికి కావాల్సిన సంభారాలు కూడా ఏర్పాటు చేశారు. రంగరాజచారి గారిది పెద్ద కుటుంబం. కేవలం పరమాచార్య స్వామివారి ఆశీస్సులతోనే అందరి ఆడపిల్లల పెళ్ళిళ్ళు జరిగాయి.

మహాస్వామివారు పండరీపురంలో మకాం చేస్తున్నప్పుడు, రంగరాజచారి స్వామివారిని దర్శించుకుని సాష్టాంగం చేసి నమస్కరించారు. అప్పుడు మహాస్వామివారు, “నువ్వు నాకు సాష్టాంగం చెయ్యొచ్చా?” అని అడిగారు.

“మా సంప్రదాయం ప్రకారం, యజ్ఞోపవీతము, శిఖ లేని సన్యాసిని చూస్తే స్నానం చెయ్యాలి” అని రంగరాజచారి బదులిచ్చాడు.

“అలా అయితే, మరి నా ముందర ఎందుకు సాష్టాంగం చేశావు?”

“ఈ స్వరూపము విష్ణు స్వరూపమే అని నాకు అనిపించింది” అని భక్తితో బదులిచ్చాడు. ఈ శీవైష్ణవ భక్తశిఖామణి జీవితంలో పరమాచార్య స్వామి అనుగ్రహంతో ఒక అద్భుతం జరిగింది. రంగరాజచారిది పేద కుటుంబం. వారి ఆదాయంతో సభ్యులందరినీ చూసుకోవడం కూడా వీలు కాని పరిస్థితి. ఆడపిల్లల పెళ్ళిళ్ళకు డబ్బు కూడా అవసరం. ఇటువంటి స్థితిలో వారికి ఒక మంచి అవకాశం వచ్చింది. 1978లో వేద విద్యాభ్యాసం ముగియగానే, వారిని జర్మని రమ్మని కొందరు ఆహ్వానించారు. అంతటి కటిక దారిద్య్రాన్ని అనుభవిస్తున్న సమయంలో జర్మని అవకాశాన్ని, నేలకు మూడువేల రూపాయల సంపాదనని ఎలా కాదనగలరు. ఈ డబ్బుతో పాటు మూడేళ్ళ తరువాత మూడు లక్షల రూపాయలు అందుతుంది. కనుక రంగరాజచారి ఈ అవకాశాన్ని ఒప్పుకోవడంలో ఆశ్చర్యం ఏమి లేదు.

ఈ అవకాశాన్ని ఇచ్చినతనికి అన్ని ఏర్పాట్లు చూసుకోమని చెప్పాడు. ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లలో మునిగిపోయాడు. అదే సంవత్సరం అక్టోబరు 31న బోంబే నుండి బయలుదేరడానికి నిర్ణయించుకున్నాడు. ఇంత జరిగినా ఈ విషయాలేవీ ఇతరులకు తెలియనివ్వలేదు. అక్టోబరు 27న తన తండ్రికి విషయం తెలపడానికి గ్రామానికి వెళ్ళాడు.

“పరమాచార్య స్వామివారి అనుమతి తీసుకున్నావా?” అని అడిగారు అతని నాన్న. “లేదు, నాకు తెలిసి వారు అనుమతి ఇవ్వరు. స్వామివారు అనుమతించకపోతే, ఇంత డబ్బులు వచ్చే ఈ ప్రతిపాదనని నేను కాదనలేను. వెళ్ళడానికి నేనే నిర్ణయించుకున్నాను. మనకు డబ్బు అవసరం చాలా ఉంది. నాకు ఇంకొక మార్గం కనపడడం లేదు” అని చెప్పాడు.

ఆరాత్రికి తన ఊళ్లోనే ఉండిపోయాడు. రాత్రి మూడు గంటలప్పుడు, నిద్ర రాక మంచంపై అటు ఇటు దొర్లుతున్నాడు. అప్పుడు కళ్ళముందు మహాస్వామివారు ఉన్నట్టుగా లీలగా కనపడుతోంది. దగ్గరకు వచ్చి తనని తాకినట్టుగా తనకు అనుభూతి కలిగింది. తన తల్లి అడిగినట్టుగానే, “వెళ్ళడానికే నిర్నయించుకున్నావా?” అని అడిగినట్టు అనిపించింది. అది కలో, నిజమో అర్థం కావడంలేదు. ఆలస్యం చేయకుండా మరుసటిరోజే పరమాచార్య స్వామివద్దకు వెళ్లి అనుమతి పొందాలని భావించాడు.

అప్పుడు పరమాచార్య స్వామివారు కర్ణాటక రాష్ట్రం, బాదామి దగ్గరలోని బనశంకరి అనే చోట మకాం చేస్తున్నారు. అక్కడకు చేరుకోగానే స్వామివారి దర్శనానికి ముందు, స్నానం చేస్తున్నాడు. అప్పుడు పరమాచార్య స్వామివారి సహాయకులొకరు వచ్చి, “వచ్చి దర్శనం చేసుకోమని పరమాచార్య ఆదేశించారు” అని చెప్పాడు.

తను వస్తున్న విషయం కాని, వచ్చిన కారణం కాని ఎవరికీ తెలియదు. కాని మహాస్వామివారు కబురుచేయడంతో ఆశ్చర్యపోయాడు. అదే ఆశ్చర్యంతో వెళ్లి స్వామివారి ముందు నిలబడ్డాడు.

“ఎప్పుడు బయలుదేరుతున్నావు?” అని అడిగారు స్వామివారు.

“స్వామివారు ఎప్పుడు అనుమతిస్తే అప్పుడు” అని బడులిచ్చాడు స్వామివారు తన తిరుగు ప్రయాణం గురించి అడుగుతున్నరేమో అనుకుని.

“నీవున్నచోటికి తెరిగివెళ్ళే విషయం గురించి నేను అడగడం లేదు. విదేశాలకు వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నావు కదా! దాని గురించి ఎప్పుడు అని అడుగుతున్నా”

ఆ మాటలు విని నిశ్చేష్టుడయ్యాడు. ఇంకా ఆ విస్మయం నుండి తేరుకునే లోపే, పరమాచార్య స్వామివారు ఇంకొక విషయం తెలిపారు.

“నువ్వు ఇక్కడకు రావడానికి కారణమేంటో చెప్పనా? మొన్న నేను వచ్చి నిన్ను అడిగాను, “వెళ్ళడానికే నిశ్చయించుకున్నావా?” అని. అందుకే వెళ్లబోయేముందు ఇక్కడకు వచ్చావు. అంతేనా?” అని అన్నారు.

ఆరోజు జరిగినది కల కాదని, నిజంగా స్వామివారే వచ్చి ఆశీర్వదించారని తెలుసుకున్న తరువాత రంగరాజచారి భావోద్వేగానికి గురయ్యాడు.

“నీ మంచి నడతను కొనసాగించు . . . డబ్బు అవసరం లేదు . . . మంచి నడవడిక ముఖ్యం” అని చెప్పి, తమ దివ్య పాదచారణాలను ఆ భక్తుని తలపై ఉంచి కరుణతో ఆశీర్వదించారు.

ఇది అద్భుతం కదా! ఒక సాంప్రదాయస్తుణ్ణి విదేశాలకు వెళ్ళకుండా ఆపారు స్వామివారు. ధర్మం యొక్క సాకార రూపమైన మన స్వామివారు తన భక్తులను ధర్మ మార్గంలో పయనించడానికి అనుకూలంగా అనుగ్రహాన్ని ప్రసరిస్తారు.

--- “శ్రీ పెరియవ మహిమై” పత్రిక నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Monday, November 5, 2018

మహాస్వామి వారి ఘటం





పరమాచార్య స్వామి వారికి పరమ భక్తుడైనందువల్ల తన కీర్తి ప్రతిష్టలు అంతా స్వామి వారి అనుగ్రహంగానే పరిగణిస్తారు. “నాతో వారి ఉనికి, వారు నా వెంటే ఉన్నారన్న విషయం నాకు ఎన్నో సార్లు ఋజువు అయ్యింది” అని అంటారు ప్రముఖ ఘటం విద్వాంసులు విక్కు వినాయకరం.

ఒకసారి వినాయకరం, ఎల్. శంకర్ మరియ జాకిర్ హుస్సేన్ లతో కలిసి ఒక కచేరి కోసం ఏథెన్స్ వెళ్ళారు. కచేరి రోజుకు కొన్ని రోజులముందు అకస్మాత్తుగా వారి ఘటం పగిలిపోయింది. చెన్నైలో ఉన్న వారి భార్యకు ఏడుస్తూ “తెచ్చుకున్న ఘటం పగిలిపోయింది. ఇక్కడ నాకు ఇక పని లేదు. నేను తిరిగి వచ్చేస్తాను” అని చెప్పారు. వారి భార్య ఒక రోజు వేచి ఉండమని చెప్పి వారి పరిస్థితిని ఆచార్యుల వారికి చెప్పడానికి కంచికి వెళ్ళారు. పరమాచార్య స్వామి వారు ఆవిడ గోడు విని ఏమి పలుకక మిన్నకుండిపోయారు. ఆవిడ చాలా బాధపడి కన్నీరు కారుస్తూ తిరిగి వెళ్ళి పోతున్నప్పుడు మహాస్వామి వారు మౌనంగా ఒక కొబ్బరికాయను ఇచ్చి పంపారు.

మరోవైపు జాకిర్ హుస్సేన్ ఏథెన్స్ మొత్తం వెతికి చివరగా అమెరికా హౌస్ లో ప్రదర్శనకు ఉంచిన ఒక ఘటం చూసారు. కాని దాన్ని అతను ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే అది ఇచ్చిన వ్యక్తి దాన్ని ఎవరికి ఇవ్వకూడదు అమ్మకూడదు అని చెప్పారు. అది తనకి ఎవరు ఇచ్చారు అని అడుగగా అందరూ అతను “వినాయకరం” అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. “ఆ ఘటం నీకు ఇచ్చినవారికే ఇప్పుడు దాని అవసరం వచ్చింది” అని జాకిర్ గారు చెపారు. అప్పుడు అతను వినాయకరం గారి వద్ద నుండి “ఈ ఘటం నాకు చాలా ఉపయోగపడింది” అని ఒక లేఖని కూరుతూ ఆ ఘటాన్ని ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఇంకా ఆశ్చర్యపోవల్సిన విషయం ఏమిటంటే వినాకరం కచేరిలో వాయించడానికి సరిపడా శృతి ఆ ఘటానికుంది.

మరొక్కసారి అమెరికా వెళ్తూ జర్మనీలో విమానం తప్పినందువల్ల సరదాగా ఒక సంగీత వాద్య పరికరాలు అమ్మే దుకాణానికి వెళ్ళారు. వారి వినాయకరం అని తెలుసుకుని ఆ దుకాణదారుడు వారికి ఒక ఘటాన్ని చూపించి దాని నాణ్యత తెలుపమన్నారు. అది ఒక జర్మనీ వనిత తయారుచేసినది. దాని శృతి శబ్ధ స్వరం అచ్చంగా భారతదేశంలో తయారు చేసినదానివలే ఉన్నదని చెప్పారు.

సంతోషంతో ఆ యజమాని, వారు వద్దని వారిస్తున్నా దాన్ని వారికి బహూకరించాడు. వారు అమెరికా వెళ్ళిన తరువాత చూస్తే తెచ్చుకున్న ఘటం పగిలిపోయి ఉంది. వారికి బహూకరించిన ఘటాన్నే వారు కచేరీలో వాడారు. ఆ ఘటం శృతి జి (5 కట్తై) అది కచేరి యొక్క ఆధార శృతి సి (1 కట్తై)కి సరిగ్గా సరిపోయింది. దాన్ని పరమాచార్య స్వామి వారి ఘటంగా భావించి వారి పూజామందిరంలో ఉంచుకున్నారు వినాయకరం గారు.

--- పద్మశ్రీ టి.హెచ్. వినాయకరం, చెన్నై - శక్తివికటన్ ప్రచురణ

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

https://t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Monday, October 29, 2018

క్యాన్సర్ వ్యాధి – కనకల్ చికిత్స



దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన. ఎచంకుడి గణేశ అయ్యర్ పరమాచార్య స్వామి వారికి పరమ భక్తుడు.

వారి భార్య కడుపులో క్యాన్సర్ కారణంగా చాలా బాధ పడేవారు. ఆపరేషన్ చేయించుకోవాలని, లేదంటే ఈ వ్యాధితో బ్రతకడం చాలా కష్టం అని చెప్పేవారు వైద్యులు.

గణేశ అయ్యర్ మహాస్వామి వారి దర్శనానికి వచ్చి వారితో తన బాధను విన్నవించుకున్నారు.

మహాస్వామి వారు అతనితో "ఆపరేషన్ చేయవలసిన అవసరం లేదు. తిరుతురైపూంది సమీపములో తిరునెల్లిక్కావల్ అనే రైల్వేస్టేషన్ ఉంది. ఆ స్టేషనులో దిగి అక్కడి నుండి పడమర వైపు ఒక కిలోమీటర్ వెళ్తే ఒక నీటి కాలువ వస్తుంది. ఆ కాలువ ఒడ్డున ఒక పెద్ద చెట్టు ఉంది. దాని పేరు "కనకల్" (తమిళంలో). ఆ చెట్టు ఆకుల యొక్క కాడలను స్వీకరిస్తే కాన్సర్ నయం అవుతుంది” అని చెప్పారు.

పరమాచార్య వారి సలహా ప్రకారం తన భార్య చేత ఆ చెట్టు ఆకుల కాడలు తినిపించారు. ఆశ్చర్యముగా కొన్ని రోజులలో ఆమె పొట్టలో ఉన్న క్యాన్సర్ వ్యాధి తగ్గుముఖం పట్టి, కేవలం కొద్ది రోజులలలోనే పూర్తి ఆరోగ్యవంతురాలు అయ్యింది.

ఎప్పుడూ స్వామి వారిని ధ్యానించే ఆవిడ 80 సంవత్సరాలు పైగా జీవించారు. అంతే కాకుండా మహాస్వామి వారు బృందావన ప్రవేశం ముందు జరిగిన వారి కనకాభిషేకం చూసి ధన్యులు అయ్యారు.

--- శ్రీమఠం బాలు మామ, మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్ 2

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Monday, October 22, 2018

చెన్నై - కంచి




ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ తన జీవితంలో జరిగిన అనుభవాన్ని ఇలా పంచుకున్నాడు..

నేను చెన్నైలోని ఒక ప్రైవేటు కంపెనీలో ఆటోమొబైల్ ఇంజనీర్ గా పని చేస్తున్నాను. ఈ సంఘటన 2005లో నేను కుంబకోణం నుండి చెన్నైకు తిరుగుప్రయాణం చేస్తున్నప్పుడు జరిగింది. నేను నా కుటుంబంతో సహా వేసవి సెలవుల కొసం అక్కడికి వెళ్ళాము. మా బంధువుల ఇళ్ళకు వెళ్ళాము మరియు కుంబకోణంలో ఉన్న అన్ని దేవాలయాలను సందర్శించడం కూడా మా ప్రణాళికలో భాగమే.

మా తిరుగు ప్రయాణం కోసం మే 24వ తేది ఉదయం 8 గంటలకు టికెట్స్ బుక్ చేసుకున్నాము. తమిళనాడులో ఉన్న పుణ్యక్షేత్రాలను సందర్శించడం చాలా సంతోషం కలిగించే విషయం. తమిళనాడులో ఆలయ నగరముగా పేరుగాంచిన కుంబకోణంలోని దేవాలయాలు దర్శించడం నా చిరకాల వాంఛ.

మేము కుంబేశ్వర ఆలయం, సారంగపాణి ఆలయం మరియు శ్రీ ఒప్పిలిఅప్పన్ ఆలయాలు దర్శించాము. ఈ యాత్రలో చివరిగా కంచి మఠంను దర్శించటం మా ప్రణాలిక. మఠంలో ఉండగా నేను పొందిన అనుభూతి అనిర్వచనీయమైనది. మేము అక్కడ ఉండగా పరమాచార్య స్వామి వారి గురించి మఠం ధర్మకర్తలతో కొద్దిగా మాట్లాడాము. దాంతో నాకు వారి గురించి తెలుసుకోవాలని ఉత్సాహము మరియు ఆసక్తి కలిగి కొన్ని పుస్తకాలు తీసుకొన్నాను. తిరుగుప్రయాణంలో చదువుటకు నిశ్చయించుకున్నాను.

ఆ రోజు రాత్రి నా కలలో మహాస్వామి వారు స్వప్న దర్శనమిచ్చారు. వారు నాతో "నా వద్దకు రండి" అని చెప్పారు. నేను మధ్యలోనే నిద్రలేచి సమయము చుస్తే ఉదయం 4 గంటలు. ఆ తరువాత నేను నిద్రపోలేదు స్వామి వారు నిద్రలో చెప్పిన దానిగురించే ఆలోచిస్తున్నాను. సుమారు ఉదయం 5:30 అప్పుడు నేను నా పిల్లలను భార్యను నిద్ర లేపి, సామాను సర్దుకొని తయారు అవ్వమన్నాను. ఎనిమిది గంటలకు మా తిరుగు ప్రయాణం కాబట్టి. అందరం అల్పాహారం ముగించుకొని మా అమ్మ, నాన్న మరియు బంధువులందరికి విడ్కోలు పలికి కారులో బస్సు ప్రాంగణానికి బయలుదేరాము.

కారులో కూర్చున్న తరువాత నా భార్యతో, చెన్నైకి వెళ్ళేముందు కంచి వెళ్ళి కామకోటి మఠాన్ని దర్శించాలని ఉంది అని చెప్పాను. మరునిమిషములో మా ప్రణాలికను మార్చుకుని కంచి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. ఉదయం 7:30 ప్రాంతములో టికెట్ కౌంటరుకి వచ్చి కాంచీపురం వెళ్ళడానికి బస్సుల గురించి అడుగగా, 8:30కి ఉంది అని చెప్పారు.

మేము చెన్నైకి పోయే బస్సు టికెట్స్ రద్దు చేసుకోవడం కుదరలేదు. కాంచీపురం బస్సు రావడంతో వెళ్ళి కంచి కామకోటి మఠంను సందర్శించాము. అక్కడకు వెళ్లగానే నా మనస్సుకు ఏదో తెలియని పులకరింతకలిగింది. అక్కడ చాలా ఆహ్లాదంగా ప్రశాంతంగా అనిపించింది. ఒక గంటసేపు అక్కడ ఉండి మేము చెన్నైకి తిరుగు ప్రయాణం అయ్యాము.

మేము ఇంటికి వెళ్ళాక T.V చూస్తే ఒక వార్తవిని చాలా ఆర్చర్యానికి లోనయ్యాము. మేము చెన్నై రావడానికి టికెట్స్ తీసుకున్న బస్సుకి ప్రమాదం జరిగి, దానిలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఇది చాలా విషాదకరమైన సంఘటన.

కానీ నాకు ఇప్పటికి అర్థం కాని విషయం “హఠాత్తుగా ఎందుకు మా ప్రణాళిక మార్చుకున్నాము?” అని. ఆనాటినుండి నేను మహాస్వామి వారికి లొంగిపొయాను. నా జీవితాన్ని వారి పాదపద్మముల సేవకు అంకితం చెసాను. ఈరోజు వరకు లేవగానే నేను చేసే మొదటి పని పరమాచార్య స్వామి వారి పాద పద్మములు చూసి నమస్కరించడం.

--- మూలం : స్వస్తిక్ టివి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

https://t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Saturday, October 13, 2018

వినాయకుడు - విరుగుడు



నేను ఒకసారి కంచి మఠం వెళ్ళినప్పుడు ఒక అర్చకులు నాకు ఈ కింది విషయం చెప్పారు.

దాదాపు 45 సంవత్సరాల కిందట పరమాచార్య స్వామి వారు తిరుచిరాపల్లికి దగ్గర్లోని ఒక పల్లెటూరిలో మకాం చేస్తున్నారు. ఒకరోజు వారు చంద్రమౌళీశ్వర పూజకు ఉపక్రమిస్తూ, మఠం మేనేజరుతో “ఇంక కొద్దిసేపట్లో అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయ అర్చకులు ఇక్కడికి వస్తారు. వారికి భోజనాలు పెట్టించి, 2 గంటలకు నా వద్దకు తీసుకుని రా” అని చెప్పారు.

అక్కడే నిలబడి ఉన్న ఒక శిష్యుడితో, “మఠం స్థపతితో చెప్పి రెండు అడుగుల వినాయకుని విగ్రహం తయారు చెయ్యమని చెప్పు” అని ఆజ్ఞాపించారు.

మహాస్వామి వారి ఆజ్ఞ ప్రకారం మేనేజరు అర్చకులను మఠం సంప్రదాయం ప్రకారం స్వాగతించి, మద్యాహ్న సమయం కావడం వల్ల వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేసి వారి భోజనం తరువాత స్వామి వారి వద్దకు తీసుకుని వెళ్ళాడు.

పరమాచార్య స్వామి వారు అందరినీ పేరుపేరునా వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ప్రధాన అర్చకులు పరమాచార్యస్వామి వారితో, “పెరియవ రోజూ ఉదయం అర్చకులు ఎవరైతే అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయ గర్భగృహం తలుపులు తీసి లోపలికి వెళ్తున్నారో, ఆ వెళ్ళినవారు వెంటనే కళ్ళు తిరిగి పడిపోతున్నారు. మళ్ళా పది నిముషములు ఉపచారము చేసిన తరువాతనే స్వస్థత పొందుతున్నారు. కావున మిగిలిన అర్చకులు ఎవరూ లోపలికి వెళ్ళడానికి సాహసించడం లేదు” అని తమ బాధను చెప్పుకున్నారు.

వెంటనే మహాస్వామి వారు వారితో, “రేపు నేనే స్వయంగా దేవాలయానికి వస్తాను. నేను వచ్చిన తరువాతనే మీరు ఆలయ తలుపులు తెరవండి” అని చెప్పి వారికి ప్రసాదాన్ని ఇచ్చి పంపించారు.

మరుసటి రోజు తెల్లవారుఝామున 5:30 గంటలకు పరమాచార్య స్వామి వారు అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయానికి వచ్చారు. ఒక అర్చకుడు అమ్మవారి గర్భగృహం తలుపులు తెరిచాడు. వెంటనే కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. పది నిముషముల తరువాత లేచి తన పనులకు వెళ్ళిపోయాడు. అది చూసి మహాస్వామి వారు కొద్దిసేపు ధ్యానంలోకి వెళ్ళారు. తరువాత ఆలయ ప్రధాన అర్చకుణ్ణి పిలిచి, “రేపటినుండి అతణ్ణి గర్భగృహం పక్క ద్వారం నుండి లోపలికి వెళ్ళమని చెప్పండి” అని ఎల్ల వెళ్ళాలో చెప్పి, తలుపులు తీసిన రెండు నిముషముల తరువాత లోపలికి వెళ్ళండి అని చెప్పారు.

సాయంత్రం స్థపతి వినాయకుని విగ్రహం తీసుకుని పరమాచార్య స్వామి వారి వద్దకు వచ్చాడు. స్వామి వారు ఒక మంటప నిర్మాణం చేసి, దాని పైన ఈ వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించమని చెప్పారు. అది ఎలా ఉండాలి అంటే “అమ్మవారి దృష్టి కాంతి, వినాకుడి దృష్టి కాంతి సమాంతరంగా ఒకటికొకటి కలవాలి” అలా నిర్మాణం చెయ్యవలసిందని చెప్పారు. స్వామి వారు చెప్పినట్టుగానే ఆలయంలో వినాయకుణ్ణి వారి అమ్మగారైన అఖిలాండేశ్వరి ఎదురుగా ప్రతిష్టించారు. ఆగమోక్తంగా ప్రతిష్ట పూజలు నిర్వహించారు. అప్పటి నుండి అర్చకులకు కళ్ళుతిరిగి పడిపోవడం జరుగలేదు.

ఇప్పటికీ, అష్టమూర్తి క్షేత్రములలో ఒకటైన, జల లింగ క్షేత్రమైన జంబుకేశ్వరం(తిరువణైకావల్) లోని అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయానికి ఎదురుగా వినాయకుడు ఉంటాడు. తల్లి తొలి చూపు తన తొలి బిడ్దడిపై ప్రసరించేట్టుగా పరమాచార్య స్వామి వారు సుముఖుడైన వినాయకుని ప్రతిష్ట చేయించారు.

[సాక్షాత్ పరమశివ అవతారులైన ఆదిశంకరాచార్యుల వారు, రాబోవు కాలాములలో ప్రజలు అనుష్టానము లేక, తపశ్శక్తి లేక దేవతా మూర్తుల ఎదురుగుండా నిలబడలేరని గ్రహించి, ఎక్కువగా ఉన్న తేజస్సును లెక్కకట్టి దాన్ని శ్రీచక్రంలోకి తీసి అక్కడే శ్రీచక్ర ప్రతిష్ట చేసారు. జంబుకేశ్వరం జల క్షేత్రం కావటం చేత అమ్మవారి సువర్ణ తాటంకాలలో శ్రీచక్రం వేసి అమ్మవారికి ధరింపచేసారు]

--- ఎ. త్యాగరాజన్, చెన్నై - శక్తి వికటన్ ప్రచురణ

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Friday, October 5, 2018

వేద స్వరం - శిక్ష




మహా పెరియవర్ సాక్షాత్ పరమాత్మ స్వరూపులు, శివావతారులు. ఈ శతాబ్ధపు ఆది శంకరాచార్యులు. అప్పుడు స్వామి వారు కుంబకోణంలోని కంచి మఠంలో మకాం చేస్తున్నారు. వ్యాస పూర్ణిమ చాలా ఘనంగా జరిగింది. చంద్రమౌళీశ్వర పూజ పూర్తి అయిన తరువాత భక్తులందరూ పరమాచార్య స్వామి స్వహస్తాలతో ఇచ్చే అభిషేక తీర్థం కోసం ఆత్రుతగా వచ్చారు. వరుసగా నిలబడి వస్తున్న వాళ్ళలో ఒక భక్తుణ్ణి మహాస్వామి వారు తలెత్తి చూసారు.

వారు అతనితో, ”రేపు తెల్లవారుఝామున జరిగే వేదపారాయణానికి రా” అని అన్నారు. మహాస్వామి వారి ఆజ్ఞకి తిరుగేముంది?

స్వామి వారి ఆదేశం మేరకు మరుసటిరోజు ఉదయాన్నే వచ్చి, వేదపారాయణంలో పాల్గొన్నాడు. పారాయణం జరుగుతూ ఉండగా ఆశ్చర్యకరంగా మహాస్వామి వారు వచ్చారు. వారు చాలా అరుదుగా వస్తారు.

నిన్న తాము రమ్మన్న భక్తుడు చాలా శ్రద్ధగా భక్తితో వేదాలను ఆమ్నాయం చెయ్యడం గమనించారు. వేదపారాయణం తరువాత అందరికి తీర్థప్రసాదాలు ఇచ్చు సమయంలో అతన్ని పిలిచి కొద్దిసేపు వేచియుండమన్నారు.

ఆ భక్తుడు భయంతో మనసులో నేను వేదమంత్రాలు సరిగ్గా ఉచ్ఛరింలేదేమో అందుకే మహాస్వామి వారు ఉండమన్నారు అని అనుకున్నాడు. కొద్దిసేపటి తరువాత, మహాస్వామి వారు ఆజ్ఞాపించారు అని ఒక వైద్యుడు వచ్చి, అతన్ని పూర్తిగా పరీక్ష చేసారు. తరువాత అతని వైద్యశాలకు తీసుకుని వెళ్ళీ ఇంకొన్ని పరీక్షలు చేసిన తరువాత ఆ భక్తుడికి హృదయ సంబధమైన జబ్బు ఉందని తెలుసుకున్నారు.

పరమాచార్య స్వామి వారి ఆదేశానుసారం ఆ వైద్యుడు, ఏ శస్తచికిత్స అవసరం లేకుండానే ఆ భక్తుని జబ్బు నివారించాడు.

పది రోజుల తరువాత ఆ భక్తుడు మహాస్వామి వారి దర్శనానికి వచ్చాడు. అతని మనస్సులో ఉన్న ప్రశ్నలకు సమాధానంగా మహాస్వామి వారు అతనితో,



“నువ్వు వేదం చాలా శ్రద్ధతో పఠిస్తున్నావు కాని, మంత్రాలను ఉచ్ఛరిస్తున్నప్పుడు నీకుగల శ్వాస సంబంధమైన రుగ్మత చేత, చాలా ఇబ్బందిగా పలకడం వల్ల అక్కడక్కడ స్వరం తప్పుతున్నది. నేను దాన్ని గుర్తించి బహుశా నీకు ఊపిరితిత్తులు లేక గొంతు సమస్య ఏదో ఉన్నదని గ్రహించి వైద్యుణ్ణి రప్పించాను” అని అన్నారు.

తరువాత “కొద్దిసేపు వేదం పారాయణం చెయ్యి” అని ఆజ్ఞాపించారు.
అతను స్వరం తప్పకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా వేదం చెప్పాడు. మహాస్వామి వారు చాలా సంతోషించి అతణ్ణి ఆశీర్వదించారు.అలా ఆ భక్తుడికి ముందు జరగబోయే ఉపద్రవాన్ని మహాస్వామి వారు తప్పించారు.

ఎప్పుడైతే మనం భక్తితో పరమాత్ముణ్ణి ప్రార్థించి, సేవిస్తామో మనకు రాబోయే బాధలు కష్టాలు మన దరిచేరకనే కరిగిపోతాయి.

--- రా. వెంకటసామి, శక్తి వికటన్ ప్రచురణ

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Monday, September 24, 2018

రావి చెట్టు - ప్రదక్షిణం


పరమాచార్య స్వామి వారు తమని తాము సాధారణ సన్యాసిగా చెప్పుకున్నా కొన్ని సంఘటనలు వారి నిజరూపాన్ని వారి అపార శక్తిని తెలియపరుస్తాయి. అలాంటి ఒక సంఘటన నా జీవితంలో జరిగింది.

అప్పుడు పరమాచార్య స్వామి వారు తిరువనైక్కావల్ లో మకాం చేసారు. నేను నా భర్త మహాస్వామి వారిని దర్శించుకుని తిరిగి తంజావూరు వెళ్ళిపోవాలి. మరుసటి రోజు సోమవార అమావాస్య. మేమిద్దరమూ తంజావూరులో రావి చెట్టుకు ప్రదక్షిణ చేయాలి.

మహాస్వామి వారు అక్కడకు వచ్చిన అందరితోను మాట్లాడి వారికి ప్రసాదం ఇచ్చి పంపిస్తున్నారు. మా విన్నపం విని కూడా మా మాటలు విన్నట్టు ఉన్నారు. మేము వరుసలో వచ్చినప్పుడు మా ముందువరకు అందరికి ప్రసాదం ఇచ్చి మా వంతు వచ్చిన వెంటనే లేచి లోపలికి వెళ్ళిపోయేవారు – వారు పదే పదే ఇలాగే చేస్తుండేవారు.

మేము తంజావూరు వెళ్ళే ఆలోచన విరమించుకుని రాత్రికి అక్కడే ఉండిపోయాము. నాకు మహాస్వామి వారిపై చాలా కోపంగా ఉన్నింది.

మరుసటి రోజు ఉదయం విశ్వరూపం తరువాత, వారి గంట జపం మొదలుపెట్టేముందు మేనేజరు వారితో “ముప్పవు గంట తరువాత నేను జపంలో ఉండగానే పల్లకిని కొల్లిదం నది ఒడ్డుకు చేర్చుటకు ఏర్పాట్లు చెయ్యమని” చెప్పారు. వారు పల్లకిలోపల కూర్చుని తలుపులు వేసుకున్నారు.

రావి చెట్టుకు ఎలాగు ప్రదక్షిణలు చేయలేమని తెలుసుకుని, కనీసం మహస్వామి వారి చుట్టూ తిరుగుదామని అనుకున్నాము. మేనా చుట్టూ ప్రదక్షిణలు చెయ్యడం మొదలుపెట్టాము. అది పూర్తి అయినతరువాత పల్లకి బయలుదేరింది. మేము కూడా దాని వెంట వెళ్ళి కొల్లిదం చేరుకుని అక్కడే స్నానాదులు ముగించాము.

పరమాచార్య స్వామి వారు తమ అనుష్టానానికి కూర్చుంటూ నన్ను పిలిచి ”ఎన్ని ప్రదక్షిణలు చేసావు?” అని అడిగారు. “తొంబై ప్రదక్షిణలు” అని చెప్పాను. కాని నేను ప్రదక్షిణలు చేసినట్టు మహాస్వామి వారు చూసే అవకాశమే లేదు. మిగిలిన ప్రదక్షిణములు కూడా పూర్తి చెయ్యమని చెప్పారు.

నేను మిగిలిన ప్రదక్షిణలు పూర్తి చేసిన తరువాత నన్ను అడిగారు, “ఏ శ్లోకం పఠిస్తూ ప్రదక్షిణలు చేసావు?”

“గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః అని మననం చేస్తూ ప్రదక్షిణ చేసాను” అని చెప్పాను.

“రావి చెట్టు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ శ్లోకం పఠిస్తావు?” అని అడిగారు.

”మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపాయ అగ్రతో శివరూపాయ వృక్షరాజాయతే నమో నమః” అని అన్నాను.

వెంటనే మహాస్వామి వారు “మరింకేంటి ఇక్కడా త్రిమూర్తియే అక్కడా త్రిమూర్తియే. సరిపోయింది కదా!” అని అన్నారు.

ఈ మాటలు చెప్పి నన్ను ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చారు. అప్పటినుండి ప్రతి సోమవార అమావాస్య నాడు పరమాచార్య స్వామి వారికి ప్రదక్షిణ చెయ్యాలని నియమం పెట్టుకున్నాను.

--- జయలక్ష్మీ అమ్మాళ్, పొల్లాచి. మహాపెరియావళ్ – దరిశన అనుభవంగళ్ 4

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

https://t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం