Monday, June 16, 2014

మూడు శేర్ల వినాయకుడు



మనం గణపతి యొక్క అనేక రూపాలని పూజిస్తూ ఉంటాం. లక్ష్మీ గణపతి, మహాగణపతి, సిద్ధి బుద్ధి తో ఉన్న గణపతి, బాల గణపతి ఇలా అనేకానేక రూపాలతో ఉన్న గణపతిని మనం పూజిస్తూ ఉంటాం. మధురైలోని మీనాక్షి అమ్మ గుడిలో ఓ వినాయకుడి సన్నిధి ఉంది. ఆయన్ని అక్కడవారు అరవంలో "ముక్కురుని పిల్లయార్" అనిపిలుస్తుంటారు. ముక్కురుని అంటే మూడు శేర్లు (శేరు అనేది ఒక కొలత). పిల్లయార్ అంటే పిల్లవాడు అని. ముక్కురుని పిల్లయార్ గుడి మీనాక్షి అమ్మ గుడిలోనే కాక, చిదంబరంలోనూ, నాగపట్టణంలోనూ ఉంది. ఈ గణపతి అవతారానికి సంబంధించి ఒక చిత్రమైన కధ ఉంది

గణపతి రూపమే చాలా విచిత్రమైనది. ఎంతో పెద్ద దేహంతో చాటంత చెవులతో, పేద్ద తొండంతో, చిన్ని కళ్ళతో, పెద్ద ఏనుగు ముహంతో ఉంటాడు. కొద్దిగా మరగుజ్జు  రూపంలో ఉండి పెద్ద బొజ్జతో కూర్చొని ఉంటాడు. ఆయన చేతిలో కుడుములూ, ఉండ్రాళ్ళూ మొదలైనవి కనిపిస్తుంటాయి. ఈ అవతారాన్ని చూసి పూర్వం వినాయకుడిని అందరూ గేలిచేసి ఆటపట్టిస్తూ ఉండేవారుట. ఏమంటే "నువ్వు ఎప్పుడూ అంత బొజ్జతో ఉండి ఏ పనీ చెయ్యక మీ అమ్మగారిచ్చిన కుడుములు తింటూ ఉంటావ్ కదా?" అని. అలా అందరూ గేలిచేసేసరికి వినాయకుడికి బాధ కలిగిందిట. ఇహ లాభం లేదు ఏదన్నా పనిచేసి ఈ ఆటపట్టించే వారికందరికీ తగిన సమాధానం చెప్పాల్సిందే అనిపించి తన భక్తుడైన ఒక రైతు దగ్గర చిన్న పాటి ఉద్యోగం చేద్దామని వెళ్ళాడుట. 

    ఆ రైతు యొక్క వరిపంట ఏపుగా పెరిగి కోతకి సిద్ధంగా ఉందిట. ఓ బాలుడి రూపంలో వినాయకుడు వెళ్ళి రైతుకి సహాయం చేద్దామనుకొంటున్నట్టు చెప్పాడు. అందుకు రైతు కొంత ఆలోచించి జీతం ఎంతకావాలని అడిగాడుట. అందుకు వినాయకుడు "నీ చేతికి పంట వచ్చాకా మూడు శేర్ల ధాన్యాన్ని ఇయ్యమని" చెప్పాట్ట. అందుకు సరే అని రైతు వినాయకుడికి పొలంలో పిట్టలని తోలి తన ధాన్యపు పంటని కాపుగాసే పని ఇచ్చాట్ట. వినాయకుడు అలా రోజూ మంచె ఎక్కి పక్షులని పంట తినకుండా కాపుకాసాడుట. ఆఖరులో పంట చేతికొచ్చాకా రైతు సంతోషించి అన్న ప్రకారం మూడు శేర్ల ధాన్యాన్ని ఇచ్చాడుట. తన తొలి సంపాదనని తీసుకెళ్ళి అమ్మైన పార్వతీ దేవికి చూపించాట్ట గణపతి. అది చూసి పార్వతీదేవి " ఏ పిల్లాడైనా కష్టపడితే అమ్మ సంతోషించదు నాయనా. పుత్రుడు ప్రయోజకుడైతే అది తండ్రికే ఎక్కువ ఆనందాన్నిస్తుంది. నీ కష్టార్జితాన్ని మీ నాన్నగారికి చూపించు" అందిట. వినాయకుడు పరమేశ్వరుడి దగ్గరకు తీసుకెళ్ళి ఆ ధాన్యాన్ని చూపించి "నాన్నగారూ ఇంగోండి నా తొలి సంపాదన" అని చెప్పాడుట. పరమేశ్వరుడి చేష్టలు అర్ధం ఎవరు చెప్పగలరు ఆయనొక పిచ్చివాడిలా ఆనందంగా నవ్వుతూ ఆ మొత్తం ధాన్యాన్ని తన నెత్తిమీద వొంపేసుకొన్నాట్ట. ఒక విధంగా అంతా శివార్పణం అయ్యింది.

ఈ లీలకి గుర్తుగా ఈ రోజుకీ ముక్కూరుని పిల్లయార్ గుళ్ళలో వినాయకుడికి మూడు శేర్ల సరిపడా బియ్యంతో ఉండ్రాళ్ళు చేసి నైవేద్యం పెడుతుంటారు. మీరు ఈ టపాలో చూస్తున్నది మీనాక్షి అమ్మవారి గుడిలోని ముక్కురుని వినాయకుడి గుడి.

Courtesy : Chibi Vijayan
Photo : Danda pani