Monday, October 15, 2018

మహాస్వామి - మట్టి వైద్యం



ఒకసారి ఒక భక్తుడు పరమాచార్య స్వామి వద్దకు వచ్చి తన బంధువు ఒకరు ఆసుపత్రిలో కోమాలో ఉన్నాడని, వైద్యులు ఇక ఏమీ చెయ్యలేమని తేల్చేశారని బావురుమన్నాడు. తమ అసలు స్వరూపం ఎంటో తెలియడానికి ఇష్టపడని మహాస్వామి వారు తేనంబాక్కం దేవాలయానికి వెళ్ళమన్నారు.

“తేనంబాక్కం దేవాలయానికి వెళ్లి, విభూతి ప్రసాదాన్ని తీసుకుని మరలా ఇక్కడకు రా” అని ఆదేశించారు. అతను ఆలయానికి వెళ్ళగా, అప్పటికే ఆలయం తలుపులు వేసి ఉండటంతో, విభూది ప్రసాదం ఇవ్వడానికి అర్చకులు ఎవ్వరూ లేకపోవడంతో అతను నిరాశ పడ్డాడు. దిగాలుగా తిరిగొచ్చి నిలబడ్డాడు.

“సరే! చుట్టూ ఉన్న ప్రాకారంలో ఎవరైనా భక్తులు ఉంచిన విభూతి గాని, కుంకుమ గాని తీసుకుని రా” అని చెప్పారు స్వామివారు. ఆ భక్తుడు మరలా దేవాలయానికి వెళ్ళాడు కాని, ప్రకారం మొత్తం చూసినా ఎక్కడా ప్రసాదం కనపడలేదు ఆరోజు. ఇదే ఆశ్చర్యకరమైన విషయం అనుకుంటే, పరమాచార్య స్వామివారు మాకు కలిగించబోయే ఆశ్చర్యం ఇంకా పెద్దది.

ఆ భక్తుడు మరలా తిరిగిరావడంతో, “సరే వదిలేయ్. వెళ్లి ఆ దేవాలయ ప్రాకారం నుండి మట్టిని తీసుకుని రా” అని ఆదేశించారు. అతను మట్టిని తెచ్చి మహాస్వామివారి ముందు ఉంచాడు. ఇప్పుడు స్వామివారి అద్వితీయ శక్తులు బహిర్గతం అయ్యాయి.

శ్రీవారు ఆ మట్టిని దగ్గరకు తీసుకుని, మహిమాన్వితమైన వారి చేతివేళ్ళతో తాకుతూ ఆ మట్టికి మహత్వాన్ని ఇచ్చారు. కొద్దిసేపటి తరువాత దాన్ని బాలు మామకు ఇచ్చి, “వెళ్ళు. వెళ్లి దీన్ని అతనికి (రోగికి) ఇవ్వు” అని ఆదేశించారు.

స్వామివారి ఆదేశానుసారం బాలు మామ ఆసుపత్రికి బయలుదేరారు. కాని ఐసియులో కోమాలో ఉన్న రోగి వద్దకు తనను వదులుతారా, అతని వద్ద ఈ ఇసుకను ఉంచడానికి ఒప్పుకుంటారా అన్న ప్రశ్నలతో ఆసుపత్రికి చేరుకున్నారు. కాని అక్కడకు చేరుకున్న తరువాత ఏ సమస్య లేకుండా లోపలకు వెళ్ళగలిగారు. లోపలి గదిలోకి వెళ్లి ఆ రోగి దగ్గరకు వెళ్ళగానే, ఈ అద్భుతం జరిగింది. లోపలకు వెళ్ళగానే, అతని వద్దకు వెళ్లి అతనికి దగ్గరగా ఆ మట్టిని ఉంచి రావాలని బాలు మామ ఆలోచన. కాని అక్కడ జరిగింది వేరు.

బాలు మామ లోపలికి వెళ్ళగానే, కోమాలో ఉన్న రోగి కొద్దిగా కదలికలను చూపించాడు. పరమాచార్య స్వామివారి ప్రసాదం అడుగుతున్నట్టుగా హఠాత్తుగా చేతులను బయటపెట్టాడు. అ స్థితి చూస్తే అతనే లేచి “అది పరమాచార్య స్వామి ప్రసాదమా? దయచేసి ఇవ్వండి” అని అడుగుతాడేమో అనుకున్నారు బాలు మామ.

బాలు మామకు చాలా ఆశ్చర్యం వేసింది. పరమాచార్య స్వామివారి అనుగ్రహం వల్ల ఇలాంటి అద్భుతాల జరుగుతాయని తనకు తెలుసు కాబట్టి కొద్దిసేపటి తరువాత తేరుకున్నారు. ప్రసాదాన్ని ఇచ్చి తిరిగొచ్చారు. మొత్తం జరిగిన విషయం మహాస్వామివారికి తెలిపారు. తమ శక్తిని తెలపడానికి ఇష్టపడని స్వామివారు, “సరే! మరో రెండు మూడు రోజులు ఆసుపత్రికి వెళ్లి, అతనికి ప్రసాదం ఇచ్చి రా” అని ఆదేశించారు.

స్వామివారి ఆజ్ఞానుసారం బాలు మామ మూడు రోజులపాటు ఆసుపత్రికి వెళ్లి, అతనికి ప్రాసాదం ఇచ్చారు. అక్కడి డాక్టర్లందరూ ఆశ్చర్యానికి లోనయ్యేటట్టుగా, ఆ రోగి కోమా నుండి బయటపడి మామూలు మనిషి అయ్యాడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

పరమాచార్య స్వామివారి వైభవాన్ని, మహిమలను వర్ణించడం ఎవ్వరి తరమూ కాదు.

--- ‘శ్రీ పెరియవ మహిమై’ పత్రిక నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

https://t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం