Monday, September 24, 2018

రావి చెట్టు - ప్రదక్షిణం


పరమాచార్య స్వామి వారు తమని తాము సాధారణ సన్యాసిగా చెప్పుకున్నా కొన్ని సంఘటనలు వారి నిజరూపాన్ని వారి అపార శక్తిని తెలియపరుస్తాయి. అలాంటి ఒక సంఘటన నా జీవితంలో జరిగింది.

అప్పుడు పరమాచార్య స్వామి వారు తిరువనైక్కావల్ లో మకాం చేసారు. నేను నా భర్త మహాస్వామి వారిని దర్శించుకుని తిరిగి తంజావూరు వెళ్ళిపోవాలి. మరుసటి రోజు సోమవార అమావాస్య. మేమిద్దరమూ తంజావూరులో రావి చెట్టుకు ప్రదక్షిణ చేయాలి.

మహాస్వామి వారు అక్కడకు వచ్చిన అందరితోను మాట్లాడి వారికి ప్రసాదం ఇచ్చి పంపిస్తున్నారు. మా విన్నపం విని కూడా మా మాటలు విన్నట్టు ఉన్నారు. మేము వరుసలో వచ్చినప్పుడు మా ముందువరకు అందరికి ప్రసాదం ఇచ్చి మా వంతు వచ్చిన వెంటనే లేచి లోపలికి వెళ్ళిపోయేవారు – వారు పదే పదే ఇలాగే చేస్తుండేవారు.

మేము తంజావూరు వెళ్ళే ఆలోచన విరమించుకుని రాత్రికి అక్కడే ఉండిపోయాము. నాకు మహాస్వామి వారిపై చాలా కోపంగా ఉన్నింది.

మరుసటి రోజు ఉదయం విశ్వరూపం తరువాత, వారి గంట జపం మొదలుపెట్టేముందు మేనేజరు వారితో “ముప్పవు గంట తరువాత నేను జపంలో ఉండగానే పల్లకిని కొల్లిదం నది ఒడ్డుకు చేర్చుటకు ఏర్పాట్లు చెయ్యమని” చెప్పారు. వారు పల్లకిలోపల కూర్చుని తలుపులు వేసుకున్నారు.

రావి చెట్టుకు ఎలాగు ప్రదక్షిణలు చేయలేమని తెలుసుకుని, కనీసం మహస్వామి వారి చుట్టూ తిరుగుదామని అనుకున్నాము. మేనా చుట్టూ ప్రదక్షిణలు చెయ్యడం మొదలుపెట్టాము. అది పూర్తి అయినతరువాత పల్లకి బయలుదేరింది. మేము కూడా దాని వెంట వెళ్ళి కొల్లిదం చేరుకుని అక్కడే స్నానాదులు ముగించాము.

పరమాచార్య స్వామి వారు తమ అనుష్టానానికి కూర్చుంటూ నన్ను పిలిచి ”ఎన్ని ప్రదక్షిణలు చేసావు?” అని అడిగారు. “తొంబై ప్రదక్షిణలు” అని చెప్పాను. కాని నేను ప్రదక్షిణలు చేసినట్టు మహాస్వామి వారు చూసే అవకాశమే లేదు. మిగిలిన ప్రదక్షిణములు కూడా పూర్తి చెయ్యమని చెప్పారు.

నేను మిగిలిన ప్రదక్షిణలు పూర్తి చేసిన తరువాత నన్ను అడిగారు, “ఏ శ్లోకం పఠిస్తూ ప్రదక్షిణలు చేసావు?”

“గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః అని మననం చేస్తూ ప్రదక్షిణ చేసాను” అని చెప్పాను.

“రావి చెట్టు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ శ్లోకం పఠిస్తావు?” అని అడిగారు.

”మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపాయ అగ్రతో శివరూపాయ వృక్షరాజాయతే నమో నమః” అని అన్నాను.

వెంటనే మహాస్వామి వారు “మరింకేంటి ఇక్కడా త్రిమూర్తియే అక్కడా త్రిమూర్తియే. సరిపోయింది కదా!” అని అన్నారు.

ఈ మాటలు చెప్పి నన్ను ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చారు. అప్పటినుండి ప్రతి సోమవార అమావాస్య నాడు పరమాచార్య స్వామి వారికి ప్రదక్షిణ చెయ్యాలని నియమం పెట్టుకున్నాను.

--- జయలక్ష్మీ అమ్మాళ్, పొల్లాచి. మహాపెరియావళ్ – దరిశన అనుభవంగళ్ 4

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

https://t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం