Tuesday, January 7, 2020

బియ్యంబస్తాలు



Image result for paramacharya rice



పరమాచార్య స్వామివారు రామేశ్వరంలోని శ్రీమఠం శాఖకి బియ్యాన్ని పంపమని 1964 ప్రారంభం నుండే బియ్యం దాతలకు చెబుతున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరంగా తోచి మేనేజరు కూడా ఎక్కువ బియ్యం నిల్వకి ఏర్పాట్లు చేసాడు. కాని అతను ఈ విషయంలో చాలా అసహాయతతో అప్పుడప్పుడు తన అసహనాన్ని స్వామివారికి గట్టిగానే వినిపిస్తున్నాడు. 

కాని పరమాచార్య స్వామివారు ఈ విషయంలో కాస్త మొండిగా వ్యవహరించి రామేశ్వరంలోని వారి శాఖామఠంలో 250 బస్తాల బియ్యం నిల్వచేసేట్టు చర్యలు తీసుకున్నారు. 1964 డిసెంబరు మాసంలో పెద్ద తుఫాను రామేశ్వరంని తాకింది. 

ఆ తుఫాను దెబ్బకి రామేశ్వరం చేరడానికి ఉన్న ఒక్క మార్గం పంబన్ వారధి ధ్వంసమైంది. ధనుష్కోటి పట్టణం మొత్తం సముద్రంలో కలిసిపోయింది. సముద్రుని అలల ఆవేశం వల్ల రామేశ్వర ద్వీపానికి ఆహారం పంపించడం జరగని పని. 

పరమాచార్య స్వామివారు ముందుచూపుతో రామేశ్వరంలోని మఠంలో నిల్వచేయించిన 250 బియ్యం బస్తాలే ప్రకృతి విలయం దెబ్బకి సర్వం కోల్పోయిన రామేశ్వరంలోని వేలాదిమంది ప్రజలకి ఆహారమై వారి కడుపు నింపింది. 

సుశనుడు

Image result for శుక్రుడు




అనేక సందర్భాలలో దేవతల వలన కలిగిన ప్రమాదాలతో తల్లడిల్లిన రాక్షస జాతినే శుక్రాచార్యుడు కాపాడినట్లు అనేకానేక పురాణకథలలో కనిపిస్తుంటుంది. రాక్షసులకు గురువైన ఈ శుక్రాచార్యుడి జన్మకు సంబంధించిన కథ విచిత్రంగా ఉంటుంది. పూర్వం యక్షులకు రాజైన కుబేరుడు దేవరాజైన ఇంద్రుడి కోశాగారానికి అధిపతిగా ఉంటుండేవాడు అయితే ఈ కుబేరుడి ఆధిపత్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో సుశనుడు అనే ఒక ముని సమయం కోసం వేచి ఉండేవాడు. ఆ మునికి తగిన సమయం ఆసన్నం కాగానే తన యోగశక్తి సహాయంతో కుబేరుడి ఆధీనంలో ఉన్న సంపద మొత్తాన్ని సంగ్రహించుకుని తీసుకువెళ్ళాడు. ఆ విషయం తెలిసిన కుబేరుడు తను సుశనుడి చేతిలో మోసపోయినందుకు ఎంతగానో బాధపడుతూ ఎవరికి చెప్పినా ఫలితం లేదని చివరకు పరమేశ్వరుడినే శరణువేడాడు. శరణన్న వారిని ఆదుకునే శంకరుడు కుబేరుడికి అభయమిచ్చి సుశనుడిని సంహరించి ఆ ధనాన్ని మళ్ళీ కుబేరుడికి అప్పగించాలనుకున్నాడు. అయితే ఈ విషయం తెలిసిన సుశనుడు మొండి ధైర్యంతో ఎలాగైనా పరమేశ్వరుడి నుంచి తప్పించుకోవాలని అనేక విధాలుగా తరుణోపాయం కోసం ఆలోచించసాగాడు. తాను ఎక్కడ దాక్కున్నా పరమేశ్వరుడు తనను పట్టి సంహరిస్తాడనే నిర్ణయానికి వచ్చి ఆ ముని తన యోగమాయతో పరమేశ్వరుడి చేతిలో ఉన్న శూలం మీదకు చేరి కూర్చున్నాడు. శూలం మీద ఉన్న తనను శివుడు గమనించడులే అనుకున్న ఆ మునికి నిరాశే ఎదురయింది. సకల చరాచర జగత్తును శాసించగల శివుడు మునిని కనుక్కోలేకపోవడం అనేది అసంభవం. తన శూలాగ్రం మీదనే తనకు కోపాన్ని తెప్పించిన ముని ఉన్నాడని గమనించిన శివుడు తన చేతిలోని శూలాన్ని మరొక చేతితో వంచాడు. ఆనాటినుండి అలా వంగిన శూలం శివుడికి పినాకము అనే ఆయుధంగా మారిపోయింది. అల్లరి చేష్టలు లాగా తనను చీకాకు పరుస్తున్న మునిని శివుడు ఒక చేత్తో పట్టుకుని తన నోట్లో వేసుకుని మింగివేశాడు. అలా సుశనుడు పరమేశ్వరుడు గర్భంలో తిరగడం ప్రారంభించాడు. పరమేశ్వరుడి గర్భగోళంలో వుండలేక తనను రక్షించమని అనేక రకాలుగా ఆముని ఈశ్వరుడిని ప్రార్ధిస్తూ ఎలాగైనా బయటకు తీయమని వేడుకున్నాడు. అయినా చాలాకాలం వరకు శివుడు అతడి మాటలను వినిపించుకోలేదు. సుశనుడు మరీమరీ ఆర్థ్రత నిండిన భక్తి భావంతో శివుడిని ప్రార్ధిస్తూ ఎలాగైనా తనను వెలుపలికి రప్పించమని ఎన్నోమార్లు వేడుకున్న మీదుట శివుడు శాంతుడై తన సర్వ రంధ్రాలను మూసి ఒక్క రంధ్రాన్ని మాత్రం తెరిచి వుంచి ఆ రంధ్రం నుండి సుశనుడిని బయటకు రమ్మనమని చెప్పాడు. చేసేది లేక ఈశ్వర శుక్లం వెలవడే ఆరంధ్రం నుండే సుశనుడు బయటకు వచ్చాడు. ఆనాటి నుండి సుశనుడు శుక్రుడు అయ్యాడు. బయటకు వచ్చిన శుక్రుడు గొప్ప తేజస్సుతో వెలుగొందుతూ కనిపించాడు. శివుడికి అప్పటికీ అతడిమీద కోపం చల్లారలేదు. అతడిని పట్టి సంహరించబోతుండగా ఈశ్వర గర్భం నుంచి వెలువడినవాడు తనకు పుత్రుడితో సమానమని పార్వతీదేవి శివుడికి నచ్చచెప్పి అతడిని రక్షించమని ప్రార్ధించింది. పార్వతీదేవి ప్రార్ధన మేరకు పరమేశ్వరుడు శుక్రుడిని విడిచి పెట్టాడు. శుక్రుడు కూడా తనమీద దయ చూపిన పార్వతీ పరమేశ్వరులకు మొక్కి వెళ్ళిపోయాడు. అలా సుశనుడు అనే ముని అనంతర కాలంలో దానవులకు గురువైన శుక్రాచార్యుడిగా మారిన ఈ కథను భారతం శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు వివరించి చెప్పాడు. ఈ శుక్రాచార్యుడు కథ కొద్దిపాటి తేడాతో శివపురాణంలో కూడా కనిపిస్తుంది.