Wednesday, August 19, 2020

సాల్వ వధ

 Ancient Aircraft (Vimana) and Parachute by King Salwa in Bhagavata ...


 ఈ కథ మహాభారతం అరణ్యపర్వం ప్రథమాశ్వాసంలో ఉంది. అన్ని కథల కన్నా ఈ కథకు ఒక ప్రత్యేకత ఉంది. దుర్యోధనుడు నిండుసభలో ద్రౌపదిని, పాండవులను అవమానించటం, అంతకంటే ముందు పాండవులు, కౌరవులు జూదం ఆడటం, ఆ జూదంలో అన్యాయంగా కౌరవులు పాండవులను ఓడించి ద్రౌపది వస్త్రాపహరణం, పాండవుల అరణ్యవాసం ఇలాంటి దుష్కృత్యాలు ఎన్నెన్నో సంభవించాయి. అయితే పాండవుల పక్షపాతిగా నిరంతరం వారిని వెన్నంటి ఉన్న శ్రీకృష్ణుడు పాండవులను జూదం ఆడకుండా ఎందుకు నివారించలేకపోయాడు అనే ప్రశ్నకు శ్రీకృష్ణుడే సమాధానం చెప్పిన సందర్భం ఈ కథలో ఉంది.

జూదంలో ఓడిపోయి అరణ్యాల పాలైన పాండవులు కామ్యకవనానికి చేరుకున్నారు. అక్కడకి శ్రీకృష్ణుడు వచ్చి పాండవుల యోగక్షేమాలను విచారించాడు. తాను సాల్వుడు అనే శిశుపాలుడి సోదరుడితో పదినెలల పాటు యుద్ధం చేస్తున్న కారణంగా తనకు పాండవులు జూదానికి వెళ్ళిన సంగతికానీ మరి ఏ ఇతర విషయాలు కానీ తెలియలేదని, సాల్వుడిని సంహరించిన తర్వాత యుధానుడు తనకు ఈ విషయమంతా చెప్పాడని వెంటనే తనకు పాండవులను చూడాలనిపించి కామ్యకవనానికి వచ్చానని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు.

శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను విని ఎంతో ఆశ్చర్యానికి లోనైన ధర్మరాజు తనకు సాల్వవధ ఇతివృత్తాన్ని వివరించి చెప్పమన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ యుద్ధానికి సంబంధించిన పూర్వాపరాలన్నింటినీ ధర్మరాజుకు వివరిస్తూ శిశుపాలుడి తమ్ముడైన సాల్వుడు తాను శిశుపాలుడిని సంహరించినందుకు తనమీద ఎంతో క్రోధాన్ని పెంచుకున్నాడని కృష్ణుడు చెప్పాడు. సాల్వుడికి సౌంభకం అనే కామగమనం గల ఒక నగరం ఉండేదని ఆ నగరంతో సహా సాల్వుడు ఎదురువచ్చి ద్వారకా నగర పరిసరాలలో శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని కృష్ణుడిని సంహరిస్తానని పెద్దపెద్దగా కేకలు పెడుతుండగా యాదవ కుమారులు సాల్వుడి మీదకు దండెత్తి వెళ్ళారు. వారిలో చారుధేష్ణుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు తదితరులను సాల్వుడి సేనాపతి అయిన క్షేమవృద్ధి ఎదిరించాడు. సాంబుడు వాడిని తన బాణపు దెబ్బలతో ఏడిపించాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక క్షేమవృద్ధి పారిపోగా వేగవంతుడు అనే మరొకడు వచ్చి సాంబుడి మీద విరుచుకుపడ్డాడు. అప్పుడు చారుదేష్ణుడు వేగవంతుడిని ఎదిరించి వధించాడు. ఆ తర్వాత విలంత్యుడు అనే వాడిని కూడా చారుదేష్ణుడు వధించటంతో సాల్వుడు ఉగ్రుడై తన మహాసేనతో అక్కడికి వచ్చాడు. అప్పుడు ప్రద్యుమ్నుడికి సాల్వుడికి ఘోరయుద్ధం జరిగింది. ప్రద్యుమ్నుడు దివ్యాస్త్రంతో వాడిని సంహరించబోగా నారదుడు తదితర మునులు అక్కడికి వచ్చి తొందర పడవద్దని సాల్వుడి మరణం శ్రీకృష్ణుడి చేతిలోనే ఉందని చెప్పటంతో ప్రద్యుమ్నుడు వాడిని వదిలివేశాడు. యాదవ కుమారులను సాల్వుడు ఇలా ఎదురిస్తూ ద్వారకానగరాన్ని ముట్టడిస్తున్నాడన్న సంగతి ధర్మరాజు చేస్తున్న రాజసూయయాగంలో ఉన్న శ్రీకృష్ణుడికి తెలిసింది. యాగం పరిసమాప్తి అయిన తర్వాత సాల్వుడి వధకు కృష్ణుడు పూనుకున్నాడు. అంతేగాక వాడిని సంహరించి కానీ ద్వారకలో అడుగుపెట్టనని కృష్ణుడు శపథం చేసి తన పాంచజన్యాన్ని పూరించి శిశుపాలుడి తమ్ముడైన సాల్వుడు ఉన్న మూర్తికావత దేశం మీదకు అసంఖ్యాక చతురంగ బలాలతో వెళ్ళాడు. అయితే సాల్వుడు తన కామగమనం గల నగరం సౌంభకంతో సహా సముద్రకుక్షి దేశానికి వెళ్ళాడు. కృష్ణుడు కూడా అక్కడికే వెళ్ళి వారితో ఘోరయుద్ధానికి తలపడ్డాడు. సాల్వుడు తన సౌంభకాన్ని ఎక్కి శ్రీకృష్ణుడితో ఎన్నోరకాలుగా మాయాయుద్ధం చేశాడు. కృష్ణుడి మీద శిలావర్షాన్ని కురిపిస్తుండటంతో కృష్ణుడు తన వజ్రబాణాల చేత ఆ శిలావర్షాన్ని నిరోధించాడు. వాడు తన నగరంతో సహా ఆకాశంలో మాయమై దొంగచాటుగా యుద్ధం చేస్తుండటంతో చివరకు ఇక సహించలేక కృష్ణుడు తన చక్రాయుధాన్ని వాడిమీదకు సంధించాడు. అది ఆకాశంలో ఉన్న సౌంభకంలోని సాల్వుడిని సంహరించింది. వెంటనే సౌంభక నగరంతో సహా సాల్వుడు నేలకూలాడు.

* * *

పదినెలల పాటు శ్రీకృష్ణుడు తాను ఇలా ఘోరాతి ఘోరంగా సాల్వుడితో యుద్ధం చేసి వాడిని సంహరించి కానీ ద్వారకకు చేరుకోలేదని ఈ కారణంగానే పాండవుల విషయాలు ఏవీ తనకు తెలియకుండా పోయాయని చెప్పాడు. ఆ తర్వాత కృష్ణుడు పాండవులందరికీ ధైర్యవచనాలు చెప్పి తన చెల్లెలైన సుభద్రను, మేనల్లుడైన అభిమన్యుడిని రధం మీద ఎక్కించుకొని ద్వారకా నగరానికి తీసుకువెళ్ళాడు. అలాగే ద్రౌపది సోదరుడైన దృష్టద్యుమ్నుడు ద్రౌపదికి పాండవుల అయిదుగురి వల్ల కలిగిన ఉపపాండవులను తీసుకొని ద్రుపది నగరానికి వెళ్ళిపోయాడు. ఈ కారంణంగానే మిగిలిన అరణ్య, అజ్ఞాతవాస సమయాలలో సభద్ర, అభిమన్యుడు, ఉపపాండవుల ప్రస్తావన మనకు కనిపించదు.