Saturday, June 8, 2019

గౌతమ మహాముని

Related image

తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే. పాపం కూడా నిప్పులాంటిదే. నిప్పులాగే దాని ప్రభావం ఉంటుంది. ఈ జీవిత సత్యాన్ని సమర్ధిస్తూ భూమికి గౌతమిని తెచ్చి మనుషుల పాపాలను పోగొట్టేందుకు కృషి చేసిన గౌతమ మునికి సంబంధించిన కథ ఒకటి ఉంది. శివపురాణంలో కోటిరుద్ర సంహితలో ఇది కనిపిస్తుంది. గౌతమ మునిని గోహత్యా పాపం చుట్టుకుందని భయపెట్టి ఆయనచేత తీవ్రమైన తపస్సు చేయించి గంగ భూమి మీదకు వచ్చి గౌతమిగా మారి ముందుగా గౌతముడి పాపాన్ని తొలగించి ఆ తర్వాత అందరి పాపాలను క్షాళన చేసేందుకు పథకం పన్నిన బ్రాహ్మణులు శాపం పాలయ్యారు. అయితే ఈ సందర్భంలో గంగాదేవి కోపానికి గౌతముడిచ్చిన శాపానికి ఆ బ్రాహ్మణులేకాక వారి సంతతి కూడా దరిద్రులుగా మారవలసి వచ్చింది. గౌతముడి చేత గౌతమీ నదిని భూమి మీదకు తెప్పించడమన్నది మంచిపనే అయినా దీనికోసం ఒక మాయాగోవును సృష్టించటం అది గౌతముడి పంటచేలో వేస్తుండగా గౌతముడు దాన్ని మెల్లగా అదిలించటం, ఆ మాత్రానికే ఆ గోవు ప్రాణాలు విడవడం జరిగాయి. ఆ వెంటనే గౌతముడి ఆశ్రయం పొందిన బ్రాహ్మణులంతా గోహత్యా పాపం పోవడానికి గంగను భూమి మీదకు తీసుకురమ్మనమని గౌతముడికి చెప్పారు. నిజంగానే గోహత్య జరిగిందని భయపడి దాన్ని పోగొట్టుకోవటానికి ఆ ముని ఎంతో తీవ్ర తపస్సును చేయవలసి వచ్చింది. అన్నింటినీ మించి ఆ సమయంలో ఆయన పడిన మనోవ్యధ అంతా ఇంతా కాదు. బ్రాహ్మణులు గౌతముడి శక్తి తెలిసినవారే కనుక ఆయనను ఆలా భయానికి గురిచేయకుండా వేరొకవిధంగా సాత్విక ధోరణిలో ఆయనను ప్రార్థించి ఆయన చేత తపస్సు చేయించి గంగను భువికి తెప్పించి ఉంటే బ్రాహ్మణులకు గౌతముడి శాపం అంటివుండేది కాదు. గౌతముడికి బంధుప్రీతి, ఆశ్రిత రక్షణ మీద ఆసక్తి అధికంగా ఉన్నాయని బ్రాహ్మణులకు తెలుసు. కనుక వారు గౌతముడి ఆశ్రమం నుండి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నప్పుడు అంతమందీ కలిసి ఆయనకు నచ్చచెప్పి బయలుదేరినా అంత ప్రమాదం సంభవించి ఉండేది కాదు. విపరీతంగా కరవు ఉన్నంతకాలం గౌతముడి ఆశ్రమంలో ఆశ్రయాన్ని పొంది ఆ తరువాత ఆయన మీద బ్రాహ్మణులు గోహత్య పాపం జరిగిందని నాటకమాడిన తీరు సమంజసంగా లేదు. కనుకనే గౌతముడు వారిని శపించవలసి వచ్చింది. ఈ శాపానికి గంగాదేవి ప్రవర్తన కూడా కొంతవరకు దోహదం చేసింది.
పరమేశ్వరుడి అనుజ్ఞ మేరకు గౌతమీనది గౌతమ ముని వెంట బయలుదేరింది. ఆ గంగ బ్రహ్మగిరి మీద నుండి పరవళ్ళు తొక్కుతూ ఒక ఉదుంబర వృక్షపు కొమ్మనుండి జాలువారుతూ ప్రవాహ వేగాన్ని పుంజుకుంది. తొలిగా గౌతముడు ఆయన శిష్యులు ఆ గంగలో స్నానం చేసి తమ పాపాలను పోగొట్టుకున్నారు. ఆ ప్రదేశమే ఆనాటి నుండి గంగా ద్వారమని పేరు పొందింది. ఇలా గౌతముడు ఆయన శిష్యులు స్నానాలు చేసిన తర్వాత మాయా గోవును సృష్టించిన బ్రాహ్మణులు కూడా గౌతమిలో స్నానమాడటానికి వచ్చారు. అయితే ఎంతో ఆశ్చర్యంగా ఒక్క క్షణంలో ఆ గంగ వెంటనే అంతర్ధానమయింది. విస్తుపోయిన గౌతముడు గంగాదేవిని పలుమారులు స్తుతించాడు. అయితే అప్పుడు గంగ చేసిన మేలును మరిచి పాపం చేసిన వారిని తాను తాకలేనని పలికింది. అయితే వెంటనే గౌతముడు
‘అపకారిషు యో లోక ఉపకారం కరోతివై!
తేన పూతో భవామ్యత్ర భగవద్వచనం త్విదమ్‌’
అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చెయ్యడమే గొప్పతనంగా పరిగణలో ఉందని కనుక ఈ అపకారులకు ఉపకారం చెయ్యమని వేడుకున్నాడు. గౌతముడు అలా అనేక విధాలుగా మంచి సూక్తులతో గంగాదేవిని శాంతపరిచాడు. అప్పటికీ ఆమె గౌతముడికి అపకార చేసిన వారికి ప్రత్యక్షం కావటానికి ఒప్పుకోక కొన్ని నిబంధనలను పెట్టింది. ముందుగా వారంతా నూట ఒక్కసార్లు బ్రహ్మగిరికి ప్రదక్షిణం చెయ్యాలని ఆ తరువాతనే వారికి తాను ప్రత్యక్షమవుతానని పలికింది. ఆ బ్రాహ్మణులంతా జరిగిన తప్నేమిటో తెలుసుకుని తమను క్షమించమని గంగాదేవిని వేడుకున్నారు. గంగ చెప్పినట్లుగానే గిరి ప్రదక్షిణలు చేశారు. వారు అలా చేసిన తరువాత గంగాదేవి అనుజ్ఞతో గంగ ద్వారానికి కింది భాగంలో గౌతమ ముని ఒక గొయ్యిని తవ్వాడు. దానిపేరే కుశావర్తం. గంగాదేవి ఆ గొయ్యిలోకి ప్రవహించింది. అది ఉత్తమ తీర్థంగా పేరు తెచ్చుకుంది. అలా ఆ కుశావర్తంలో అంతా స్నాన విధులను నిర్వహించి పవిత్రులయ్యారు.
ఈ కథలోనే కల్పభేదంతో మరొక విషయం కూడా కనిపిస్తుంది. గౌతముడు తనను ఇబ్బంది పెట్టిన బ్రాహ్మణులందరినీ గంగను భూమి మీదకు తెచ్చిన తరువాత తాను గోహత్యా పాపం పొగొట్టుకున్న తర్వాత తీవ్రంగా శపించాడు. ఆ శాపం ప్రకారం వారికి వారి సంతతికి కూడా శివభక్తి నశించటం, దరిద్రం ప్రాప్తించటం లాంటివన్నీ సంభవించాయి. వారు చేసేదిలేక కాంచీనగరంలో నివాసమేర్పరచుకుని గౌతముడి శాపాన్ని అనుభవించారుట. కనుక తెలిసి చేసినా తెలియక చేసినా లేక మంచి జరుగుతుందన్న ఆలోచనతో చేసినా కూడా తప్పు తప్పేనని ఆ తప్పునకు తగిన శిక్ష ఎవరైనా అనుభవించి తీరాల్సిందేనని ఈ కథ వివరిస్తోంది.


- శ్రీ యల్లాప్రగడ మల్లికార్జున రావు గారు

- సేకరణ ఈనాడు దినపత్రిక నుంచీ 

No comments:

Post a Comment