Monday, February 3, 2020

మన్మథుడే ప్రద్యుమ్నుడు

Image result for pradyumna



శివుడు కోపాగ్నికి దగ్ధమైన మన్మథుడు ఆ తరువాత ఏమయ్యాడు? రతీ విలాసానికి కరిగిన దేవతలు ఆమెకు ఎలాంటి వరమిచ్చారు? రతీ మన్మథులు సశరీరులుగా మళ్లీ ఎప్పుడు ఎలా కలుసుకోగలిగారు? అనే విషయాలను భాగవతంలో వ్యాసుడు చెప్పిన ఈ కథ వివరిస్తుంది. మన్మథుడు ప్రద్యుమ్నుడుగా శ్రీకృష్ణుడికి జన్మించటం ఆ ప్రద్యుమ్నుడే కృష్ణుడికి విరోధి, కృష్ణుడు భార్య రుక్మిణికి సోదరుడు అయిన రుక్మి కుమార్తెను వివాహమాడి రెండు కుటుంబాల నడుమ ఉన్న కయ్యాన్ని వియ్యంగా మార్చిన ఉదంతం ఈ కథలోనే కనిపిస్తాయి. ఎన్నెన్నో మెలికలతో ఈ కథ చివరకు సుఖాంతంగా ముగుస్తుంది.


తారకాసురుడిని సంహరించడం కోసం పార్వతికి శివుడికి జన్మించే కుమారుడే తగిన వాడని బ్రహ్మ దేవతలకు చెప్పడంతో దేవతలంతా వెళ్లి తపోనిష్ఠలో ఉన్న పరమేశ్వరుడి మనసు మార్చటానికి మన్మథుడిని ఆశ్రయించారు. మన్మథుడు దైవకార్యం నెరవేర్చటానికి ఉద్యుక్తుడయ్యాడు. కానీ శివుడి ఆగ్రహానికి మాడి మసైపోయాడు. అప్పుడు రతీదేవి విపరీతంగా విలపిస్తుండగా దేవతలామెను ఓదార్చి మన్మథుడు తిరిగి ప్రద్యుమ్నుడు అనే పేరుతో జన్మిస్తాడని చెప్పారు. నారదుడు రతీదేవికి మరింత మనశ్శాంతి కలగటానికి ప్రద్యుమ్నుడి జన్మకు సంబంధించిన విశేషాలను కూడా వివరించాడు. కృష్ణుడికి రుక్మిణిదేవి వల్ల ప్రద్యుమ్నుడు జన్మిస్తాడు. అయితే జన్మించిన కొద్ది రోజుల్లోనే శంబరాసురుడు అనే ఒక అనే ఒక రాక్షసుడు ప్రద్యుమ్నుడిని సంహరించే ప్రయత్నం చేస్తాడు. అందుకే శంబరాసురుడి బారి నుంచి ఆ బాలుడిని రక్షించుకోమని నారదుడు రతీదేవికి చెప్పాడు. అప్పుడామె ఆ దేవముని చెప్పిన మాటలను అనుసరించి మాయావతి అనే పేరుతో శంబరాసురుడి ఇంట్లోనే దాసిగా చేరింది. ఇలా జరిగిన కొంత కాలానికి ద్వారకలో రుక్మిణికి ఒక కుమారుడు జన్మించాడు. అయితే బాలుడు పుట్టిన ఎనిమిదో రోజునే జటాసురుడు అనే రాక్షసుడి కుమారుడైన శంబరాసురుడు ప్రద్యుమ్నుడిని ఎలాగైనా సంహరించాలని అనుకున్నాడు. కృష్ణుడికి జన్మించిన కుమారుడి వల్ల తనకు మరణం ప్రాప్తిస్తుందని తెలుసుకోవటమే అందుకు కారణం. శంబరాసురుడు ఒక కాకి రూపంలో రహస్యంగా పురిటింటిలో ప్రవేశించి ఆ బాలుడిని పట్టుకుని తీసుకువెళ్లి సముద్రంలో పడేశాడు. రుక్మిణి తదితరులంతా ఎంతగానో దుఃఖించారు. అయితే సముద్రంలో పడిన బాలుడిని ఒక పెద్ద చేప మింగింది. ఒక జాలరి వల వేసి పట్టినప్పుడు ఆ చేప అతడికి దొరికింది. చాలా పెద్దదిగానూ, అందంగా, విచిత్రంగా ఉన్న ఆ చేపను తమ రాజైన శంబరాసురుడికి కానుకగా ఆ జాలరి తీసుకువెళ్లి ఇచ్చాడు. శంబరాసురుడి వంట పనివారు ఆ చేపను తరుగుతుండగా దాని కడుపులో నుంచి ఒక చక్కని బాలుడు బయటపడ్డాడు. అందుకు వంట వారు ఆశ్చర్యపోయారు. అక్కడే దాసీ రూపంలో ఉన్న రతీదేవికి ఈ విషయం తెలిసింది. రతీదేవి ఆ బాలుడిని జాగ్రత్తగా కాపాడుతూ శంబరాసురుడి వల్ల ఎటువంటి ప్రమాదం కలుగకుండా చూడసాగింది. శంబరాసురుడు కాకి రూపంలో ప్రద్యుమ్నుడికి చేసిన అపకారం ఆమెకు తెలిసింది. మరింత జాగ్రత్తగా కంటికి రెప్పలా మాయావతి (రతీదేవి) ఆ బాలుడిని పెంచుతూ వచ్చింది. అతడు యుక్త వయస్సుకు వచ్చిన తరువాత ఒక రోజున ఆమె గతాన్నంతా అతడికి వివరించి చెప్పింది. అంతేకాక శంబరాసురుడిని జయించటానికి తనకు తెలిసిన మహామాయ అనే విద్యను అతడికి నేర్పించింది. ప్రద్యుమ్నుడు ఒక రోజున శంబరుడి మీదకు యుద్ధానికి వెళ్లాడు. ఆ ఇద్దరి మధ్య ఘోరంగా యుద్ధం జరిగింది. మహామాయ విద్య సహాయంతో ప్రద్యుమ్నుడు ఆ రాక్షసుడిని సంహరించాడు. ఆ తరువాత రతీదేవితో కలసి ఆకాశ మార్గాన ద్వారకా నగరానికి బయలుదేరి వెళ్లాడు.

శ్రీకృష్ణుడి లాగా రూపురేఖలున్న ప్రద్యుమ్నుడిని చూసి అందరూ కృష్ణుడేమోనని భావించారు. కానీ పక్కన రతీదేవి ఉండటం, కృష్ణుడికి శిరసున నెమలి పింఛం ఉన్నట్లు ప్రద్యమ్నుడికి లేకపోవడం చూసి కృష్ణుడు కాదని పరిచారికలు నిర్ధారించుకున్నారు. రుక్మిణీదేవి తనకు జన్మించి పురిట్లోనే అదృశ్యమైపోయిన తన కుమారుడు బతికి ఉంటే అలాగే ఉండి ఉండేవాడని అనుకుంటుండగానే అక్కడికి నారదుడు వచ్చి విషయమంతా వివరించాడు. అక్కడివారంతా ఎంతో ఆనందించారు. ప్రద్యుమ్నుడు రతీదేవినేకాక రుక్మి కుమార్తె అయిన రుక్మవతిని పెళ్లాడాడు. స్వయంవరంలో ఎందరో రాజులను ఓడించి మరీ ఆమెను చేజిక్కించుకున్నాడు. ఆ వివాహం వల్ల శ్రీకృష్ణుడికి రుక్మిణి సోదరుడైన రుక్మికి ఉన్న విరోధం నశించి వియ్యం కుదిరింది. ప్రద్యుమ్నుడికి రుక్మవతి వల్ల అనిరుద్ధుడు జన్మించాడు.

No comments:

Post a Comment