Tuesday, February 18, 2020

ధర్మవ్యాధుడు - అర్జునకి - అహింస

Image result for ధర్మవ్యాధుడు



అహింసా స్వరూపం ఎలాంటిదో తెలిపే ఈ కథ వరాహ పురాణంలో కన్పిస్తుంది. ఏది హింస, ఏది అహింస అనే విషయం తెలియక చాలామంది సందిగ్ధావస్థలో కొట్టుమిట్టాడుతుంటారు. ఆ సందిగ్ధమే కొన్ని కొన్ని సార్లు మనస్పర్థలను, తగాదాలకు కూడా దారితీస్తూ ఉంటుంది. ఈ కథలో ఇతివృత్తం కూడా ఇటువంటి మనస్పర్థల నేపథ్యంలోనే ఉంది. పూర్వం మిథిల నగరంలో ఒక కిరాత కులంలో ధర్మబుద్ధిగల ధర్మవ్యాధుడు అనేవాడు ఉండేవాడు. ఇలా ధర్మవ్యాధుడు జన్మించటానికి కారణం వసురాజు గతజన్మలో అతడి సేవకుడికిచ్చిన వరమే కారణం.
ధర్మవ్యాధుడు తన కిరాతకుల సంప్రదాయాన్ని అనుసరించి ప్రతిరోజూ వేటకు వెళ్ళి ఒక మృగాన్ని చంపి తీసుకువచ్చి సగం అగ్నికి సమర్పించి మిగిలిన సగం మాంసాన్ని తనకోసం, తన కుటుంబసభ్యుల కోసం, అతిథులకోసం వినియోగిస్తూ ఉండేవాడు. ధర్మవ్యాధుడికి అర్జునకుడు అనే ఒక కుమారుడు, అర్జునకి అనే ఒక కూతురు జన్మించారు. అర్జునకుడు తండ్రికి సహాయకుడిగా ఉంటూ ఉండేవాడు. అర్జునకి కూడా ధర్మబుద్ధితో పెరిగి పెద్దది అయి యుక్తవయస్సుకు వచ్చింది. ఆమెకు వివాహం చెయ్యాలని ధర్మవ్యాధుడు తలపెట్టాడు. ఎంతో సౌందర్యవతి, ధర్మగుణశాలి అయిన అర్జునకికి తగిన వరుడిని వెతుకుతూ ధర్మవ్యాధుడు మాతంగుడు అనే ఒక మునికి తన కుమార్తెకు భర్తగా కాదగిన కుమారుడు ఉన్నాడని తెలుసుకొని ఆయన ఆశ్రమానికి వెళ్లాడు. తాన వచ్చిన పనిని చెప్పి మునికుమారుడు అయిన ప్రసన్నుడికి తన కుమార్తె అయిన అర్జునకికి వివాహం జరిగేలా మాతంగుడిని ఒప్పించాడు. మాతంగుడు కూడా ధర్మవ్యాధుడి గుణశీలాలను, ఆయన కూతురు అయిన అర్జునకి గుణశీలాలను అంతకుముందే తెలసుకొని ఉన్న కారణంగా వెంటనే ప్రసన్నుడిని, అర్జునకికి వివాహం జరిపించాడు.

ధర్మవ్యాధుడు తన కుమార్తెకు తగిన బుద్ధులు అన్నీ చెప్పి అత్తమామలను వినయవిధేయలతో సేవించమని మరీమరీచెప్పి అత్తవారింటికి పంపాడు. అర్జునకి, ప్రసన్నుడి జీవితం సుఖంగా గడుస్తూనే ఉంది. అయితే ఒకరోజున అర్జునకి ఏదో పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆమె అత్తగారు ఒకటికి రెండు సార్లు ఆమెను పిలిచింది. అయినా ఆ మాటలు చెవిన పడకపోవడంతో అర్జునకి పలుకలేదు. వెంటనే కోపంతో అక్కడకు వచ్చిన ఆమె అత్త నిర్ధాక్షిణ్యంగా మూగజీవుల గొంతులు కోస్తూ బతికేవారి కూతురిని తన కోడలుగా చేసుకోవటమే తప్పు అయిందని తాను పిలిచినా రాకపోవడంతో అంత గర్వపడాల్సిన విషయం ఏం ఉందని, అయినా ఇవి ఏవీ ఆలోచించకుండా తన భర్త కోడలిగా తీసుకురావడమే తప్పు అయిందని రకరకాలుగా అనేకరకాలుగా సూటిపోటిమాటలను అని పుట్టింటికి వెళ్ళగొట్టింది. పుట్టింటికివచ్చిన అర్జునకి తండ్రికి తన అత్త పలికిన పలుకులను చెప్పింది.

ధర్మవ్యాధుడు తన ధర్మబుద్ధిని, నడవడిని తన వియ్యపురాలు తెలుసుకోలేకపోయిందని అనుకొని హింసకు అహింసకు బేధం ఏంటో నిజానికి ఎవరు తక్కువగా హింస చేస్తున్నారో వివరించి చెప్పాలని తన కూతురు అత్తగారింటికి వెళ్ళాడు. ధర్మవ్యాధుడికి మాతంగముని ఎదురువచ్చి మర్యాదలు చేశాడు. అప్పుడు ధర్మవ్యాధుడు తాను కేవలం జీవహింసకు తావులేని ఆహారాన్నే స్వీకరిస్తానని చెప్పాడు. మాతంగుడు ఎంతో సంతోషంతో ధర్మవ్యాధుడికి వరి, గోధుమ ఇలాంటి ధాన్యాలతో తయారు అయిన ఆహార పదార్ధాలనే తన భార్యచేత చేయించి పెట్టించాడు. ఆ పదార్ధాలను చూసిన ధర్మవ్యాధుడు ఒక్క ఉదుటన భోజనం ముందునుంచి లేచి బయటకు వచ్చాడు. అప్పుడు మాతంగుడు తాను కూడా బయటకు వచ్చి ఎందుకు ఇలా చేశావని అడిగాడు. ఇంత ఘోరంగా జీవహింసతో కూడుకొని ఉన్న ఆహారాన్ని తనకు పెట్టటమే కాక మళ్ళీ ఎదరు ప్రశ్నించడం ఏమిటని ధర్మవ్యాధుడు మాతంగుడితో అన్నాడు. తాను పెట్టించిన ఆహారం వరి, గోధుమలకు సంబంధించినదే అని జీవహింసకు తావులేదని మాతంగుడు అన్నాడు. అప్పుడు ధర్మవ్యాధుడు తాను రోజుకు కేవలం ఒక జంతువును మాత్రమే వధించి ధర్మబద్ధంగా తన కుటుంబం కోసం ఆహారాన్ని సమకూరుస్తున్నానని అయితే కొన్నివేల వరిమొక్కలను, గోధుమ మొక్కలను కానీ కోసి హింసించి అలా వచ్చిన ధాన్యంతో తనకు ఆహారం పెట్టడం ఏమంత సబబు అని అన్నాడు. మొక్కలు, చెట్లలో కూడా జీవం ఉంటుందనే విషయాన్ని తెలుసుకోలేక ఇంత జీవహింసకు పాల్పడడం మంచిదికాదని చెప్పాడు. ఈ ధర్మసూక్ష్మాన్ని మాతంగుడు, ఆయన భార్య ఇద్దరు విని అర్జునకిని వెళ్ళగొట్టడంలో ఉన్న తప్పు తెలుసుకున్నారు. అయితే ధర్మవ్యాధుడు కూడా తాను మాతంగుడిని కానీ, ఆయన భార్యను కానీ అవమానించాలనే ధోరణిలో భోజనం ముందు నుంచి లేవలేదని కేవలం హింస ఎలాంటిదో తెలియజెప్పటానికే అలా చేశానని అదీగాక ఆ రోజున తన ఇంటిదగ్గర పితృకార్యం ఉన్నందువలన ఆహారం స్వీకరించడంలేదని చెప్పాడు. ఇక నుంచి ఇంతకుముందు తనను జీవహింస పరుడని నిందిచినట్లుగా నిందిచవచ్దని తన కూతురిని సక్రమంగా చూసుకొనమని చెప్పాడు. ఎవరికివారు సాధ్యమైనంత వరకు హింసకు దూరంగా ఉండాలంటే అహింస అవుతుందని వివరించి చెప్పాడు. ఇలా వరాహపురాణంలో కన్పించే అర్జునకి కథ అహింసాతత్వాన్ని నిరూపిస్తుంది.

No comments:

Post a Comment