Wednesday, July 10, 2019

అనుష్టానం మానరాదు



1963లో పరమాచార్య స్వామివారు కుంబకోణం దగ్గర్లోని మరుదనల్లూర్ లో మకాం చేస్తున్నారు. అప్పుడు కుంబకోణంలోని కుంబేశ్వర ఆలయంలో ‘తిరుప్పావై - తిరువెంబావై’ సదస్సులు వైభవంగా జరుగుతున్నాయి. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ భక్తవత్సలం మరియు మధురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి తిరుప్పణి (ఆలయ సంబంధిత పనులు) చేసిన పి.టి. రాజన్ ఆ సదస్సుకు వచ్చారు.

అప్పుడు సాయం సంధ్యా సమయం. మహాస్వామి వారి ఉపన్యాసం వినాలని వారి వద్దనే కూర్చుని ఉన్నాను. స్వామివారు ఉపన్యాసం మొదలుపెట్టబోతూ నావైపు తిరిగి, చేతులతో ఆచమనం చేస్తున్నట్టుగా చూపిస్తూ వెళ్ళి సంధ్యావందనం చెయ్యమని ఆజ్ఞాపించారు. స్వామి ఉపన్యాసం వినాలనే కోరికతో నేను సంధ్యావందనం మాని అక్కడ కూర్చున్నానని స్వామివారు అర్థం చేసుకున్నారు. ఎట్టి పరిస్థితులలోను అనుష్టానం మానవద్దు అని నన్ను హెచ్చరించటం. స్వామివారి ఆజ్ఞ ప్రకారం సంధ్య వార్చడానికి నేను కొలను వద్దకు వెళ్ళాను.

ఆ రోజు రాత్రి పదిగంటలప్పుడు మేము ఆహ్వానించకుండానే స్వామివారు మేలకావేరిలోని మా ఇంటికి విచ్చేశారు. దాదాపు ఒక గంట పాటు అనుగ్రహ భాషణం చేశారు. మేము పరమానంద భరితులమయ్యాము. అలా స్వామివారు బ్రాహ్మణుడికి సంధ్యావందనం వంటి నిత్యకర్మల కంటే మేలైనది విలువైనది వేరొక్కటి లేదని సెలవిచ్చారు. అలా ధర్మానుష్టానం చేసిన వారి వద్దకు స్వామివారే వచ్చి అనుగ్రహం ఇస్తారు. అలా ఆచరించని వారు మాత్రమే స్వామిని వెతుక్కుంటూ వెళ్ళాలి.

--- యస్. పంచపకేశ శాస్తిగళ్, కుంబకోణం. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 1

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

No comments:

Post a Comment